Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవిత్వమంటే జీవితం. కవి వాస్తవం. ప్రతిభా వ్యుత్పత్తభ్యాసాల మాట పక్కన పెడితే ఒక సంఘటనో, దృశ్యమో, అనుభవమో పదేపదే అదేపనిగా హృదయాన్నో, మనసునో ఉలిలా రక్తస్రావం జరుగకుండా మనకు తెలియకుండానే తొలిస్తే... ఆ దృశ్య సంఘర్షణా రూపానికి లిఖిత రూపమే కవిత్వం. ఇలాంటి సందర్భంలో శిల్పం, వస్తువు అప్రయత్నంగానే ఇమిడి వుంటాయేమో!
ఒక కవితనో, ఒకరి కవిత్వాన్నో నచ్చిందని ఎలా చెబుతాం? ఒక్కొక్క పాఠకుడు కవిత్వాన్నో, కవినో స్వీకరించే విధానం వేరుగా వుంటుంది. ఒక్కొక్కసారి కవిత మొత్తం నచ్చకపోవచ్చు. ఒక పదబంధమో, వాక్యమో, ప్రారంభమో, ఆఖరికి ముగింపో... ఎక్కడో ఒక్కచోట ఆగి, విపరీతంగా ఆ పదాలకు ఆకర్షితులవుతారు. ఆలోచన మొదలెడతారు. అంతే అక్కడే ఆ కవిని ప్రేమిస్తారు. ఉత్తమ కవిత్వాన్ని కొలిచే తూనికలు, కొలతలు ఖచ్చితంగా ఇంత వరకు ఏవీ లేవు. తుది తీర్పు పాఠకునిదే!
సృజన అంటే ఉన్నది లేనట్లో, లేనిది ఉన్నట్లో చెప్పే అతిశయోక్తి కాదు. సృజనకారుడు ఊహల్లో విహరించే ఉత్ప్రేక్ష అలంకారం కారాదు.
కవి, కవిత్వం సమాజాన్ని ఉన్నదున్నట్లు చూపే స్వభావోక్తి అలంకారం అయి వుండాలి. దర్పణంలా నిజాన్ని ప్రతిబింబించాలి. ఈ నేపథ్యంలో ఎలాంటి అతిశయోక్తులు, 'ఉత్ప్రేక్షలు లేని వాస్తవ కవిత్వంతో కొండి మాల్లారెడ్డి చేస్తున్న రెండో అలికిడే 'ఇప్పుడు వీస్తున్న గాలి'. నిజానికి ఇప్పుడు, ఇక ముందు వీయాల్సిన గాలి కూడా ఇదే!
జీవితం, వాస్తవికత లేని కవిత్వం ఎప్పటికీ ప్రాణం లేని శరీరం లాంటిదే. నిర్భీతి, సరళత్వం, సూటిదనం, స్పష్టత వుండి ఒక పద్ధతి ప్రకారం తాననుకున్న సిద్ధాంతానికి కట్టుబడి కవితాసేద్యం చేస్తున్న తెలంగాణ కవులలో 'గట్టికవి'గా కొండిమల్లారెడ్డి ముందు వరుసలో వుంటారు.
పుట్టిన ఊరు, పరిసరాల ప్రభావం ఎంతటి వారికైనా తప్పవు. మూలాల్ని మరచి ఎవ్వరైనా నేల విడిచి సాము చేయలేరు. చేయొద్దు కూడా. కొండి మల్లారెడ్డి కూడా ఊరు, నేల, వ్యవసాయం, రైతు, పాడిపంట, ప్రపంచీకరణ, భూసేకరణ వంటి అతి ముఖ్యమైన వస్తువుల్ని తన కలం ద్వారా సృజించారు. నేల విడిచి ఊహల్లో విహరించే కవిత్వం పునాది లేని ఇల్లులాంటిదని చెప్పకనే చెప్పారు.
కొండి మల్లారెడ్డి కవిత్వ చెట్టులో పుష్కలమైన సామాజికత, వాస్తవికత, స్థానికత, అవసరమైన సందర్భంలో ధిక్కార స్వరము కనిపిస్తుంది. నిఖార్సయిన కవి ఎప్పుడూ ప్రజల పక్షమే. పాలకులకు ప్రతిపక్షమే. లొంగి పోవడం, వంగి వంగి నడవడం ఈ కవికి తెలియవు. తెలిసిందల్లా ఉన్నదున్నట్లు కుండ బద్దలు కొట్టడమే!
కవి ఊరుచుట్టూ, పని చేస్తున్న ప్రదేశాల చుట్టుపక్కల సాగునీటి ప్రాజెక్టుల పేరుతో భూసేకరణ జరుగుతుంది. చాలా వరకు జరిగింది కూడా. ఈ నేపథ్యంలో తరాల చరిత్ర గల ఊళ్ళు ముంపునకు గురై రైతులు, ఆధారిత కూలీలు, వృత్తి పనివాళ్లు నిర్వాసితులవుతున్నారు. 'ఊరంటే కన్నతల్లినే కన్నతల్లి'. మన జయాపజయాల్ని, ఎత్తుపల్లాల్ని తనలో ఇముడ్చుకుని అక్కున చేర్చుకున్న ఊరు కళ్ళముందే ముంపు పేరుతో మునిగిపోతుంటే ఉన్న ఊరు ఇడ్సిపెట్టలేక, ప్రభుత్వంతో కొట్లాడే శక్తి, ఐక్యత లేక బాధపడే సందర్భంలో కవి ఇలా ఆత్మస్థైర్యాన్ని నూరిపోస్తారు.
