Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాఖపట్నంలో రెండు సముద్రాలున్నాయి. రెండు సుప్రసిద్ధమైనవే. ఒకటి బంగాళాఖాతం, రెండవది సాహిత్యసాగరం - రామతీర్థ సాగరం మాయమైపోతుందా? ఆవిరైపోతుందా? ...
అవుననే అనిపించింది.. రామతీర్థ లేరన్న వార్త వినగానే.
ప్రముఖ కవి ఇక్బాల్ చంద్ ఫోన్ చేసి, ''రామతీర్థ గురించి నేను విన్న విషయం నిజమేనా'' అని అడిగాడు. నాకు అప్పటికి విషయమేమిటో తెలియదు .. తెలిసిన వెంటనే దిగ్రాÄ్భంతికి గురయ్యాను. నన్ను ఆత్మీయంగా తమ్ముడు అని పిలిచే జగతి దీదీకి ఫోను చేశాను. ..
నేనెప్పుడు రామతీర్థ నెంబరుకు ఫోన్లు చేయలేదు. ఎప్పుడు చేసినా జగతి దీదీకే చేసేవాడిని. ''జీజా.. ఇక్కడే ఉన్నాడ్రా ఇస్తున్నా..'' అని ఇచ్చేది. రామతీర్థ కూడా నాకు తన ఫోను నుంచి ఎప్పుడు చేసేవారు కాదు. దీదీయే ఫోన్ చేసేది.. ''జీజా.. మాట్లాడతాడంట.. విను'' అని ఇచ్చేది. ఇప్పుడా.. జీజా.. ఎక్కడీ
ఈ వార్త నిజమే అయితే దీదీ పుట్టెడు దు:ఖంలో ఉంటుంది. ఆమెకు ఫోను చేయడం సబబు కాదు.. కాని ఇక్బాల్ చంద్ చెప్పిన వార్త నమ్మలేకున్నా.. వెంటనే ఆమెకే చేశాను. ఫోను ఆమె వద్ద లేదు. రాజేష్ ఫోనెత్తి వార్త నిజమే అన్నాడు. ఇది నేను ఊహించని షాక్. ఎప్పటికీ తేరుకోలేని షాక్
మే 28వ తేదీన నేను ఆయన నుంచి చివరి మెయిల్ అందుకున్నాను. కందుకూరి శతవర్థంతి సమాపనోత్సం నిర్వహిస్తున్నట్లు అంతకు ముందు ఫోనులో కూడా చెప్పారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరవుతున్నారని కూడా చెప్పారు. ఆ కార్యక్రమ ఆహ్వానపత్రం మెయిల్లో పంపారు. కేవలం రెండు రోజుల్లోనే రామతీర్థ లేరన్న వార్తను ఎలా నమ్మాలి?
కందుకూరి కార్యక్రమాలు ఆయన అత్యంత ఉత్సాహంగా భుజానికెత్తుకున్నారు. మే 17న కందుకూరి స్మృతిలహరి ఆహ్వానం పంపారు. మరోవైపు జలియన్ వాలా బాగ్ మారణకాండ జరిగి వందేళ్ళు పూర్తయిన సందర్భంగా మరో కార్యక్రమం డిజైన్ చేసుకున్నారు. రామతీర్థ... సాగరమంత శక్తి, సముద్రం లాంటి మనిషి. అధ్యయనం, విమర్శ, కవిత్వం, వ్యాసాలు... ఆయన రాసినంత వేగంగా, అంత ఎక్కువగా రాయడమూ సాధ్యం కాదు, అంత క్రమశిక్షణతో రాయడమూ సాధ్యం కాదు. సాహిత్యానికి మారుపేరు రామతీర్థ.
