Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ రాష్ట్రంలో (1740-1948) ఆధునీకరణ అనే ప్రక్రియ 1850ల నుంచి ప్రారంభమైంది. దానిలో భాగంగా పత్రికలు కూడ మొదలయ్యాయి. తెలుగులో పత్రికల స్థాపనకు 1880ల నుంచి ఆలోచనలు సాగినప్పటికీ ఏ పత్రికకూడా ఒక నెలనుంచి రెండు సంవత్సరాల కాలం స్థిరంగా నడిచిన దాఖలా లేదు. అందుకు కారణాలు ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ నగరం నుంచి ఒక చారిత్రక అవసరంగా 1926లో గోలకొండ పత్రిక ప్రారంభమైంది. 50 సంవత్సరాలకు పైగా నడిచిన ఈ పత్రిక హైదరాబాద్ నగరం నుంచి సుదీర్ఘ కాలం వెలువడిన తొలి తెలుగు పత్రిక. హైదరాబాద్ నగరం నుంచి తెలుగు పత్రిక అనేది లేని కాలాన ఏకైక పత్రిక గోలకొండ. నిజాం కాలంలో వెలువడి సుదీర్ఘంగా నడిచిన తెలంగాణ పత్రిక అదే. దాని స్థాపకుడు ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలోనే కాక దక్షణాదిన ఎంతో ప్రముఖుడైన కొత్వాల్ వెంకటరామారెడ్డి. దాని తొలి సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి ఇంగ్లీషు పత్రికలకు దీటుగా అంతే ఆధునికంగా పత్రికను నడిపిచ్చిన గొప్ప పత్రికా రచయిత సురవరం ప్రతాపరెడ్డి. గోలకొండ పత్రికను టాబ్లాయిడ్ సైజులో వారానికి రెండు సార్లు వెలువరించడం ఆనాటికి ఒక అధునాతన ప్రయోగం. అప్పటికీ పట్టణాల విస్తరణ అంతంత మాత్రమే. రవాణా సౌకర్యాలు అంతగా కుదురుకోలేదు. విద్యావ్యవస్థలు, న్యాయవ్యవస్థలు ఏర్పడినా వాటి వ్యవహారాలన్నీ ఉర్దూలో కొనసాగేవి. పూర్తి ప్రతికూల పరిస్థితులలో విద్యాస్పృహ, పత్రికలకు పునాది అయిన ఆధునిక మధ్యతరగతి బలపడని కాలమది. పాఠక చైతన్యం లేని రోజులలో లాభాపేక్ష, వ్యాపార ప్రయోజనాలు లేకుండా పత్రికను నడపాలనుకోవడమే పెద్దసాహసం. అప్పటికీ నికరమైన పాఠక వర్గం లేదు. ఆధునిక పద్దతులలో వ్యాసాలు, వార్తలు, వ్యంగ్య రచనలు చేసేవారు లేరు. ఆనాటి సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులలో అందుకు అనుగుణంగా తెలుగు పత్రికను తీర్చిదిద్దాలి. ఆనాటికీ రాజకీయ పార్టీలు, ఉద్యమ సంస్థలే సామాజిక ఆదర్శాలతో పత్రికలు పెట్టడం ఒక రివాజు. గోల్కొండ పత్రిక స్వభావాన్ని చూస్తే ఇప్పుడు కూడా అటువంటి పత్రికలు వెలువడడం లేదన్న నిర్థారణకు రావచ్చు. స్థానికత, జాతీయత, అంతర్జాతీయతకు సంబంధించిన వార్తలు, వ్యాసాలు ప్రచురించడంలో సురవరం ఎంతగా ప్రామాణికతను నెలకొల్పాలో సాధారణ పాఠకులను ఆకట్టుకోవడానికి ఆయన అంతగా ప్రాధాన్యతనిచ్చారు. ఆంగ్ల, తెలుగు విద్య సహా రాజకీయ, సామాజిక చైతన్యంతో తెలంగాణ తెలుగు