Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవికి, సమాజానికి విడదీయరాని సంకెల వున్నది. అది బాధ్యతో, భావావేశమో సృజనాత్మకమై, అక్షర రమ్యమై మొదలవుతుంటది, విస్తరిస్తుంటది. బలమై బలపడుతుంటది. ఊయలలూపినా, ఊగిపోనిచ్చినా వెనుక సల్లక్షణమైన లక్ష్య సాధనే ద్యోతకమౌతుంది. ఉషస్తార మొలిచినా, నిశితార నిలిచినా కార్యాకారణ సంబంధాన్ని పసిగట్టే, కై గట్టే కవిస్థానం ప్రత్యేకమైనది, అజరామరమైనది.
అది 1996 జులై 20. సిద్ధిపేట పట్టణం శోభాయమానంగా సాహిత్య కాంతుల్లో వెలిగిపోతున్నది. నేల నాలుగు చెరుగుల నుంచి ప్రముఖ, ప్రవర్ధమాన కవిజనం, 'తమకోసం రాస్తున్నారనుకున్న' సామాన్య జన ప్రభంజనం మోహరించిన సందర్భవిశేషమే 'మంజీరా రచయితల సంఘం' పదేళ్ల సభల వేడుక.
''మరి ఎదిరించడమంటే ఎగరడమే'', అని 'మట్టి మనుగడలోంచి' మాట్లాడి- ''జీవితాన్ని గెల్చుకుంటున్న ఆనందాన్ని, మరోసారి త్యాగం చేయటానికి, ఇప్పుడు నెమళ్ళు సిద్ధంగా లేవు'' అని వ్యవస్థలో 'ఖాయం' చేసి- కవిత్వం రాసిన నవనవోన్మేష యువకవి ఐలేనిగిరి ''నెమలికన్ను'' ఆవిష్కరణ మహౌత్సవం మరో వేడుక.
గిరి బక్కపలచగా, ధవళ తేజంతో, మంద్రస్థాయి స్వరంతో, నవ్వుతో అందరిని ఆకట్టుకునేవాడు. కవిత్వాన్ని ఆషామాషీగా, రాసినా రాయకపోయినా ఒరిగేదేముందిలే 'అన్న అభిప్రాయంగా తీసుకునేవాడు కాదు. బ్యాంకు ఉద్యోగిగా క్యాషులో మునిగి తేలినా, కవిత్వాన్ని ఖాయిష్ చేసుకున్నందున మరసంకు ఇష్టుడయిండు.
ఏ వస్తువును తీసుకున్నా పూర్తిగా పలవరించనిదే కవిత ముగింపునిచ్చేది కాదు. 'జీవితమొక పద్మవ్యూహమని చెప్పి, ఈదకుండా వుండగలవా?' అనే ఉత్ప్రేరకంతో హైప్ ఇస్తడు.
'ప్రశ్న గర్భస్థ శిశువులా ఎదుగుతూ ఉంటుంది/ కెరటంలా విరుచుకు పడితే, అది ప్రశ్నకు పరాకాష్ట' అంటూ ప్రశ్నకు ఒక నిబద్ధత, సార్థకత రంగరిస్తడు. లేత అక్షరాల్లాంటి పిల్లల ఆటపాటలకు మురియని మనిషుండడు. అయినా వర్షంలో తడిస్తే ఊరుకోని మనిషుండడు. 'జలుబు వస్తేనేం/ వర్షం మళ్ళీ రాదుగా!' అన్నడు. పిల్లల వైపున్న పెద్ద మనసు ఈ కవిది. 'ఏడ్వడానికే పుట్టినట్లు/ ఓ విషాదమేఘంలా ఇంట్లో ఆమె' అనడం గిరిని స్త్రీ జన పక్షపాతిగా రుజువు చేస్తుంది. ఇంకా ప్రతి స్త్రీ/ గృహిణి అసహజ మరణానికి వెనుక 'రంగుల కలల్లో విహరించే/ మరోసారి డబ్బుకు అమ్ముడు పోయే/ దీపాన్ని ఆర్పే శాపంలా' మగ జాతిని నిరసించేవరకు వెళ్ళడు. ఆక్టివిస్ట్గా ఉండడమన్నా, మారడమన్నా అత్యంత ప్రీతి. 'వాస్తవ విలువల్ని కాపాడటానికి/ వందల చేతులు పుట్టుకొస్తాయి', 'ఇక గాంధారివేషం చాలిద్దాం/ ఇంకాసేపయితే సూర్యుడు కొమ్మల్ని దాటి ఊళ్లోకి వస్తాడు/ ఇకనైనా వెలుతురుని ఆహ్వానిద్దాం/ బామ్మా పురాణం ఆపు/ 'లేచే వేలైంది' కవితే నిదర్శనం.