జగతి రామతీర్థ.. ప్రముఖ గజల్ గాయని జ్యోతిర్మయి మళ్ళ వీరిద్దరినీ నాకు పరిచయం చేశారు. షేక్ స్పియర్ సోనెట్స్ కొన్ని తెలుగులో రామతీర్థ చేశారు. జ్యోతిర్మయి నాకు ఆ విషయం చెప్పారు. నేను ఒకటి అరా సోనెట్స్ తెలుగులో రాయడానికి ప్రయత్నించి ఉన్నాను. అలా చేసిన ఒక ప్రయత్నాన్ని జ్యోతిర్మయి గారికి పంపించి పాడడానికి వీలవుతుందా చూడండన్నాను. ఆమె రామతీర్థ, జగతి ఇద్దరి గురించి చెప్పారు. గజల్ పట్ల ఆసక్తి ఉన్న జగతి దీదీతో అలా పరిచయం పెరిగింది. స్వంత తమ్ముడిలా ఎంతో ఆప్యాయంగా చూసేవారు. అప్పట్లోనే నా ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవిత్వం, జీవితం పుస్తకం అచ్చయ్యింది. ఈ పుస్తకావిష్కరణ సభ రామతీర్థ విశాఖ గ్రంథాలయంలో ఏర్పాటు చేశారు. అలా మొదటిసారి రామతీర్థను కలుసుకున్నాను. ఫైజ్ కవిత్వం గురించి అనర్గళంగా ఆయన మాట్లాడ్డం చూసి ఆశ్చర్యపోవడం నా వంతయింది. ఫైజ్ కవిత్వం గురించే కాదు, బెంగాలీలో నజ్రుల్ ఇస్లాం కవిత్వం గురించి కూడా ఆ సందర్భంగా కోట్ చేస్తూ, అవిభక్త భారతంలో వివిధ ఉద్యమాల్లో కవిత్వం ఎలాంటి పాత్ర పోషించిందో చెప్పారు. నజ్రుల్ ఇస్లాం రాసిన ప్రముఖ కవిత బిద్రోహి ఆయన తెలుగులోకి అనువాదం చేశారు. నజ్రుల్ కవితల్లో బిద్రోహి చాలా విభిన్నమైన కవిత. అనువాదానికి లొంగే కవిత కాదు. అలాంటి కవితను అద్భుతంగా తెలుగు చేశారు.
ఆ తర్వాతి నుంచి జగతి రామతీర్థలతో నా పరిచయం మరింత పెరిగింది. రామతీర్థ పేరు చెబితే నాకు వెంటనే పక్కనే పావలా కాసంత బొట్టుతో జగతి తప్పక కనిపిస్తారు. ఆయన వెనుక వెన్నుదన్ను, కొండంత బలం, ప్రోత్సాహం అన్నీ ఆమే. ఆ తర్వాత విశాఖ బుక్ ఫెస్టివల్ సందర్భంగా రామతీర్థను కలిసినప్పుడు ఆయన ఒక కొత్త ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుండడమే ఆయన తత్వం. నేను చాలా బద్దకస్తుడిని. ఏదన్నా పని చివరి క్షణం వరకు వాయిదా వేయడమే మనపని. రామతీర్థ అలా కాదు. చాలా క్రమశిక్షణగా, ఒక సైనికుడిలా ఆయన పనిచేసేవారు. ప్రతిరోజూ ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం రాసేవారు. ఆయనతోపాటు పోటీ పడ్డం మనవల్ల కాదురా బాబు.. ఆయన మరీ డిసిప్లిన్ సోల్జర్... రోజూ రాయవలసిన జాబితా పూర్తి చేసి కాని మనతో మాట్లాడడు అనేది దీదీ. విశాఖ వెళ్ళినప్పుడు వారింట్లో ఉండి, ఆతిథ్యం స్వీకరించిన ఆ రోజులు ఎన్నడూ మరిచిపోలేను.
