Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాల సాహితీవేత్త డాక్టర్ కందేపి రాణీ ప్రసాద్ నుంచి వచ్చిన మరో రచన 'స్వీటీ, మిల్కీ, ఓ చిలుక'. ఈ పుస్తకంలో మొత్తం 16 కథలు ఉన్నాయి. ఈ పుస్తకంలోని కథలన్నీ పిల్లల మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడతాయి. ప్రతి కథలోనూ వ్యక్తిత్వ వికాసం, జీవన నైపుణ్యాలు అంతర్లీనంగా ఉన్నాయి. పిల్లలకు జీవన నైపుణ్యాల గురించి బాల్యం నుంచే వివరిస్తూ ఉంటే, వారు కచ్చితంగా బాధ్యత గల పౌరులుగా ఎదుగుతారనేది నిస్సందేహం. రాణీ ప్రసాద్ అదే చేశారు. ఆమె సృష్టించిన ప్రతి కథలోని ఎక్కువ పాత్రలు బాధ్యతగా కనిపిస్తాయి. పుస్తకంలోని ప్రతి కథ చదువుతుంటే ఆధునిక జీవితంలో ఇప్పటి పిల్లలకు తారసపడుతున్న పాత్రలే కనిపించడం విశేషం. ఈ విధానం 'విక్రమ్-భేతాళ కథలను, పరవస్తు చిన్నయసూరి రచించిన నీతి చంద్రిక, విష్ణు శర్మ చెప్పే పంచతంత్రం కథలు, చందమామ కథలను' గుర్తుకు తెస్తుంది. అయితే ఆ కథలకు అనుకరణ ఎంతమాత్రము కనిపించదు.
పుస్తక శీర్షిక అయిన 'స్వీటీ మిల్కీ ఓ చిలుక' కథను గమనిస్తే... ఈ కథ ద్వారా పిల్లలకు పరిశుభ్రత ఎంత ముఖ్యమో చెప్పడంతోపాటు, గాయమైతే చికిత్స చేయాలనే విషయంపై వారిలో అవగాహన కలుగుతుంది. ఈ 16 కథల్లో ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు. హింసా ప్రవృత్తిని ప్రేరేపించేలా లేకపోవడం ఈ కథల ప్రత్యేకత. ఈ కథల్లో కనిపించే మరో సుగుణం ఏమిటంటే... కథలలోని పాత్రల గుణగణాలు కూడా ఏమాత్రం వ్యతిరేకంగా ఆలోచించనీయవు. బాలల్లో పెరిగిన మానసిక ఒత్తిడి, విద్యావిధానంలోని లోపాలను 'చెట్టుగా మారని మొలక' అనే కథ ద్వారా సున్నితంగా వివరించారు. రాణీప్రసాద్ గారు రాసిన ప్రతి కథ చాలా తేలికగా అర్థమయ్యే పదాలతో, చిన్న చిన్న కథలను సృష్టించడం చాలా బాగుంది. కథల్లోని పాత్రలను, తీర్చిదిద్దిన తీరు ఆమె ప్రత్యేకతను పట్టి చూపుతుంది.
పుస్తకం పేరు: స్వీటీ, మిల్కీ, ఓ చిలుక, రచయిత : కందేపి రాణీప్రసాద్, పేజీలు : 65, వెల : 80/-, ప్రతులకు : సృజన్ చిల్డ్రన్ హాస్పటల్, సిరిసిల్ల. ఫోన్ : 9866160378
- నస్రీన్ ఖాన్,
9652432981