Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిందు అంటే కేవలం ఆడటం కాదు, అది లలితకళల సమాహారం. చిందులో నాట్యముంది. నటన వుంది. సంగీతముంది. సాహిత్యముంది. చిందు ప్రాచీనమైంది. కేతన తన 'దశకుమార చరిత్ర'లో జక్కుల వాళ్ళు చిందేసినట్లు తెలిపాడు. పాడుతూ, నటిస్తూ చిందువేసే వాళ్ళే చిందు భాగవతులు. గొల్ల కుర్మలకు మంద హెచ్చులు ఆశ్రితకులం. చాకలి వారికి మాచయ్యలు ఉపకులం. కోమట్లకు వీరముష్టి ఉపకులం. బ్రాహ్మణులకు విప్రవినోదులు ఆశ్రిత కులం. అలాగే మాదిగలకు ఆశ్రితకులం చిందు కళాకారులు. వీరు మాదిగలిచ్చే త్యాగం (పారితోషికం) పై ఆధారపడి బతుకు వెళ్ళదీస్తుంటారు.
'కొంగవాలుకత్తి' చిందు కళాకారులపై గడ్డం మోహన్రావు రాసిన ఆత్మ కథాత్మక నవల. చిందు భాగవుతులకు సంకేతం కొంగవాలు కత్తి. ఇది ఆది జాంబవుని ఆయుధం. ఆది జాంబవుడు తనకున్న ఇద్దరు కుమారుల్లో ఒకడిని చంపి వారి శరీరావయవాలతో విశ్వకర్మకు కావలసిన పనిముట్లు తయారు చేసి ఇస్తాడు. అందుకు కృతజ్ఞతగా ఆది జాంబవునికి విశ్వకర్మ 'కొంగవాలు కత్తి'ని ఇస్తాడు. పురాణాల్లో దధీచి తన శరీరాన్ని త్యాగం చెయ్యగా అతని ఎముకలతో వజ్రాయుధాన్ని తయారు చేస్తారు. అది ఇతరులను చంపడానికి ఉపయోగపడే ఆయుధం. కానీ తన కుమారుడి శరీరావయవాలతో జాంబవుడు చేసిన పనిముట్లు ఉత్పత్తికి ఉపయోగపడే సాధనాలు. మొదటిది నశింపచేయడానికి పనికొస్తే, తదుపరివి సృష్టించడానికి ఉపయోగపడేవి.
'కొంగవాలు కత్తి' నవలలో నాయకుడు నర్సింగరావు. నర్సింగరావు ఎవరో కాదు... మోహన్రావే! ఈ నవల అతని ఆత్మ కథే. విప్లవ పూర్వపు రష్యాలోని దుర్భరత్వాన్ని 'నా బాల్యం' అనే ఆత్మకథలో మాక్సీమ్ గోర్కి మన కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తాడు. దేవులపల్లి కృష్ణమూర్తి రాసిన 'ఊరు వాడ బతుకు' కూడా ఆత్మకథాత్మకమైన నవలే. 'కొంగవాలు కత్తి'కీ ఆ నవలకూ తేడా వుంది. ఊరు - వాడ బతుకులో కృష్ణమూర్తి తన పేరును మార్చలేదు. కొంగవాలు కత్తిలో మోహన్రావు పేరు మార్పు తప్ప మిగతా పాత్రల పేర్లు ఏ మాత్రం మారలేదు. అలాగే ఊళ్ళ పేర్లు కూడా మారలేదు. హజీపూర్, బొమ్మల రామారం, భువనగిరి, నెమురుగొముల, సికింద్రాబాద్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో జరిగిన సంఘటనల సమాహారమే ఈ నవల. బొమ్మల రామారం స్కూల్లో నర్సింగరావు ఇంగ్లీషు టీచర్ సరోజినిదేవి. ఈమె భువనగిరి మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన పాదరాజు హన్మంతరావు కుమార్తె. నటి ప్రత్యూష తల్లి. అలాగే ప్రొఫెసర్ తంగెడ కిషన్రావు, బేతవోలు రామబ్రహ్మం, ఎన్.గోపి, మంజుల టీచర్, పసునూరి రవీందర్ వంటి ప్రత్యక్ష, పరోక్ష పాత్రలు ఈ నవల్లో కనిపిస్తాయి. అంతేకాదు చిందు కళాకారులైన తన తల్లిదండ్రులు సావిత్రి, కిష్టయ్య పేర్లను కూడా కొంగవాలు కత్తిలో మోహన్రావు మార్చలేదు. ఒక్క తన పేరునే మార్చాడు.
