Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాచిప్ప కథల సంపుటి వివిధ పత్రికల్లో ప్రచురితమైన 19 కథల సమాహారం. నేటి సమాజంలో పెరిగిన నాగరికతతో పాటు టెక్నాలజీ పెరిగి మానవ సంబంధాల్లో దూరాలు పెరుగుతున్నాయి, ఆప్యాయతలు తగ్గుతున్నాయి. వాటివల్ల జరిగే నష్టాలు తన కథల ద్వారా తెలియజేసారు రచయిత్రి కొండపల్లి నీహారిణి.
రాచిప్ప కథలో వైదేవమ్మకు అనుమారెడ్డితో పెళ్లి జరుగుతుంది. పెద్ద కుటుంబానికి కోడలవుతుంది. అత్తారింటికి వచ్చేటప్పుడు వాళ్ళ నాయనమ్మ ఒక రాచిప్ప ఇస్తుంది. అదంటే వైదేవమ్మకు ప్రాణం. వారికి లేకలేక కలిగిన సంతానం మల్లన్న. కొంతకాలానికి వైదేవమ్మ తన భర్తను కోల్పోతుంది.
రామవ్వ వాళ్ళింట్లో పనిమనిషి ఆ ఇంటితో ఎంతో అనుబంధం ఉంది. మల్లన్నకు వైదేవమ్మ మేనకోడలితో వివాహం జరిపిస్తుంది. వారికుటుంబంలోని వారు వేరుపడి ఎవరి జీవితాలు వారు జీవిస్తుంటారు. తనకున్న నాలుగెకరాల పొలాన్ని సాగుచేసుకుని కష్టపడి గౌరవంగా సంసారాన్ని నెట్టుకొస్తుంది. మల్లన్నకు పుట్టిన సంతానం గోపాల్ని విదేశాల్లో ఉన్నత చదువులు చదివిస్తుంటారు. అతని పెళ్ళి సంబంధం మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి పెద్దావిడ వైదేవమ్మకు వాళ్ళ నాయినమ్మ ఇచ్చిన 'రాచిప్ప' ప్రస్తావన వస్తుంది. విడిపోయిన కొన్ని తరాల బంధుత్వం పెళ్ళితో కలుస్తారు. ఉమ్మడి కుటుంబంలోని విలువలు ఈ కథలో కనిపిస్తాయి.
'నిశబ్దానికి ఆవల' అనే కథలో లక్ష్మి, సరళ ఇద్దరూ స్నేహితులు. సరళకు ఒక బాబు ఒక పాప. బాబు స్కూల్ కు వెళ్తాడు. పాపకు ఒకటిన్నరేళ్ళుంటుంది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు కావడంవల్ల పాప ఆలనాపాలనా చూసుకోవడం కష్టమవుతుంది. సరళకు అత్తగారున్నా ఆమె చూసుకోవడం సరళకు నచ్చదు. అందువల్ల ఒక స్త్రీని 'నానీ'గా నియమించుకుంటుంది. ఆ నానీ సరళ ఆఫీస్కు పోగానే తన తోటి స్త్రీకి పాపను ఇచ్చి రోడ్లమీద బిచ్చమెత్తుకునేటట్లు చేస్తుంది. అది తన స్నేహితురాలు లక్ష్మి కంట పడుతుంది. అదే విషయం సరళకు చెబుతుంది. అందరూ ఉండి అనాథగా మారిన తన పాపను చూసి తట్టుకోలేక బోరున ఏడుస్తుంది. నానమ్మలూ తాతయ్యలు ఉండి ఉమ్మడి కుటుంబాలను కాదనుకుని దూరమైతే ఒంటరి జీవితాల్లో ఎన్ని అనర్థాలు కలుగుతాయో ఈకథ లో చక్కగా చిత్రించారు రచయిత్రి.
