Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాల సాహిత్యంలో ఎన్నో పుస్తకాలు వచ్చాయి. కథల పుస్తకాలు వచ్చినట్టుగా నవలలు రావడం లేదు. కారణం ఇతమిద్ధంగా తెలియనప్పటికీ బాల సాహిత్య రచయితలు నవలల పై కాస్త శ్రద్ధ పెట్టలేదనిపిస్తుంది. కొద్దిమంది మాత్రం వీటికి మినహాయింపు చంద్రశేఖర్ ఆజాద్ రచించిన 'పిల్లల పుస్తకం' నవల. ఈ పుస్తకం ఇప్పటి తరం ఆలోచనలను, భావనలను ఒడిసి పట్టింది. నవలలో ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ నవల చివరికి ఒక అద్భుతమైన ముగింపునిచ్చారు. శాన్వి, యాషిక, వారి స్నేహితురాలు ఎలా తమ ఊహలని అందమైన పుస్తకంగా మలిచారు? వాటికి కావాల్సిన ప్రేరణని ఎలా పొందారు సవివరంగా చర్చించారు. శాన్వి తాత విహారి మంచి బాల కథా రచయత. ఒకప్పుడు విరివిగా రాసిన విహారి ఎందుకు రాయకుండా మౌనంగా ఉన్నాడు? అనుకోకుండా నలభై సంవత్సరాల తరువాత కలిసిన స్నేహితుడు టాగూర్. అతను విహారిని మరల బాల సాహిత్యాన్ని మొదలు పెట్టమంటాడు. మనవరాళ్లకి ఇరాన్ సినిమాలు, కథల పుస్తకం చేతిలో పెట్టి చూపమంటాడు. 'శాన్వి, లిటిల్ మాన్, 'వేర్ ఈస్ మై ఫ్రెండ్' హౌమ్ కథలు యాషికి, స్నేహకి వినిపిస్తాడు. తాత ఇచ్చిన కథల పుస్తకాన్ని చదివి, వాటి ప్రేరణతో ఒక పుస్తకాన్ని రాయాలనుకుంటారు. మొదలు పెట్టమని అందరూ ప్రోత్సహిస్తారు. చివరికి అనుకున్నట్టుగా పుస్తకాన్ని రాసి ప్రచురిస్తారు. శాన్వి, యాషి, స్నేహ ముగ్గురు ఎంతో ఆనందంగా రచనారంగంలోకి దూసుకెళ్తామని ఆత్మా విశ్వాసంతో ప్రకటిస్తారు. దీనికి విహారి స్నేహితుడు టాగూర్ కూడా ప్రచురణ బాధ్యతని చేపడతారు. ఇది స్థూలంగా నవల కధానిక.
ఈ చిన్ని నవలలో రచయత మానవ సంబంధాల గురించి, మాయమైపోతున్న ఉమ్మడి కుటుంబాల గురించి ఎంతో చక్కగా వివరించారు. వలస వెళ్ళిపోయిన కుటుంబాలు తమ వాళ్ళని చూసుకోవడానికి ఎంతగా తపన పడతారు, పిల్లలని ప్రకృతితో మమేకం చేసి వారిలో సృజనాత్మకతని పెంపొందించాలి అన్న విషయాన్ని నవలలోని పాత్రల ద్వారా చిత్రీకరించారు. ఈ నవల చిన్నవాళ్లనే కాదు పెద్దవాళ్ళని కూడా ఆలోచింపజేస్తుంది.
- పుష్యమీ సాగర్,|
9010350317