Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాత్రా చరిత్రలు రాయటంలో ఒక్కోరిది ఒక్కో శైలి, పద్ధతి ఉంటాయి. దానిని వివరించే క్రమంలో కవుల శైలి విభిన్న తరహాలో ఉంటుంది. ఆ యాత్రా సాహిత్యం డా||ఎన్.గోపి గారిలాంటి విశిష్ట కవిది అయితే అది మరింత వన్నెలీనుతూ శోభాయానంగా పాఠకుడిని అలరిస్తుంది. యాత్రా సాహిత్యాన్ని కవిత్వమంత ఇష్టంగా వెలువరించటం గోపి గారికి ఇష్టమైన పని. ఇప్పటి వరకు వారు మారిషస్, సైప్రస్, అమెరికా, ఇంగ్లండు, జర్మనీ దేశాల్లో తాము జరిపిన కవితా యాత్రకు యాత్ర సాహిత్యపు గుచ్ఛంగా పాఠకులకు అందించారు. గత సంవత్సరం అక్టోబర్ నెలలో చైనా దేశంలోని బీజింగ్ నార్మల్ యునివర్సిటిలోని ఇంటర్నేషనల్ రైటింగ్ సెంటర్లో కవితాగోష్టులు, అనువాద శిబిరాలు, సాహిత్య గోష్టులలో పాల్గొన్న వివరాలను, మొత్తం పర్యటన విశేషాలను చాలా ఆసక్తికరంగా చెప్పే యాత్రా సాహిత్యాన్ని 'చైనాలో కవితా యాత్ర' గానూ, చైనాలో ఆయన్ని కదిలించిన అంశాలను 'చైనా పద్యాలు' గానూ తీసుకొచ్చారు.
యాత్రానుభవాన్ని కవి వివరించే తీరు భిన్నంగా ఉంటుంది. అందులో కవులందరూ ఒక్క వేదికపై చేరినప్పుడు... అంతర్జాతీయ కవులు ఒకరి కవిత్వాన్ని మరొకరు దర్శించే తీరు ఎలా ఉంటుంది... మానవ సంవేదనల వ్యక్తీకరణ ప్రపంచ వ్యాప్తంగా ఎలా ఉంటుందన్న అంశాలు ఆసక్తికరంగా ఆ కథనంలో చోటు చేసుకుంటాయి.
కవి గోపి గారి శైలి అంతా ముచ్చటను చెప్పినంత అందంగా ఉంటుంది. చదువరి తెలియకుండానే ఆయనతో పాటు ఒక ప్రయాణం చేసి వస్తాడు. ప్రయాణంలోని చిన్న చిన్న అంశాలను ప్రస్తావిస్తూ ఉత్సుకతతో యాత్రను కొనసాగిస్తారు. సింగపూర్ ట్రాంసిట్ ఎయిర్పోర్టు అని వివరిస్తూ టెర్మినల్ కు టెర్మినల్ కు మధ్య రైలు ప్రయాణం చేయాలని, దాన్ని స్కై ట్రైన్స్ అంటారని చెబుతారు. ప్రతి 80 సెకండ్లకో విమానం ఎగిరే airport సింగపూర్ అంటారు.
చైనా చేరింది మొదలు, గోపి గారి కవితావేశం ఉప్పొంగుతూ కనిపిస్తుంది. ముందుగా ఈ అంతర్జాతీయ కవులను ఒక వేదికపై చేర్చిన 'జామీ ఫాక్టర్ జూ'ను, ఆమె రచనా సామర్ధ్యాన్ని మనకు పరిచయం చేస్తారు. వారితో పాటుగా ఈ కవితోత్సవానికి హాజరయిన వారిలో అమెరికన్ కవి షెర్విన్ బిచ్చూ, దేనిష్ కవయిత్రి క్యాండీ విన్ బ్రౌన్, దక్షిణాఫ్రికా కవయిత్రి నీతాబాసెంగ్ జహారోజ్ జాఫ్నా, జర్మనీ కవి రాన్ రింక్లర్ ఉన్నారు. ఈ కవితోత్సవానికి సూత్రధారి జామీ ఫాక్టర్ జూ, ఆచార్య ఎన్.గోపి అంతర్జాతీయ కవులయితే, మరో ఆరుగురు చైనీస్ కవులూ ప్రతి కవికీ ఒక దుబాసీ కవి అనుసంధించబడ్డాడని, కవులందరూ ఇంగ్లీష్ అనువాదాలు చదవగా అవి వెంటనే స్క్రీన్ పై చైనీస్ భాషలో కనిపించేదని ఆశ్చర్యంగా చెబుతారు.
