Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బతుకు దుర్భర పరిస్థితిల్లో నెట్టబడి జీవనం కష్టమై కూడు, గుడ్డ కోసం యుద్ధం అంటూ చేయాల్సివస్తే సగటు మనిషి సహాయం కోసం ఎదురు చూస్తాడు. సగటు మనిషికి స్వేచ్ఛని, భద్రతని కల్పించడంలో విఫలమైనప్పుడు కర్తవ్యాన్ని గుర్తు చేసేందుకు ఎప్పుడూ కలం ఝుళిపిస్తూనే ఉండాలి. కవి ఎప్పుడూ ప్రజల పక్షమే అని నిరూపిస్తూ సిరికి స్వామినాయడు తన అక్షర ప్రస్థానాన్ని ప్రజలవైపు నుంచే మొదలుపెట్టాడు. మట్టి రంగులాంటి మనుషులకి తన పోరాటాన్ని అరువు ఇచ్చి యుద్ధంలో తానూ తోడు వెళ్తానంటాడు. ఛిద్రమైన పల్లె జీవితాల్ని, అంతరించిపోతున్న సంస్కృతీ సాంప్రదాయాల్ని, కొండల్ని, గుట్టల్ని అభివృద్ధి పేరుతో ఆదిమవాసుల్ని కొల్లగొడుతున్న తీరుని గట్టిగానే ప్రశ్నిస్తాడు. రెక్కలు ముక్కలు చేసుకొని పండిన పంట చేతికొచ్చాక తీరా అప్పులోడు ఎగిరేసుకుపోతే 'మడీ చెక్క' ఎంత బాధపడుతుందో చెప్పనలవి కాదు. ''ఎలా వచ్చిందో అప్పుల గద్ద/ పురిటి మంచం నుంచి తన్నుకు పోయింది (మడీ చెక్క)''.
జాతుల వారీగా విడిపోతేనేమి మేమంతా భారతీయలమే కదా, మనిషి అంటగట్టిన కులాన్ని మతాన్ని నిరసిస్తూ మువ్వన్నెల భారతమే వెలిగిపోవాలని కాంక్షిస్తాడు. ''గుక్క పట్టి ఏడుస్తున్న నన్ను తన గుండెలకదుముకుని ఆకలి తీర్చిన ఆ ఏసమ్మది ఏ కులమైతే మాత్రం /నాకు కన్న తల్లి కాకుండా పోతుందా''.
ఆకలి వారే మనిషికి దేవుడు అది ఏ కులమైన సరే. అన్నం పెట్టె అమ్మ ఏ కులమైనా నాకు తల్లే అని కులమత రహిత సమాజంలోకి భారతాన్ని పయనించాలని కోరుకుంటున్నారు. అభివృద్ధి పేరుతో ఉన్న భూమిని లాక్కొని పచ్చని పంట పొలాల్ని స్మశానాలుగా మార్చితే అది స్వర్గం అనుకొమ్మని ఎలా చెప్తారు. రైతే రాజు అని ఎలుగెత్తిన చోట కూలీలుగా, నిరాశ్రయులుగా మారిన దుస్థితికి బెంగటిల్లుతాడు. 'భూతల స్వర్గంలో' పెట్టుబడులతో మా పల్లెల మీద పడీ/ మా భూముల్ని గుంజుకున్నారు/ మా ఇంటి సస్యలక్ష్మిని చెరబట్టారు/ భావ్ మీ దేవతల రాజధానిలో మా పేదలకి చోటుందా'' అని నిలదీసి అడుగుతాడు. చివరికి మీరు చెప్పే నినాదాల్లో అంతా డొల్లతనమే అని నిరసిస్తాడు.
''భావ్, రైతు లేని రాజధాని మీకు భూతల స్వర్గమేమోగాని/ మాకు మాత్రం భూతాల స్వర్గమే''. నిజమే రైతులేని సమాజాన్ని ఊహించలేం. ఎంత అభివృద్ధి సాధించినా రైతు లేని సమాజాన్ని ఊహించలేమేమో (భూతాల స్వర్గం).
స్వాతంత్య్రం వచ్చి డెబ్బై వసంతాలు దాటుతున్నా కూడ నిమ్న వర్గాలపై దాడులు ఆగడం లేదు. దళితుడికి బతుకు భరోసా లేదు. ఎప్పుడు ప్రాణాలు పోతాయో అని భయపడుతూ జీవిస్తున్నారు దళితులు. చరిత్రలో మచ్చగా మిగిలిన లక్ష్మీ పేట దారుణాన్ని చూసి దు:ఖిస్తాడు కవి. ''అసలే నిర్వాసిత, ఆపై కొడుకుల్ని పోగొట్టుకున్న కడుపుకొత/ లక్ష్మీపేట ఎంత కష్టమొచ్చింది'' అని బాధపడుతూ దీనికి కారణమైనవాళ్లు బాగానే ఉన్నారు, బాధితుల ఉనికి మాత్రం ప్రశ్నార్థకమే అంటాడు.
''పంజా విసిరిన పెద్దపులులు పదిలంగానే ఉన్నాయి /వ్యూహాల ఊర్లో చిక్కి నేలకొరిగిన/ దళిత పక్షుల ఉనికే ప్రశ్నార్ధకం అయ్యింది (నల్లకలువల నెత్తుటి దారుల్లో!). వ్యవసాయం చేయడం అంటే రైతుకి కష్టంతో కూడిన ఇష్టమే. రైతుకి నాట్లువేయడం అంటే ఇష్టం. ఎందుకంటే బుక్కెడు బువ్వని లోకానికి అందించే భాగ్యం కనుక! మరి అదే నాట్లు వేయకపోతే ప్రపంచానికి ఎలా అన్నం పెట్టగలం. ఎంత అద్భుతంగా వివరించాడు.
ఇది మట్టిబొమ్మల వరుస కవిత్వం. మనిషిని తొలిచేస్తున్న బాధని దిగమింగుకొని రాసిన కవిత్వమిది. తమ అస్తిత్వాన్ని లోకానికి వెలువరించాలని ప్రతి అక్షరాన్ని ప్రశ్నలా సంధించి ఆలోచింపచేస్తారు స్వామినాయుడు. మొత్తం డెబ్బయి ఆరు కవితలున్న ఈ సంపుటిలో ఒక్కో కవిత ఒక్కో అనుభూతినిస్తుంది. కొంత బాధ, మరికొంత నైరాశ్యం వెంటాడుతుంది. రాజ్యం చేస్తున్న హింసకి పోరుబాట మాత్రమే చివరి దారని నిర్ణయించుకొని ఆ దిశగా పీడిత జనాల వైపు తానూ నిలబడతానని తన నిబద్దతని నిరూపించుకున్నాడు. ఆలోచింపచేసే విధంగా అస్తిత్వ కవిత్వాన్ని అద్భుతమైన అభివ్యక్తితో రాసిన కవికి జేజేలు.
- పుష్యమీ సాగర్,
9010350317