Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవిత్వం చదివేవాళ్ళలో ఒకకాలంలో నీతి ప్రధానమైన కవనానికి విలువనిస్తే, ఈ కాలానికి సామాజిక ప్రయోజనం నిలబడుతుంది. కాని వీటన్నిటి పక్కనుంచి ఎప్పటికీ పాయగా ప్రేమ కవిత్వం ప్రవహిస్తుంది. మన చేతిలో ఉన్న డా. బాలకష్ణ ''కలల గూడు'' అలాంటిదే. ఇక్కడ సాహిత్యార్థంలో ''కల'' అంటే తానుగా ఊహించుకున్న, మానసికంగా రూపొందించుకున్న గూడు అని. ''గూడు'' అనే పదానికి కూడా ప్రేమలో ఒక ప్రాధాన్యం ఉంది. సాధారణంగా గూళ్ళలో పక్షులుంటాయి. ఎప్పుడైనా పక్షులే ప్రేమకు ప్రధాన ఆకరాలు. ''ప్రేమ పక్షులు''లాంటి పదబంధాలు, సమాసాలు సాహిత్యంలో మరో ప్రాణితో కనిపించవు. ఆ గూడులో మొదలు తనూ, తన ప్రేయసి ఆ లోకం అందించిన పిల్లలు తరువాత. అందువల్ల ''కల'' ''గూడు'' రెండు పదాలు ప్రేమకు, ప్రేయసీ సంబంధమైన ఊహాభావనలకు ప్రధానక్షేత్రాలు. ఈ ''కలల గూడు'' చేస్తున్నదీ ఇదే.
అన్నమయ్య వర్ణించిన కీర్తనల దగ్గరనుంచి ఈ ''కలల గూడు'' దాక ఎంతో ప్రేమ కవిత్వం. ఇది సహచర్యాన్ని కోరుకుంటుంది. ఒంటిగానైనా సరే దాన్ని అనుభవిస్తుంది. దానికోసం తపిస్తుంది. ఇలా బంధింపబడిన సందర్భాలు ఈ కవిత్వంలోనూ ఉన్నాయి.
1. ఎవరివో చూపులు /పాటలై నను వెంటాడుతున్నాయి
ఏ నీలి ముంగురుల పరదాల మాటునుండో/రువ్వుతున్న చిరునవ్వుల నెలవంకలు/హదయాన్ని సుతారంగా కోస్తూ అతుకుతున్నాయి-(చిరునవ్వుల నీడలు.30)
2. తను వెళ్ళిపోయింది / మళ్ళీ వస్తానని చెప్పకుండానే / కళ్ళచివరనుండి జారిపడిన గులాబీలను / తాజ్ మహల్ ముంగిట్లో పరవమని చెప్పి / పెదాలపై నిత్యారుణ గీతాన్ని / మల్లెపూవంత స్వచ్ఛంగా పాడుకుంటూ / చీకటి తరిమిన సాయంత్రంలా వెళ్ళిపోయిందామే'' - (తను వెళ్లిపోయింది.27.)
3. ఇప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉన్నాను / నేనెప్పుడు నీ వాకిట్లో మనసు పారేసుకున్నానోనని / నాకంతా కొత్తగానే ఉంది / నీ పవిత్ర పరిష్వంగంలో కాలం తెలియకుండానే జారిపోతోంది'' -(నువ్వు మాత్రమే.46)
ఇలాంటివన్నీ బాలకష్ణ కవిత్వంలో పైన చెప్పిన చేష్టల ఫలితాలే. కేవలం చేష్టనే గమనించలేదిక్కడ కవి. వాటిని హదయ పర్యంతం సుతారంగా అనుభవించాడు కాబట్టే భావుకుడిగా బయటి కొచ్చాడు. చూపులు పాటలై వెంటాడడం. నీలి ముంగురుల పరదాల మాటున నవ్వుల నెలవంకలను రువ్వడం వల్లనే ఈ భావుకత కవిత్వమౌతుంది. ఈ వాక్యాలన్నిటిలోనూ బాలకష్ణ ఒక సందర్భాన్నో, సంఘటననో ఆనుకుని అందులో ప్రత్యేకవ్యక్తి చర్యలను లేదా కదలికలను కళగా మారుస్తున్నారు. ఆ అనుభవాన్ని చెప్పడానికి కొన్ని ఆకారాలను, ప్రతీకలను వెదుక్కుంటున్నాడు. ఇలాంటి పని 'ఎక్ఫ్రాస్టిక్ కవిత' (Ekphrastic poem) చేస్తుంది.
