Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సృజనాత్మక ప్రక్రియల్లో అంతర్భాగం విమర్శ. సాహిత్యంలో కవిత, కథ, నవల, నాటకం మాదిరిగానే విమర్శ కూడా ఒక ప్రక్రియ. విమర్శ లేకుండా మిగతా ప్రక్రియలు రాణించలేవు. సాహిత్యంలోని మంచీచెడులను చర్చించడానికి విమర్శ అవసరం. కవిత్వం, కథలు పుష్కలంగా రాగానే సరిపోదు. వాటిలోని గుణదోషాలని చెప్పగలిగే విమర్శ కావాలి. పాఠకునికీ, రచయితకీ మధ్యన వారథిగా పనిచేస్తాడు విమర్శకుడు. ఒక రచనలోని సారాన్ని, సౌందర్యాన్ని చూపగలిగే నైపుణ్యం విమర్శకుడికే ఉంటుంది. ఒక వాచకంలోని నిగూఢమైన అంశాల్ని విప్పి చెప్పడం విమర్శ ద్వారానే సాధ్యం. పైకి కనిపించే అర్థమే కాకుండా అంతరార్థాల్ని బోధపరిచే సాహిత్య ప్రక్రియ విమర్శ. అందువల్ల కథారచన, కవితా రచనతో పాటు విమర్శ కూడా పెరగాలి.
సాహిత్యంలోని మంచినీ, గొప్పతనాన్నీ విమర్శకులు చెప్పగలరు. సామాన్యంగా కనిపించే లక్షణాలలోని అసాధారణతల్ని వివరించడం విమర్శకుని కర్తవ్యం. శ్రీశ్రీ 'మహాప్రస్థానం' కవితా సంపుటికి చలం రాసిన 'పీఠిక' ఎంతో విలువైంది. ఇప్పటికీ దానికి ప్రాధాన్యం ఉంది. చలం ప్రధానంగా కథకుడు, నవలాకారుడు. అయినప్పటికీ ఆయన రాసిన 'యోగ్యతాపత్రం' విమర్శ కోవలోకి వస్తుంది. కనుకనే 'మహాప్రస్థానం'తోపాటు 'యోగ్యతాపత్రం' ప్రాచుర్యం పొందింది.
కొందరు ప్రత్యేకించి సాహిత్య విమర్శనే చేస్తారు. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, కట్టమంచి రామలింగారెడ్డి, రొణంకి అప్పలస్వామి, రాచమల్లు రామచంద్రారెడ్డి, జి.వి.సుబ్రమణ్యం, చేకూరి రామారావు, వల్లంపాటి వెంకట సుబ్బయ్య, కోవెల సంపత్కుమారాచార్య, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, కాత్యాయనీ విద్మహే వంటి వారు ప్రత్యేకించి విమర్శ రాశారు. ఈవిధంగా సీరియస్గా విమర్శని చేపట్టి నిర్వహించేవారి అవసరం ఇవాళ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఇతర ప్రక్రియల్లో రచనలు చేస్తూ విమర్శలు రాసేవారు ఉన్నారు. కానీ విమర్శని చేపట్టి నిర్వహించేవారు అరుదు. అందులోనూ నిరంతరం ఇదే పనిమీద ఉన్నవారు కొద్దిమంది మాత్రమే. పెన్నా శివరామకృష్ణ, ఎం. నారాయణశర్మ, లక్ష్మణచక్రవర్తి, కె.పి. అశోక్కుమార్ ప్రత్యేకంగా విమర్శ వ్యాసాలు రాస్తున్నారు. ఇటీవలి కాలాన ఈ నలుగురు క్రమం తప్పక విమర్శనా వ్యాసంగంలో ఉన్నారు. అయితే సమీక్షలు, పరిచయ వ్యాసాలు, కేవలం ముందుమాటలు రాసేవారు కూడా విమర్శకులుగా చెలామణీ అవుతున్నారు. వీరిలో చాలామంది సాహిత్య పేజీలకు సరిపడే వ్యాసాలు రాయడానికి పరిమితమయ్యారు. లేదంటే తమ భావజాలానికి దగ్గరగా ఉన్నవారిని ముందుమాటలతో మురిపించే ప్రయత్నం చేస్తుంటారు ఇంకొందరు. కేవలం తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారే సాహిత్యవిమర్శని సీరియస్గా చేపట్టి నిర్వహించడం గమనార్హం.
