Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తనకు అవసరమైన రచయితల్ని సమాజమే తయారు చేసుకుంటుంది. సమాజంలో పలు ఒత్తిళ్ళకు, బాధలకు లోనయినవారంతా రచయితలు కాలేరు. కానీ వారి సంవేదనలకు రూపం ఇచ్చే సృజనశీలురు వారి గొంతుక అవుతారు. వారి జీవిత ప్రయాణంలోని కడగండ్లకు, పోరాటాలకు చిత్రిక పడతారు. దీనికి తగిన పూర్వరంగం ఆ సమాజమే సమకూరుస్తుంది. అందుకే కొందరు రచయితలు భిన్నంగా ఆలోచిస్తారు. సమాజంలో వస్తున్న మార్పుల్ని మామూలుగా తీసుకోకపోవడం నిజమైన రచయితల స్వభావం. ఇలాంటి అసలుసిసలు రచయితలు ఇతరులు ఉపేక్షించే అంశాలపైన దృష్టి పెట్టి సృజన చేస్తారు. మన కళ్ళ ముందర మనకు తెలిసీతెలియకుండానే జరిగిపోతున్న దారుణాలని తమ సృజనతో ఎరుక పరుస్తారు. ఆలోచించక తప్పని అనివార్యస్థితికి పురిగొల్పుతారు. అంతేకాదు, ఒకానొక నిర్దిష్ట కాలంలో, నిర్దిష్ట ప్రాంతంలో మానవుని సంవేదనలు ఎలా ఉన్నాయో తన రచనల ద్వారా తెలియజెబుతాడు రచయిత. తద్వారా చరిత్ర క్రమంలో క్రియాశీల భాగస్వామియై తన సాహిత్యాన్ని చరిత్రకు ఒక బలమైన వనరుగా అందిస్తాడు. ఇవాళ డాక్టర్ శాంతి నారాయణ సరిగ్గా ఇదే పనిచేస్తున్నారు.
కథకునిగా, కవిగా, నవలాకారునిగా, వ్యాసకర్తగా బహుళ ప్రక్రియల్లో కృషి చేస్తున్న శాంతినారాయణ వచన రచనలు రాయలసీమ, ప్రత్యేకించి అనంతపురం సామాజిక చరిత్రకు మంచి ఉపకరణాలు. ఆయన రాసిన కథలు, పెన్నేటి మలుపులు నవల చదివితే రాయలసీమ జనజీవితం బోధపడుతుంది. రాయలసీమ జీవితంలోని సూక్ష్మకోణాలు ఎన్నో ఆయన కథలు రూపుగట్టిస్తాయి. 'పెన్నేటి మలుపులు' ఆ ప్రాంత జనజీవన గమనాగమనాల్ని పట్టి చూపుతుంది.
జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురవుతున్నా, వాటిని తట్టుకుంటూనే తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు శాంతినారాయణ. సమాజం పట్ల, సాహిత్యం పట్ల మరింత ప్రేమతో తన సృజనాత్మక వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు. ఇపుడు వారు వెలువరించిన 'నాలుగు అస్తిత్వాలు-నాలుగు నవలికలు' పుస్తకం ప్రత్యేకమైంది. ఎవరి అస్తితాన్ని గురించి వారే రాయాలనేం లేదు. రాయగలిగితే మంచిదే. కానీ ఇతరులు రాయకూడదన్న నిబంధనలేం లేవు. నిజానికి ఇవాళ్టి సంక్లిష్ట సామాజిక సందర్భంలో ఎవరయినా ఒకే ఒక అస్తిత్వానికి చెందినవారయి ఉండలేరు. మన జీవితం బహుళ అస్తిత్వాలతో ఏదో రూపంలో సంబంధం కలిగి ఉంటుంది. అనేక అస్తిత్వాల పరివేదనని అనుభవించడం అత్యాధునిక మానవుని స్థితి. ఈ దృష్టితో చూసినపుడు శాంతినారాయణ నాలుగు అస్తిత్వాలకు సంబంధించిన ఇతివృత్తాల్ని తీసుకోడం ఆశ్చర్యకరం కాదు.
'వెట్టికి వెట్టి' దళితవాదానికి, 'కంచం మీద కట్టడి' బహుజనవాదానికి, 'నూర్జహాన్' మైనారిటీ, స్త్రీవాదాలకి, 'రక్షకతడులు' ప్రాంతీయ అస్తిత్వ చైతన్యానికి దగ్గరగా ఉన్నాయి. ఈ నాలుగు అస్తిత్వాల నేపథ్యంలో అనంతపురం జిల్లాలోని పరిస్థితినీ, రాయలసీమలోని సంఘర్షణపూరితమైన బతుకుతీరును దర్శింపజేశారు రచయిత.
