Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బతుకుదెరువు కోసం సరిహద్దులను దాటి విదేశాలకు వెళ్ళినా కూడ తన కన్న ఊరును, బొడ్డుతాడు లాంటి పల్లెప్రేమను మరిచిపోలేడు. పల్లెనే పలువరిస్తూ, పల్లె చుట్టునే తిరుగుతాడు. వలస కూలీ కూడ తన మాతృదేశం పోవాలని, తాను తిరిగిన భూమిని తాకాలని, అక్కడి మనుషులతో మాట్లాడాలని తండ్లాడుతుంటడు. నిజానికి తన సొంత మట్టి మీదున్న ప్రేమనే జీవితం. దీనిని మించిన కవిత్వమేముంటది? అట్లా స్థానికతను భూమికగా చేసుకొని కథలు, కవిత్వం రాస్తున్నవారు ఎందరో ఉన్నారు మనకు. ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమంలో భాగంగ తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుండి గొప్ప కవిత్వం వచ్చింది. ఇప్పుడు గోదారి ప్రాంతంలో ఓ మూలగ ఉన్న ఏజెన్సీ ప్రాంతం ప్రక్కనుండె బయ్యనగూడెం నుంచి నిలబడి స్థానికత గురించి మాట్లాడుతున్న కవి మెట్టా నాగేశ్వరరావు. తాను రాసిన 'మనిషొక పద్యం'లో స్థానిక అంశాలైన పెద్దబావి, పులివాగు, గోదావరి నది, కన్నాపురం సంత, పరమేశుని చెరువు తన కవిత్వానికి జీవనాడులు.
మెట్టా రాసిన 'మనిషొక పద్యం' సమకాలీన సమస్యలమీద రాసిన కవితలు, బహుజన దృక్పథంతో వివిధ కులవృత్తుల మీద రాసిన కవితలు, తనలోని తాత్వికుడిని తెలిపే కవితలే గాక స్థానికతను కవిత్వమెట్లా జేసిండో చూద్దాం.
సంత అనగానే మొదట గుర్తొచ్చేది గోరటివెంకన్న 'సంతపాట'. అదే కాకుండ మోరు మార్కెట్ల మీద రాసిన 'మా యఅంగడి సంత'.
మెట్టారాసిన కన్నాపురం సంత గోరటివెంకన్న చెప్పిన మాయ అంగడిసంత లాంటిది కాదు. అప్పుడే కోసుకొచ్చిన తాజా కూరగాయాల్లాంటి మనుషులింటారిక్కడ. కార్పొరేట్ సంతలతో పోల్చినపుడు ఎటువంటి మాయా ఉండదు.
''ఎందరినో ఒక్కటి చేసే దయామయి సంత
అది ఎన్నో బతుకుచిత్రాల పాలపుంత'' (కన్నాపురం సంత-పుట75)
సంతలో కలుసుకోవడాలు, కన్నీళ్ళను పంచుకోవడాలు మాత్రమే తప్ప ఎటువంటి మాయా ఉండదు. అందుకే సంతను 'దయామయి'గ చెప్తాడు కవి. అంతే కాకుండ జీవితానుభవాల పాఠశాలగ, మానసిక వైద్యశాలగ దర్శిస్తాడు. ఈ కవితలో వాడిన సంతచెట్టు, మనసుసంచి, చిల్లరపూలు లాంటి పదచిత్రాలు దీనిని ప్రత్యేకంగ, తాజాదనం గలిగిన కవితగ నిలబెడుతాయి.
''అప్పుడప్పుడూ నేను సంతకెళ్తుంటాను
అక్కడే
పేదరికాన్ని వేడుకెలా చేసుకోవాలో తెల్సుకున్నాను''
అని సంతకు వచ్చే నిరుపేదల బతుకుల్ని, అక్కడి సందడిని చెబుతూనే సంతకు తానెందుకు వెళ్ళాలనుకుంటాడో చెప్తాడు. ఉన్నదాంట్లోనే తృప్తి పడి జీవితాన్ని పండుగలా చేసుకునే ఎంతో మంది నిరుపేదల జీవనవిధానం కనబడుతుంది చివరివాక్యంలో.
