Authorization
Mon Jan 19, 2015 06:51 pm
A FICTIONAL PROSE NARRATIVE OF CONSIDERABLE LENGTH; TYPICALLY HAVING A PLOT; THAT IS UNTOLD BY THE ACTIONS; SPEECH; AND THOUGHTS OF CHARACTERS
- D.H. LAWRENCE
'నవల'కి ఆ ప్రముఖ రచయిత ఇచ్చిన నిర్వచనం అది. దేశ, కాలమాన పరిస్థితులు మారుతున్నా; ఇంచుమించుగా ఏ భాషలో అయినా 'నవల' విధానం ఇలాగే ఉంటుందని, నవలా రచయితులకు, పాఠకులకు తెలిసిందే!
అసలు నవల అనే ప్రక్రియ మనకు పాశ్చాత్యదేశం నుంచి వచ్చిన సాహిత్య ప్రక్రియ అని సాహితీ విమర్శకుల అభిప్రాయం. ఎటునుంచి వచ్చినా నవల ప్రక్రియ ఇవాళ విశ్వవ్యాప్తమయింది. ఇక, నవలలో కథ చెప్పే తీరుని; ఒక్కోరచయిత, తన పంథాలో నిర్దేశించుకోవడం జరుగుతుంది. కొందరు 'ప్రథమ పురుషలో' (ఫస్ట్ పర్సన్) అంటే 'నేను' అని చెబితే, మరికొందరు ప్రధానపాత్ర ద్వారా కథ నడిపిస్తారు.
ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తోందంటే, ఇప్పటికే తన నవలల ద్వారా, పాఠక ఆదరణను పొందిన, ప్రముఖ నవలా రచయిత ప్రభాకర్ జైనీ; తన నవలలు అన్నిటినీ ప్రథమ పురుషలోనే కథను చెప్పడం జరిగింది! ఈ నవల 'నా సినిమా సెన్సారు అయిపోయిందోచ్' కూడా ఆ విధానంలోనే ఆయన రాశారు.
ఇక ఈ నవల ఇతివృత్తం గురించి చెప్పవలసి వస్తే; సహజంగా రచయితలు, తమకు బాగా పరిచయం ఉన్న విషయాల గురించి గానీ, పరిసరాలు, వ్యక్తుల గురించి గానీ వ్రాస్తారు. ఎందుకు అంటే తెలిసిన 'వస్తువు' అయితే అసహజమయిన పాత్రలు గానీ, సంఘటనలు గానీ, వచ్చే అవకాశం ఉండదు కాబట్టి.
అలా ఈ నవలలో, రచయితకు చిత్రపరిశ్రమతో; దర్శకుడుగా, రచయితగా, నిర్మాతగా కొండొకచో నటునిగా, ఇలా ఎన్నో శాఖలతో పరిచయమే కాదు... ప్రావీణ్యత కూడా ఉందని, ఈ నవల చదివిన పాఠకులకు తెలుస్తుంది.
మంచి ఆశయంతో ఎవరు ఏ పని మొదలు పెట్టినా; ఆటంకాల కంటకాలు ఎదురవడం, లోకంలో మనం చూస్తున్నదే! అలా ఉదాత్త ఆశయాలతో, ఉత్తమ చిత్రం నిర్మించాలన్న తపనతో, చిత్రరంగంలోకి అడుగుపెట్టిన యువకుడు (ఆ యువకుడే కథ చెప్పే రచయిత), కొన్ని తెలిసి, మరికొన్ని తెలియక, ఎలా ఊహించని పరిస్థితులను ఎదుర్కొన్నా, చివరకి సాధించిన ఫలితం, ఫలవంతం కావడం నవల కథావస్తువు. ఈ క్రమంలో రచయిత నిజాయితీ కనిపిస్తుంది. ఉదాహరణకు చిత్ర నిర్మాణ సమయంలో, అనుభవజ్ఞుడైన 'కెమెరామన్' తనకు ఏరకంగా సహకరిం చిందీ, ఎటువంటి భేషజాలు లేకుండా వ్రాసారు. సాధారణంగా చిత్ర దర్శకుడు, ఆ చిత్రానికి సంబంధించిన 'క్రెడిట్' అంతా తనకే చెందాలను కుంటాడు. ఇది ఎన్నో సినిమాల విషయంలో జరిగింది! జరుగుతున్నదీ!