''గూడు ఖాళీ చేయిస్తే
గువ్వలు బెదిరిపోతాయనుకోవడం
ఒక భ్రమ!
సామూహిక గానమై
సరికొత్తగా నిర్మించుకోవడమే
ఇప్పటి కళ!!'' (కన్నీటి భాష - పేజి.25)
కవి ఆత్మవిశ్వాసంతో నిర్వాసితుల తరపున కన్నీటి భాషను ఆలపిస్తారు.
వాస్తవానికి భూసేకరణ చట్టాలు, నిర్వాసితులపై ప్రభుత్వాలు, పాలకుల ప్రేమ గట్టు దాటేవరకే. వెంపలిచెట్టుకు నిచ్చెనేసినట్లు చేసే వాగ్దానాలు అన్నీ నీటి మూటలే. క్షేత్రస్థాయిలో ప్రభుత్వాలు, ఇల్లు భూములకు ఇచ్చే పైసలతో ఇల్లుకు ఇల్లు గాదు, భూమికి భూమి రాదు. ఏరు దాటినంక తెప్ప తగలేసే పాలకపక్షాల వైఖరిని తూర్పారపడ్తూ నిర్వాసితుల తరపున భరోసా కవనం చేస్తున్నారు.
కొండి మల్లారెడ్డి కవితను ప్రారంభించే ఎత్తుగడ, దాన్ని గొప్పగా నడిపే తీరు, అన్నింటికన్నా ముగింపు చాలా చైతన్యవంతంగా, స్ఫూర్తిదాయకంగా వుంటుంది. పదాల విరుపు కూడా ఆలోచింపచేసేదిగా వుంటుంది. అందుకే మల్లారెడ్డి శైలి ఆధునికులలో భిన్నమైనది. వీరి మొదటి సంపుటి 'అలికిడి', మలి సంపుటి 'ఇప్పుడు వీస్తున్న గాలి' కవితలన్నీ తనని ప్రజాకవిగా నిలబెట్టాయి. తన ప్రతీ కవితలో అత్యద్భుతమైన సామాజికత వుంటుంది.
''తెల్లవారితే
ఏ పిట్ట ఏ చెట్టుమీద వాలుతుందో
వీడని సందేహం!
ఏ బతుకు
ఎక్కడ తెల్లవారుతుందో
తెలియని సంశయం'' (మృత్యుపత్రం - పేజీ 46)
కవి పై కవితా పంక్తులతో సందేహాత్మకంగా కవితను ప్రారంభించి సెజ్లు, స్పెషల్ జోన్లు, పరిశ్రమలు, ప్రాజెక్టుల కింద ఊళ్ళకు ఊళ్ళు శకలాలై విడిపోయాయన్న విషయాన్ని తెగిపోని నిరంతర ధారతో కవితను నడిపిస్తూ...
''నిలువెల్లా విధ్వంసమై
నిర్లక్ష్యంగా
తరిమేయబడుతూ
కళ్ళముందే కనుమరుగవుతున్న
ఈ దేశపు పట్టుగొమ్మలు!'' (మృత్యుపత్రం - పేజీ 46)
ఈ దేశపు పట్టుగొమ్మలైన పల్లెలు కళ్ళముందే ఎలా విధ్వంసమవుతున్నాయో ఆర్తిగా కవి ముగిస్తూ, మన చెంప చెళ్ళుమనిపిస్తారు. పాఠకున్ని. సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ ఈ దేశానికి ఎన్నటికైనా ఇంత తిండి పెట్టేవి పల్లెలేనంటూ భవిష్యత్ మార్గదర్శనం చేస్తారు.
ఇంకా చెప్పాలంటే ఏ కవినైనా, ఎంతటివారినైనా ప్రభావితం చేసేది స్థానికత. తాను వుంటున్న పరిసరాలు, ప్రదేశాలు, అనుభవాలు, అప్రయత్నంగానే కవిని కవిత్వంలోకి తీసుకొస్తాయి. ఈ నేపథ్యంలో కవి సృజించిన అత్యద్భుత కవిత 'అంబేద్కర్ చౌరస్తా'.
''గుమ్మడి పువ్వు చుట్టూ
గునుగుపూలు పేర్చినట్టు
నాల్గు రెక్కలు
తొడుక్కున్న క్షేత్రం
నేలమీద వాలినట్లు
ఊరి జీవనాడి కూడలి!'' (అంబేద్కర్ చౌరస్తా - పేజీ 128).
ఈ కవితలో నాణ్యమైన ఉపమాలంకారాలతో కవి మనం చూడని 'అంబేద్కర్ చౌరస్తా' సిద్ధిపేటను మన కళ్ళముందు సాక్షాత్కరింపచేస్తారు.
అంతే కాకుండా 'ఖడ్గస్పృహ' కవిత ద్వారా కవి భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు, తరాలకు వారధిగా వుంటూ సమాజాన్ని అప్రమత్తం చేయాలని, కవి కర్తవ్యాన్ని గుర్తుచేస్తూ, కవి చేయాల్సిన పని ఇంకా ఎప్పటికీ మిగిలే వుంటుందని తెలియజేశారు.
మల్లారెడ్డి ప్రతి పదమూ, పాదమూ, కవితా స్పృశించతగ్గదే! అభినందించదగ్గదే. సమస్యలపై తన అక్షరాలతో నిరంతర 'అలికిడి' చేస్తూ, పదునైన పదజాలం, పాఠకాకర్షణ తీరు కల్గిన కొండి మల్లారెడ్డి కవితల చైతన్య గాలి ఇంకా మరింత బలంగా విరియాలని అభిలషిస్తూ అభినందనలు.
- అశోక్ అవారి,
9000576581