కాగా, తెలంగాణలో కవిత్వం, కథలు రచించేవారిలో కొందరు అరుదుగా మంచి విమర్శనా వ్యాసాలు రాస్తున్నారు. ప్రముఖ కవి, రచయిత, అనువాదకుడు ఏనుగు నరసింహారెడ్డి విమర్శ ప్రక్రియలోనూ కృషి చేస్తున్నారు. ఇటీవలి ఆయన వెలువరించిన 'అంతరంగం', 'సమాహార' పుస్తకాలని గమనిస్తే విమర్శ ప్రక్రియ మీద తనకు గల పట్టు అర్థమవుతుంది. అలాగే ఫేస్బుక్లో కొన్నాళ్ళుగా కవిత్వం మీద వంశీకృష్ణ రాస్తున్న వ్యాసాలు విమర్శకునిగా తన ప్రత్యేకతని తెలియజేస్తాయి.
నిజానికి సాహిత్యపేజీలలో విమర్శ పేరుతో పుస్తక సమీక్షలు, పరిచయవ్యాసాలు ఎక్కువగా అచ్చవుతున్నాయి. కానీ విపులమైన సాహిత్య విమర్శ రావడం లేదు. సాహిత్యం కోసం మాత్రమే ఉండే పత్రికలు నిడివితో సంబంధం లేకుండా సాహిత్య వ్యాసాలు ప్రచురిస్తాయి. అలాంటి పత్రికలు రెండు మూడు తప్ప పెద్దగా లేవు. అందువల్లనే సమగ్రమైన విమర్శ వ్యాసాలు రావడం తగ్గింది. ఈ కారణంగానే తెలుగులో విమర్శ లేదనే మాట వినిపిస్తుంటుంది. అయితే విమర్శ లేనేలేదనే మాట వాస్తవం కాదు. కాకపోతే అవసరమైనంతగా రావడం లేదన్నది నిజం.
ఇపుడు కొంతమంది ఎక్కువగా ప్రత్యేక సంచికలకు మాత్రమే విమర్శ రాస్తున్నారు. ఇంకొందరు తమకు నచ్చిన కవుల గురించి చిన్నపాటి పుస్తకాలు రాస్తున్నారు. వాటిలో ప్రశంసలే ఎక్కువ. గుణదోష విచారణ కనిపించదు. ఏకపక్షంగా కవి రాసిన ప్రతి వాక్యాన్ని శిరోధార్యంగా భావిస్తున్నారు. ఇది విమర్శ అనిపించుకోదు. ప్రశంస కూడా కాదు. ఎందుకంటే ప్రశంసకు అర్హమైన విషయాలు ఏమిటో కూడా చెప్పడం లేదు. ఒక వాచకం బాగుందంటే ఎందుకు బాగుందో చెప్పాలి. ఏ కారణంగా ఒక వాచకం పాఠకుల్ని ఆకట్టుకుంటుందో వివరించాలి. బాగుందనగానే సరిపోదు. ఈ మాట చెప్పడానికి విమర్శకులే కానక్కర్లేదు. పాఠకులు కూడా తమకు నచ్చిందో లేదో చెబుతారు. బాగుందనో, లేదనో అంటారు. బాగుంటే ఎందుకు బాగుందో పాఠకులు చెప్పలేరు. ఎందుకుంటే వారు ఒక రచనని చదివి ఆనందించగలరు. కానీ తమకు ఆనందాన్నిచ్చే అంశాలు ఆ రచనలో ఏమున్నాయో వారు వివరించలేరు.
ఇక్కడే విమర్శకులు ఆ పని చేయాలి. ఒక రచన ఇచ్చే అనుభూతికి గల మూలాల గురించి విడమరచి రాయాలి. ఒక వాచకం పాఠకుల్ని బాగా ఆకట్టుకోడానికి గల కారణాల్ని యోచించాలి. ఆ వాచకంలోని వస్తువు, శైలి, శిల్పం, నిర్మాణం, అభివ్యక్తిరీతి వంటి అంశాల్ని పరిశీలించాలి. వీటిలో ఏయే అంశాల కారణంగా ఒక రచన పాఠకులను ఆకట్టుకుంటుందో విపులంగా రాయాలి. ఈ పని చేస్తున్నవారు అరుదయ్యారు.
