Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజమైన చరిత్ర కవిత్వంలోనే ఎక్కువగా దొరుకుతుంది అని ప్లేటో అన్నట్లు ఆ పనిలోనే నిమగమైంది తెలుగు పూలతోట సాహిత్య వేదిక. ప్రముఖ కవి వెన్నెల సత్యం ఆధ్వర్యంలో 2016 ఫిబ్రవరి 18న ప్రారంభమైన ఈ వేదిక మూడో వార్షికోత్సవం జరుపుకుంది.
ఈ సందర్భంగా 3 మార్చి, 2019న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సాహితీ సహకారంతో 51మంది కవులతో నిర్వహించిన కవిసమ్మేళనంలో కవులు చదివిన కవితలను 'పుప్పొడి' కవితా సంకలనంగా తీసుకువచ్చారు. డా||ఏనుగు నరసింహారెడ్డి 'పుప్పొడి'కి రాసిన ముందుమాటలో యువకవులంతా తిలక్, శ్రీశ్రీ, అలిశెట్టి ప్రభాకర్, కాళోజీ, దాశరథి వంటి కవులను అధ్యయనం చేస్తే కొత్త అభివ్యక్తితో రాయగలరనే సూచన చాలా విలువైనది.
'ఆమెకు నేనేమివ్వగలను' కవితలో బోల యాదయ్య చక్కని భావోస్పోరక వాక్యాలు రాస్తూ ''ఆమె మా అమ్మ నాన్న అలిగి/ ఆకాశ తారలై వెళ్ళిపోతే/ అన్ని తానై నాకు/ కన్నీళ్ళ దీపమై వెలిగింది'' అంటూ తన జీవిత భాగస్వామి గురించి బోల యాదయ్య రాసిన వాక్యాలు కంటతడి పెట్టిస్తాయి. బాదేపల్లి వెంకటయ్యగౌడ్ రాసిన 'డోంట్ వర్రీ... పిల్లలమర్రి' కవితలో ''ఆత్మబంధువైన పిల్లలమర్రిని/ కాలగర్భాన కలిసిపోకుండా/ కాపాడుకుందాం.../ ప్రభత చెవిని మెలేసి/ ప్రకృతి అందించిన అపురూప/ కళాఖండాన్ని పరిరక్షించుకుందాం.../ పిల్లలమర్రి...డోంట్ వర్రీ'' అంటూ చక్కని సందేశం ఇచ్చారు.
ఈ సంకలనం సంపాదకుల్లో ఒకరైన సర్పరాజ్ అన్వర్ తన భావాలను స్పష్టంగా ప్రకటించారు 'నీడే నా అస్తిత్వం' కవితలో ''నా నీడ నా సంస్కృతి, సంస్కారాలకు గుర్తు../ వెలుతురులో చిక్కగా ఆ చీకటిలో పల్చగా/ అవతారం దాల్చి, కష్టసుఖాల్ని/ సమదృష్టితో చూడాలని చెప్పే సందేశ మహత్తు'' అని నీడను అభివర్ణిస్థారు. కవికి భావాలు- ఆశయాలు- ఆలోచనలు- దృక్పధాలు... లక్ష్యాలు... లక్షణాలు అవసరమని ఎరుక పరిచే కవిత ఇది. డి.శ్యామల 'కాలానికి తృప్తిలేదు' కవితలో ''కాలం కాలగర్భంలో దాగి/ కాలం అనేకానేక సత్యాలను/ వెలికి తీయదా??/ కాలమెప్పుడూ కాలం చేయదు/ అందుకే/ కాలానికి ఎప్పుడూ తృప్తి ఉండదు...!!!'' అని చక్కటి తాత్త్వికతను ప్రకటించారు.
వీధిబాలల జీవితాల్ని అద్దం పట్టే కవిత కల్లూరి ప్రభాకరాచారి రాసిన 'అభాగ్యజీవులు' కవితలో ''ఏ దారి ఎటు వెళ్తుందో/ తడారని గొంతు వీరిది!/ ఎడారిలో ఎండమావుల్లా/ చీకటి బ్రతుకు వీరిది!!'' అని దిగులు చెందుతారు. ''ఆలోచనలకు ఆసరాయై/ భాషిస్తున్నది చెట్టు'' అని నందిగామ కిషోర్ కుమార్ రాసిన 'చెట్టు', సిరా పర్యావరణ స్పృహతో రాసిన 'తరువు వ(వ్య)థ' కవితలు చదువుతుంటే ఇస్మాయిల్ రాసిన 'చెట్టు' కవిత గుర్తుకు వస్తుంది.
''జీవితాన్ని నిత్యం ప్రేమించే వారికి /ప్రేమికుల దినం ఏపాటిది!/ నిత్యం చెలి తలపుల్లో/ తడిచే మనసుకు/ క్యాలెండర్ కానుక లేపాటివి..!'' అని 'రెండక్షరాలు' కవితలో విఠలాపురం పుష్పలత సంధించిన ప్రశ్నలు ఆలోచింపచేస్తాయి. ఆటవెలది- సీస, తేటగీతుల్లో అల్వాల లక్ష్మణమూర్తి రాసిన 'రైతు' పద్యాలు, ఆంజనేయులు గౌడ్ రాసిన 'నిరుద్యోగి గోస', సయ్యద్ ముజాహిద్ అలీ రాసిన 'నరకానికి నకలు', పుట్టి గిరిధర్ రాసిన 'యుద్ధగీతి' కవితలు ఆలోచింపజేస్తాయి.
పుప్పొడి, సంపాదకులు : వెన్నెల సత్యం, సర్ఫరాజ్ అన్వర్, డా||వి.జయప్రకాష్, పేజీలు : 64, వెల: 50/-, ప్రతులకు : వెన్నెల సత్యం, తెలుగు పూలతోట సాహిత్యవేదిక, షాద్ నగర్ - రంగారెడ్డి జిల్లా. ఫోన్ : 9440032210.
- చక్రవర్తి