Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇది కంప్యూటర్ యుగం. మనిషితో మనిషికి సత్సంబంధాలు క్రమంగా తగ్గిపోతున్న యుగం. మట్టితో, చెట్టుతో అనుబంధం పూర్తిగా తెగిపోతున్న కాలం. ఏ రుతువు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియకుండానే బతుకుతున్నాం. పొడిపొడి మాటలు, జీవం లేని నవ్వుల మధ్య యాంత్రికంగా బతుకీడుస్తున్నాం. పదిమందిలో ఉన్నా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాం. గుండెబరువును దించుకోవడానికి ఒక ఆత్మీయుడైనా లేని కరువు కాలం ఇది. మనుషుల మధ్య డబ్బు,హౌదా, కులం ప్రవేశించాక అడ్డుగోడల్ని కట్టుకొని బతుకుతున్నం. ప్రతీ మనిషి అనేక సంఘర్షణల మధ్య జీవిస్తున్నాడు. ఈ మానసిక సంఘర్షణ నుంచి బయటపడటానికి ప్రతీ ఒక్కరూ తన గురించి తాను తెలుసుకునే ప్రయత్నమే బండారి రాజ్ కుమార్ రాసిన 'వెలుతురు గబ్బిలం'.
ఇంతకూ ఈ కవిత్వసంపుటికి 'వెలుతురుగబ్బిలం' అని ఎందుకు పెట్టాడు కవి? ఎన్నో అసమానతలు కూడిన ఈ సమాజంలో తలకిందులైన జీవితాలను చూసి ఈ పేరు పెట్టాడు. వెలుతురులోనే బతుకుతున్నా చీకటిజీవితాన్ని అనుభవిస్తున్న మనిషికి ప్రతీకే ఈ గబ్బిలం. నోరు విప్పి చెప్పుకోలేని బాధల్లోంచి ఈ కవిత్వం పుట్టింది. ఈ బాధ, ఈ మానసిక సంఘర్షణ కేవలం ఈ కవి ఒక్కడిదే కాదు. ఇప్పుడు ప్రతీ మనిషి అనుభవిస్తున్నది కూడా అదే.
1) నేనెక్కడ్నో కాటుగల్సిన
ఎవలకన్న కనబడితే జెప్పున్రి బాంచెన్
తాను కనుక్కునే ప్రయత్నమేనా? కాదు. ప్రతి మనిషి తనలోపలి మనిషిని దొర్కబట్టిచ్చుకునే ప్రయత్నం. బాల్యం గురించి, బతుకు గురించి, మనిషితనం గురించి వెతుకులాట. ప్రపంచీకరణలో మనిషి కూడ వస్తువైండు. దొరకని ఎండమావుల కోసం పరుగులు తీస్తూ మనిషి తప్పిపోతుండు. ఇటువంటి సందర్భంలో చీకటి నుండి వెలుతురులోకి నడిపించడమే ఈ కవిత్వం చేస్తుంది.
''నీ గోడు చెప్పుకుంటానికి పోతే
గోలెం మీద వాలిన పిట్ట
తుర్రుమంటది'' (గోడు-పు.63)
మనిషి తన బాధను చెప్పుకుంటుంటే వినడానికి ఒక్క మనిషి కూడా లేకపోవడం ఎంతో విచారం. మనిషి అనుభవిస్తున్న ఒంటరితనాన్ని, మనిషిని ఎవరూ పట్టించుకోని విధానాన్ని ''గోలెం మీద వాలిన పిట్ట తుర్రుమన్నది'' వాక్యంలో ధ్వనింపజేశాడు కవి.
''పిట్టకున్న పాయిరం/ మనిషికెక్కడిదని'' అంటూ
స్వార్థపరుడైన మనిషిని, కన్ననేల మీద మమకారం కోల్పోతున్న మనిషి ఎత్తి చూపిస్తడు.
