Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాహిత్య చరిత్రలో కథకున్న చరిత్ర గొప్పదికాని, కథ గురించిన విపులమైన చర్చ, చారిత్రక పరిణామాలు దృష్టిలో ఉంచుకుని వచ్చిన విశ్లేషణలు తక్కువ. మనకున్న కథా విమర్శ మరీ చిన్నదేమీ కాదు గాని, జరగాల్సినంత పని జరగలేదు. చారిత్రకంగా శిల్పపరంగా ఇంకా వెలుగు చూడని కోణాలు ఎక్కువే. ఒక్కోసారి కొన్ని వ్యాస సంపుటాలు, విమర్శ రూపంలో ఈ లోటును కొంత తీరుస్తున్నాయి. కె.పి.అశోక్ కుమార్ 'కథావిష్కారం' అలాంటిది. సినిమా, నవల అప్పుడప్పుడు కవిత్వం, విమర్శలపై రాస్తున్నా అశోక్ కుమార్ కథమీద ఎక్కువ శ్రద్ధపెట్టారని అనిపిస్తుంది. విమర్శ రాసే వాళ్లకు అధ్యయనం ఎక్కువ అవసరం. అందులోనూ ఆయా సాహిత్య రూపాల చారిత్రక పరిణామాలను విశ్లేషించేటప్పుడు మరింత లోతైన అనుభవం కావాలి. ప్రధానంగా కవిత్వం లాంటి రూపాలు ఆధునిక కాలంలో ఉద్వేగం, భావనలాంటి వాటిపై ఆధారపడి ఒక సామాజిక సందర్భాన్నో, రాజకీయ సందర్భాన్నో పెనవేసుకుని వుంటే కథ నిర్దిష్టమైన గమనంలో నిలబడి మాట్లాడుతుంది. ఆయా సామాజిక రాజకీయ సందర్భాలను, వాటి పరిణామాలను, వాటిని పెనవేసుకున్న ఉద్యమాలను కనీసంగా చర్చించగలుగుతుంది. కవిత లాంటి రూపాలకన్నా కథ నిడివి, వైవిధ్యమైన గొంతులను ఇముడ్చుకోగల స్థితి కథకు ఈ అవకాశాలనిస్తుంది. కవిత ఒకటి లేదా రెండు గొంతులను మాత్రమే తనలో లీనం చేసుకోగలిగితే, అదే సందర్భంలో కథ అనేక పాత్రలను గొంతులను తనలో లీనం చేసుకుంటుంది. అందువల్ల వాతావరణానికి చిత్రికపట్టే అవకాశం. కథలో కొంత ఎక్కువ. అందువల్ల కథావిమర్శకుడికి ఆయా కాలాల సామాజిక, సాంస్కృతిక ఆర్థిక, సాంఘిక జీవితాలు, వాటి విలువలు బాగా తెలిసి వుండాలి. అందువల్ల కథ చెప్పలేని విషయాలను విమర్శ చెబుతుంది.
సుమారు మూడుపదులకు మించిన సాహిత్యాధ్యయనం గల కె.పి.అశోక్ కుమార్లో ఈ కోణాలన్నీ కనిపిస్తాయి. సుస్పష్టంగా మార్క్సిస్టుగా కనిపించడు కాని కథనుండి పాఠకుడికి చేరవేసే అంశాలు ముఖ్యంగా సామాజిక విలువలు వాటిలోని శాస్త్రీయ పుష్టి ఇవన్నీ కె.పి.ని అభ్యుదయ ప్రగతిశీల దార్శనికుడిగా చూపిస్తాయి. ఇరవైరెండు వ్యాసాలున్న ఈ సంపుటిలో ఈ విషయం అన్ని వ్యాసాల్లోనూ కనిపిస్తుంది. 'తెలంగాణా కథల్లో కనిపించే సామాజిక- సాంస్కృతిక పరివర్తనలు' (1-18)లో ప్రారంభం నుండి నుండి 1990 వరకు గల సామాజిక పరిణామాలు, వాటి ప్రతిఫలనాలు 1990కు ముందు కాలాల కథల్లో ఎలా ప్రతిఫలించాయనే విపులమైన వ్యాసం. నిజానికి ఒక పుస్తకంగా వచ్చేంత వైశాల్యం, లోతూ కలిగిన వ్యాసమిది. ప్రాంతీయ చరిత్రకు, దాని గమనానికి సాహిత్యానికి ఎలాంటి సంబంధాలుంటాయో విశ్లేషించిన వ్యాసమిది. ఈ సందర్భంలో వెట్టిని, దానికి దగ్గరగా ఉన్న 'వంతు' పద్ధతిని వివరించడం కె.