Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాహిత్యంలో సమాజం, దానితపాటు కళ ఉంటుంది. కవిత్వం కళ కాకుండా పూర్తి ప్రయోజనాన్ని సాధించలేదు. కవిత్వేతర ప్రయోజనంకోసం మరో రూపం, ప్రక్రియ ఏదైనా ఉపయోగపడతాయి. ప్రధానంగా కవిత్వం దేనికోసం చేసినా అది చేసే సంభాషణ హృదయగతమైంది. వాలరీ లాంటి పాశ్చాత్యులు కూడా ''కవిత్వం హృదయాన్ని చేరాల''న్నారు. ఇలాంటి కవిత్వ సిద్ధికోసమే కవి తాపత్రయపడతాడు. ప్రాచీన కాలంలో కావ్యాలంకార సూత్రాలుండేవి. నిజానికి ఏ సూత్రమైనా చివరికి ప్రతిభనే కొలమానంగా చెప్పింది గానీ, ఆ ప్రతిభను పొందేందుకు ప్రేరేపించే మార్గాలను కొన్నిటిని సూచించింది. అలాంటి ప్రతిభను పెంచుకునేందుకు కవిత్వానుభవాన్ని పొందినవాళ్లు కొన్ని విశ్లేషణలూ చేశారు. విమర్శ కూడా హృదయంతో పొందిన కవిత్వానుభవాన్ని బుద్ధితో కొలవడానికి సిద్ధపడుతుంది. నిజానికి హృదయానుభవం లేని విమర్శకూడా గుడ్డి నడకే నడుస్తుంది. ఎప్పటికప్పుడు కవిత్వ వాతావరణం మారినట్టు కవిత్వానుభవం కూడా మారుతుంది. ఆ మారిన అనుభవం గతాన్ని కూడగట్టుకుని వర్తమాన కవిత్వ సత్వాన్ని లెక్కగట్టేందుకు, మంచీ చెడులను విచారించేందుకు సిద్ధపడుతుంది. సాధారణంగా ఎప్పటికప్పుడు కవిత్వం నవీకరణ చెందినట్టు, మూలతత్వం చెడకుండా కవిత్వైకరణ కూడా చెందుతుంది. అయితే కవిత్వం వచ్చినంతగా విమర్శ, విమర్శ వచ్చినంతగా ఆధునిక నిర్మాణ సూత్రపరిశీలన, దానికి గతానికి తారతమ్య వివేచన జరగదు. ఉత్తరభారతంలో రాధావల్లబ్ త్రిపాఠి లాంటి వాళ్ళు ఆధునిక కావ్య సూత్రాలను గ్రంథాలుగా తెచ్చారు. తెలుగులో అలాంటి అరుదైన కవిత 'కవిత్వ కళాతత్త్వం'. ఆచార్య ముదుగొండ వీరభద్రయ్య పూర్తి సాహిత్య జీవితంలో ఎక్కువ భాగం కళా మీమాంస, విమర్శలో గడిపారు. ప్రధానంగా ఆధునిక కళా వివేచనకు ఆయన మార్గం ఒక ప్రధాన కొలమానాన్నిచ్చింది. ఆ అనుభవమే కావ్యంలా 'కవిత్వ కళాతత్త్వం'లా ముందుకు వచ్చింది.
ఇది ప్రధానంగా ఉపదేశ రూపంలో ఉన్న సంవాదాత్మకమైన దీర్ఘకవిత. గురుశిష్యులుగా కోయి కోటేశ్వరరావు వీరభద్రయ్యలు కావ్యంలోని పాత్రలు. 'పరిప్రశ్నేన' అన్నట్టు శిష్యుని కావ్య మీమాంస సంబంధమైన ప్రశ్నలకు సమాధానాలను ఇస్తారు. ఆ సందర్భంలోనే కావ్య, ప్రతిభ, చిత్రణ, హృదయం, సృజన మొదలైన అనేక అంశాలు కవితా వాక్యాలుగా పరచుకున్నాయి.
