Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కాలమనే /కాలసర్పం/ జ్ఞాపకాల /దొంతరలను/ కబళిస్తుంటే/సంద్రాన దాగిన /బడబాగ్ని/ గుండెల్లో ప్రవహిస్తుంటే.. / నమ్మకం /రెప్పచాటు మౌనంగా/ ఒదిగిపోయి/ కను కొలుకుల్లోంచి/ జారిపడుతోంది!!' అంటారు 'రెప్పచాటు మౌనం' కవితలో. ఆ మౌనం వెనుక దాగియున్న బడబాగే రమాదేవి కులకర్ణి. ఒక ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్గా పని చేస్తున్న ఈ మోటివేషనల్ స్పీకర్ కలం గుండె నుండి వచ్చిన అక్షర భాస్వరం ఈ కవితా సంపుటి. ఈ కవితా సంపుటిలో మొత్తం 50 కవితలున్నాయి. ప్రతి కవితకి కనువిప్పు కలిగించే శక్తి ఉంది. అదే గుండె లోతుల్లోని అలజడి నుండి వచ్చిన కవిత్వమైతే కాలుతున్న దివిటిలా వెలుగుతూ సమాజానికి వెలుగులు పంచుతుంది. మనసు పొరల్లోంచి వచ్చిన ఆలోచనల నుంచి అజరామరమైన భావ కవిత్వం పుడుతుంది. సాహిత్యమంటేనే సమాజానికి హితం చేకుర్చేది. సమకాలీన పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండే సాహిత్యం ప్రజల నాలుకలపై నిలిచి ఉంటుంది. తాను పరిశీలించిన అంశాలపై సత్వరమే స్పందిస్తూ ఒక్కోసారి ఆనందాన్ని, మరోసారి దు:ఖాన్ని అనుభవిస్తూ మనసుపడే అంతర్మథనమే కవిత్వం. అలా రమాదేవి కులకర్ణి కలం నుండి జాలువారిన అక్షర సుధలు ఆస్వాదించాల్విందే.
'వైకల్యపు జీవితమని వగపేల నీకు/ మనిషికే వైకల్యం అది మనసుకు అంటనీయకు' అని కవి, గాయకుడు శేషగిరి అంటారు 'అవిటి మనుసులు' అనే కవితలో రమాదేవి కులకర్ణి కూడా ఆత్మవిశ్వాసమే ఆలంబనగా... వైకల్యం ఉదిరించిన ధీరులను గుర్తు చేస్తూ అన్ని ఉండి.. ఏమి సాధించలేని... తోటి వారిని ఆదుకోలేని మనషుల మనస్తత్వాలను ఉండగట్టారు.
'అగ్నిపుల్ల, కుక్కపిల్ల' కాదేది కవిత్వానికి అనర్హం అని శ్రీశ్రీ అన్నట్లుగా రమాదేవి 'మెత్త' కవిత్వానికి అనర్హం కాదు అనుకున్నారు. మెత్త అంటే 'దిండు లేక తలగడ'. ఈ తలగడ మీద కవిత్వం రాసి మెప్పించడమంటే అభినందనీయమే. ఈ కవితలో అభివ్యక్తి చాలా బాగుంది. మెత్తతో అనుబంధం అందరికి ఉంటుంది. కానీ, ఎవరు ఇప్పటి వరకు దానిని ఇలా రాసి ఉండరు. మెత్తను ఆమె ఎలా వర్ణించారో ఆమె మాటల్లోనే 'నెత్తి కింది మెత్తని నా మెత్త / నేను అలిగితే హత్తుకునే / నా మేనత్త' 'అలిసినపుడు మెత్త/ అమ్మఒడి అయితది/ ఒంటరిగా మిగిలి/ అలసి సొలసి నేను/ ఉసూరని కూర్చుంటే / ఆసరా ఇచ్చే నాన్నైతది' అంటారు. మెత్తని అమ్మనాన్నతోనే కాదు మేనత్తతో పోల్చడం ఒక ఎత్తు అయితే... అలిగినప్పుడు మేనత్త అవుతుంది అంటారు.