అత్యల్ప సంఖ్యలో ఉన్న శిష్టవర్గం వారి పురాణాలు లలిత కళలకు ఆదరణ లభిస్తుంటే, అట్టడుగు వర్గాల పురాణాలు, లలిత కళలు నిరాదరణకు గురౌతున్నాయి. కొంగవాలు కత్తిలో చిందు భాగవతుల జాంబపురాణ ప్రదర్శన వుంది. ఆ ప్రదర్శన మధ్యలోనే సావిత్రి, నర్సింగరావుకు జన్మనిస్తుంది. రచయిత చిందు భాగవతుల కొడుకవడంతో చిందు జాంబపురాణ ప్రదర్శనను కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు. ఇది మరొక రచయితకు సాధ్యం కాదు. చిందు కళాకారులు తమ పాత్రకు అవసరమైన ఆభరణాలను పూసలు, ముత్యాలతో తామే తయారు చేసుకుంటారు. తమ అలంకరణను తామే చేసుకొంటారు. ఎరుపు, తెలుపు, పసుపు రంగులను ఉపయోగించి తమ మేకప్ తామే చేసుకుంటారు. నవలలో నెమురగొములలో జాంబ పురాణ ప్రదర్శన వుంటుంది. కిష్టయ్య, నెలలు నిండిన సావిత్రి కూడా ప్రదర్శనలో పాలు పంచుకోడానికి వెళ్తారు. దశరథ జాంబవుని వేషం కడితే, కిష్టయ్య బాపనాయిన వేషం కడతాడు. దశరథ మేకప్ వేసుకున్నాక -
''ఒకరిద్దరు అతనికి అలంకరణలో సహాయం చేస్తున్నారు. కాశ మీద కాశ ఏడు కాశలు కట్టిన్రు. నడుము చుట్టు మరొకటి, ఎడమవైపు భుజం నుంచి నడుముకు, కుడి భుజం నుంచి మరో రెండు కాశలను వేలాడదీసిండ్రు. నెత్తిమీద కలువ రేకులు, చెవులకు మకర కుందనాలు, కోరమీసం, కుడి చేతిలో కొంగవాలు కత్తి, ఎడమ చేతిలో పిడికత్తి, నడుముకు పులితోలు, ఎలుగు తోలు, బొడ్డు గంటను కట్టిన్రు. కాళ్ళకు గజ్జెలు... చూడటానికి యుద్ధవీరుని లెక్క ఉన్నడు.
వీపు దర్శనం, ఎద దర్శనం, చేతులకు అట్టలు కట్టి, మెడలో రుద్రాక్ష దండలు, గవ్వల దండలు వేశిన్రు. నడుముకు చుట్టూత వేపకొమ్మలు అమర్చడంతోటి వేషం పూర్తయింది'' అని జాంబవంతుని అలంకరణ గూర్చి రచయిత తెలిపాడు.
జాంబపురాణంలో జాంబవంతుడు, బ్రాహ్మణుని సంవాదం ఆసక్తికరంగా వుంటుంది. ఈ సంవాదంలో అగ్రవర్ణ అహంకారానికి అట్టడుగు వర్గం తూట్లు పొడవటం కనిపిస్తుంది.
''ఓ... ఓయీ జాంబవంతుడా! నీ తల్లి పేరు? నీ తండ్రి పేరు? నీ తాతపేరు? నిన్ను యెవ్వరు సాదినారో.... ఓ జాంబవంతా చెప్పు'' అని బ్రాహ్మణుడు అడిగితే...