ఎక్ప్రాస్టిక్ కవిత ఒక దశ్యము యొక్క ప్రకాశవంతమైన వర్ణన లేదా అతి సాధారణంగా కళాసంబంధమైన పని. ఒక శిల్పం లేదా చిత్రం యొక్క కదలికలను ఊహాత్మక చర్యల ద్వారా లేదా ప్రతిఫలనాల ద్వారా చెప్పడం. ఒక్కోసారి కవి దాని (ఊహ, లేదా ప్రతిఫలనం యొక్క) అర్థాన్ని విపులీకరించవచ్చు విస్తరించడమూ చేయవచ్చు.
బాలకష్ణ కేవలం చర్యను గమనిస్తే దానిని చెప్పి ఊర్కోవటం జరిగేది కాని దానిని ఊహాత్మకంగా చెప్పడం, ప్రతిఫలనాలను చెప్పడం వల్ల ఈ వాక్యాలన్నీ కవితలయ్యాయి. స్త్రీ,పురుషుల మధ్య ప్రేమ, ఆనందం, సౌందర్యం లాంటివాటిని చెప్పడంవల్ల మాత్రమే ఇది ప్రేమకవితగా కనిపిస్తుంది. పై వాక్యాలలో ఒకటి, మూడులలో ఊహా, రెండవదాన్లో కథనం ఉంది. ''వెంటాడుతున్నాయి''లో ఊహ ఉంది. వాస్తవంగా వెంటాడినట్టులేదు. ఒక ప్రేయసిని ఊహించి లేదా ఎవరినైన ప్రతిఫలించవచ్చు కూడా ఆ రూపంలో. ఒక కవితలో ''రావే గౌరి'' అంటూ వాడారు కూడా. గౌరి వాస్తవమా, ఊహనా అన్నది అప్రస్తుతం. ఆ రూపం వెంటాడుతున్నది. అది ఊహాత్మకంగా. దాన్ని వ్యక్తం చేయడానికి కవి తోడు తెచ్చుకున్నది మిగతా వాక్యాలను. నిజానికి ''ఎవరివో ఆ చూపులు పాటలై నను వెంటాడుతున్నాయి'' దగ్గరే చెప్పాల్సిన ఊహ లేదా వాస్తవము పూర్తయింది. మిగతాదంతా కవి వికసింపచేసిన భావన. మూడులోనూ ఇలాగే కనిపిస్తుంది. ఇందులో తానుగా చేసిన పనిని ఊహాత్మకంగా చెప్పడం కనిపిస్తుంది.
ఈ చెప్పడం రెండులో కొంత వైవిధ్యమైంది. అంశం మొదటి రెండు వరుసల్లోనే పూర్తయింది. దాన్ని ఊహాత్మకంగా విస్తరించాడు. ఇందులోనూ కథనముంది.