ఇక వాగు విషయానికొస్తే 'పులివాగు' మెట్టా జీవితంలో భాగం. చాకిరేవు నేపథ్యంలోంచి వచ్చిన ఈ కవి పులివాగులో బట్టలుతికిన జీవితాన్ని కవిత్వం చేయడం అనేది తాను పెరిగిన ప్రాంతం పట్ల ప్రేమను తెలుపుతుంది.
''వాళ్ళు ఆరేసిన బట్టలన్ని చూస్తే
వాగుకన్య ధరించిన రంగురంగుల వలువల్లా అన్పించేవి!'' (పులివాగు-పుట43)
పై వాక్యాలు వాగు గట్టు మీద చీరలు ఆరేసే దృశ్యాన్ని కళాత్మకంగ చెప్పడమే!
''నాకు తాత చెప్పిన
ఆనాటి పులివాగు గాండ్రింపు వినాలని ఉంది'' అని కవి అన్నప్పుడు వాగు ఎండినపోయిన స్థితిని చెబుతూనే దానిమీదున్న ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. ఇది కేవలం పులివాగు పరిస్థితే కాదు, ఎన్నో ఎండిపోతున్న వాగుల స్థితి కూడ.
పులివాగు గురించి చెప్పినా, పరమేశుని చెరువు గురించి చెప్పినా వాటికి ఆ పేర్లు ఎందుకొచ్చినాయో మూలాల్లోకెళ్ళి కవిత్వం చేస్తాడు.
1) ముత్తాతకి ముత్తాతెవరో చూశారు
ఆ వాగులో పులొచ్చి నీళ్ళు తాగడం
అప్పటినుంచది పులివాగు (పులివాగు-పు.42)
2) బహుశా...
శివుడు గంగమ్మనెత్తుకున్నందుకు
కృతజ్ఞతగా ఆ పేరేమో! (పరమేశుని చెరువు-పు171)
పై రెండు వాక్యాలు వాగుకు, చెరువుకు సంబంధించి మూలాలను పట్టిస్తాయి. వీటిని కవిత్వంలోకి తీసుకొచ్చి స్థానికతను రికార్డు చేసి తరతరాలకు అందిస్తాడు.
ఇది నది పక్కనే ఉన్నా నీళ్ళు కొనుక్కుంటున్న కాలం. చెరువులు, బావులు ఎండిపోయి మనిషికి కన్నీళ్ళే మిగిలిన కాలం. ఇటువంటి కాలంలో బావిలో పడి ఒక వ్యక్తి చనిపోయాడని బావినే మూసేయడం ఎంతవరకు మంచిది.
''అప్పుడు నిండా నీళ్ళుంటే హారతిచ్చేవాళ్ళు
ఇప్పుడు హంతకిలా చూస్తున్నారు
దోషం బావిది కాదు
అయినా అది శిక్షను మోస్తుందిపుడు'' (పెద్దబావి-పుట96)
ఇది వాళ్ళ ఊరిలోని పెద్దబావి గురించి తెలిపే వాక్యాలు. చుట్టాలొస్తే కడుక్కోవడానికి నీళ్ళిచ్చిన ఒకప్పటి పెద్దబావి నేడు అనాథలా ఉండటానికి కారణం ఎవరని ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నలో బావి మీదన్న అభిమానం, మళ్ళీ బావిని తెరిస్తే బాగుండన్న కోరిక, మనుషులను నిలదీసే కోపం కనిపిస్తాయి. కవిత ప్రారంభంలో పూర్వం బావి ఎలా ఉండేదని చెప్పి బావి గిలక పాడే మానవతా గీతాన్ని వినిపిస్తాడు. ఇది వినైనా మనుషుల మనసు మారితే బాగుండనిపిస్తుంది చదివేవారికి.
'మనిషొక పద్యం'లో అక్కడి వాగు, చెరువే కాకుండా తేటని గోదారినీళ్ళు మన మనసుల్ని కడుగుతాయి. పొద్దుపొద్దున్నే గోదావరిని నిద్రలేపే జాలరి, మడేలయ్య, పిండాలు పెట్టె పేద బ్రాహ్మణులు, రైతుల జీవితాలు గోదావరితో ఎలా ఆధారపడ్డావో చూడొచ్చు.