మనిషికి స్పందించే గుణం కోల్పోతే ఆ పరిసిత్థి చాలా దుర్భరంగా ఉంటుంది. అలాంటి మనిషి వల్ల సమాజానికి ఏమి ఉపయోగం ఉండదు. వారి గురించి కవయిత్రి 'మనుసుకు ముసుగు' కవితలో ఇలా అంటారు. 'చింపేసుకున్నాడో ఏమో మనిషి....!/ మనసన్న తెల్లకాగితాన్ని...!/ ఒంపేసుకున్నాడో ఏమో మనిషి/ తనలోని ప్రేమ రసాన్ని...!/ ముసుగేసుకున్నాడు మనిషి/ మనసుకు ముసుగేసుకున్నాడు/ మనిషి...!!' అంటారు.
'బాల్యమురా అమూల్యమురా' అనే పాటలా సాగింది రమాదేవి కులకర్ణి బాల్యం కవిత. జీవితంలో అమూల్యమైనది బాల్యం. బాల్యంలో చేసే అల్లరి, బడిలో స్నేహితులలో కలిసి ఆడిన ఆటలు, అన్నం తినకుండా చేసిన మారాం.. అన్ని ఒక మధురానుభూతే అలాంటి జ్ఞాపకాలే 'బాల్యం'. ఆ కవితలో జ్ఞాపకాలను కవయిత్రి ఇలా నెమరువేసుకున్నారు. 'దాల్ దడీలు, ఓమన గుంటలు/ తాడుదుంకుడు, కోతికొమ్మచ్చి/ ఐస్ బైస్, బొమ్మల పెండ్లి' అంటూ తీపి గుర్తులను నెమరవేసుకున్నారు రమాదేవి కులకర్ణి.
'ఎట్లాట్ట బతికినోళ్లం రా వెంకన్న' అనే పాట గుర్తుకు వస్తుంది రమాదేవి రాసిన 'ఎందదిరో ...!!!' కవిత చదువుతుంటే. ఈ కవిత ఇలా సాగుతుంది. 'అరే ఓ .../ ఎల్లన్న...!!/ ఏందిరో ఈ పరీక్ష../ బక్కచిక్కి డొక్క ఎండి/ కలో గంజి తాగి/ కూలినాలి చేసి/ బతుకులీడుస్తున్నమని /బాధపడితిరొ...!!'.
ఒక మంచి పనికి పది మంది ముందుకు వచ్చే కాలం పోయి ముప్పది మంది దుష్మన్లు అడ్డం పడుతున్నారు అంటూ లోకం తీరును ఎండగడతారు 'లోకం' కవితలో, యుద్ధం చేయాల్సింది ఎవరితోనో కాదు 'నీలోని నీతో యుద్ధం చేరు' అంటూ సందేశాత్మకంగా సాగుతుంది 'యుద్ధం' కవిత.
ఈ కవితా సంపుటిలో 'అమ్మ కాని అమ్మ', 'పుట్టిల్లు', 'అప్పా', 'నేటి ప్రేమ' వంటి ఆలోచింపచేసే కవితలు చాలా ఉన్నాయి. సాధారణంగా బిడ్డలు తల్లిదండ్రులకు పుస్తకాన్ని అంకితం ఇస్తారు. రమాదేవి కులకర్ణి ఆ సంప్రదాయానికి భిన్నంగా తనలోని ఆలోచనలు, ఆవేదనలు, ఆవేశాలను, ఆదర్శాలను పంచుకునే తన బెస్ట్ ఫ్రెండ్, తన కుమారుడైన 'మారుతీ భరద్వాజ్'కి ప్రేమతో అంకితం ఇచ్చారు.
-అనంతోజు మోహన్కృష్ఱ