పి.అవగాహనకు అద్దం పడుతుంది. ఫ్యూడల్ వ్యవస్థలో స్త్రీలకున్న పరిస్థితుల గురించి దాసీలు, అడబాపలు, పనిమనుషులు ఇంకా అనేక రకాలుగా బలయిన స్త్రీల గురించి చెబుతారు. రైతులు-వ్యవసాయం, వెట్టి చాకిరి, అధికారుల దోపిడి, సాయుధ పోరాటం గురించి చెప్పి వాటిని కథకులు చిత్రించిన విధానాన్ని చెబుతారు. సాంస్కృతిక పరివర్తనల కింద జరిగిన ఉదంతాలను గురించి ఆ ప్రతిఫలనాలతో వచ్చిన కథలను గురించి ప్రస్తావిస్తారు. ''1960-1970లలో తెలంగాణ స్థితిగతులను వివరించిన కథలు లేవు. సురమౌళి, తాడిగిరి పోతరాజు కనిపిస్తే కథకులే కనిపించరు. కాల్పనిక సాహిత్యానికి ఆదరణ లభించడంతో ఈ దశాబ్దాన్ని రచయిత్రుల దశాబ్దంగా చెప్పవచ్చు. 1960తో పాతతరం రచయితల శకం ముగిసింది. కొత్తతరం రచయితలు 1970 తరువాతే కనిపిస్తారు''- (పే.11) అంటారు. ఈ వ్యాఖ్య లోతుగా తెలంగాణ కథాచరిత్రను విశ్లేషిస్తుంది. దీనికి కారణాలను కూడా విశ్లేషించారు. స్వాతంత్య్రం, పంచవర్ష ప్రణాళిక, నూతన రాష్ట్ర ఏర్పాటు వల్ల మేధావులలో స్తబ్దత ఏర్పడిందంటారు. ఈ నిశ్శబ్దం సామాజిక పోరాటాలగతిలో విప్లవోద్యమం తరువాత బద్దలయిందని అంటారు. విప్లవోద్యమం నాటి కథలను '1.పోరాటాన్ని చిత్రించినవి, 2.నిర్బంధాన్ని చిత్రించినవి, 3.ప్రతిఘటనని చిత్రించినవి' ఇలా మూడురకాలుగా విభజించవచ్చునని అంటారు (పే.13). ఈ క్రమంలోనే తెలంగాణ కథాసాహిత్య చరిత్రకు ముఖచిత్రం అనదగిన అంశాలను క్రోడీకరించారు.
1. 1972-73 ముందునుండే ఉద్యమం, ఉద్యమ కథ మొదలైనప్పటికీ ఎమర్జెన్సీ ఎత్తేశాక 1977 జూలై, ఆగస్టుల నుండి రైతుకూలీ సంఘాల బహిరంగ కార్యక్రమాలు ఉధృతమయ్యాక పోరాటకథలు విస్తృతంగా రావడం జరిగింది. అంతకు ముందే రైతాంగ పోరాటానికి సంబంధించిన ప్రాథమిక దశని వర్ణించిన కథలు 'బదలా' సంకలనంలో వచ్చాయి. తెలంగాణలో పుట్టిన నిప్పుని ముందుగా గ్రహించింది 'బదలా' రచయితలే. ప్రజా సాహిత్యాన్ని రచించడానికి ప్రజలనుండే రచయితలు పుట్టుకొస్తారని ఉద్యమ సాహితి, కరీంనగర్ చేసిన బదలా సంకలనం నిరూపించింది- (పే.13).
2. 1983లో రాష్ట్రంలో మొదటిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. కాని తెలంగాణ గ్రామాల్లో పరిస్థితులేం మారలేదు (పే.15).