'మారాకుతొడిగింది' అనే కథలో సరళకు ఇద్దరూ ఆడపిల్లలే పుడతారు. భర్త కొడుకు పుట్టలేదని వేధిస్తుంటాడు. వారి మధ్య ఈ విషయంలో ఎప్పుడూ మనస్పర్థలు వస్తుంటాయి. సరళ కూడా ఒక కంపెనీలో జాబ్ చేస్తుంటుంది. తనుచేసిన ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యి తనకు ప్రమోషన్ వస్తుంది. ఆ విషయం బాస్ చెబుతూ ప్రశంసించినా, తన ముఖంలో ఆనందం కనిపించకపోయేసరికి బాస్ విషయం ఏంటో అని అడుగుతాడు. విషయం తెలుసుకున్న అతని సలహా మేరకు ఒక ప్రణాళిక వేసుకుంటుంది. తన భర్త చిన్నాన్నకు ఆరోగ్యం బాగాలేదని పలకరించడానికి కుటుంబ సమేతంగా వెళ్తారు. వాళ్ళ ఒక్కగానొక్క కొడుకు తనను పట్టించుకోకపోవడం కూతురే దగ్గరుండి అన్నీ చూసుకోవడం చూసిన సాగర్కు కనువిప్పు కలుగుతుంది. కొడుకుల కంటే కూతుళ్ళే నయం అని తెలుసుకుంటాడు.
'మనసు పరిమళించిన వేళ...' అనే కథలో స్వాతి అనే అమ్మాయి స్వాతంత్య్ర పోరాటాలపైన రీసెర్చ్ చేసే క్రమంలో వివరాల కొరకు దయమ్మ అనే 80 ఏళ్ళ పెద్దావిడని కలుస్తుంది. ఆమె ఆ కాలంలోని సంఘటనలు చెప్తుంది. రాఘవరావు అనే దళనాయకుడు తన మేనకోడలిని చూడడానికి ముత్యాల వర్తకునిగా మారువేషంలో వస్తాడు. మేనకోడలు భోజనం పెడుతుంది. ఆ సమయంలో పోలీసులు తరుముకుంటూ అక్కడికి వస్తారు. రాఘవరావు తప్పించుకుని హరిజనవాడలో ఒక శవంగా పాడెమీద పడుకుంటాడు. అది గుర్తించలేక పోలీసులు వెళ్ళిపోతారు. నిజాంకాలంలో సంఘం నాయకులు ఎన్నో కష్టాలకోర్చి ప్రజలకు జరిగే అన్యాయాలను ఎదిరించారు. అంటరానితనం వంటి దురాచారాలను గురించి ప్రజల్లో చైతన్యం తెచ్చారు. అత్యాచారాలను, అణచివేతలను మాన్పించడానికి పోరాటం చేసారు. ఆ సంఘటనలను రచయిత్రి కళ్ళకు కట్టినట్లు ఈ కథలో చిత్రించింది.
'అద్దంలో చందమామ' కథలో సంధ్య, రవి భార్యాభర్తలు. వారికి ఇద్దరు కొడుకులు. వారిని ఉన్నదాంట్లో లేదనకుండా చక్కగా చదివిస్తున్నారు. అడిగిందల్లా లేదనకుండా కొనిచ్చేవారు. ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకున్న కొడుకు బైక్ కావాలని పట్టుబడతాడు. ఈ వయసులో బైక్ వల్ల ఏర్పడే ఇబ్బందిని గమనించి భార్య సాయంతో తన కొడుకును సముదాయించి, నాయినమ్మ, తాతయ్యకు అనారోగ్యం కారణంగా డబ్బులు పంపించాలనీ, వారిని జాగ్రత్తగా చూసుకోవడం మన భాధ్యత కదా అని నచ్చజెప్పి బైక్ ఇప్పించడం వచ్చే సంవత్సరానికి వాయిదా వేయిస్తాడు. ఇక్కడ రచయిత్రి కథలోని పాత్రల ద్వారా తల్లిదండ్రులు ఎవరికైనా తల్లిదండ్రులే అని, అందరినీ సంతోషపెట్టడం కొడుకు బాధ్యత అని చాకచక్యంగా చిత్రించారు.