మధ్యతరగతి వికాసానికి పునాదులు వేసి తీర్చిదిద్దిన పత్రిక గోలకొండ. ఆనాటి తెలంగాణ సమాజం చవిచూసిన సామాజిక రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక మార్పుల ప్రతిఫలనమే గోలకొండ పత్రిక. మరో రకంగా చూస్తే ఆనాటి తెలంగాణ సమాజానికి వాయిస్ ఆఫ్ పీపుల్. ఈస్థాయిలో పత్రికను నడిపిన సురవరం వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఆనాటి పరిస్థితులలో ఆయన స్థానాన్ని బేరీజు వేయగలం. మరొక విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ఆయన ప్రాథమికంగా జాతీయోద్యమ ఆదర్శాలతో జీవించిన ఉదారవాద ప్రజాస్వామికవాది. భిన్న సామాజిక రంగాలపై అధ్యయనం, పరిశోధనాసక్తి ఉన్న మేధావి. బహుభాషా కోవిదుడు. మౌలికంగా న్యాయవాది. 1890ల నుంచి కుల వివక్షకు, అంటరానితనానికి వ్యతిరేకంగా ఆర్యసమాజం ఊరూరా పనిచేసింది. సామాజిక సమానత్వాన్ని ప్రచారం చేసింది. అదే కాలాన బౌద్దం సహా హేతువాదాన్ని ప్రచారం చేసింది. స్త్రీ విద్యకోసం, సాంఘిక సమానత్వం కోసం ఉద్యమించింది. 1924లో హైదరాబాద్ నగరంలో సురవరం అడుగుపెట్టేనాటికి హైదరాబాద్ సహా మొత్తం తెలంగాణలో ఒక కొత్త రాజకీయ, సామాజిక వాతావరణం ప్రబలింది. ఇంతేకాకుండా గోలకొండ పత్రిక ప్రారంభం నాటికి తెలంగాణ వికాస ఉద్యమం, భాగ్యరెడ్డి వర్మ ఆది హిందూ ఉద్యమం బలపడ్డాయి.
కుటుంబం నుంచి సంక్రమించిన జాతీయోద్యమ ఆదర్శాలు, యుక్తవయస్సులో మద్రాసులో విద్యార్థిగా తాను పాల్గొన్న జాతీయోద్యమ సమావేశాలు, ఆనాటి రోజులలో విన్న జాతీయోద్యమ ప్రముఖుల ఉపన్యాసాలు సురవరం ఆలోచనారీతిని ప్రభావితం చేశాయి. ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో స్థానిక పాలక వర్గాలకు, ఉర్దూభాషా వాదులకు, మతవాదులకు వ్యతిరేకంగా ఉద్యమించినట్టే, పెత్తందారీ, ఆధిపత్యభావాలకు వ్యతిరేకంగా ఉద్యమస్థాయిలో పనిచేశారు. ఆ మేరకు ఆయన అనేక సంపాదకీయాలు రాశారు. తన సమకాలాన స్థానిక, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఒక తాత్విక చారిత్రిక దృక్పథంతో పనిచేసిన దేశీయమేధావి ఆయన. భిన్న కోణాలలో పదివేల పుటలకు పైగా చేసిన రచనలు ఆయనవి. ఆయా కుల ఉద్యమాలకు మద్దతుదారునిగా వర్ణవ్యవస్థ డొల్లతనం మీద బౌద్దం నేపథ్యంలో ఆయన చారత్రిక దృక్పథంతో రాసిన వ్యాసాలు చూస్తే మహాత్మా ఫూలే వారసులలో ఒకరిగా నిలవడం ఖాయం. తెలుగు వచనాన్ని ఆధునిక భావాల వ్యక్తీకరణకు అనుకూలంగా తీర్చిదిద్దిన వారిలో ఆయనదే ప్రథమ స్థానం. అంతటి సూటితనంతో, సులభశైలిలో ఏ విషయాన్ని అయినా విశ్లేషించడం ఆయనకే చెల్లింది.. ప్రస్తుతం ప్రపంచంలోనే