1. ''అభివ్యక్తం కాని భావాన్ని వాచ్యం గొంతునులిమో/ దానిపై దయ తలచో/ సూచ్యమై చిరంజీవి ఔతుంది'' -(పే.16)
2. ఇది ఎడ తెగని సంభాషణ/ వైఖరీనుంచి పరివాక్కుదాకా చేరి/ విశ్వమంతా మనమయితే నీనా కవితలు సూర్య చంద్రులవలె /శక్తివంతమైన చోదక శక్తితో/ మానవాళికి కొంగ్రొత్త ప్రాణం పోస్తాయి-(పైదే)
3. ఆనందమన్నది లోకవ్యవహారంలోని సుఖం కాదు/ శరీరానికి హాయినిచ్చే సుఖం కానే కాదది/ మనసుకి మత్తునిచ్చే మాదక ద్రవ్యంలా/ జోకొట్టి నిదుర పుచ్చేది అంతకన్నాకాదు/ ఆనందంకోసం కవిత్వం రాయడు కవి/ అనందంవల్ల కవిత్వం రాస్తాడు - (పే.21)
4. మహా కావ్య మీవేళ రూపు మార్చుకుని/ ఆదర్శంగా నిలచి యుగచేతనను ప్రతిబింబిస్తున్నది/ సాధారణ కవులకది అందని ద్రాక్షయే అయింది/ అష్టాదశ వర్ణనలతో, ప్రసిద్ధ కథతో /రాసే మహా కావ్యాలకీ రోజున వ్యాప్తిలేదు/ ఆసుపత్రి గీతం, గొరిల్లా, మట్టీ మనిషీ ఆకాశం వంటి ప్రతీక కావ్యాలకు ప్రాణం పోస్తాయి - (పే.23)
5. రసనేత్రం ఉన్న కవుకి వస్తువులే అతణ్ని మావైపు చూడు- మమ్మల్ని గ్రహించమంటున్న విషయం తెలిసిపోతుంది - (పే.26)
ఇలాంటి కవిత్వీకరణ సంబంధమైన విషయాలు చాలా చర్చకు వచ్చాయి ఈ వాక్యాల్లో. కవిత్వంలో చెప్పడమే ఉంటుంది కాని, కవిత్వభాషది ప్రకటన. దాన్నే అభివ్యక్తి అంటున్నాం. వాచ్యంగా చెప్పేభాషలో సూచ్యంగా అంటే ప్రతీకలాగానో, ధ్వని రూపంలోనో భావం వ్యక్తమౌతుంది. సమాచారాన్ని చెప్పడానికి వాచ్యం సరిపోతుంది. కాని భావం చెప్పడానికి సూచ్యం అవసరం. రెండవ భాగంలోని అంశం చాలావరకు వైదిక కాలంనుంచి వ్యక్తీకరణ క్రమాన్ని చెప్పే విషయాల్లో చర్చకు వచ్చినదే. ఈ వాక్యంలో 'వైఖారి, పరా' అనే రెండు పదాలు కనిపిస్తున్నాయి. వైఖారి చెప్పేతీరు. పరా వ్యక్తంచేసేది. రుగ్వేదం దశమ మండలంలో ఒక రుచ ఉన్నది. 'చత్వారి వాక్ పరిమితాపదాని తాని త్రీని గుహితానేంగయంతి'. చత్వారి- అన్నదానికి పశ్యంతి, మధ్యమా, వైఖారి, పరా అనే నాలుగు పదాలుగా అర్థం చెప్పి, పశ్యంతి చూస్తున్నది. మధ్యమా గ్రహించుచున్నది. వైఖారి చెబుతున్నది. పరా దాని కన్నా ఉన్నతమైందిగా చెబుతారు. ఒక వస్తువు లేదా భౌతిక దృశ్యం కవిత్వమవడంలో ఇదంతా ఒక క్రమం. కావ్యమీమాంసలో అలౌకిక వ్యాపారాలుగా చెప్పే 'సాధరణ, ధారణ, మనన, చర్వణ, సృజన' లలోనూ ఇదే క్రమం కనిపిస్తుంది.