''శంఖు మా తల్లి దండ్రి జనులార వినుడీ
----------------------
ముగ్గురు మూర్తులకు తాతను స్వామి ముందొక్క జాంబవంతున్ని''
''అయితే సరేగానీ నీవు ఏ యుగంలో బుట్టితివి?'' అని బ్రాహ్మణుడు ప్రశ్నిస్తే ''మీయైతే నాలుగే యుగాలు. మరి మాయి - యుగములు ఎన్ని యనగా నందనీరవ, అనంత, అచ్చుత, అద్భుత, తమంద, తారక, అండజ, భిన్నజ, అన్యోన్య, అలంకృత, విశ్వభవ, పరభవ, సకలధర్మ, సకల స్వరూప, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము... ఇట్లా పద్దెనిమిది యుగములలో మొదటి యుగంబున నేను జన్మించితి'' అని జాంబవంతుడి వేషంలోని దశరథ అంటాడు.
'కొంగవాలు కత్తి' నవలా నాయకుడైన నర్సింగరావు హాజీపూర్ ప్రాథమిక పాఠశాలలో చదివేటప్పుడు కులం సర్టిఫికెట్లు తెస్తే స్కాలర్షిప్ ఇస్తారని విజయ టీచర్ చెబుతుంది. 'అడ్కతినేటోల్లకు దొరల పేరేందిరా? రావు అంటే దొరలాయె' అంటూ గిర్దావర్ నర్సింగరావుకు కులం సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తాడు. సామాజిక చైతన్యం గల డేవిడ్ సార్ కొట్లాడి అతనికి కులం సర్టిఫికెట్ ఇప్పిస్తాడు. చిన్నతనంలోనే కుల వివక్ష అంటే ఏమిటో నర్సింగరావుకు తెలిసింది. పటేల్ పొలంలో మొదటిసారి కూలికి వెళ్ళినప్పుడు అతనికి అస్పృశ్యత అంటే ఏమిటో అవగతమౌతుంది. దోసిలి పట్టమని చెప్పి పటేలమ్మ మీది నుంచి నీళ్ళు పోస్తుంటే అతని మనసు అల్లకల్లోలమవుతుంది. బాగా దూపైతే నర్సింగరావు మోట బావిలోకి దిగుతాడు. పకీర్ చిత్తారెడ్డి అది చూసి -
''ఎవడ్రా బాయిలకు దిగింది?'' అని అడిగితే...
''నేను చిందు భీమయ్య మనుమన్ని. చిందు కిష్టయ్య కొడుకును పటేలా''
''అడ్కతినేటోనివి. ఎత్క తినేటోనివి. బాయిలకు దిగుతావురా. ఇసుంత రమ్మంటే ఇల్లంత నాదే అంటరు ఈ లం... కొడుకులు. ఈ జాతే అసొంటిది. మీదికెక్కు'' అంటూ చిత్తారెడ్డి తిడతాడు.
అవమాన భారంతో నర్సింగరావు ఇంటికెల్లి కుమిలి కుమిలి ఏడుస్తాడు. పొలంలో కూలికెల్లినప్పుడు మధ్యాహ్నం కూలి వాళ్ళందరూ అన్నం తినడానికి కూర్చుంటారు. మాలమాదిగలు ఒక చోట కూర్చుంటే లంబాడాలు తక్కినవాళ్లు కలిసి ఒక చోట కూర్చుంటారు. నర్సింగరావుకు మరోసారి అంటరానితనమంటే ఏమిటో తెలిసొస్తుంది. ఒకనాడు రామిడి బాలమ్మ పొలంలో పనిచేస్తుంటే పొరపాటున అతని చెయ్యి ఆమెకు తగిలితే ఇష్టమొచ్చినట్లు తిట్టి శుద్ధికోసం స్నానం చేస్తుంది. మరొకసారి గౌండ్ల చింతకింది మల్లమ్మ నీళ్లకుండ ముట్టుకున్నాడని ఆ కుండనే పగులగొట్టింది. నిమ్నకులం మూలంగా నర్సింగరావు అడుగడుగునా అవమానాలకు గురౌతాడు. అంటరానితన అగ్ని జ్వాలల్లో అతని హృదయం కాలిపోతూ వుంటుంది.
