Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్లాస్టిక్ కాలుష్యం గురించి ఎంతో మాట్లాడుతుంటారు. రచయితలు, కవులు ప్లాస్టిక్ కాలుష్య నివారణ గురించి రాస్తుంటారు. కానీ ఆచరణలో ప్లాస్టిక్ని వాడుతుంటారు. సాహిత్యసభలు, సాహిత్యోత్సవాల నిర్వణహలో ప్లాస్టిక్ను యధేచ్ఛగా ఉపయోగిస్తుంటారు. అయితే ఇందుకు భిన్నంగా ఇటీవల (జనవరి 31- ఫిబ్రవరి 3,4-2019) తిరువనంతపురంలో జరిగిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్లో ఎక్కడా ప్లాస్టిక్ని ఉపయోగించలేదు. ప్లాస్టిక్ రహితంగా ఈ సాహిత్యోత్సవాన్ని జరపాలనుకున్నారు నిర్వాహకులు. అందుకు అనుగుణంగానే బ్యానర్లకు కూడా ప్లాస్టిక్ని గానీ, సింథటిక్ని గానీ వాడలేదు. చివరకు బ్యాడ్జీలకు, ఐడెంటీటీ కార్డులకు సైతం కాగితాన్ని, కాటన్ బట్టని ఉపయోగించారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ స్థానంలో గాజు గ్లాసుల్లో, స్టీల్, రాగి గ్లాసుల్లో మంచినీళ్ళు అందించారు. టిఫిన్, భోజనవేళల్లో ప్లాస్టిక్ప్లేట్లను వాడలేదు. వాటికోసం ప్రత్యామ్నాయ మార్గాలని అనుసరించారు.
సాధారణంగా సాహిత్యసభల్లో, సాహిత్యోత్సవాల్లో చిన్నచిన్న వాటర్ బాటిల్స్ ఇస్తుంటారు. వేదికల మీద కూడా అరడజనుకు పైగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ పెడుతున్నారు. కొంతమంది మూతవిప్పి కొంచెం తాగి అలా వదిలేస్తుంటారు. ప్లాస్టిక్ ప్లేట్లలో స్వీట్, సమోసా, బిస్కట్లు పెడుతున్నారు. అలాగే ప్లాస్టిక్ కప్పుల్లో కాఫీ, టీలు ఇస్తున్నారు. పేపర్ కప్పుల పేరుతో మరోవిధమైన ప్లాస్టిక్ కప్పులు సరఫరా చేస్తున్నారు. కాని అవి కూడా నేలలో కరిగిపోని, మంటకు బూడిదకాని కప్పులే అన్నది గమనార్హం. కనుక ఒక సభ అనంతరం జమయ్యే ప్లాస్టిక్ చెత్తకు అంతుపొంతు ఉండదు.
ఇక రెండుమూడురోజుల పాటు జరిగే సాహిత్సోత్సవాల్లో పొగుపడే ప్లాస్టిక్ భారీగా ఉంటుంది. భోజనానంతరం రెండుమూడు ప్లాస్టిక్ గ్లాసుల్లో మంచినీళ్ళు తాగి పడేస్తుంటారు. ఒకవైపున ప్లాస్టిక్ కాలుష్యం గురించి చెబుతూనే మరోవైపున ప్లాస్టిక్ని ఇష్టానుసారంగా ఉపయోగించడానికి కవులు, రచయితలు సిగ్గుపడటం లేదు. ప్లాస్టిక్ వాడటం ఎంత ప్రమాదకరమో తెలిసిన సాహిత్యకారులే అలక్ష్యంగా వ్యవహరించడం క్షంతవ్యం కాదు.
తిరువనంతపురంలో నాలుగురోజుల పాటు జరిగిన సభలో ఎక్కడా ప్లాస్టిక్ని ఉపయోగించలేదు. సభకు హాజరయినవారికి దగ్గరుండి గాజు గ్లాసుల్లో మంచినీళ్ళు అందించారు. గ్లాసు, స్టీల్ జగ్గులు ఉపయోగించారు. కాటన్, జూట్ బ్యాగుల్ని సరఫరా చేశారు. ఫెస్టివల్ బయట కాఫీ, టీలు, టిఫిన్లు అమ్మేవారికి కూడా ముందుగానే ప్లాస్టిక్ వద్దని సూచించారు. మంచినీళ్ళు కొనాల్సిన పనిలేకుండా ఏర్పాట్లు చేశారు. ఇదే పద్ధతిని ఇక్కడా మన దగ్గర సభల్లో అమలు చేయాలి. ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ దరి చేరకుండా చూసుకోవాలి. కాటన్ బట్ట మీద బ్యానర్లని ఎందుకు రాయకూడదు. సింథటిక్, ప్లాస్టిక్ బ్యానర్లని ఉపయోగించడం ఆపాలి. బ్యానర్తో సహా ఎక్కడా ప్లాస్టిక్ని ఉపయోగించకుండా సభలు జరిపే అలవాటు చేసుకోవాలి. గ్లోబలైజేషన్కు వ్యతిరేకంగా పెద్దపెద్దమాటలు చెప్పడం కాదు, చేతల్లో ఈ స్ఫూర్తిని ప్రదర్శించాలి. అందుకే సాహిత్యసభలు, సాహిత్యోత్సవాలు ప్లాస్టిక్ రహితంగా ఉండాలి. ప్లాస్టిక్ వినియోగించక్కర్లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. అయితే ఈ దిశగా సంకల్పం ఉండాలి. అప్పుడే కవుల, రచయితల రాతలకి అర్థం ఉంటుంది.
- సంజీవ్