మరో వైపున విమర్శ పేరుతో వస్తున్న వ్యాసాల్లో పరామర్శ ఎక్కువ. కేవలం ఇతివృత్తం గురించే రాస్తున్నారు. వస్తున్న సాహిత్య విమర్శలో అధికభాగం వస్తు ప్రాధాన్య విమర్శనే. కవులు, రచయితలు ఏయే ఇతివృత్తాల్ని ఎంచుకుంటున్నారో చెబుతున్నారు. కవిత, కథ, నవల గురించి వచ్చే వ్యాసాల్లో ఇతివృత్తమే ప్రధానంగా కనిపిస్తుంది. ఒక రచన కేవలం ఇతివృత్తంగానే మంచిదో చెడ్డదో కాదు. ఎంచుకున్న ఇతివృత్తాన్ని అందంగా అభివ్యక్తం చేయడంలో రచయిత అనుసరించిన పద్ధతి చెప్పాలి. కవిత్వం గురించి రాసేవారు ఎక్కువగా కవిత్వాన్ని ఎత్తి రాస్తున్నారు. ఆ తర్వాత ఒకటీ రెండు మాటలతో తమ వ్యాఖ్యానాన్ని సరి పెడుతున్నారు. ఇక కథా వ్యాసాల్లో తిరిగి కథని చెబుతున్నారు. దళితుల గురించి, ప్రపంచీకరణ గురించి వచ్చిన కథలంటూ ముక్తాయింపుని ఇస్తున్నారు. ఈవిధమైన వ్యాసాలే సాహిత్యపేజీల్లో చూస్తుంటాం. కనుకనే విమర్శ లేదనే మాట వినిపిస్తుంటుంది. ఎందుకంటే ఇది విమర్శ కాదు.
విమర్శలో విశ్లేషణ ఉండాలి. ఒక రచనకు సంబంధించిన గుణదోష చర్చ కనిపించాలి. ఒక రచన ఉదాత్తతకు మూలమైన సౌందర్యం, శిల్పం, కళాకౌశలం గురించి వివరంగా రాయాలి. రసరమ్యతకు దోహదం చేసిన అంశాల్ని విశ్లేషించాలి. వస్తుశిల్పాల సమన్వయం గురించి విశదీకరించాలి. అలాంటప్పుడే విమర్శలో పరిపూర్ణత ఉంటుంది. ఈరకమైన విమర్శలు అరుదుగా వస్తున్నాయి.
ముఖ్యంగా సాహిత్య ధోరణుల మీద ప్రత్యేక సంచికలు తీసుకు వచ్చినపుడు మంచి వ్యాసాలు రాస్తున్నారు కొందరు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి తెలంగాణ తెలుగు కథ, తెలంగాణ తెలుగు నవల అనే రెండు పుస్తకాలు వచ్చాయి. వాటిలో కథ, నవల గురించి సరయిన విమర్శ, విశ్లేషణలు కనిపిస్తాయి. తెలంగాణ ప్రాంతంలో కథావికాసం, నవలా వికాసం గురించి తెలుసుకోడానికి ఉపకరిస్తాయి ఈ పుస్తకాలు. అలాగే ఈమధ్య కాలంలో దాశరథి కృష్ణమాచార్య, కాళోజీ, వట్టికోట ఆళ్వారుస్వామి వంటి సాహితీవేత్తల మీద విమర్శా సంకలనాలు వచ్చాయి.
విమర్శ రాణించాలంటే విమర్శకులు నిర్మొహమాటంగా ఉండాలి. బాగున్న రచనల గురించి చెప్పడం అవసరమే. కానీ సాహిత్యం పేరిట చెలామణయ్యే చెత్తరచనల గురించి కూడా ధైర్యంగా రాయాలి. ఎవరేమంటారోనని సందేహించకూడదు. విమర్శకునికి వాచకమే ప్రమాణం. అందువల్ల ఒక రచన బాగోలేకపోతే అది ఎందుకు పేలవమైనదో రాయాలి. తద్వారా చెత్తరచనలకు ప్రచారం తగ్గుతుంది. విలువలు, ప్రమాణాలు పాటించే రచనల ప్రాధాన్యం పెరుగుతుంది. ఉత్తమ సాహిత్యానికి ఆదరణ లభిస్తుంది. ఈవిధంగా సాహిత్యం కానిది సాహిత్యంగా చెలామణయ్యే ప్రమాదాన్ని విమర్శ ద్వారానే అడ్డుకోగలుగుతాం. కనుక సమాజానికీ, సాహిత్యానికీ విమర్శ అవసరం. మంచి సాహిత్యం మరింతగా పరివ్యాప్తం కావాలంటే విమర్శ రాణించాలి.