పేరెన్నిక గన్న హైదరాబాద్ వంటి నగరం రాజధానిగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందంటే దానికి తొలి దశ మలిదశ ఉద్యమాలే కారణమన్నది అందరూ చెబుతున్నదే. మలిదశ ఉద్యమాన్ని తెలంగాణ ఆత్మగౌరవం ఉద్యమంగా నిర్వచించడం కూడా ఉన్నది. రాజకీయ కోణంలోంచి చూస్తే ఇది వాస్తవం కూడా. కానీ భాష, చరిత్ర, ఉనికి కోణంలోంచి చూస్తే దానికి తెలంగాణ ప్రజల పోరాటానికి వందేళ్ల చరిత్ర ఉన్నది. ఇందులో హైదరాబాద్ కేంద్రంగా ఆయా చారిత్రిక మలుపులలో ఏర్పడిన నాలుగు సంస్థలది ముఖ్యమైన పాత్రే. వాటిలో మొదటిది శ్రీకృష్ణ దేవరాయ భాషానిలయం, రెండవది రాజబహుదూర్ వెంకట్రామారెడ్డి వసతి గృహం. మూడవది గోల్కొండ పత్రిక, నాలుగవది సారస్వత పరిషత్తు ఉన్నాయి. మొదటిది భాషా నిలయాన్ని మినహాయిస్తే మిగతా మూడు సురవరం కార్యదీక్ష, వ్యక్తిత్వం మేధో గరిమతో రూపొందినటువంటివే. ఈ నాలుగు సంస్థలు ఒకో సమస్య ప్రతిఫలనంగా పుట్టుకొచ్చినవే. వీటి ప్రస్తావన లేకుండా ఆధునిక తెలంగాణ, తెలుగు వాళ్ల చరిత్ర లేనే లేదు. ఈ క్రమంలో చూస్తే వ్యక్తిగా సురవరం ప్రతాపరెడ్డి ప్రత్యేకంగా నిలుస్తారు. వ్యక్తులుగా చాలామంది పనిచేసినప్పటికీ వాళ్లంతా ఏదో ఒక రంగానికి పరిమితమైన వాళ్లే. ఆయన వలే తెలంగాణ, తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతీ, చరిత్ర రంగాలకు అంకితమై పనిచేసిన వ్యక్తులు ఒక్కరు కూడా లేరు. బహుముఖీనమైన ఆయన వ్యక్తిత్వంలో గోల్కొండ పత్రిక సంపాదకత్వం అనేది ఒక ముఖ్యమైన కోణం మాత్రమే. ఆయన ఏకకాలంలో తెలంగాణకు కార్యకర్త, కావ్యకర్త నాయకుడు కూడా. మరోరకంగా అనేక సామాజిక రంగాలకు ఆయనే కేంద్రబిందువు. తెలంగాణ తెలుగు భాష, చరిత్ర, సంస్కృతివంటి రంగాలను ఎంచుకుని కార్యాచరణకు, పరిశోధనకు, రచనకు దిగడంవల్ల ఆయనక ఈ విశిష్టత అబ్బింది. బహుశా దీనిని గుర్తించినందువల్ల కావచ్చు విశ్వనాథ, చలం, కోకు, శ్రీశ్రీ వంటి సృజనాత్మక రచయితలను, మల్లంపల్లి సోమశేఖర శర్మ వంటి పండితులను కాదని కేంద్ర ప్రభుత్వం ఆయనకు తొలి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతిని బహుకరించింది. మద్రాసు, హైదరాబాద్, బొంబాయి. మైసూరు, సెంట్రల్ ప్రావిన్సెస్లలో విస్తరించిన కోట్లాది మంది తెలుగు ప్రజలకు ప్రతినిధిగా గుర్తించి నందువల్ల కావచ్చు ఆయనకు ఈ గౌరవం లభించింది. తాను నడిపే పత్రికకు గోలకొండ పేర పెట్టడంలో సురవరం దార్శనికత కనిపిస్తుంది. నిజానికి ఆంధ్ర అనేమాట పండితులకు మాత్రమే పరిమితం. ప్రజలు ఆంధ్ర మహాసభను సంఘంగానే పిలిచి ఆంధ్ర అనే మాటను తిరస్కరించారు.
