Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాపురాలు సజావుగా సాగాలంటే భార్యాభర్తల మధ్య ఒక నమ్మకం వుండాలి. అకారణంగా భర్త పట్ల అపనమ్మకాన్ని కలిగించుకుని, భర్తను వేధించి చివరకు తన జీవితాన్ని నాశనం చేసుకున్న జగదాంబ కథే 'సాహచర్యం' నవలగా రూపొందింది. ఈ నవల డాక్టర్ ధర్మారావు, ఆయన భార్య జగదాంబ, డాక్టర్గారి ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్న గ్రేసీల చుట్టూ తిరుగుతుంది.
డాక్టర్ ధర్మారావు, జగదాంబలది పెద్దలు కుదిర్చిన పెళ్ళి. ఇద్దరు పిల్లలు కలిగినా అన్యోన్య దంపతులుగానే నివసిస్తుంటారు. ఆదర్శభావాలతో ఆసుపత్రి నడుపుతున్న ధర్మారావు దగ్గర పనిచేసే నర్సులలో గ్రేసీ సేవాంకిత భావాలతో పనిచేస్తూ అందరి హృదయాలను చూరగొంటుంది. డాక్టర్లకు, నర్సులకు మధ్య ఇతరేతర సంబంధాలు వుండటం మామూలేనని, ఆమెను జాగ్రత్తగా వుండమని కొంతమంది హెచ్చరించడంతో జగదాంబ మనసులో అనుమానభూతం ప్రవేశిస్తుంది. ఆమె ఇచ్చే డబ్బులకు ఆశపడి ఆసుపత్రిలో పనిచేసే ఒకరిద్దరు, వీళ్ళ గురించి లేనిపోనివి చెప్పడంతో అవి నమ్మిన జగదాంబ, గ్రేసీని అవమానించి వెళ్ళగొడుతుంది. అవమానం భరించలేక బంధువుల ఇంటికి వెళ్ళిన గ్రేసీని, మోసగాడైన జాన్కిచ్చి పెళ్ళిచేస్తారు. వాడు ప్లాన్డ్గా గ్రేసీని పనిలో చేర్చుకోమని జగదాంబను బతిమాలుకుంటాడు. వాడు గ్రేసీకి తెలియకుండా లాబ్ పెడుతున్నానని నమ్మించి, డాక్టర్ దగ్గర ష్యూరిటీ తీసుకుంటాడు. వాడు పారిపోతే ఆ మూడు లక్షలు డాక్టర్గారే బ్యాంకుకు కట్టాల్సి వస్తుంది. అది తెలిసి జగదాంబ డాక్టర్గారి మరో సంబంధం ఇంకా కొనసాగుతూనే వుందని నమ్ముతుంది. డాక్టర్గారు ఎంత చెప్పినా వినకుండా, అతనికి దూరంగా ఆశ్రమాలలో, పిల్లలతో గడుపుతుంటుంది. వేదనతో, ఒంటరితనంతో బాధపడే డాక్టర్గార్ని గ్రేసీ స్వాంతన పరుస్తుంది. అపవాదును నిజం చేద్దామని వాదించి, అతనికి భార్య లేని లోటును తీరుస్తుంది. చివరకు ఈ ముగ్గురి జీవితాలు ఎలా ముగుస్తాయో తెలుసుకోవాలంటే ఈ నవల చదవాల్సిందే. వరిగొండ కాంతారావు రాసిన మొదటి నవలే అయినప్పటికీ, నవలను ఆద్యంతం ఆసక్తిగా తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటుంది.
సాహచర్యం (నవల), వరిగొండ కాంతారావు, పేజీలు : 160,
వెల : 120/-, ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు.
- కె.పి.అశోక్కుమార్,
9700000948