Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చరిత్ర రచనా నిర్మాణానికి లిఖిత వాఙ్మయంతో పాటు మౌఖిక వాఙ్మయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరాన్ని చరిత్రకారులు ఎప్పుడో గుర్తించారు. వ్యక్తుల ధైర్యసాహసాలను ప్రస్తుతిస్తూ పాడిన వీరగాథలను, చెప్పుకోదగ్గ సంఘటనల ఆధారంగా కల్పించబడిన గాథలను పాడుకుంటూ తిరిగే భిక్షుక గాయకులు ఎంతమందో వున్నారు. వీరుపాడే పాటల్లో అద్భుత ఆశ్చర్యాలకు సంబంధించిన విషయాలు వున్నప్పటికీ, వాటిలో అంతర్లీనంగా వుండే చారిత్రక, సాంస్కృతిక విషయాలు చరిత్ర రచనకు ఉపకరిస్తాయి.
ఉన్నవాళ్ళను దోచుకుని లేనివాళ్ళకు పంచిపెట్టే రాబిన్హుడ్ లాంటి వ్యక్తులు ప్రతి సమాజంలో కనిపిస్తారు. విదేశీయులు వీరిని సామాజిక బందిపోట్లుగా అభివర్ణించినా, తెలుగునాట వీరిని వీరులుగా, ప్రజానాయకులుగా గుర్తిస్తారు. వీరు ప్రజల ఆకలిబాధలను చూడలేక ధనవంతులు, ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టి పేద ప్రజలకు పంచుతారు. వీరి దోపిడీలకు తట్టుకోలేక భారీ బలగాలను మోహరించి ఈ వీరులను వెంటాడమని, అయినవాళ్ళ ద్రోహంతో వాళ్ళు పట్టుబడి చంపబడటంతో వారి కథ ముగుస్తుంది. పేరు పొందిన ప్రజావీరుడు పండుగ సాయన్నది బహబూబ్నగర్ ప్రాంతం. మియాసాహెబ్ది కొల్లాపూర్ ప్రాంతం. నక్కలపల్లి రామన్నది గద్వాల ప్రాంతం. బండ్లోళ్ళ కురుమన్నది కల్వకుర్తి ప్రాంతం. ఈ నాలుగు ప్రాంతాల్లో ఆయా వీరులకు సంబంధించిన కుటుంబాల వారిని, ఊరి పెద్దలను, వృద్ధులను ఇంటర్వ్యూలు చేసి, గేయాలలో గల సమాచారం కన్నా కొంత అదనంగా వివరాలు సేకరించి 'పాలమూరు ప్రజావీరులు' పేరిట డా||ఎం. ఇందిరాదేవి ఈ పుస్తకాన్ని వెలువరించడం అభినందనీయం. మాదిగల ఆశ్రితజాతివారైన డక్కలివారు కిన్నెర వాయిద్యంపై ఈ జానపద వీరగాథలను ఆలపిస్తూ, ప్రచారం చేస్తారని తెలియజేసిన రచయిత్రి ఆనాటి ప్రాంతాలలో తిరిగి, కొన్ని ఫొటోలను కూడా ఈ పుస్తకంలో అందజేయడం విశేషం.
పాలమూరు ప్రజావీరులు, రచన : డా|| ఎం.ఇందిరాదేవి, పేజీలు : 131, వెల : 150/-, ప్రతులకు : రచయిత్రి - 9177417007
- కె.పి.అశోక్కుమార్