'నానీ'లే 'నానీ'లైన వేళ' కథలో విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు, పిల్లల బాగోగుల కోసం నానీలను నియమించుకుంటారు. అలా యశోధర మొదటిసారి అమెరికా వెళ్తుంది. తన మనవడిని నిద్రపుచ్చుతున్న సమయంలో కొడుకు ఆఫీస్ కొలీగ్స్ వస్తారు. ఎవరావిడా నానీ నా అని అంటారు. కాదు మా అమ్మ అని చెప్తే సారీ చెప్పి వెళ్ళిపోతారు. అక్కడి నానీలు అంటే పిల్లల బాగోగులు చూసుకునే వాళ్ళు అని వారి గురించి తన కోడలు చెబుతుంది. అందుకే అత్తయ్య మిమ్మల్ని కొన్ని రోజులు ఇక్కడుండి వెళ్ళమనేది మనసంస్కృతి సంప్రదాయాలు అలవడడమేకాక మీతో అటాచ్మెంట్ పెరుగుతుంది కదా అంటుంది. అందుకు యశోధర నిజమేనని తను నాని కాదు నానమ్మ అనిపించుకోవాలనుకుంటుంది.
'మృత్యుంజయుడు' అనే కథలో చిల్పూరు గుట్టపైన సంఘం నాయకుడు తుపాకులు పేల్చే శిక్షణ తీసుకుంటుంటారు. ఈ విషయం తెలిసిన పోలీసులు దళనాయకుడైన రాఘవరావును పట్టుకోవడానికి గుట్టను చుట్టుముడతారు. పోలీసుల కాల్పుల్లో కార్యకర్త లక్ష్మారెడ్డి మరణిస్తాడు. రాఘవరావుకు తగలాల్సిన బుల్లెట్ తృటిలో తప్పి, తలపై పాపిటలా దూసుకుపోతుంది. పోలీసుల దృష్టి మరల్చేందుకు తన నడుముకున్న కండువాలో రాళ్ళునింపి పొదల్లోకి దూరంగా విసిరేస్తాడు. ఆ శబ్దానికి రాఘవరావు పారిపోతున్నాడనుకొని పోలీసులు అటువైపు పరుగెత్తుతారు. అదే అదనుగా మరణించిన కార్యకర్తను ఊళ్ళోకి తీసుకెళతారు. ఇదే కథలో (ఈరిగాని) పాత్ర వీరయ్య అనే పాత్రను దళంలో విరుద్దమైన పనులు చేసేదిగా, ఈర్ష్యా ద్వేషాలు నింపుకుని రాఘవరావును చంపాలనుకుంటాడు. దళ సభ్యులు గమనించి వీరయ్యను చంపేస్తారు. ఈ కథ చదువుతున్నంత సేపూ కళ్ళముందు జరిగినట్లుగా అనిపిస్తుంది. అంత చక్కని చిత్రణ చేసారు రచయిత్రి. అదే విధంగా అన్ని కథలూ నిత్య జీవితంలో సమాజంలోని సంఘటనలను వస్తువులుగా తీసుకుని కథల్లో చిత్రించారు నీహారిణి. కొన్ని కథల్లో తెలంగాణ మాండలికంలో సంభాషణలు సహజంగా ఒదిగినట్లు కనిపిస్తుంది. తన మొదటి కథా సంపుటి అయిన 'రాచిప్ప' చాలా సులభశైలిలో చక్కని శిల్పంతో అందరికీ అర్థమయ్యే విధంగా చదవాలనే ఆసక్తిని కలిగిస్తుంది.
- జయంతి వాసరచెట్ల,
9985525355