కవిత్వంతో పాటు కవులందరూ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనేక అంశాలను చర్చించుకునే వీలు కలిగింది అంటారు గోపి. చైనీస్ మహాకవి 'జీది మాజియా' హాజరవటం, కవులకోసం ఏర్పాటు చేసిన డిన్నర్లో భాగం పంచుకోవటం ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని ఇచ్చిందంటారు గోపి. కవి మాజయా 'Yi' తెగకు చెందిన వాడని ఆయన కవిత్వం '20' అంతర్జాతీయ భాషల్లోకి అనువాదమయిందని చెబుతారు కవి గోపి. ప్రస్తుతం చైనా రచయితల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారంటారు. 'మానవాళిని కలిపేది కవులే' అన్న మాజయా కవి పలుకులు ఎంతో నిజమంటారు. కవి గోపికి తక్షణ స్పందనను కవిత్వం రూపంలో చెప్పటం అలవాటు. అలా డైనింగ్ టేబుల్ మీద కనిపించిన చేప ఆయనను వెంటాడి ఆయనలోంచి కవితగా బయటకు వచ్చింది. ఆ కవిత పేరు 'చైనాలో చేప' కొన్ని పంక్తులు పేర్కొంటాను :
''ఒక నిశ్చల దృక్కు/ నాకు గుచ్చుకుంటూనే ఉంటుంది
వదిలించుకుని/ మరో జీవితంలోకి
ఈదుకుంటూ వెళ్లిపోయాను'' అంటారు.
ఈ కవిత ఇంకా కొనసాగుతుంది. మళ్ళీ ఇక్కడ కవి తనలోకి తాను చూసుకుని 'కవిత్వమొక సంజీవిని'. సమస్త మానవాళి బాధలముందు మనమెంత అనే స్పృహను కవిత్వం కలిగిస్తుంది అని కవిత్వాన్ని ప్రశంసిస్తుంటారు.
ఈ యాత్రలో భాగంగా కవి గోపి గారి ఎన్నో పరిశీలనలు మనల్ని అబ్బురపరుస్తాయి. ఇప్పుడు నేను భారతీయుడ్ని. 29 రాష్ట్రాల ప్రతినిధిని... కేవలం తెలుగు వాడినే కాదు సుమా అని సగర్వంగా చెబుతారు. బీజింగ్ నగరంలోని ఆర్ట్ గ్యాలరీని కవుల బృందం సందర్శించినప్పుడు అన్నిచోట్లా కనిపించే డ్రాగన్ బొమ్మలను పరిచయం చేస్తారు. డ్రాగన్ చైనా వారి పహచాన్ అంటారు. వారికి శుభకరమైనది అని పేర్కొంటారు.
డా||ఎన్.గోపి చైనాలో ముచ్చటపడి ఇష్టపడి చూసింది 'గ్రేట్ వాల్ ఆఫ్ చైనా'. ఆరు వేల కిలోమీటర్ల రాతి గోడ. ఏడవ శతాబ్దంలో మొదలైన నిర్మాణం. ఎక్కడానికి మెట్లున్నాయి. రోప్ వే కూడా వుందిట. మెట్లు ఎక్కిదిగిన వారికి ఇత్తడి రేకును సర్టిఫికెట్ గా ఇవ్వటమో విశేషం అంటారు కవి గోపి. 'చైనా గోడ' ఎక్కిన అనుభవం కవితగా రూపు దాల్చుతుంది... కొన్ని పంక్తులు మళ్ళీ పేర్కొంటాను మీ కోసం ...
''చైనా గోడ/ నా దేహంలోంచి పోతోందో
ఈ దేశంలోంచి పోతోందో/ తెలియని సుప్త చేతనావస్థలో ఉన్నాను.
మనసును ఛిద్రం చేస్తూ/ చుట్టలు చుట్టలుగా ముడుచుకుంటున్న
ఒక అవిచ్ఛిన్న సరీసృపాకృతి/ తలపోతలను మేల్కొల్పుతున్నది'' అంటారు కవి.
అక్టోబర్ 24వ తేదీన అంతర్జాతీయ కవుల బృందం లూషన్ లిటరరీ ఇన్ట్సిట్యూట్ని దర్శించింది గోపి బృందం. ఈ ప్రయాణంలో తమతమ దేశాల కవిత్వ ధోరణులను చర్చిస్తారు కవులంతా. సాహిత్య విద్యను బోధించడం కోసం ఏర్పాటయిన సంస్థ లూషన్ ఇన్స్టిట్యూట్. చైనా రచయితల అజమాయిషీలో నడపబడుతున్న సంస్థ. 'లూషన్' అనే కలం పేరున్న కవి, కధకుడు, విమర్శకుడు, సంపాదకుడు Dausi Dausi Suran గౌరవార్ధంగా ఏర్పాటయిన సంస్థ అంటారు. ఇక్కడ 'how writing becomes personalized through metaphore' అనే అంశం మీద జరిగిన సెమినార్లో గోపి ప్రసంగించారు. ''కనిపించే బయటి ప్రపంచం కవిలోకి ప్రవేశించి మళ్ళీ కవిత్వంతో బయటకు వస్తుంది'' అంటారు గోపి. కవిత్వంలో పద చిత్రాలు నడిపే పథ చిత్రాలు ఎలా అవుతాయో వివరిస్తారు. గడ్డి పోచ కొసర్ల చివర నర్తించే మంచు బిందువులా కలం అంచులపై జీవితాన్ని నర్తించనీ అన్న రవీంద్రుని వాక్యాలను గుర్తుకుతెస్తారు. లూషన్ ఇన్ట్సిట్యూట్ సెమినార్ అనంతరం కవుల బృందం బీజింగ్కు వేయి కిలోమీటర్ల దూరంలో ఉన్న 'కున్ షాన్'కు ప్రయాణం కడుతుంది. షాంఘై మహానగరానికి గంటన్నర ప్రయాణ దూరంలో ఉన్న చిన్న పట్టణం. బీజింగ్ ఉత్తరమైతే షాంఘై దక్షిణాది నగరమంటారు రచయిత. ఈ వెయ్యి కిలోమీటర్ల దూరాన్ని బుల్లెట్ ట్రైన్ ద్వారా చేరుకుంటారు కవులంతా. బుల్లెట్ ట్రైన్ ని చైనీస్ భాషలో 'ఫ్యూషింగ్' అంటారు.