కావాలని, ఏదో ఐపోవాలని అక్షరం పొదలో వేలు పెట్టలేదు. పొంచివున్న సర్ప పరిష్వంగంలో నలుగుతున్న చీమల పక్షం 'నేనే' అంటూ 'కమ్ముకొస్తున్న పాట'లా తలపడటం కోసమే కలం పట్టిండు. రైతు దైన్యం గురించి నాటి దువ్వూరి రామిరెడ్డి నుండి నేటి దర్భశయనం శ్రీనివాసాచార్య గారల వరకు విస్తృతంగ విన్నం. 'పొలంలో విత్తనాలు నాటినప్పుడే/ గుండెలో కలల్ని నాటుకుంటాడు' అని ప్రారంభించి, 'ఆరుమాసాలు గడిస్తే చాలు' అని నిరీక్షణను సముదాయించుకొని, 'కలలు గెలలు తొడిగినయని' సంబురపడతడు. 'కలల్ని కోసి కుప్పగా పోసి/ సంచుల్లో యింటికి తీసుకొని పోయేవేళ 'గుబురు మీసాలు, గుడ్లగూబ కళ్ళు' అడ్డగించడం, 'రెండు నిమిషాల్లో లెక్కలు వేసి, పంట నీకు దక్కదని' తేల్చడం, చెప్పుతూ..., 'పచ్చని స్వప్నం' దక్కించుకునే తీరును చదివితే, ఒక సెల్యులాయిడ్ కావ్య గౌరవం దక్కే కవితగా అనుభూతి చెందుతుంది.
ఆందోళన, అప్రమత్తత - భయం, సాహసం పురివిప్పిన నెమలి కంటిలో ఒలికించిన అపూర్వ ముఖచిత్రం శీలా వీర్రాజు గారు వేసిన ఈ సంపుటిలో 33 కవితలున్నయి. అందులో హైకూలు 3, మినీకవితలు 3, మిగతావన్నీ పెద్ద కవితలే. ఈ కవికి అక్షరాల మీద ఆశ ఎక్కువ. అందుకు విశాలమైన కాన్వాసు నిర్మించుకున్నడు. నూతనత్వాన్ని, ప్రయోగవాదాన్ని అనుసరించిండు కవిత్వంలో. జీవితతత్వ సత్యం, తాత్వికత్వం, మతరాహిత్యం, ప్రాకృతిక, సామాజిక, స్వీయ అనుభవాలే సాధికారంగా రాసిండు. ఇన్స్టంట్గ, తాత్కాలిక సంఘటనాత్మక కవిత్వంగ కనబడడు. విషపాత్రను స్వీకరించే సోక్రటీస్గ, బోధివృక్షపు నీడలో జరిపిన అంతరంగ మథనమే కవిత్వసారంగ ప్రయాణించిండు. ఆవిష్కరణ సందర్భంగా 'ఐ' లేని గిరి కాదు, 'ఐ' (విజన్ )వున్న గిరి' అని సంబోధించిన్రు సుధామ గారు. అప్పట్లో ఆకాశవాణి హైద్రాబాద్ కేంద్రం తరపున తెలుగులో జాతీయకవిగా, ఢిల్లీలో కవితాపఠనం చేయడం మరసం క్రెడిబిలిటీలో తనొక పింఛమయిండు.
తొలి పుస్తకంలోనే పెద్దలు అమ్మంగి వేణుగాపాల్ గారి ప్రశంసవాక్యాలకు అర్హుడయిండు. ''ఎక్కడా అరిగిపోయిన పరిభాష గానీ, ఆ పరిభాష లేని కారణంగా అస్పష్టత గానీ కనిపించదు. గిరి మంచి కవిత్వం రాస్తున్నాడు. మరిన్ని మంచి కవితలు రాస్తాడన్న నమ్మకం నాకుంది'' (గిరిజనం- ముందుమాటలో) అన్న సంతోషం, విశ్వాసం సారు ప్రకటించడం తన ఎదుగుదలకు సోపానం గదా! అట్లే మరో పెద్దలు నందిని సిధారెడ్డి 'నెమళ్ళు మేల్కొన్న చప్పుడు' అనే పీఠికలో గిరిని, కవిత్వాన్ని ఆసాంతం శల్యపరీక్షే చేసిన్రు. 'బాధల్ని పట్టుకోవటంలో సున్నితమైన కొత్తకోణాల్ని ఎన్నుకోవటంలో గిరికి నిశితమైన చూపుంది'' అంటరు. కవిత్వ ప్రపంచంతో నిరంతరంగా సంబంధాల లేమితో వుండే గిరికి, తగదని బాధతో హితవు పలికిన్రు.
23 ఏళ్ళ కాలం గతించింది, ఇప్పటికి నాలుగైదు పుస్తకాల వయసయ్యేవాడు. ''ముసి ముసి ఆశల్ని దాచుకున్న నాయిన'' అన్నవే... ''నా చేతుల్లో సేద తీరకుండానే వెళ్లిన అమాయకపు తల్లి'' అని వగచినవే... వర్షమొచ్చినప్పుడల్లా తడిసె ఆటకు సిద్ధమయ్యే అభిలాష్, వంశీ, విశ్వాల లోకాన్ని చూడవా...
నువ్వు తెరిపించిన నెమలికన్ను తడితో ముద్ద ముద్దయింది తుడువలేవా...
''మౌనం నీ శత్రువు/ ముళ్లకంచెల్ని, ఉరితాళ్లను ఖండించు -దండించు'' అన్నడు గదా - నీ మిత్రు క్షిపణి!
''నా బీళ్ల హృదయం పులకరిస్తుంది/ పక్షి రెక్కలల్లార్చినట్టు/ కోడిపిల్ల కువకువమన్నట్టు/ వర్షం నా ఊరిచుట్టూ పచ్చని సంగీతం పాడుకుంటుంది/ పుడమి కడుపు పండి నా ఇల్లు పండగై పోతుంది''
నీ చివరి పేజీ అక్షరాలు నిజమవుతున్నయి, ఆ పండుగ లో నువ్వుండాలె గదా గిరీ...!!!
- దాసరాజు రామారావు,
9618224503