Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శతాధిక గ్రంథకర్తగా, సాహిత్య పరిశోధకుడిగా, కవిగా కపిలవాయి లింగమూర్తి ప్రసిద్ధులు. సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లో రచనలు చేసిన ఘనత వారికే దక్కుతుంది. వారు రాసిన ఆత్మకథ 'సాలగ్రామం' పేరిట వారి మరణానంతరం వెలువడింది. రచయిత విశ్వకర్మ కులంలో జన్మించడం వలన ఆ వంశం గొప్పదనాన్ని వివరిస్తూ ప్రారంభమైన ఈ ఆత్మకథలో వారి కుటుంబ నేపథ్యం, చిన్ననాటి పరిస్థితులు, విద్యతో పాటు చిత్రలేఖనం, కులవృత్తిలో ప్రావీణ్యం సంపాదించడం, నిరంతర అధ్యయనంతో అధ్యాపకుడిగా మారడం, పరిశోధకుడిగా ప్రారంభమై అన్ని రకాల ప్రక్రియల్లో సాహితీ రచనలు చేయడంతో పాటు పిల్లల చదువులు - పెళ్ళిళ్ళు, తన అనారోగ్యం గురించిన అన్ని విషయాలను తెలియజేశారు. ''నా జీవితంలో బుద్ధి తెలిసిన తర్వాత నాలుగు పెద్ద తవాయిలు గత్తర, ప్లేగు, రేషను కంట్రోల్, రజాకార్ ఉద్యమం జరిగినవి. ఇటువంటి కష్టకాలంలో మాకు కులవృత్తి లభించక ఎన్నో అవస్థలు పడ్డాను'' అని తెలియజేశారు. ఆనాటి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక చరిత్రకు ఈ ఆత్మకథ అద్దం పడుతుందనే చెప్పాలి.
సాలగ్రామం (ఆత్మకథ), రచన : డా||కపిలవాయి లింగమూర్తి, పేజీలు : 208, వెల : 150/-, ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు
- రాహుల్