విశాఖ బుక్ ఫెస్టివల్లో కలిసినప్పుడు కొత్త ప్రతిపాదన ఒకటి పెట్టారు. శ్రీశ్రీ కవిత్వాన్ని ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో అనువదిద్దాం.. మహాప్రస్థానం కవితలన్నీ అనువాదం చేద్దాం అన్నారు. శ్రీశ్రీని ఉర్దూలో అనువదించడమా.. అసలు శ్రీశ్రీని అనువాదం చేయడమే కష్టం... శ్రీశ్రీ కవితల్లో భావాన్ని మాత్రమే అనువదిస్తే సరిపోదు, శబ్దాన్ని కూడా అనువాదంలో తీసుకురాగలిగితేనే అనువాదం కాస్త బాగుంటుంది. ''నీకెందుకు నువు చేయగలవు.. ముందు ప్రారంభించు'' అని ప్రోత్సహించారు రామతీర్థ. శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా కవిత్వ పఠన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఒకే వేదికపై శ్రీశ్రీ తెలుగు కవిత, రామతీర్థ ఇంగ్లీషు అనువాదం, నేను చేసిన ఉర్దూ అనువాదం వినిపించాం. మొత్తం పది కవితలు ఆ కార్యక్రమంలో అనువదించాం. ఆ తర్వాత వరుసగా రెండు సంవత్సరాలు శ్రీశ్రీ కవితల పఠన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మొత్తం మహాప్రస్థానం కవితలు ఇంగ్లీషులోకి అనువదించారు. పుస్తకం వేద్దామనేవారు.
పరిశోధనంటే ఆయనకు చాలా ఇష్టం. సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళే అనేక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు. జనగణమన గీతం రాసి నూరేళ్ళు పూర్తయిన సందర్భంగా నూరేళ్ళ జనగణమన అంటూ జాతీయగీతానికి శతవార్షికోత్సం జరపడమే కాదు, ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించారు.
విజయనగరంలోని గురజాడ ఇంటిని ఒక మ్యూజియంగా మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2016లో ఆ ఇంటిని మ్యూజియంగా మార్చి, గురజాడ ఘనకీర్తిని నలుదిశలా చాటి చెప్పే అద్భుతమైన కార్యక్రమం నిర్వహించారు. కన్యాశుల్కం నాటకం 125 సంవత్సరాలయిన సందర్భంగా కన్యాశుల్కాన్ని, గురజాడను ప్రజలందరికీ పరిచయం చేసే కార్యక్రమాలు ఒంటిచేత్తో నిర్వహించారు. 2016 ఆగష్టు 26, 27, 28 తేదీల్లో వరుసగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రాయూనివర్శిటీలో కన్యాశుల్కంపై అనేకమంది పరిశోధనా పత్రాలు చదివారు. కన్యాశుల్కంలో ఉర్దూ పదాలు, ఉర్దూ ప్రభావం అనే అంశంపై ప్రసంగించే అవకాశం నాకు లభించింది. నాలాంటి ఎంతో మంది ఔత్సాహికులను ప్రోత్సహించాడాయన. 1887లో కన్యాశుల్కం మొదటి ప్రతిని సేకరించి డిజిటల్ రూపంలో భద్రపరిచారు.
కందుకూరి వీరేశలింగం శతవర్థంతి కార్యక్రమాలకు ఒకవైపు ఏర్పాట్లు చేసుకుంటూనే, మరోవైపు మరో కార్యక్రమం కూడా ఆయన తలకు ఎత్తుకున్నారు. జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగి వందేళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అప్పట్లో అంటే 1919లోనే ఉర్దూలో వేసిన నాటకం డిజిటల్ ప్రతిని ఆయన సంపాదించారు. కిషన్ చందర్ జేబా రాసిన నాటకమది. ఆ నాటకాన్ని తెలుగులో ఇప్పటి ప్రేక్షకులకు అర్థమయ్యేలా మార్చితే వెంటనే ప్రదర్శనకు ఏర్పాట్లు చేద్దామన్నారు. ఆయన ఎప్పుడూ ఏదో ఒక సాహిత్య కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమం భుజాలకు ఎత్తుకుని మోస్తూనే ఉండేవారు. ఒక కార్యక్రమం పూర్తి కాక ముందే మరో కార్యక్రమం ఆయన సిద్ధం చేసుకునేవారు. సాహిత్యం తప్ప మరో ప్రపంచం ఏదీ ఆయనకు లేదు.