''లెక్కకు మించిన తత్త్వాలు కైగట్టి
నా చేత పాడిత్తయి
లోపలి కన్ను తెర్సుకొని
నాకు ఉపదేశించిన లక్ష్యం బోధపడుతది''
ఉపాధ్యాయ వృత్తి నేపథ్యాన్ని సూచించే గదిలోకెళ్ళాక, ఒక పూలవనం- కొన్ని సీతాకోకచిలుకలు లాంటి కవితల్లో తరగతి గదిలోనే తనను తాను తెలుసుకున్న తత్వం కనబడుతుంది. లోపలి కన్ను తెరుచుకోవడం అంటే మనలోని అజ్ఞానం తొలగడమే కదా. అజ్ఞానపు చీకట్లనుంచి వెలుగులోకి రావాలనే పిలుపు కూడా ఈ వెలుతురు గబ్బిలంలో కనిపిస్తుంది. ఈ కవి ఉపాధ్యాయుడు కాబట్టి తరగతి గదిలో తన గురించి తాను తెలుసుకున్నానన్నాడు. అలాగే ప్రతీఒక్కరూ తాము చేస్తున్న పనిలోనే ఆనందం వెతుక్కోవాలని అర్థమౌతుంది.
''ఇప్పుడు
కండ్లు మాత్రమే మాట్లాడుకోవాలె
స్పర్శ మాత్రమే గాయాల్ని మాన్పాలె
గతకాలపు మొక్క... చెట్టయిన నీడలో
ఒకరికొకరు తోడవ్వాలె
నవ్వులు మాత్రమే కన్నీళ్ళు తెప్పించాలె'' (మనిషిని కలవాల్సిందే-పు.114)
వెలుతురుగబ్బిలం ద్వారా కవి చివరగా ఏం చెప్పాలనుకుంటున్నాడో ఈ వాక్యాల ద్వారా తెలుసుకోవచ్చు. గుండె గాయాలను మాన్పే ఒక మనిషిని కలగంటున్నాడు.
ఒక ఆత్మీయస్పర్శ కోసం ఎదురుచూస్తున్నాడు. చేసిన తప్పుల్ని ఒప్పుకొని మనిషి ముందు క్షమించమని సాగిలపడి అడగాలి అంటడు. అప్పుడే ఈ మానవసంబంధాలు మరింత బలంగా ఉండేది. మనలోని అహాన్ని కాల్చినపుడే మనిషికి దగ్గరయ్యేది. ఈ కవి వెతుకులాట తన గురించి తాను తెలుసుకోవడం నుంచి మొదలై ఎదుటిమనిషి కలుసుకునే వరకు, అతడిని ప్రేమగా చిరునవ్వుతో దగ్గరకు తీసుకోవడం వరకు సాగుతుంది.
బండారి రాజ్ కుమార్ 2010 నుంచి కవిత్వం రాస్తున్నాడు. 2010లో గరికపోస, 2013లో నిప్పు మెరికలు, 2016లో గోస కవిత్వ సంపుటాలను తీసుకొచ్చి తెలంగాణభాషకు, తెలంగాణ ప్రజల కన్నీళ్ళకు అక్షరరూపమిచ్చిండు. మొదటినుంచి తన ధిక్కారగొంతును వినిపిస్తూనే ఉన్నాడు. దేశంలో జరిగే అనేక మత దాడులను ఖండిస్తున్నాడు. వెలుతురు గబ్బిలంలో కూడా ఆ ఆగ్రహస్వరం బలంగా వినిపిస్తుంది.
''బొండిగె మీద ఇనుపబూట్ల కాళ్ళతో తొక్కి
కులమతాల కక్షల మంటల్లో కాల్చి
బూడిదను విభూతి రాసుకునే దేశం కదా'' (బతుకే ఉగాది-పు.84)
ప్రస్తుత దేశ రాజకీయాల్ని విమర్శిస్తాడు. రాజ్యం చేస్తున్న హత్యలను, దళితులపై జరుగుతున్న దాడులను చూసి రాజ్యాన్ని ప్రశ్నిస్తాడు. మతాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వాలు చేస్తున్న కుట్రరాజకీయాలను నిరసిస్తాడు. బియాస్ నది దుర్ఘటన గురించి, సిరియా బాలుడి గురించి అంతర్జాతీయ సంఘటనల మీద స్పందించాడు.