మరి ఏ రంగంలోకి ప్రవేశించాలనుకున్నా ఆరంభం నుంచీ, ఆ రంగం గురించి ఆధ్యయనం చేయాలనుకోవడం వివేకవంతుల లక్షణం. అప్పుడే ఆ రంగం గురించి అవగాహన ఏర్పడుతుంది. అది భవిష్యత్తులో వేసే అడుగులకు ఆలంబనగా వుంటుంది.
అలా చిత్రనిర్మాణానికి, చిత్రరంగంలో 24 శాఖలలో ముఖ్యమైన వాటి గురించి తెలుసుకోవడానికి; ఆ కోర్సులోని ముఖ్య విభాగాలను బోధించే కళాశాలలో, కథానాయకుడు ప్రవేశించి; ఎన్నో విషయాలను సినీరంగ అనుభవశాలురవల్ల తెలుసుకున్నాక; చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడతారు.
అయితే కళాశాల విద్యతో వచ్చిన విజ్ఞానం వేరు... కార్యక్షేత్రంలో, ఎదురవుతున్న అనుభవాలతో, రోజూ తెలిసే కొత్త విజ్ఞానం వేరని అతి స్వల్ప కాలంలో 'కథా'నాయకుడు గ్రహిస్తాడు.
సినిమా అంటే ''మేక్ బిలీవ్'', అంటే; లేనిది ఉన్నట్టు భ్రమింపచేయడమే! దానికి రెండో కోణంలో ఉన్న నిజాయితి, నిబద్ధతలు; కాస్త ఆలస్యంగా వెలుగులోకి వస్తాయి. అప్పటికి ఎన్నో చేదు అనుభవాలు జ్ఞాపకాలుగా మిగులుతాయి. ఎందుకంటే చిత్ర నిర్మాణ సమయంలో, అడుగడుగునా ఎంతో జాగ్రత్తగా ఉండకపోతే, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎంత నష్టపోతారో, ముఖ్యంగా నూతనంగా చిత్ర నిర్మాణంలోకి ప్రవేశించేవారికి ఈ నవల ఒక దిక్సూచి! ఇంకా చెప్పాలంటే ఒక కరదీపిక.
కొన్ని అనుకోని సంఘటనలు ఎదురయినప్పుడు కథానాయకునికి ఎందుకు ఈ సినిమా నిర్మాణంలోకి వచ్చానా అని అనిపించడం, ఆ క్షణంలో కుంగిపోతున్న అతనికి, ఆర్ధాంగి సంపూర్ణ సహకారం అందించడం వంటి సంఘటనలు, పాఠకులను ఉద్వేగ భరితమయిన భావాలలో ఊగిస్తాయి. చిత్ర నిర్మాణ సమయంలో తను ఆర్థికంగా కొన్ని శాఖల వారి వల్ల మోసపోతున్నానని తెలిసినా, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో, నిర్లిప్తంగా వుండవలసి రావడం వంటివి, నూతన నిర్మాత, దర్శకులకు కనువిప్పు కలిగించే వాక్యాలు.
భద్రమైన జీవితం నుంచి, ఏ క్షణంలో ఏం జరుగుతుందో; అసలు అనుకున్నది జరుగుతుందా అన్న క్షణ క్షణ భయాందోళనలు కలిగించే చిత్రరంగంలోకి వచ్చిన కథానాయకుడు, సినిమారంగం సంపూర్ణ స్వరూపాన్ని; స్వభావాన్ని ప్రతిభావంతంగా ఈ నవలలో ఆవిష్కరించడం జరిగింది అంటే అతిశయోక్తి కాదు.
