Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెలగం భీమేశ్వరరావు, గడ్డం మోహన్రావులకు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డులు
కేంద్ర సాహిత్య అకాడమీ 2019 పురస్కారాలను ప్రకటించింది. బాలసాహిత్య పురస్కార్ 2019కి 'తాత మాట వరాల మూట' కథల పుస్తకం రచయిత బెలగం భీమేశ్వరరావు ఎంపికయ్యారు. అలాగే యువ పురస్కార్ 2019కి 'కొంగవాలు కత్తి' నవల రచయిత గడ్డం మోహన్రావు ఎంపికయ్యారు. ఈ నవల నవతెలంగాణ నిర్వహించిన 'భాగ్యరెడ్డివర్మ స్మారక రచనల పోటీలో ద్వితీయ బహుమతి గెలుచుకుంది.
చిత్తలూరికి రాష్ట్ర సాహిత్య పురస్కారం
చిత్తలూరి సత్యనారాయణ రచించిన 'నల్ల చామంతి' కవితా సంపుటికి అనేక అవార్డుల పరంపరలో తాజాగా మరో అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్కి చెందిన పాతూరి అన్నపూర్ణ సంస్థ తరఫున రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన కవితల సంపుటిలో చిత్తలూరి పుస్తకానికి ప్రఖ్యాత అవార్డు లభించింది. ఈ అవార్డు కింద శాలువా, జ్ఞాపిక అయిదు వేల రూపాయల నగదు అందజేస్తారు. ఈ నెల 30 న నెల్లూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈ అవార్డు అందుకుంటారు.
జైనీ శకుంతల స్మారక కళా పురస్కార అవార్డులు
తెలుగు సాహిత్యంలోని వివిధ విభాగాలలో కృషి చేసిన పన్నెండు మంది రచయితలు, రచయిత్రులు, కవులు, కవయిత్రులను జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ జైనీ శకుంతల స్మారక కళా పుర్కారాలతో సత్కరిస్తుంది. ఈ నెల 19 వ తేదీ సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరిగే ఈ సభలోనే అంపశయ్య నవీన్కి జీవన సాఫల్య పురస్కార ప్రదానం, డాక్టర్|| ప్రభాకర్ జైనీ రచించిన 'నిఘా' నవ్య సీరియల్ నవల, 'మీల్స్ టికెట్' కథా సంపుటి ఆవిష్కరణలు వుంటాయి. ఈ సభలో మాడభూషి శ్రీధర్, శ్రీ బిక్కీ కృష్ణ, బి. చంద్రకుమార్, జి. చంద్రయ్య, ఏ. యస్. జగన్నాథ శర్మ, సుధామ, మామిడి హరికృష్ణ పాల్గొంటారు.
శ్రీమతి శకుంతలా జైనీ కళా పురస్కార అవార్డు 2019 గ్రహీతలు వి. రాజా రామ మోహనరావు, స్వాతి శ్రీపాద, విజయలక్ష్మీ పండిట్, వెంకట్ గుడిపాటి, డా|| పత్తిపాక మోహన్, నరేష్ బీరెడ్డి, శ్రీరాంసాగర్ కవచం, పెద్దింటి అశోక్ కుమార్, డా|| పసునూరి రవీందర్, డా|| మహమ్మద్ రఫీ, అన్వర్, చరణ్ జానీ భాషా.
బుద్దుని సన్నిధి - కవితా పెన్నిధి
టూరిజం, హెచ్ఎమ్డిఎ, టిపిఎస్కె, తెలంగాణ సాహితి సంయుక్త ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ అంశపై హుస్నేన్ సాగర్ లుంబినీ పార్కులో బుద్దుని సన్నిధి - కవితా పెన్నిధి' పేరుతో కవితా యాత్ర ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు జరుగుతుంది.
- భూపతి వెంకటేశ్వర్లు, 9490098343
'ఉద్యమం ఉద్యమమే' గ్రంథావిష్కరణ
ప్రొ|| ఎస్వీ సత్యనారాయణ కవిత్వం 'ఉద్యమం ఉద్యమమే' ఆవిష్కరణ ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయం సమావేశం మందిరంలో జరుగుతుంది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం భాషాభివృద్ధి పీఠం ఆధ్వర్యంలో జరిగే ఈ సభలో డా||అయాచితం శ్రీధర్, కె.శివారెడ్డి, వాసిరెడ్డి నవీన్, ఆచార్య కె.సుధీర్కుమార్, డా||నాళేశ్వరం శంకరం పాల్గొంటారు.