3. 1981 ఏప్రిల్ 20 న జరిగిన ఇంద్రవెల్లి కాల్పుల సంఘటన గిరిజన పోరాటాల సాహిత్య సృజనకు కారణమైంది. గిరిజనుల జీవితంలో ఎదుర్కొనే నిరంతర దోపిడీని, పోరాటానికి సమాయత్తమవడానికి దారితీసిన పరిస్థితుల్ని ప్రజలకు తెలియజేసే అవసరంలోంచి గిరిజన పోరాట కథలు వెలువడ్దాయి -(పే.17). ఇలా అనేక అంశాలతో ఈ వ్యాసం సుమారు డెబ్బై సంవత్సరాల కథా సాహిత్య చరిత్రను రేఖా మాత్రంగా స్పర్శిస్తుంది. అయా కాలాల సామాజిక, సాయుధ పోరాటాలపై వాటిచరిత్రపై, ఆయా కాలాల కథాసాహిత్యంపై అశోక్ కుమార్కున్న సాధికారత, అవగాహన ఈ వ్యాసం తెలియ చేస్తుంది.
కథలను విశ్లేషించేటప్పుడు స్థూలంగా వాటిని విభజించడం, ఇతివృత్తాన్ని, అందులోని ముఖ్యాంశాన్ని పరిచయం చేసి దాన్నుంచి తన వ్యాఖ్యను చెప్పటం, దాని చుట్టూ ఉన్న చరిత్రనంతా తవ్విపోయటం. కథను నడిపిన విధానం. అందులోని సామాజిక న్యాయం. అశాస్త్రీయత, అసంబద్ధతలపట్ల మెలకువగా ఉండటం, చివర్లో రచయిత దృష్టి, సృష్టిపై తనదైన అభిప్రాయాన్ని చెప్పడం కె.పి.విమర్శ చేస్తుంది. కథలో ఏ అంశాన్ని చెప్పినా దాని వెనుకున్న చారిత్రక విషయాలని చెప్పడం అనేక చోట్ల కనిపిస్తుంది.
1. ఆత్మహత్య నేరం కాదు అని రామకోటి 'వర్షీయసి' అనే కథ సూచిస్తే, ఆ కథ ప్రచురణ జరిగిన కొన్నాళ్లకు 'భారతియ శిక్షాస్మృతి''లో నేరం అని చెప్పిన సెక్షను రాజ్యాంగ విరుద్దమని తీర్పు రావడం ఆయన న్యాయశాస్త్ర పారంగత్వానికి ఒక గొప్ప నిదర్శనం -(పే.25).
2. బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు, సోషలిజం అని ఎన్ని కబుర్లు చెప్పినా దానివల్ల బీదవాడికి ఒరిగిందేమీలేదు. బ్యాంకులు బీదవాళ్లను దగ్గరకు రానివ్వవు. ఉన్నవాడే వీళ్ల పేరు మీదుగా వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి అవి తోడ్పడుతాయి -(పే.29).
3. ఉన్నతస్థాయి ఉద్యోగాలకు ప్రైవేటురంగం బాగనే ఉంటుంది కానీ కిందిస్థాయి ఉద్యోగులను తక్కువ జీతాలతో ఎక్కువ పనిగంటలతో వేధించుకు తింటుంది. ప్రపంచీకరణ ప్రభావం వల్ల ప్రభుత్వోద్యోగుల సంఖ్యను తగ్గించడం, కొత్త ఉద్యోగాలను నింపకపోవడంతో నిరుద్యోగం పెరిగిపోయింది. ప్రభుత్వాలు కూడా ఔట్సోర్సింగ్ ద్వారా కాంట్రాక్టు ఉద్యోగులను నియమించుకోవడం మామూలైపోయింది. పని పరాయీకరణ (ఔట్ సోర్సింగ్) కూడా ప్రపంచీకరణ పెట్టిన భిక్షే - (పే.49).
ఇలా పాలన, విద్య, ఉపాధి, ఆర్థిక సామాజిక రాజకీయ విషయాలను అవసరానికనుగుణంగా చర్చిస్తారు. ఇవన్నీ కథ వెనుక, ముందున్న వాతావరణాలపై ఉన్న అవగాహనకు అద్దం పడతాయి.