సినిమా రంగం, చాలా కొద్ది మందికి పూలపానుపు. ముఖ్యంగా వారసులకు! తాత తండ్రుల పేరుని ఆస్తిపాస్తులను వారసత్వంగా దక్కించుకున్న వారికి. కాని చాలా మందికి అది పూలపానుపు కాదు. పూట గడవని మాపు.
అందుకే, అందలం ఎక్కాలని ఉన్నా, అందుకు నోచుకోని వాళ్ళు... ఈ రంగం మీద ఉన్న ఆశలతో, భ్రమలతో, భ్రాంతులతో తేనెలో పడిన ఈగల్లా ఇక్కడే బ్రతకాలని సిద్ధపడతారు. మరి 'రేపు' మీద ఆశతో బతకాలంటే; ఇటువంటివాళ్ళు, ఇవాళ మోసంతో అయినా, రేపటికోసం సంపాదించాలి. నూటికి తొంభై మంది కృష్ణానగర్ లోని 'కుచేలుర' పరిస్థితి ఇదే!
దాన్ని దృశ్యమానంగా, సందర్భోచిత సంభాషణలతో; ఒక్కోసారి మనసు పలికే మాటలతో, రచయిత ప్రభాకర్ జైనీ, అతి సహజంగా వ్రాయడంలో సఫలీకృతులయ్యారు.
అసలు ఇప్పుడున్న పరిస్థితులలో, ఒక సామాన్య మానవుడు బ్రతకడం అంటేనే, ఓ నిత్యపోరాటం అనుకుంటే, చిత్ర నిర్మాతగా బతకాలంటే, ఆ పోరాటాన్ని మించిన దానితో పోరాడాలి అని, స్వానుభవ పూర్వకంగా చెప్పడం చూస్తే... రచయితను 'క్రాంత దర్శి' అని అనడంలో తప్పులేదు.
అందం, ఆరోగ్యం ఉన్న బిడ్డను కంటే, అందరూ అభినందిస్తారు, ఆనందిస్తారు అని నమ్మే తల్లి, నవమాసాలూ తన జవసత్త్వాలను పణంగా పెట్టిన నూతన శిశువుకి జన్మనిస్తుంది. చిత్ర దర్శక, నిర్మాతలదీ అదే పరిస్థితి అని, సహజంగా సరళంగా, సమయోచిత సందర్భ సన్నివేశాల మాలికతో ఈ నవల, ఆద్యంతం పాఠకులను, రచయిత రంగమైన చిత్రరంగంలోకి తీసుకుపోతుంది.
చిత్రనిర్మాణం అనే సినిమా చూపిస్తుంది! సినిమా తారల మీద దర్శక నిర్మాతల మీద ఇతరత్రా చిత్రరంగ శాఖల మీద కొన్ని రచనలు వచ్చాయి.. వస్తున్నాయి. కాని ''చిత్రనిర్మాణం'' అంటే ఏమిటో, ఒక నవల రూపంలో రావడం ఇదే ప్రథమం అనుకుంటాను. అందుకే ఈ నవలకు, న్యాయ నిర్ణేతలు సరి అయిన న్యాయం చేసి 2014 సంవత్సరానికి నంది పురస్కారం ఇచ్చారు. ఆ అవార్డుకు అర్హమైనదే ఈ నవల! అందమైన ఆరోగ్యమైన బిడ్డను కన్న తల్లికి కలిగే ఆనందమే. 'నా సినిమా సెన్సార్ అయిందోచ్!' అని దర్శక నిర్మాతలు.. ఈ రచయిత;
ఆనందపడే నవల ఇది. పాఠకులూ సంతోషిస్తారు. సినిమా రంగం గురించి కొత్తచూపుని అందించే ఈ నవల చదవడం పాఠకులకు వినూత్న అనుభవం.
- వై.వి.యల్.యన్. శాస్త్రి