వ్యక్తిత్వమే కవిత్వం' ఆవిష్కరణ
వరవరరావు కవిత్వంపై పాణి విశ్లేషణాత్మక రచన 'వ్యక్తిత్వమే కవిత్వం' ఆవిష్కరణ ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. మలుపు బుక్స్ ఆధ్వర్యంలో జరిగే ఈ సభలో దేవిప్రియ, డా||బి.విజయభారతి, వసంత్ కన్నభిరాన్, కె.శివారెడ్డి, ప్రొ||ఎండ్లూరి సుధాకర్, ప్రొ||కాత్యాయని విద్మహే పాల్గొంటారు.
'స్వాతంత్య్రానంతర తెలుగు, హిందీ కవిత్వంలో స్త్రీ (1947-70)' ఆవిష్కరణ
డా||సి.భవానీదేవి పరిశోధక రచన 'స్వాతంత్య్రానంతర తెలుగు, హిందీ కవిత్వంలో స్త్రీ (1947-70)' ఆవిష్కరణ ఈ నెల 20వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు రవీంద్రభారతి సమావేశమందిరంలో జరుగుతుంది. ఈ సభకు డా||ఎన్.గోపి, మామిడి హరికృష్ణ, డా||వోలేటి పార్వతీశం, ఆచార్య ఎస్వీ రామారావు, ఎన్.స్వయంప్రభ, డా||ఎన్.రఘు, డా||పి.జ్యోతి హాజరవుతారు.
పునరావృత దృశ్యం కవిత్వ ఆవిష్కరణ సభ
పుష్యమీ సాగర్ రచించిన 'పునరావృత దృశ్యం' కవితా సంపుటి ఆవిష్కరణ ఈ నెల 23 న తేదీ సాయంత్రం ఆరు గంటలకు బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. సుద్దాల అశోక్ తేజ, నారాయణ శర్మ, హరగోపాల్, భూపతి వెంకటేశ్వర్లు, విరివించి విరివింటి, పోర్సియా దేవి, శిలాలోలిత, నరేష్ కుమార్ సూఫీ పాల్గొంటారు.
డా||వేదగిరి రాంబాబు కథానికా పురస్కారం
సింహప్రసాద్ సాహిత్య సమితి ఈ ఏడాది నుండి డా||వేదగిరి రాంబాబు కథానికా పురస్కారం'పేరుతో యువ రచయితలకు పురస్కార ప్రదానం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఈ సంవత్సరం అక్బోబర్ 14 నాటికి నలభై సంవత్సరాలు నిండని రచయితల నుండి కథానికా సంపుటాలను ఆహ్వానిస్తోంది. 2017, 18, 19లో ప్రచురింపబడిన కథా సంపుటాల ప్రతిని ఆగస్టు 14వ తేదీ లోపు సింహప్రసాద్, 401, మయూరి ఎస్టేట్, యం.ఐ.జి -2 -450, కెపిహెచ్బి కాలని, హైదరాబాద్ - 85 చిరునామాకు పంపాలి. వివరాలకు : 9849061668
'భిలాయి వాణి' పురస్కారానికి కవితలు ఆహ్వానం
తెలుగు, హిందీ భాషల్లో గత పంతొమ్మిది సంవత్సరాలుగా వెలువడుతున్న ద్విభాషా పత్రిక 'భిలాయి వాణి' జాతీయ స్థాయి కవితల పోటీకి భిలాయి వాణి సభ్యుల నుండి కవితలను ఆహ్వానిస్తోంది. ఏ సామాజిక అంశంపైన అయినా 40 లైన్లకు మించని కవితలను (ఒకటి లేదా రెండు) ఆగస్టు 31వ తేదీ లోపు భిలాయి వాణి, 19-సి, క్రాస్ స్ట్రీట్ - 1, సెక్టార్ 1, భిలాయి - 490001 చిరునామాకు పంపాలి. వివరాలకు 9827408575, 8374134200