తండ్రి కిష్టయ్య పక్షవాతానికి గురికావడంతో నాయినమ్మ కమలమ్మ బిచ్చమెత్తి నర్సింగరావును పోషిస్తూ వుంటుంది. అట్టడుగు కులం తుర్కోళ్ళు, కాపోళ్ళ దగ్గర అడుక్కొచ్చిన అంగీలు, లాగులు మనుమనికిచ్చేది కమలమ్మ. బొమ్మల రామారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నప్పుడు నర్సింగరావు స్కూలు అసెంబ్లీలో నిలబడ్డాడు. వందేమాతరం ఆలపించడం కాగానే దబీమని నర్సింగరావు కింద పడ్డాడు. దశరథ సారొచ్చి ముఖంపై నీళ్ళు చల్లాడు. నీళ్ళు తాగించాక అతడిని సర్కార్ దవాఖనకు తీసుకెళ్లాడు. డాక్టర్ పరీక్షించి ''మంచి ఆహారం తీసుకోవాలి బాబూ... అవును పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసినవా?'' అని డాక్టర్ అడిగాడు.
''చెయ్యలేదు సార్''
''ఏం ఎందుకు... ప్రతిరోజూ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చెయ్యాలె''
''మా అమ్మ అన్నమొండలే సార్''
''ఎందుకు ఆమె ఒంట్లో బాగలేదా?''
''మా ఇంట్లో బియ్యం లేవు సార్''
దుర్భర దారిద్య్రాన్ని ఎదుర్కొంటూనే పదవ తరగతిలో నర్సింగరావు స్కూల్ ఫస్ట్ వస్తాడు. శ్యామ్ సుందర్సార్ ప్రోత్సాహంతో పాలిటెక్నిక్లో చేరతాడు. ఆర్థిక కారణాల వల్ల మధ్యలోనే ఆపేస్తాడు. ఇంటర్లో చేరినా కుటుంబ పరిస్థితుల మూలంగా పూర్తిచేయలేకపోతాడు. చర్లపల్లి, కుషాయిగూడల్లోని ప్రయివేటు కంపెనీల్లో పనిచేస్తాడు. ఆరోగ్యం చెడిపోవడంతో తన సొంత ఊరైన హాజీపూర్ వెళ్ళి వ్యవసాయ కూలీగా మారతాడు. బర్లు గాస్తాడు. ట్రాక్టర్ మీద పెండ, మొరం, రాళ్లు, ఇసుక గంపలెత్తుతాడు. బోర్వెల్ మీద ఇనుపరాడ్లు మోస్తాడు. విజయకుమారి టీచర్ మూలంగా హాజీపూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యావాలంటీర్గా చేరతాడు. ఆంధ్రాయూనివర్సిటీ దూరవిద్యావిధానం ద్వారా డిగ్రీ పూర్తి చేస్తాడు. మాతృశ్రీ గ్రామర్ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు డొంకెన పోశెట్టి, మంజుల గార్ల ప్రోత్సాహంతో తెలుగు సాహిత్యంలో ఎం.ఎ. చేయాలని సంకల్పించాడు. లర్న్ టు ఎర్న్ ప్రోగ్రాం ద్వారా చదువుకుంటూ ఫకీర్ సురేందర్ రెడ్డి సహకారంతో సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్.ఎ, ఎమ్.ఫిల్ పూర్తి చేస్తాడు. తరువాత ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ తంగెడ కిషన్రావు పర్యవేక్షణలో 'తెలంగాణ చిందు కళాకారుల జీవన చిత్రణం - సాహిత్యానుశీలనం' అనే అంశంపై పరిశోధన చేసి పిహెచ్.డి పట్టా స్వీకరించాడు. నర్సింగరావు ఇప్పుడు డాక్టర్ నర్సింగరావు. అంతే కాదు ఉమెన్స్ కాలేజీలో పార్ట్టైం తెలుగు లెక్చరర్.
