Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆధునిక సమాజంలో మనుషుల ఆలోచనలో, అభిరుచులలో, ఆచరణలో రావలసిన మార్పులను గుర్తించి చైతన్యంతో వివిధ ఇతివృత్తాలను సమకూర్చుకొని భిన్న ప్రక్రియలలో రచనలు చేసి, ఆధునిక సాహిత్య యుగకర్తగా, పేరు పొందిన నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం.
1848 ఏప్రిల్ 16 న సుబ్బారాయుడు, పున్నమ్మ దంపతులకు రాజమండ్రిలో వీరేశలింగం జన్మించారు. వీధి బడిలో విద్యాభ్యాసం ప్రారంభించిన వీరేశలింగం పిన్న వయసులోనే పురాణ పఠనం, బాల రామాయణం, రుక్మిణీ కళ్యాణం, సుమతీశతకం, కృష్ణశతకం మొదలైనవి నేర్చుకున్నాడు. విద్యాభ్యాసం చేస్తున్న సమయంలోనే రచనలు రాయడం ప్రారంభించారు. చిన్నప్పటి నుండే వీరేశలింగం దేనినీ గుడ్డిగా నమ్మేవారు కాదు. ప్రతి విషయాన్ని ప్రశ్నించి తెలుసుకునేవారు. భూతప్రేత పిశాచాలపై, మంత్రతంత్రాలపై నమ్మకం ఉండేదికాదు. మూఢ నమ్మకాలను వ్యతిరేకించేవాడు. వీరేశలింగంకు 13 సంవత్సరాల వయసులోనే బాపమ్మ (రాజ్యలక్ష్మి) తో వివాహం జరిగింది.
విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత వీరేశలింగం ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. స్త్రీల దుస్థితికి కారణం వారికి విద్య లేకపోవడమేనని భావించారు. అందుకొరకై ధవళేశ్వరంలో బాలికల పాఠశాలను స్థాపించారు. సంఘంలోని మూఢాచారాలను తొలగించడానికి, స్త్రీ విద్య, వితంతు వివాహాల పట్ల ప్రజలలో చైతన్యం కలిగించడానికి పత్రికే సరియైన మార్గమని భావించిన వీరేశలింగం 1874లో వివేకవర్థిని పత్రికను ప్రారంభించారు. ఈ పత్రికలో కథలు, సంఘ సంస్కరణ విషయాలు, సారస్వత విషయాలు ప్రచురితమయ్యేవి. వివేకవర్థిని పత్రికకు అనుబంధంగా ఏర్పాటు చేసిన హాస్య సంజీవని పత్రికలో వివిధ రకాల వ్యంగ్య రచనలు ప్రచురించారు వీరేశలింగం.
వీరేశలింగం వితంతు పునర్వివాహం శాస్త్ర సమ్మతమని వాదించి తన ఉపన్యాసాల ద్వారా, రచనల ద్వారా ప్రజలను చైతన్యపరచి 1881లో మొదటి వితంతు వివాహం జరిపించారు. వితంతువుల కొరకు తన స్వగృహంలో ప్రత్యేక శరణాలయాన్ని స్థాపించి వాళ్ళకు పునరావాసాన్ని కల్పించారు. స్త్రీ విద్యాభివృద్ధికై రాజమండ్రిలో మరొక బాలికల పాఠశాలను స్థాపించారు. అనుక్షణం స్త్రీల అభ్యుదయాన్ని కాంక్షించే వీరేశలింగం స్త్రీల కొరకు సతీహితబోధిని అనే మాస పత్రికను ప్రారంభించి స్త్రీల జ్ఞాన సంపదను పెంచే ప్రయత్నం చేశారు. తనకున్న ఆస్తితో స్త్రీల అభ్యున్నతికి దోహదం చేసే విధంగా హితకారిణి సమాజం అనే గొప్ప సంస్థను స్థాపించారు. స్త్రీల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన వీరేశలింగం సేవలను గుర్తించిన ప్రభుత్వం వారికి రావు బాహద్దూర్ బిరుదును ఇచ్చి సత్కరించింది.
వీరేశలింగం రాసిన గద్య, పద్య కావ్యాలు ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. గోపాల స్వామి, మార్కండేయ శతకాల రచనలతో సాహిత్య రచనలోకి ప్రవేశించిన వీరేశలింగం నీతి కథామంజరిలో చిత్రపటాలతో కూడిన అనేక కథలు పద్య రూపంలో రాసి ప్రచురించారు. బ్రహ్మ వివాహము, వ్యవహార ధర్మబోధిని, మూషికాసుర విజయము, సత్య హరిశ్చంద్ర లాంటి అనేక నాటకాలను రాసి, ప్రదర్శింపజేసి ప్రజలను చైతన్య వంతులను చేశారు వీరేశలింగం. ఆనాడు ప్రజల్ని పీడిస్తున్న లంచగొండితనం, అన్యాయాలు, అక్రమాలు, మూఢ నమ్మకాలను తన ప్రహసనాల ద్వారా ఎండగట్టారు.
వీరేశలింగం రాసిన రాజశేఖర చరిత్ర, సత్యవతీ చరిత్ర, సత్యరాజా పూర్వదేశ యాత్రలు అనే నవలలకు విశేషమైన ఆదరణ లభించింది. కవుల చరిత్ర రచన ద్వారా కవుల చరిత్రను సమగ్రంగా, శాస్త్రీయంగా పరిశోధన చేసి ప్రచురించారు. విద్యార్థులు సులువుగా వ్యాకరణం నేర్చుకోవడానికి సంగ్రహ వ్యాకరణం రచించారు. తన స్వీయ చరిత్రను నిష్పక్షపాతంగా రచించి సహధర్మచారిణి రాజ్యాలక్ష్మికి అంకితం చేశారు వీరేశలింగం.1919 మే 27న మరణించినప్పటికీ ఆయన సంస్కరణల ప్రభావం, రచనల ప్రభావం నేటి తరం వారిపై కూడా ఎంతగానో ఉంది.
- కందుకూరి భాస్కర్,
9703487088