Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అద్భుతమైన రచన పుట్టాలంటే భావం జతకూడాలి. భావానికి తగ్గ భాష తోడైతే వాక్యమయి, కవితగా రూపుదిద్దుకొని కావ్యమవుతుంది. ఎవరైనా మామూలు వ్యక్తీకరణలో భావాన్ని వొడుపుగా కవిత్వంలోకి వొంపుతారు. కాని ఒక జాతి అస్తిత్వాన్ని, బతుకు కోసం యుద్ధాన్ని, తపనపడే తత్వాన్ని కొందరు మాత్రమే రాయగలరు. ఈ కోవకు చెందిన కవయిత్రి మందవరపు హైమవతి. కవిత్వం చాలా ఏళ్ల నుంచి రాస్తున్నా కూడా తనదైన నిరసనగళంతో ఈ రోజున 'నీలిగోరింట' సంపుటిని వెలువరించారు. ఈ సంపుటిలో చాలా కవితలు వెంటాడతాయి. బాధితుల స్వరంతో తాను సహానుభూతిని ప్రకటిస్తూ అక్షరాలంబన అవుతారు.
నిరసన గళంలో 'శివరంజని'లో ''అమ్మాయి అంటే/ ఒక విలాసవస్తువుగా/ మార్కెట్ సరుకుగా మారాక/ బంధువులే రాబందువులై కబళించినపుడు/ పశువులుగా మారిన మనుషులకి స్త్రీ బాధలు ఏమి అర్థం అవుతాయి?'' అంటారు.
మంచి రచనని అభినందించే నెపంతో రచయిత్రుల పోన్ నెంబర్ల కోసం వెంపర్లాడి వెంబడించి మాటువేసే మగరాయుళ్లకి గట్టిగానే సమాధానమిచ్చారు అదృశ్య దృశ్యాల కవితలో.
''పత్రికలో ఆడపేరు కనిపిస్తే చాలు/ పోన్ నెంబర్ పసికడ్తే చాలు/ వలపు వలలో ఏ చిలుకైనా పడదా/ మైకపు ఉచ్చులో బందీచేస్తారు/ మాటు వేసే వేటగాళ్లు''. ఇప్పటి పరిస్థితికి అద్దం పట్టే కవిత ఇది.
ప్రేమొక కీటకమై మనుషులను కాటేస్తుంటే అంతే ఉండదు. ఇదే విషయాన్ని నీలిగోరింటలో చక్కగా వర్ణించారు. పిల్లవాడి నుంచి ముసలోడి దాకా ఆడదాన్ని ఎలా చూస్తారు. అభివృద్ధి ఎలాంటి విద్వంసాన్ని సృష్టించింది. పురుషులు స్త్రీలని చూసే దృక్కోణం ఎలా ఉంటుందో ఈ కవిత్వంలో చూపెట్టారు. చక్కని ప్రతీకలతో మహిళా సమస్యలని కవిత్వంగా మలిచిన తీరు అబ్బురం. అస్తిత్వం కోసం పోరాటం సల్పుతున్న ప్రతి మహిళకి ఈ సంపుటి ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది.
నీలి గోరింట, రచన : మందరపు హైమవతి, పేజీలు : 182, వెల : 120/-, ప్రతులకు : నవతెలంగాణ, ప్రజాశక్తి, విశాలాంధ్ర, నవచేతన, నవోదయ పుస్తక కేంద్రాలు.
- పుష్యమీ సాగర్,
9010350317