Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మార్చి 5న మధునా పంతుల శత జయంతి సభ
స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ఆంధ్ర రాజుల పాలన సంస్కృతి తెలుగు సాహితీ కళా వైభవాలను తెలుగు హృదయాలలో మనోజ్ఞ దృశ్యంగా ఆవిష్కరిస్తూ 'ఆంధ్ర పురాణం' గ్రంథం వెలువడింది. దీనిని సంస్కృతాంధ్రాలలో ఉభయ భాషాప్రవీణులుగా ప్రసిద్ధి కెక్కిన మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి రాశారు. ఒక జాతి చరిత్రను సృజించిన కవి మధునా పంతులవారే. తెలుగు వారి జీవన శైలిని సంస్కృతీ వైభవాన్ని చాటి చెప్పిన తొలి తెలుగు పద్య కావ్యమిది. ఇందులో ఉదయ, శాతవాహన, చాణక్య, కాకతీయ, విజయనగర (శ్రీకృష్ణ దేవరాయలు) మొదలగు పది రాజవంశాల చరిత్రనీ మధునాపంతుల అద్భుతంగా చిత్రీకరించారు. ముఖ్యంగా కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని, ఓరుగల్లు కోట నిర్మాణాన్ని సంస్కృతిని రాసిన తీరు విమర్శకుల ప్రశంసలందుకుంది.
మధునాపంతుల వారు తూర్పు గోదావరి జిల్లా పల్లెపాలెంలో 1920 మార్చి 5న శ్రీమతి లచ్చమ్మ, సత్యనారాయణకు జన్మించారు. 1940లో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి విద్వాన్ పట్టా పొందారు. పిఠాపురం సంస్థానంలో ఆస్థాన కవి ఓలేటి వెంకట రామశాస్త్రి, ప్రముఖ వ్యాకరణ పండితులు మహేంద్రవాడ సుబ్బరాయ శాస్త్రి వీరి గురువులు. 1938 నుంచి కావ్య రచన ప్రారంభించారు.
ప్రముఖ సంఘ సంస్కర్త, ఆనాటి మూఢాచారాలపై ధ్వజమెత్తి గళమెత్తిన కందుకూరి వీరేశలింగం ప్రభావం మధునాపంతుల మీద పడింది. అందుకే ఆయన తన పద్య రచనలో ఆధునిక భావాలను ప్రచారం చేశారు. కందుకూరి రాసిన 'ఆంధ్ర కవుల చరిత్ర'కు ప్రేరణ చెంది 'ఆంధ్ర రచయితలు' రచన చేశారు. ఇంకా తోరణం, శ్రీఖండం, చైతన్య రథం మొదలగు రచనలెన్నో చేశారు. విశ్వనాథ, జీవి సుబ్రహ్మణ్యం, సినారె, పివి.నరసింహారావు వీరి రచనలను ప్రశంసించారు. ఆంధ్ర పురాణానికి 1956లో ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ కావ్యంగా కితాబిచ్చింది. 1982లో ఆంధ్ర విశ్వవిద్యాలయం 'కళాప్రపూర్ణ' బిరుదుతో సత్కరించింది.
మధునాపంతుల ఆధునిక నవలా ప్రక్రియకు ఆకర్షితులై 'కళ్యాణ తార' 'బోధివృక్షం' నవలలు రాశారు. పిఠాపురం రాజావారు మధునాపంతుల ప్రతిభావ్యుత్పత్తులు గుర్తించి సూర్యరాయాంధ్ర నిఘంటువు రచనలో భాగస్వామిని చేశారు. నందమూరి తారకరామారావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నపుడు విశ్వామిత్ర చలనచిత్రం నిర్మించారు. విశ్వామిత్ర కథా రచనలో వీరిని పిలిచి సలహాలు తీసుకోవడం విశేషం.
మధునాపంతుల వివిధ సాహిత్య ప్రక్రియలు స్పృశించడమే కాదు సంపాదకత్వం కూడా చేశారు. 1939లో ఆయన 'ఆంధ్ర సాహిత్య పత్రిక'ను ప్రారంభించి నిర్వహించారు. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, విశ్వనాథ, వేలూరి శివరామశాస్త్రి వంటి ప్రముఖుల రచనలు ఇందులో వచ్చాయి.. బహుముఖ ప్రజ్ఞావంతులుగా పేరుగాంచిన మధునాపంతుల రచనలు సమీక్షించిన విమర్శకులు ఆయనలోని శైలి, లాక్షణిత, భాష బాగున్నాయి అని ప్రశంసించడమే కాక 'లిటరేచర్ ఈజ్ ద క్రిటిసిజం ఆఫ్ లైఫ్' రాసిన మాథ్యుమ్ ఆర్నాల్డు భావ వ్యక్తీకరణ వీరిలో గోచరిస్తుందని చెప్పడం ప్రత్యేకత.
మధునాపంతుల శతజయంతి సందర్భంగా మార్చి 5న చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో పెద్ద ఎత్తున సంస్మరణ సభ జరుగుతోంది. ఈ తరుణంలో మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి పేరిట పురస్కారాన్ని జగమెరిగిన సాహితీ వేత్త సన్నిధానం నరసింహశర్మకు సమర్పించనుండడం ముదావహం
- ఆసు