సృజనాత్మక రచనలు చేసే కవులు, రచయితలు విమర్శ రాయకూడదనేం లేదు. కానీ వారు మరింత అధ్యయనపరులయి ఉండాలి. కవుల కన్నా, కథకుల కన్నా విమర్శకుల మీద బాధ్యత ఎక్కువ. అందుకని విమర్శకులు ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి. 'చివరకు మిగిలేది' నవల రాసిన బుచ్చిబాబు గొప్ప సాహిత్య విమర్శకుడు కూడా. గొప్ప కథలు రాశారు. ప్రపంచంలోని గొప్ప రచయితలనీ, తత్వవేత్తలనీ పరిచయం చేస్తూ విపులమైన వ్యాసాలు రాశారాయన. చలం, గోపీచంద్, అడవి బాపిరాజు వంటి ఉదాత్త రచయితల సాహిత్యాన్ని విశ్లేషించారు. స్వయంగా రచయిత, కవి, చిత్రకారుడు బుచ్చిబాబు. తను ఇష్టంగా, ప్రేమగా విమర్శావ్యాసాలు రచించారు. ఇలాంటి నిబద్ధ రచయితలు ఇవాళ మనకు అవసరం. విమర్శకునికి సాహిత్యంతోనే కాదు సామాజిక, ఆర్థిక, తాత్విక రంగాలపై అవగాహన ఉండాలి. ఈ అవగాహన కలిగిన విమర్శకులు రావలసిన అవసరముంది.
ఇదే సమయంలో మరో విషయం గమనించాలి. ఇప్పటివరకు కవిత్వం మీదనే ఎక్కువగా విమర్శ వచ్చింది, వస్తున్నది. కానీ వచన రచనల మీద విమర్శ చాలా తక్కువ. తెలుగులో కథ, నవల, నాటకం పుట్టి వంద సంవత్సరాలు దాటింది. అయినప్పటికీ వచన సాహిత్యం మీద విమర్శ, పరిశోధనలు తక్కువగా ఉన్నాయి. కథావిమర్శ, నవలా విమర్శ కొంతవరకు మెరుగు. నాటకవిమర్శ మాత్రం మరీ స్వల్పం. కన్యాశుల్కం నాటకం గురించి తప్ప మరో నాటకం గురించి రాసినవారు లేరు. మరి కన్యాశుల్కం తర్వాత మంచి నాటకాలు రాలేదా? అంటే వచ్చాయి. కానీ ఆ నాటకాల గురించి రాసే విమర్శకులు లేరు. కనుకనే 'పడమటి గాలి' వంటి మంచి నాటకం మీద విమర్శావ్యాసాలు కనిపించడం లేదు. 'గాంధీ' మీద దీర్ఘాశి విజయభాస్కర్ మంచి నాటకం రాశారు. రంగస్థలం మీద ఆ నాటకాన్ని చాలా సార్లు ప్రదర్శించారు. అయినా ఆ నాటకం మీద విమర్శావ్యాసాలు రాలేదు. మొత్తంగా నాటకప్రక్రియకు విమర్శకులు దూరంగా ఉన్నారు. ఈ లోటును, పరిమితిని అధిగమించడం అవసరం. అందులో భాగంగానే వచన సాహిత్యం మీద విమర్శనీ, పరిశోధనలనీ ప్రోత్సహించాలి.
ప్రస్తుతం తెలుగులో కవిత్వం, కథ పుష్కలంగానే వస్తుంది. నికార్సయిన విమర్శ తక్కువగా ఉంది. ఈ లోటును భర్తీ చేసుకోడం తెలుగు సాహిత్యరంగానికి మేలు చేస్తుంది. గతంలోని గొప్ప సాహిత్యాన్ని, వర్తమానంలోని మంచి సాహిత్యాన్ని కాపాడుకోడానికి విమర్శ ఉపకరిస్తుంది. సాహిత్యరంగం సరయిన మార్గంలో ప్రయాణించడానికి తోడ్పడుతుంది. అందుకని విమర్శ రాసేవారిలో నిజాయితీ, చిత్తశుద్ధి, అంకితభావం ఉండాలి. ఈ రంగంపైన దృష్టి పెరిగే వాతావరణం నెలకొనాలి. సాహిత్యానికి అంకితమై పనిచేసే పత్రికలు పెరగాలి. అన్నిటికన్నా ముఖ్యంగా విమర్శని స్వీకరించే సహనం, సహృదయం సాహిత్యరంగంలో పాదుకోవాలి.
- గుడిపాటి