ఉర్దూ, మరాఠీ తప్ప తెలుగు మాట్లాడే వాళ్లు కూడా కనిపించని కాలాన హైదరాబాద్లో అడుగు పెట్టిన సురవరం, ఆయన రచనలు, సృష్టించిన సాహిత్యం, తెలంగాణ ప్రముఖుల మీద ఆయన వ్యక్తి చిత్రాలు, ఆనాటి సామాజిక సమస్యల మీద ఆయన రాసిన లఘ పుస్తకాలన్నీ కనుమరుగైపోయాయి. వేయికి పైగా రాసిన సంపాదకీయాలు తీవ్రమైన ఉపేక్షకు గురయ్యాయి. ఆనాటికి అనేక ఉద్యమాలలో ఆయన భాగస్వామ్యం, ప్రస్తావన లేకుండా తెలంగాణ గురించి మాట్లాడే ప్రసక్తి లేదు. ఇంతేకాకుండా 1926 నుంచి ఆనాటి తెలంగాణలోనే కాదు, మద్రాసు, మైసూరు, సెంట్రల్ ఫ్రావిన్సెస్లలో విస్తరించిన తెలుగు సమాజంలో సురవరం చాలా ప్రముఖుడు. ఆరోజుల్లో ఆయనకు వచ్చిన ఉత్తరాలను చూస్తే ఆశ్చర్యం వేయడం ఖాయం. బొంబాయి మహానగరంలో చాలా ప్రముఖుడు, రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్కు సన్నిహితుడు శంకర్రావు సాయన్న పర్చా, ప్రఖ్యాత రచయిత విశ్వనాథ సత్యనారాయణ, మల్లంపల్లి సోమశేఖరశర్మ, సరోజినీనాయుడు వంటి వారు; అరసం ప్రముఖులు కొడవటిగంటి కుటుంబరావు, కొమర్రాజు వినాయకరావులు ఆయనపై ఎంతో గౌరవంతో రాసిన ఉత్తరాలున్నాయి. హైదరాబాద్ రాష్ట్ర విముక్తి ఉద్యమంలో సురవరం నిర్వహించిన ప్రగతిశీలపాత్ర తన ఆత్మకథ 'నా జీవిత పథంలో' చాలా గౌరవంగా రాసి ఉన్నారు. ఆయన సొంత తమ్ముడు మహబూబ్నగర్జిల్లా వెంకటరామారెడ్డి, బూర్గుల రామకిషన్రావు ఆయన గురించి ప్రతాపరెడ్డి అన్నయ్య అన్న పేరుతో ఒక వర్దంతి సందర్భంగా గొప్పగా రాశారు. ఆయన కాలం చేసింది తెలిసి ఆనాటి ఆంధ్రప్రభ సంపాదకుడు నార్ల వెంకటేశ్వరరావు గొప్ప సంపాదకీయం రాశారు. ఆయన స్మృతిలో వచ్చిన వ్యాసాలను, కవితలను సేకరించి ప్రచురిస్తే అదే గొప్ప గ్రంథమవుతుంది. అయినప్పటికీ కారణాలేవైనా చివరికి ఆయన చరిత్ర, కార్యాచరణ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. సామాన్యులైన తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఒకటే. వాస్తవానికి మొత్తం ఆయా రాష్ట్రాలలో చీలిపోయిన తెలుగు ప్రజల జాతీయభావనకు, సంస్కృతికి అచ్చమైన ప్రతినిధి సురవరం. కుతుబ్ షాహీలు గోలకొండ కోటను పునర్నిర్మిస్తే భాష, చరిత్ర, సంస్కృతి పేరుతో సురవరం తెలంగాణ ప్రజలకు చెక్కుచెదరని మరో 'గోలకొండ' కోటను నిర్మించి ఇచ్చారు. అదే ఆయుధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ ప్రజల కల సాఫల్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15న జాతీయ జెండాను గోలకొండపై ఎగుర వేయడం కన్నా విజయం ఏముంది. సురవరంకు నా నివాళి.
(మే 28 సురవరం ప్రతాపరెడ్డి జయంతి)
- సామిడి జగన్రెడ్డి,
8500632551