రాజ్ కూమార్ వస్తువును ఎన్నుకున్న విధానం, నడిపించిన తీరు కవిగా తన పరిణితిని తెలియజేస్తాయి. ఒకపూలవనం- కొన్ని సీతాకోకచిలుకలు కవితలో అలెగెరి నిర్మాణపద్ధతి కనిపిస్తుంది. ఇక్కడ తరగతి గదికి బదులుగా పూలవనం, విద్యార్థులకు బదులుగా పూలను ప్రతీకలుగా తీసుకొని కవితను నడిపించడంలో తాజాదనం కనబడుతుంది. ఎక్కడ కూడా తరగతిగది, టీచర్, పిల్లలు అనే పదాలు రాకుండ గురుశిష్యుల మధ్య అనురాగాన్ని ఆర్ద్రంగ చెప్పడం మెచ్చుకోదగ్గది. ఇటువంటి నిర్మాణమే గదిలో కెళ్ళాక, నీడచెట్టు కవితల్లో కనిపిస్తుంది.
''పిట్టలెగిరిపోతయి
రుతువులు మారిపోతయి
చెట్టుమాత్రం ఇంకా ఒంటరిగానే'' (నీడచెట్టు-పు.90)
పిల్లలు వదిలేసిన తల్లిదండ్రుల దు:ఖాన్ని, వాళ్ళు అనుభవిస్తున్న ఒంటరితనాన్ని పై వాక్యాల్లో చెప్పాడు కవి. ఇక్కడ మనిషికి బదులుగా చెట్టును తీసుకొని తల్లిదండ్రుల వేదనను పలికించాడు. బాహ్యంగ ఒక అర్థం స్పురించేలా ఉండి అన్యాపదేశంగ మరో అర్థాన్ని కలిగి ఉండే అలెగెరి అనే టెక్నిక్ ద్వారా కవితలో గాఢతను, సంక్షిప్తాన్ని సాధించాడు.
రాజ్ కుమార్ కవిత్వం గురించి మాట్లాడుకునేటప్పుడు అతడు వాడిన భాష గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తన కవితలకు మట్టితనాన్ని అద్దింది తన భాషే. ఈ భాష ఒక సామాన్యుడి గొంతులోంచి వచ్చినట్టుగా ఉంటుంది. ఎక్కడా కృత్రిమత్వం ఉండదు. గ్రామీణ ప్రజల సంభాషణల్లా తోస్తుంది. భాషలో నిత్తెం (నిత్యం), రుశి (రుచి), న్యాల (నేల), ల్యాత (లేత) లాంటి వికృతి రూపాలు సహజంగ కనిపిస్తుంటాయి. బిస్తరుగడుత ,సైజూశిన, ఏం మూట గట్టుకొని పోతం లాంటి తెలంగాణ పదాలు తన కవిత్వం నిండా పరుచుకొని ఉంటాయి.
రాజ్కుమార్ భాష కొండల్లో పుట్టిన తేటనీరు లాంటిది. రాళ్ళను, చెట్లను ఒరుసుకుంటూ పారుతుంటది. తన భాష కూడా కవిత కవితకు మారుతుంటది. గ్రామీణ పదబంధాలే గాక ఇప్పుడు భాషలో చేరిన ఎన్నో ఆంగ్లపదాలు కూడా కనిపిస్తయి. పారే నీళ్ళను చూస్తున్నకొద్ది చూడబుద్ది ఐనట్లు తాను ఉపయోగించిన భాషవలన ఇష్టంగా కవితల్ని చదువుకుంటం. ముందు ముందు రాసే కవిత్వంలో మరిన్ని శ్రమజీవితాల్ని కవిత్వంగా మల్చాలని, నిర్మాణపరంగానూ, శైలిపరంగానూ ఇంకా ఎక్కువ పట్టు సాధించాలని ఆశిస్తున్నాను.
- తగుళ్ళ గోపాల్,
9505056316