Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'దంతెవాడ' కథా సంపుటి ముఖచిత్రం చూడగానే ఎంతో ఆసక్తి కలిగించింది. ఊడలు దిగిన ఒక మహావృక్షం, దానికింద కూర్చున్న పిల్లలు ఆసక్తిని కలిగించాయి. ఈ కథా సంపుటికి తగిన ముఖచిత్రం అని ఈ పుస్తకం చదివిన తరువాత చదువరికి అనిపిస్తుంది. ముందు మాటలో డా.వి.ఆర్.శర్మ ఈ పుస్తకంలోని ఆత్మని చక్కగా వివరించిన తీరులోనే ఈ 11 కథలు ఎటువంటి కొత్తదనాన్ని సంతరించుకున్నవో అర్థమైపోతుంది. ఈ కథల్ని రాసిన మూర్తి కె.వి.వి.ఎస్. ఇప్పటికే గాడ్ఫాదర్ నవల అనువాదకులుగా సాహితీ లోకానికి సుపరిచితులు. కథకునిగా కూడా తనదైన ముద్రని కనబరిచారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు.
మొదటి కథ 'స్మృతి' బ్రిటిష్ వారు నివసించిన ఒక ప్రాంతంలోకి మనల్ని తీసుకు వెళ్తుంది. అప్పటివారి జీవన విధానం, ఆ పరిసర ప్రాంతాలపై దాని ప్రభావం తెలుసుకొని ఆశ్చర్యపోతాం. అనేక ఆలోచనలు ముప్పిరిగొని కొత్త లోకాలకి వెళతాం. భద్రాచలానికి దగ్గరలో ఉన్న అలనాటి తెల్లవారి సమాధులు కొత్త ద్వారాలను మన కళ్ళ ముందు తెరుస్తాయి. ఇక రెండవ కథ 'ఆ రోజు' ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో జరిగిన ఒక వింత సంగతిని వివరిస్తుంది. ఈ కథలో కథకుడు మూర్తి ఆ రాష్ట్రానికి చెందిన సామాజిక చిత్రపటాన్ని మన కళ్ళ ముందు ఉంచుతారు.
ఇక 'దంతెవాడ' కథ చత్తీస్ఘడ్ రాష్ట్రంలోని ఆదివాసీలపై తీవ్రవాద ప్రభావం ఎలా ఉన్నదనేది వివరించడమే గాక స్థానికంగా వివిధ రాష్ట్రాలకి చెందిన వారు ఎలా జీవిస్తున్నారు అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఈ కథ చివరిలో వచ్చే దృశ్యం పాఠకుల మనసుల్ని పిండేస్తుంది. చదివిన వారిని అనేక రోజులు వెంటాడుతుంది. ఇక 'వొట్టి బండ' అనే కథ ఉపాధ్యాయుని పాత్ర ఎంత గురుతరమైనదో, పిల్లల పట్ల ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో తెలియజేస్తుంది. ఎవరూ ఊహించలేని నేపథ్యం గల పిల్లలు, వారి వెతలు హృదయ విదారకంగా ఉంటాయని ఈ కథ చెబుతుంది. 'రజనీకాంత్' అనే కథ ఒక కొత్త రాష్ట్రం ఏర్పడినపుడు రాష్ట్ర సరిహద్దుల్లో ఉండే ఇక్కట్లని వివరిస్తుంది.
'కిష్కింద కాండ' కథలో జంతువులు ఏ విధంగా మనుషుల కన్నా ప్రత్యేకమైనవో ఆహ్లాదంగా చెప్పారు. కోతుల మీద మంచి పరిశీలన చేసి ఈ కథ రాసినట్లుగా అనిపిస్తుంది. కొట్టాయం, ముసలావిడ, మర్మయోగి, పోలింగ్ డ్యూటీ, నా డైరీలోని కొన్ని పేజీలు ఇలాంటి కథలన్నీ ఆకట్టుకునే విధంగా సాగిపోతాయి. విసుగు తెప్పించకుండా మనోరంజకంగా ప్రతి కథని నడిపించారు. వస్తువుని ఎన్నుకోవడంలోనూ, గుర్తుండిపోయే విధంగా దానిని మలచడంలోనూ మూర్తి చూపించిన వైవిధ్యం ప్రత్యేకమైనది. చాన్నాళ్ళకి ఒక మంచి కథాసంపుటి చదివిన అనుభూతి పాఠకునికి కలుగుతుంది. ప్రసిద్ధ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఈ పుస్తకానికి రాసిన వెనుక మాటలో ఈ విషయాల్ని ప్రస్తావించి కితాబు నివ్వడం అతిశయోక్తి ఏ మాత్రమూ కాదు.
- తులసి,
99087 33389