''అప్పులకొండలు మోసే పేదరైతుకోసమే
ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా పరుగుతీస్తుంది
బువ్వపెట్టే రైతులు నవ్వుతుండాలనే
గోదావరి మేఘాలకి ఆవిరిలేఖలు రాస్తుంటది!'' (గోదారమ్మ గుర్తుగా-పు.162)
పరుగులు తీసే గోదారమ్మ ఉదాత్తగుణాన్ని అత్యంత సహజంగ చెప్పడం ఇందులో చూడొచ్చు. వర్మ కలిదిండి రాసిన 'గోదారి పలకరింపు'లో, వంశీ రాసిన 'పసలపూడి కథలు', 'మా దిగువ గోదావరి కథ'ల్లో గ్రామీణ చిత్రణ, గోదావరి సౌందర్యం కనిపిస్తాయి. మెట్టా రాసిన 'గోదారమ్మగుర్తుగా' కవితలో కూడా అక్కడి జీవనచిత్రణ, నదీ వర్ణనను చూస్తాం. కేవలం వర్ణనతోనే ఆగిపోకుండా ఇప్పటి వాస్తవికతను, సామాజికతను జోడిస్తాడు.
''ఇసుకకొండల్ని అవినీతి అనకొండలు మింగి
పేదోడికి ఇల్లుని కలగా మిగల్చడం బాగాలేదు!''
ఇసుక అక్రమ రవాణాను, ఇసుక మాఫియాను నిరసిస్తాడు కవి. తెలంగాణ ప్రాంతంలో నేరేళ్ళ లాంటి సంఘటనలు మనకు తెలియనివి కాదు. ఇట్లా తాను తీసుకున్న ఏ వస్తువునైనా సమకాలీనతతో ముడిబెట్టి కవిత్వం అవసరాన్ని, ప్రయోజనాన్ని సాధిస్తాడు.
మొత్తంగా మెట్టా కవిత్వాన్ని చదివినపుడు కొన్ని విషయాలు స్పష్టమౌతాయి. తాను తీసుకున్న వస్తువును మానవీయత, తాత్వికత, సామాజికత మొదలగు కోణాల్లోంచి దర్శించి కవితకు ప్రాణం పోయడం వీరి ప్రత్యేకత. అందుకే వీరి కవితలు రూపపరంగా పెద్దవిగా ఉంటాయి. స్థానిక అంశాలనే పోలికలుగ, రూపకాలుగా మల్చుకొని కవితను నడపడం గమనించవచ్చు.
''పరిచిన పచ్చిటుకల్ని ఎండబెట్టడానికి
సూర్యుణ్ణి కూడా పనిలోకి పెట్టుకుంటారు'' (మట్టిగంధం- పు.138)
ఇటుకల్ని ఎండబెట్టడం అనే విషయాన్ని చెప్పడానికి ''సూర్యుణ్ణి పనిలోకి పెట్టుకుంటారు'' అనే గొప్ప ఊహ చేత ఇది కవిత్వమయ్యింది. ఇటువంటి సందర్భాలు చాలా కనిపిస్తాయి ఈ సంపుటిలో.
బహుజన బతుకుల్ని కవిత్వం చేసిన ఈ కవి తన తల్లిశ్రమను చూడలేక 'అమ్మలా ఓ రోజు' పనులు చేస్తాడు. బహుజనుల్లో స్త్రీ పనులు, పురుష పనులు అని పెద్దగా తేడాలుండవు. మెట్టాలాగ 'అమ్మలా ఓ రోజు' బతకడం ఎంతో అపురూపమైనది. ఇటువంటి ఎన్నో అపురూప జ్ఞాపకాలను కలిపి కుట్టిన కవిత్వ సంపుటి 'మనిషొక పద్యం'.
చాకిరేవులో తెల్లని కొంగల్ని చేసి ఎగరేసిన బట్టల్లాగే మెరుస్తుంటాయి ఇతని అక్షరాలు. ఒక్కొక్క ఉతుకుకు రాలిపడే చెమట బిందువుల్లాగే నిజాయితీగ మాట్లాడుతాయి ఇతని వాక్యాలు.
''ముట్టుకుంటే తగలాలి కవిత్వం మనిషిలాగ'' అని ఎన్ .గోపి గారన్నట్లు అచ్చంగా అటువంటిదో వుంది ఈ 'మనిషొక పద్యం'లోని కవిత్వమంతా. బతుకును పద్యంగ మలిచిన మెట్టానాగేశ్వరరావుకి శుభాకాంక్షలు.
- తగుళ్ళగోపాల్,
9505056316