'ఒకే ఇతివృత్తం - ఓ కథ ఒక సినిమా' అనే వ్యాసం, 'బిందు' అనే శ్రీలంక సినిమాకు, పలమనేరు బాలాజీకథ 'ఏనుగుల రాజ్యం' కథలో సారుప్యాలను తులనాత్మకంగా ఆవిష్కరిస్తారు. రెండూ అడవులు, అటవి జంతువుల పరిరక్షణకు సంబంధించినవే అవటం కూడా ఈ అన్వేషణకు కలిసొచ్చిన విషయం. ఇందులోనూ అటవీశాఖకు సంబంధించిన విషయాలపై కె.పి.కున్న సాధికారత కనిపిస్తుంది. తెలుగులో సీక్వెల్ కథలు-అనే వ్యాసం కూడా ఇలాంటి కొత్త ఆవిష్కారమే. భీమరాజు వెంకట రమణ సలీం కథలకు రాసిన కొనసాగింపు కథల విశ్లేషణ ఇది. ఇందులోనూ కె.పి.చేసిన విభజనలోని ప్రణాళికా పద్ధతి ఆయన అవగాహనను పట్టి చూపుతుంది. 1.మూల రచయిత అర్థాంతరంగా వదిలేసిన కథలు, 2.విషాదాంతం చేసిన కథలు, 3.పూర్తిగా ముగించిన కథలుగా విభజించి సీక్వెల్ కథలకు పేరు పెట్టడంలో రచయితలు చేసే పనులను, అందులోని కారణాలను విశ్లేషించారు. చివర్లో తన అభిప్రాయాన్ని కూడా చెప్పారు... ''కథ సుఖాంతమైనా, విషాదాంతమైనా దానికి సీక్వెల్ రాయడం కంటే స్వంత కథ రాసుకోవడం సులువు. అందుకే ఎవరూ సీక్వెల్ కథల జోలికి వెళ్లరు'' (పే.76). కథలో నవ్యత ఉన్నా, ప్రయోగం అంతగా రుచించనప్పుడు, కథనంలో గందరగోళం ఉన్నప్పుడు అశోక్ కుమార్ చాలా నిజాయితీగా తన అభిప్రాయాన్ని చెప్పేస్తారు. కొందరు రచయితలను, రచనలను ఉద్దేశిస్తూ చెప్పినా ఇది అందరికీ, అన్ని రచనలకూ వర్తిస్తుంది.
1. నదిని స్త్రీగా, సముద్రుడిని పురుషుడిగా చిత్రించి వారి కలయికను అడ్డుకున్న మానవుడి దీక్షను 'ప్రణయ సేతువు' కథ వివరిస్తుంది. ఇందులో ఒకవైపు నది, రెండోవైపు మానవ మేధస్సును ప్రశంసిస్తారు. రెండు అంశాలకు సమప్రాధాన్యత ఇవ్వడం వల్ల కథాప్రయోజనం దెబ్బతింది. ఈ కథ చదువుతుంటే వసుచరిత్ర అనే ప్రబంధం గుర్తుకు వస్తుంది. ఇందులో కోలాహలుడనే పర్వతానికి, శుక్తిమతి అనే నదికి మానవారోపణ చేస్తూ నడిపిన కథ ఇలాగే ఉంటుంది. ఇలాంటి ఇతివృత్తం కథకంటే పద్యకావ్యానికే బాగా కుదురుతుంది -(పే.123).
2. మరీ ఆదర్శవాద ధోరణులను, మితిమీరిన సెంటిమెంట్స్ను పరిహరించుకుని, సహజత్వానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తే సలీం మంచి కథకుడిగా గుర్తుండిపోతాడు - (పే.168). ఇలాంటి వ్యాఖ్యలు మరికొన్ని ఎత్తిరాయొచ్చు... 'విశిష్టమైన వస్తుశిల్పాలు; యం.రామకోటి కథలు' వ్యాసంలో శిల్ప సంబంధమైన అంశాలను వివరించారు. ఏదైనా తనదైన అనుభవం, అవగాహన, అధ్యయనం కె.పి అశోక్ కుమార్ వ్యాసాల్లో కనిపిస్తుంది. వ్యాఖ్యాన బలానికి సామాజిక రాజకీయ చారిత్రకాంశాల మీద ఆధారపడుతారుకాని, బలంకోసం వేరే రచయిత వాక్యాన్ని తెచ్చుకునే సాధారణ సంప్రదాయం కనిపించదు. మొత్తంగా ఈ వ్యాసాలన్నీ కథల వెనుక ఉన్న చారిత్రక భూమికను ఆవిష్కరించి పాఠకుడికి సంపూర్ణమైన 'కథావిష్కారాన్ని' అందిస్తాయి.
- ఎం.నారాయణ శర్మ,
9177260385