ఒక స్టేషన్లో బౌద్ధ బిక్షువును చూడగానే ఆయనకు గుర్తుకొస్తుంది చైనాలో అధికారికంగా మతాలు లేవు కానీ బౌద్ధం, టావోయిజం ఎక్కువగా అనుసరిస్తారు అని. ఇక్కడ గోపి మనకు కున్షాన్ నగరంలో సాహిత్య కార్యక్రమాలు ఎందుకు పెట్టారో వివరిస్తారు. కున్షాన్లో సాహిత్య కళారూపాల సమాఖ్య ఏర్పడి సమస్త ప్రక్రియల సంగమంగా ఉండటం కారణం అంటారు. 'కున్షాన్' చైనాలోని అతి సంపన్న పల్లీయ నగరం. కొంచెం అర్ధమవ్వాలంటే Rural City అంటారు. యాంగ్జీ నది పరీవాహక ప్రాంతమంటారు. యాంగ్జీ పేరుతో ప్రతిష్టాత్మక సాహిత్య పత్రిక కూడా ఉందంటారు. ఏ ఊరు వెళ్ళినా ఆ ప్రాంత చరిత్రతో పాటు ఆ అర్ధాన్నీ తెలుసుకునే అలవాటున్న డా. గోపి 'చైనా' అంటే 'మధ్య ప్రదేశం' అని తెలియజేస్తారు. 'కున్షాన్' అంటే పర్వతం అని తెలుసుకుంటారు.
చైనాలో కవిత్వ ధోరణులు ఎలా ఉన్నాయని అడుగుతారు మిత్రుల్ని. 1980 ప్రాంతం నుంచి ఆధునిక ధోరణులు తలెత్తాయంటారు వారంతా. Nostalgia, Minimal Forms, ఇప్పుడు Long Poems రాయటం ఒక ట్రెండ్ అని మనకు అక్కడి వారి ద్వారా వివరిస్తారు.Land Scape Poetry విరివిగా వెలువడుతుందంటారు. స్త్రీ వాద కవిత్వం సజీవంగా ఉందంటారు. అయితే రాజకీయ కవిత్వం తక్కువట. కొంతలో కొంత ప్రాక్తన సమాజాల అస్తిత్వ వాద గొంతుకలు కూడా వినిపిస్తున్నాయంటారు. కున్షాన్ నగరంలో కవితోత్సవం, అనువాద శిబిరాలు జరిగాయంటారు గోపి. చివరిగా ఓ మాటంటారు గోపి. చైనాలో ఏ భవనమన్నా చూడండి ఎక్కడో అక్కడ ఒక చైనీయ సాంస్కృతిక స్పర్శ ఉంటుంది. అలాగే గోడ మీద గోపురాల మీద యిది చైనా కట్టడమనే ముద్ర ఉంటుంది అంటారు.
అలా డా||గోపి తొమ్మిది రోజుల కవితాయాత్ర మనకు ఈ చైనాలో కవితా యాత్ర పుస్తకంలో దర్శనమిస్తుంది. ఈ తొమ్మిది రోజుల యాత్రా విశేషాలు కవిత, సమాచార సమాహారమై చదువరికో కొత్త అనుభూతినిస్తాయి. చైనీయుల సాంస్కృతిక, చారిత్రక నేపధ్యం కొంత మనకు అవగతమవుతుంది. సింగపూర్ లోని బీజింగ్, షాంఘై విమానాశ్రయాలను మనమూ పరిశీలిస్తాం.
అంతర్జాతీయ కవుల నేపథ్యం పరిచయమవుతుంది. కవితామృతాన్ని ఆస్వాదిస్తాం... పుస్తకం చదివిన తరవాత కవి దర్శనం క్రాంత దర్శనమన్న మాట వెచ్చని తేనీరులా గుండెను చేరుతుంది.
- సి.ఎస్.రాంబాబు,
9490401005