ఇటీవల నాతో మాట్లాడినప్పుడు మరో మాట చెప్పారు. రామతీర్థ పరిశోధనా పటిమకు ఇది మరో నిదర్శనం. 1956లో ప్రచురించబడిన యక్షగానములు పుస్తకం సాఫ్ట్ కాపీ నాకు పంపించారు. గంటి జోగి సోమయాజి పరిష్కర్తగా వ్యవహరించిన యక్షగానాల పుస్తకం. తంజవూరు యక్షగానాలపై రాసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని నాకు పంపిస్తూ, వ్యవహారిక భాషా చరిత్రలో ఇది కొత్త మైలురాయి వంటిదని, దీనిపై పనిచేస్తున్నానని అన్నారు. తంజవూరు యక్షగానాల్లో చాలాకాలం ముందునుంచి వాడుక భాషను ఉపయోగించారని, ముఖ్యంగా తంజపురన్నదాన మహానాటకంలో ఈ ప్రయోగాలున్నాయని, నిజానికి వాడుకభాషను ఉపయోగించడం చాలా కాలం ముందు నుంచే ఉందని, ఈ విషయమై పరిశోధన జరగాలని ఆయన అన్నారు. రామతీర్థ ఈ పరిశోధనపై చాలా శ్రద్ధ చూపించేవారు. చాలా ఉత్సాహంగా ఈ విషయాలు చెప్పారు. తెలుగు సాహిత్యం, తెలుగు భాషా పరిశోధనల్లో రామతీర్థ లేని లోటు తీర్చలేనిది.
హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఒరియా, ఇంగ్లీష్ భాషల సాహిత్యాన్ని లోతుగా చదివిన వాడు. అలుపెరుగని సాహిత్య సేద్యం చేశాడాయన. చదవడం, రాయడం, సాహిత్య కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, ఔత్సాహికులను ప్రోత్సహించడం ఇవి తప్ప ఆయన జీవితంలో మరేదీ లేదు. తెలుగు రాష్ట్రాల్లో సాహిత్యం మాత్రమే తన వృత్తి, ప్రవృత్తిగా చేసుకున్న వ్యక్తి, సాహిత్యానికి చిరునామా రామతీర్థ. సాహితీ ప్రక్రియల్లో అన్నింటిలోను ఆయనకు ప్రవేశముంది. కవిత్వం, కథలు, అనువాదం, కవిత్వ అనువాదం, వ్యాసాలు, గేయాలు, రేడియో రూపకాలు, నాటికలు, సాహిత్య విమర్శ, కథా విమర్శ, పరిశోధన అన్నింటా ఆయన బహుముఖ ప్రజ్ఞ కనిపిస్తుంది. గొప్ప వక్త. అనర్గళంగా, నయాగరా జలపాతంలా ఆయన ప్రసంగం శ్రోతలను ఆకట్టుకునేది. వ్యక్తిగతంగా సహృదయుడు, నిగర్వి, మంచిమనిషి, శాంతమూర్తి. కాని, సాహిత్య విమర్శ విషయంలో మాత్రం మొహమాటం తెలియని నిక్కచ్చి. సూటిగా, ఘాటుగా విమర్శలు సంధించే దూకుడు... బహుశా చాలా మందికి ఈ విమర్శలు నచ్చి ఉండకపోవచ్చు. కాని ఆయన ఒక అద్దంలా రచన స్వరూపాన్ని చూపించాడన్నది మరిచిపోరాదు. ఆయన ఆంగ్లం నుంచి తెలుగులోకి అనుదించడమే కాదు, తెలుగు నుంచి ఆంగ్లంలోకి కూడా అంతే గొప్పగా అనువాదం చేయగల ప్రజ్ఞాశాలి. ఆయన అందుకున్న అవారులు ఎన్నో.