''తను వెళ్ళిపోయింది / మళ్ళీ వస్తానని చెప్పకుండానే / కళ్ళ చివరనుండి జారిపడిన గులాబీలను / తాజ్ మహల్ ముంగిట్లో పరవమని చెప్పి / పెదాలపై నిత్యారుణ గీతాన్ని / మల్లెపూవంత స్వచ్చంగా పాడుకుంటూ / చీకటి తరిమిన సాయంత్రంలా వెళ్ళిపోయిందామె''
కళ్ళ చివర నుండి జారిపడిన గులాబీలను తాజ్మహల్ ముంగిట్లో పరవమనటం - కల్పన.. కాని ఇది ప్రేమ గురించిన పూర్వ జ్ఞానం చేసింది. లేకుంటే తాజ్ మహల్ ప్రస్తావన లేదు. మల్లెపూవులు పాడటం, కళ్ల నుండి గులాబీలు రాలటం ఇవన్నీ నైరూప్య భావనలు. ఊహలు. వీటిద్వారానే తన మనసులో కలిగే భావన, అసంతప్తి, ఆలోచనకు రూపమివ్వగలిగాడు కవి. బాలకష్ణ కవితలో ఒక రూపం చేసే పనిని గమనించడం, దాన్ని ఊహాత్మకంగా విస్తరించడం ఈ రెండే బాగా ఆకర్షించి చదివిస్తాయి.
కవికి అధ్యయనముందని ఆయన వాక్యాలే చెబుతాయి. అనేక ఖండికల్లో ఆనవాళ్ళు కూడా కనిపిస్తాయి.
1. ఏటి గట్టున నీ బావ ఎదురు చూస్తున్నాడు / నీటికి నిను రమ్మని కబురు పంపినాడే గౌరి / ఏటి కలువలెన్నొ ఏరేరి నీకొరకు / నువ్వొచ్చె తొవ్వలో పరచి ఉంచినాడే గౌరి'' - (రావే గౌరి)
2. భూదేవి మనసల్లె / గంగమ్మ సొగసల్లె / విషమన్నదేలేని పసి పాప వయసల్లె (నవ్వు నువ్వు నువ్వు)
ఈ వాక్యాల్లో కనిపించే లయ ''ఎంకి''ని గుర్తుకు తెస్తుంది. వాక్యాల్లో ఆది భాగంలో ప్రాసను అనుసరించడం, వాక్యాల తూగు ఇవన్నీ చూస్తే ఈ లయ ఎంకి పాటలను గుర్తుకు తెస్తుంది. ''ఆమెను చూస్తున్నాను''లాంటి వాక్యాలను, దాని సమానార్థకాలను చూసినప్పుడు ''అద్యాపి తం - చింతయామి'' లాంటి బిల్హణుని ''చౌరపంచాసిక'' గుర్తొస్తుంది. రెండవదాన్లోనూ ఈ లయ కనిపిస్తుంది. ''యమునా తాజ్'' లాంటి కవితలు కూడా ఈ అధ్యయనాన్ని చెబుతాయి. ఈ కవిత్వం నిండా ప్రేమ ఉంది, సౌందర్యం ఉంది, దాని ఆరాధన ఉంది. సమాజంలో నిండుకున్న దాని ప్రతి రూపాలున్నాయి, భావనలున్నాయి. వాటిలోంచి తొంగి చూసే ప్రతీకలున్నాయి. వాటిలో కవి అనుభవించిన పరవశాలున్నాయి. ఒకటి అరా సామాజిక చింతనలా అనిపించే వాక్యాలూ ఉన్నాయి. అయితే కొన్ని సార్లు బాలకష్ణ తనకు తెలియకుండానే సులభ గ్రాంథికంలోకి పడిపోయారు, కొన్ని సార్లు ''తపోఫలం'' లాంటి అవ్యాకరణాలకూ సిద్ధపడ్డారు. అయితే ఇవేవి ఆయన భావనాసంపదను అందుకోడానికి అడ్డుకావు. కాళిదాసు ''ఏకోహి దో షో గుణ సన్నిపాతే నిమజ్జతీందోఃకిరణెష్వివాంకః'' అన్నట్టు అనేక మంచిగుణాలలో ఒకటి అరా దోషాలు చంద్రునిలోని మచ్చలా కలిసి పోతాయి. ఈ ''కలల గూడు''కు స్వాగతం పలుకుతూ...
- ఎం. నారాయణశర్మ,
98483 48502