మాదిగ ఉపకులానికి చెందిన నర్సింగరావు అవమానాల్ని, ఆకలిని ఎదుర్కొని అంకుఠిత దీక్షతో చదువుకుని ఉన్నత స్థానానికి ఎదిగాడు. చదువే ఆయుధంగా చేసుకుని జీవన పోరాటం చేశాడు. తనను దూరంగా ఉంచిన అగ్రవర్ణాల వ్యక్తుల పక్కనే కూర్చోగలుగుతున్నాడు. వారి సహబంతిలో కూర్చుని భోజనం చెయ్యగలుగుతున్నాడు. 'విద్వాన్ సర్వత్ర పూజ్యతే' అనే సుభాషితంలో ఎంత నిజముందో నర్సింగరావు నిరూపించాడు. అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు కూడా అట్టడుగు వర్గాల వారికి సహాయ సహకారాలు అందిస్తారని మోహన్రావు అభిప్రాయపడ్డాడు. కొంగవాలుకత్తి నవలా నాయకుడు నర్సింగరావు మలక్పేటలోని కిరాయి ఇంటికి వెళుతూ ''మమ్ములను అగ్రకులాలోళ్ళు, అగ్రవర్ణాలోళ్లు వేధిస్తున్నారు. వివక్ష చూపెడుతున్నారు'' అంటమొత్తుకుంటున్న మాలమాదిగోళ్లు ఉపకులాలోళ్ళను ఎట్ల చూస్తున్నరు? చదువుకున్న మాల మాదిగోళ్ళే చదువుకోనోళ్ళను, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నోళ్ళను తొక్కకుంటే చాలు అని మనసులోనే అనుకుంటాడు.
ఈ నవలలో గ్రామ సర్పంచి రాంరెడ్డివంటి దుర్మార్గుడున్నాడు. మాలమాదిగల కోసం పాటుపడే అభ్యుదయవాది బాల్రెడ్డి వున్నాడు. కొంగవాలుకత్తిలో నక్సలైట్లు, యాదగిరిగుట్టలోని వేశ్యల ప్రసక్తి లీలామాత్రంగా వుంది. నక్సలైట్ల జోక్యంతో రాంరెడ్డి దళిత కూలీల కూలీ పెంచుతాడు. తన చిన్నాయిన పెళ్ళి పాతగుట్టలో జరుగుతున్నదని తెలియగానే నర్సింగరావు నడుచుకుంటూ పాతగుట్టవైపు వెళతాడు. ఒక స్త్రీ అతని వెంట పడుతుంది. మరీ దగ్గరకు వచ్చి 'ఆగు ఆగు' అంటుంది. నర్సింగరావు ఆగకపోతే తిట్ల దండకం మొదలుపెడుతంది. నువ్వు నడుచుకుంటొచ్చిన తొవ్వ మంచిది కాదు అని అతని చిన్నాయిన అంటాడు. ఈ నవలలో చేతబడులు, విశ్వాసాలు, అనారోగ్యాలు, వివాహేతర సంబంధాలు, జానపద వైద్యం వంటి అంశాలను రచయిత ప్రస్తావించాడు.
కొంగవాలు కత్తిలో ఎక్కడా కల్పన లేదు. ఈ నవల చిందు కళాకారుల జీవితాలకు దర్పణం. సాహిత్యం, కళలు రెండు రకాలు. శిష్ట వర్గాలకు చెందిన పౌరాణిక సాహిత్యం, అట్టడుగు వర్గాల పౌరాణిక సాహిత్యం. శిష్ట వర్గానికి చెందిన సాహిత్యం వెలిగిపోతున్నది. అదే భారతీయ సంస్కృతి, కళలుగా ప్రచారం పొందుతున్నది. అట్టడుగు వర్గాల పౌరాణిక సాహిత్యం దీనికి భిన్నంగా వుంది. అధిక సంఖ్యాకులు ప్రాతినిధ్యం వహిస్తున్న అట్టడుగు వర్గాల సాహిత్యం, కళలను ఎవరూ పట్టించుకోవడం లేదు. వాటిని అణచివేస్తున్నారు. నిమ్న వర్గాల సాహిత్యం మౌఖికమైనది. దయనీయ స్థితిలో వున్న చిందు భాగవతులు నిరాదరణకు గురౌతున్నారు. ప్రస్తుతం మతోన్మాదంతో పాటు కులపిచ్చి పెరిగిపోతున్నది. వర్గపోరాటంతో పాటు కులపిచ్చి వ్యతిరేక పోరాటం చేయాల్సిన అవసరం వుంది.
- తెలిదేవర భానుమూర్తి,
9959150491