మూడవ భాగం ఆనందాన్ని గురించి చెప్పింది. ''యథాస్మైరో చతే కావ్యం తథేదం పరి వర్తతే'' అని ప్రాచీనుల మాట. దర్శనంలో ఆనందం కనిపించినపుడే సౌందర్యం బయల్పడుతుంది. చూసేవారి కళ్లనుబట్టి వస్తువులోని సౌందర్యం రెట్టింపవుతుందంటాడు సంజీవదేవ్. అలాంటి వాక్యమే ఇక్కడ కనిపిస్తుంది. ఆనందం అంటే సుఖం కాదని చెప్పారు. అదేవిధంగ ఆనందం వల్ల కవిత్వం రాస్తారుగాని, ఆనందం కోసం రాయరు. ఆనందం వల్లనే అనేక వస్తువులు సౌందర్యమయంగా, కావ్య వస్తువులుగా కనిపిస్తాయంటారు. ఉపనిషద్వాక్యం కూదా ఇదే చెప్పింది. - ''ఆనందాద్యైవ ఖల్విమాని భూతాని జాయంతే'' - (ఆనందం వల్లనే ప్రపంచంలోని వస్తుజాలమంతా, ప్రాణిజాలమంతా పుడుతుంది). నాలుగవ భాగంలో మహాకావ్య చర్చ కనిపిస్తుంది. నగముని కొయ్యగుర్రం వచ్చిన సందర్భం నుండి ఈ చర్చ సాహిత్యంలో జరుగుతున్నదే.
ప్రాచీన మహాకావ్యానికి లక్షణాన్ని అలంకార శాస్త్రాలు నిర్దేశించాయి. ''ఆశీర్నంస్క్రియా వస్తు నిర్దేశో వాపి తన్ముఖమ్'' (ఆశీస్సు, నమస్కారాలు, వస్తువును చెప్పడం కావ్య ముఖము) ఇలాంటివి ఆధునికంగా వచ్చినవాటిలో కనిపించవు. ఒక మహత్తర పరిణామం ఆధునిక కావ్యాలను నిలిపాయంటారు. చివరిది రస సంబంధమైన విషయాన్ని చర్చిస్తుంది. నిజాన్ని గురించి చర్చ కూడా ప్రాచీనమైందే. అయితే రస నేత్రం గురించి ఇక్కడ చర్చిస్తున్నది. - ''వ్యక్తిలో ఉన్న రసానుభూతి మాత్రమే కళకాదు. అది అమూర్తమైన అనుహూతిలాంటిది. వ్యక్తిలోని రసానుభూతి ఒక భౌతికరూపాన్ని దాల్చినప్పుడే అది కళ అవుతుంది'' అన్నాడు సంజీవదేవ్. ఈ రసనేత్రమే వస్తువును చూపిస్తుంది. ఒక వస్తువు కొత్తగా కనిపించడంలోని విషయం ఇదే- ''శనైః శనైః యన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయా'' -(కొంచం కొంచంగా ఏదైతే కొత్తగా కనిపిస్తుందో అదే రమణీయమైన రూపం) అని ప్రాచీనులు. రమణీయంగా కనిపించడానికి ఈ రసనేత్రమే ముఖ్యం.
కవిత్వంలో కవిత్వం తప్పిపోయిందని ఇప్పుడొక చర్చ జరుగుతుంది. కవిత్వం ఎక్కడ తప్పిపోయిందో కవితాత్మకమైన, శాస్త్రీయమైన చర్చ చేశారు ఈ శాస్త్ర కావ్యంలో ఆచార్య ముదిగొండవీరభద్రయ్య. కళా, సాహిత్యాంశాలపై విశేషమైన కృషి చేసిన ఆయన కలం నుంచి వచ్చిన ఈ కవిత అనేక ప్రాచీన, పాశ్చాత్య కవితత్త్వాలను గురించి ఆవిష్కరిస్తుంది.
- ఎం.నారాయణ శర్మ,
9177260385