తన సహచరి జగతితో కలిసి విశాఖలో మొజాయిక్ సాహితీ సంస్థ స్థాపించడం వెనుక ఎంతో ఆలోచన ఉంది. మొజాయిక్ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పే సాహితీ సంస్థ. ఇద్దరి అభిరుచి సాహిత్యమే. అదే వారిద్దరిని కలిపింది. వారి సహజీవనానికి కారణమయ్యింది. జగతి రాసిన కవిత్వ సంపుటికి పెట్టిన పేరు సహచరణంలోను ఈ సాహితీ అనుబంధమే ప్రతిబింబిస్తుంది. మొజాయిక్ సాహిత్య సంస్థ ద్వారా సాహిత్యానికి వీరిద్దరు చేసిన సేవను తెలుగు సాహిత్య చరిత్ర ఎన్నటికి మరిచిపోదు. గురజాడ, కందుకూరి, రావిశాస్త్రి, ఇలా అనేకమంది సాహితీ ప్రముఖులను నవతరానికి పరిచయం చేసిన ఘనత వారిద్దరిదే. కన్యాశుల్కం వ్యాసాలకు 'కవితోత్సాహము జనులకు' అంటూ జగతి రాసిన పరిచయవాక్యం వారిద్దరి సాహితీసేవల లక్ష్యాన్ని, ఉద్దేశ్యాన్ని, ఆదర్శాన్ని చాటి చెప్పింది. 1993లో వచ్చిన తెల్లమిరియం కవితా సంపుటి నుంచి నిర్భయజ్యోతి వంటి కవితల వరకు ఆయన సమకాలీన సందర్భాలన్నింటిపై తన ప్రతిస్పందన కవితాత్మకంగా రికార్డు చేశారు. కొత్త పదాలను తయారు చేయడం, భావాన్ని, అర్థాన్ని మాత్రమే కాదు ఒక అనుభూతిని, ఒక ఫీల్ని కలిగించే పదాలను సృష్టించడం కూడా ఆయన ప్రత్యేకత. మొజాయిక్ సంస్థ తరఫున ఎన్నో సాహిత్య కార్యక్రమాలు, జాతీయస్థాయి సదస్సులు, పుస్తకావిష్కరణలు, అనువాద సదస్సులు, సమీక్షలు.. విశాఖలో పబ్లిక్ లైబ్రరీ హాలు ఆయనకు చిరునామాగా మారిపోయింది. ఇటీవల ప్రారంభించిన మొజాయిక్ అవార్డు ద్వారా సాహిత్యసేవలో మరో అడుగు ముందుకు వేశారు. రామతీర్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గురజాడ అవార్డ్ తోపాటు 'రావిశాస్త్రి, మునిపల్లె రాజు' పురస్కారాలు కూడా అందుకున్నారు.
కార్యశీలి, వ్యక్తిగా రామతీర్థ ఒక్కరు కాదు.. ఇద్దరు. జగతి రామతీర్థ. ఆయన చేపట్టిన, నిర్వహించిన ప్రతి కార్యక్రమంలోనూ ఆమె సగం బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె అందించిన విద్వత్ చేయూతతో, నైతికబలంతో, మానసికశక్తితో తెలుగు సాహిత్యంలో తనదైన అధ్యాయాన్ని రాసుకున్నారు.
విశాఖ సముద్ర అలల సంగీతం ఎన్నడూ వినిపిస్తూనే ఉంటుంది. విశాఖలో సాహితీ సాగరం రామతీర్థ కృషి ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది.
- వాహెద్ అబ్దుల్,
7093788843