Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూలాలను మరువని కవి. ఎక్కడ ఉన్నా తన మూలాలను జ్ఞాపకాలుగా పదిలపరుచుకొని, వాటిని అక్షరాలుగా తీర్చుకొని, అందులో తీయదనాన్ని వెతుక్కునే కవిత్వం. ప్రముఖ పరిశోధకులు, విమర్శకులు, అనువాదకులు గంగిశెట్టి లక్ష్మీనారాయణ 'మండువా లోగిలి' కవితా సంపుటి. 'మండువా లోగిలి' ఈ శీర్షికే ఒక గొప్ప దృశ్య జ్ఞాపకం. ఒకప్పుడు ఉండే ఇండ్లను గుర్తు చేస్తాయి. ప్రతి ఇంటి ముందు అరుగులనేటివి సోఫాలు, కుర్చీల వలే పనిజేసేవి. ఇల్లు, అరుగులు, తులసిమొక్క... ఒక దృశ్య రూపంలో ఇంటిని చూపించి, ఆ కాలానికి, ఆ జ్ఞాపకాలకు తీసుకొని పోతాడు కవి. ఊరు, రచ్చబండ, రావిచెట్టు, పోశమ్మతల్లి గుడి... ఎంత అందమైన జ్ఞాపకాలు ఇవి.
''ఒకప్పుడు ఆదరాభిమానాలు
ఇంటిముందు అరుగులు కట్టించుకునేవి''.... పాడి పంటలు, పశువులు అనేవి మన జీవితం, ఇంట్లో ఆడపిల్లలు లెక్క అంటే కవిత్వం అవ్వదు. దానిని ''ఇంటి ఆడబిడ్డల్లా క్రీగంట చూసే ఆవుదూడలు''... అంటాడు కవి. ఒక పల్లె వాతావరణాన్ని చూపించారు. ఇన్ని అద్భుత బంధనాలు ఇచ్చిన ఇల్లును ఎవరు దోచుకున్నారు. సంప్రదాయాలతో సైన్సు కలిపి నిర్మాణాలుండేవి, ఊరుండేది. అట్లాంటి నాగరికతను ఎవరు లూటీ చేసారు అంటాడు కవి. 'భరతర్షి మాతాత' కవితలో కుటుంబం అంటే అమ్మానాన్నలే కాదు, తాత, నాయనమ్మలు కూడా...''నవ రుషి మాతాత/ భారత కర్మ యోగి మాతాత'' అంటూనే అప్పటి పెద్దమనిషి ఆలోచనా విధానం, పరిశీలనా దృష్టిని ఈ కవితలో ''పెట్టిన పంట మీదనే ఆయన దృష్టి/ పెరుగుతున్న పైరే ఆయన ధ్యానం...'' అంటాడు. ఎంతటి తాత్వికతను, ఆత్మీయతను జోడించాడు ఈ కవి.
''ఆరు బయట వెన్నెట్లో ఆయన చెప్పిన కథలు
నన్ను ఆకాశం దారుల్లో తిప్పారు, చుక్కలతో చెలిమి నేర్పించారు..
గణితం కథలు నా జీవితం లెక్కను సరిచూపించారు..'' తాత గురించి వచ్చిన కవితలలో ఇది భిన్నమైనది.
''నా తాత నాకో అద్భుత వీరగాథ/ నేను ఆయన శ్వాసించిన స్వప్నం...'' పూర్వం తాతలు తాము వేసిన నాటకాలలో పద్యాలను అలవోకగా, రాగయుక్తంగా పాడే తత్వాలు... ఎంత అద్భుతమైనవి. నిశ్శబ్ద లోకాన్ని వూహించగలమా! ఒకరోజు బస్టాండ్లో పదిమంది పిల్లలు దూరం నుండి చూస్తే అందరూ దేని గురించో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. దగ్గరకి వెళ్ళి చూస్తే అంతా నిశ్శబ్దం. అందరూ మూగ- చెవుడు పిల్లలు. అప్పుడు అనిపించింది శబ్దంలేని లోకాన్ని ఊహించగలరా! అలాగే శబ్ద కాలుష్యం ఎంత భయంకరమో కూడా చెబుతారు 'శబ్ధం' కవితలో. 'మట్టి తల్లి' కవితలో ఒక గొప్ప తాత్వికతను కవిత్వీకరించిన తీరు ప్రత్యేకంగా ఉంటుంది.
గాలి గురించి చెబుతూ, నా ఊపిరిగా ఉండి నాలో నిండిన గాలి, తనలో భాగం మాత్రం చేసుకోదు. రాయి కాళ్ళకు తగిలి రక్తం కారడం, అప్పుడప్పుడు దానిపై సేదదీరడాన్ని చాల చక్కటి అభివ్యక్తి చేసి, వెంటనే మట్టి అలా కాదు, నన్ను ఎప్పుడూ అంటిపెట్టుకునే ఉంటుంది అంటారు.
''కడదాక నన్ను భరిస్తూనే ఉంటుంది.
కట్టకడపట నన్ను కడుపులో దాచుకొని
కొత్త కొత్తగా మొలకెత్తిస్తూ ఉంటుంది''
చివరగా తనలో కలుపుకుని మొలకెత్తిస్తూ అనడం.... కవిత్వను గొప్ప ఊహాత్మకతతో నడిపించి, మట్టికోసం తాను ఎంతగా పరితపిస్తున్నాడో చెప్పకనే చెప్పి, తాత్వికంగా ముగించాడు కవిత్వం. ఈ మట్టిపై పెంచుకున్న మమకారం అర్థం అవుతుంది. 'శబ్ధ తపస్సులో సముద్రం' సినారె గారిని కలిసినప్పుడు పొందిన అనుభూతిని ఈ కవితా శీర్షికలో తెలియజెప్పాడు కవి. సినారె నుండి తలంచని కవి ఉండరేమో.
''ఎన్ని ధ్వని తరంగాలను సృష్టించి, సంపుటీకరించినా/ ఇంకా శబ్ధంలో తపస్సు చేస్తున్నది'' అంటూ సినారెని ఒక శబ్ధ తపస్సు చేస్తున్న రుషిగా కళ్ళముందు ఉంచారు గంగిశెట్టి లక్ష్మీనారాయణ.
'తెలుగు జాతికుంచె' అంటూ బాపుని అభివర్ణించడం అందమైన చిత్రంలా కవిత ఉంటుంది.
'అక్షరం' అనే కవితలో ఆత్మీయుల శబ్దాన్ని వెతకడమేకాదు, ''నన్ను 'నా' చెర నుండి విడిపిస్తున్నారు'' అంటాడు కవి. 'స్వరం' కవితలో ఫోను ఉపయోగం అనేది కాలంతో పాటు వచ్చిన మార్పులను స్వీకరిస్తూ ఫోనుల పాజిటివ్ ఉపయోగాన్ని చూపారు.
అటు అనుభవాలు, అనుభూతుల కలయిక, ఇటు ఆధునికత, ఆధ్యాత్మికత అల్లికలతో వెలసిన గంగిశెట్టి లక్ష్మీనారాయణ కవిత్వాన్ని ఆస్వాదించవలసిందే!
- సిహెచ్. ఉషారాణి,
9441228142