***
ఏడు దశాబ్దాల స్వాతంత్య్రానంతరం కూడా దళితులు అణచివేతకు గురవుతున్నారు. రాయలసీమలో ఇది కొట్టవచ్చినట్టు కనిపించే అంశం. అనంతపురం జిల్లా వెంకటాంపల్లిలోని మాదిగవాడలోని మాదిగల చేత వెట్టిచాకిరి చేయించుకుంటున్న భూస్వాముల అగడాలను, దౌష్ట్యాలను చిత్రించిన నవల 'వెట్టికి వెట్టి'. అప్పు ఉన్నారనే నెపంతో దశాబ్దాల తరబడి తాతలు, తండ్రులు, కొడుకులు అంతా భూస్వాముల దగ్గర వెట్టిచాకిరి చేయాల్సివచ్చిన దారుణాన్ని చూపిన నవల ఇది. ఇంతటి దారుణం ఇప్పటికీ కొనసాగుతుందా అనే ఆశ్చర్యం కలుగుతుంది ఈ నవల చదువుతుంటే. కాని అది కఠోర వాస్తవం. నమ్మకతప్పని చేదు నిజం. అంబేద్కర్ దళితులకు రిజర్వేషన్లు కల్పించినప్పటికీ రాయలసీమ గ్రామాల్లోని దళితుల జీవితంలో పెద్దగా మార్పులు రాలేదు. భూస్వాముల దుర్మార్గాలకు అంతులేదు. ఈ వాస్తవాన్ని చెబుతూనే, ఆ వెట్టి నుంచి మాదిగలు విముక్తమయిన సంవిధానాన్ని చెప్పిన తీరులోనే ఆకర్షణ వుంది.
'వెట్టికి వెట్టి'లోని సన్నివేశాల కల్పన, పాత్రల సృష్టి, కథనరీతి రచయిత ప్రతిభకు నిదర్శనం. ముఖ్యంగా అనంతపురం పల్లెల్లోని మాండలికాన్ని సజీవమైన రీతిలో వాడుకున్నారు. బైరాగి పాట, మొలకల పున్నమి నాటి సామూహిక విందు, వెట్టి చేయించుకోడానికి రెడ్డి, కమ్మ భూస్వాములు మాదిగలను పంచుకోడం, అతికారుచౌకగా వారి శ్రమని కొల్లగొట్టే కుతంత్రం ఎంత పకడ్బందీగా సాగుతుందో చెప్పారు.
***
మనుషులు తమ మానాన తాము బతుకుతున్నప్పటికీ రాజ్యం పెత్తనం చెలాయించి వారి బతుకులతో చెలగాటమాడే కుతంత్రాన్ని విప్పి చూపిన నవలిక 'కంచం మీద కట్టడి'. 'సిరివరం మీట్ మార్కెట్' అనేది ట్యాగ్లైన్. మాంస విక్రయ కేంద్రంగా పేరుబడిన సిరివరం గ్రామపంచాయితీ పరిధిలోని పల్లెల్లో అన్నిరకాల కులాలవాళ్ళు ఉంటారు. వ్యవసాయంతో పాటు ఎవరి కులవృత్తి వాళ్ళు చేసుకుంటున్న నేపథ్యంలో తలెత్తిన ఘర్షణలకు మూలాలు ఎక్కడున్నాయో రచయిత చెప్పారు. గోపరిరక్షణ పేరుతో ఎద్దుమాంసానికీ వ్యతిరేకంగా సంఫ్ుపరివార్ లేవనెత్తిన వాదనలు, నినాదాలు సిరివరం మార్కెట్ను ఎలా కుదిపివేసాయో, వాటిని తట్టుకుంటూ అక్కడి జనం ఎలా సంఘటితంగా నిలబడ్డారో చెప్పడం ఈ రచన ప్రత్యేకత.
ఇది ఒకవిధంగా ప్రతీకాత్మక రచన. హిందూత్వ భావజాలాన్ని నిరసించే సృజనాత్మక ప్రతిఘటన. హిందువుల ఓట్ల కోసం కాషాయపరివారం పన్నిన కుట్రలో ఎన్నో ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. సామరస్యంగా సహజీవనం చేస్తున్న వారి మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరు ఏం తినాలో చెప్పడానికి మీరెవరని మతోన్మాదుల్ని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఈ రచన వచ్చింది. 'కంచం మీద కట్టడి' అనే శీర్షిక అర్థవంతంగా ఉంది. మనం ఏం తినాలో, ఏం తినకూడదో చెప్పడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించే రచన ఇది. ప్రశ్నల్ని ఇష్టపడని పాలకవర్గాలపై సంధించిన నిరసనాస్త్రం 'కంచం మీద కట్టడి'.
హిందూ ముస్లింల మధ్య ఐక్యతని దెబ్బతీసే మతోన్మాదులు హేతువును అంగీకరించరు. విద్వేషాన్ని రెచ్చగొట్టి సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తారు. ఇది వారి ఎజెండా. ఈ ఎజెండాలో భాగం కాకుండా వారిని ఏకాకుల్ని చేసి, తమని తాము ఎలా కాపాడుకోవాలో ప్రజాస్వామ్యవాదులు, ఆలోచనాపరులు చేయాల్సిన పని. మీట్మార్కెట్ మీద దాడి చేసిన వారి పన్నాగం నెరవేరకుండా చేయడంలో నవలలోని శ్రీనాథశాస్త్రి చూపిన వివేచన, చైతన్యం గమనార్హం. మత, కుల ప్రాతిపదికన సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలనే వారి కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న సూచన ఈ పాత్ర ద్వారా తెలియజేస్తారు రచయిత. బహుళ కులాలు, మతాలు ఒకచోట కూడివుండటం సాధ్యమేనని సిరివరం గ్రామ పంచాయితీలోని పల్లెలు నిరూపిస్తున్నాయి. బహుజనుల ఆకాంక్షలకు అనుగుణంగా సమాజం మరింత మెరుగుపడాల్సిన అవసరాన్ని చెబుతుందీ రచన.
***
మైనారిటీవాదం, స్త్రీవాదం కలగలసిపోయి వ్యక్తమైన నవలిక 'నూర్జహాన్'. అనంతపురం జిల్లా కదిరి ప్రాంతం కేంద్రంగా కొనసాగిన ఈ రచనలో 'నూర్జహాన్' ప్రధాన పాత్ర. పోలీసుల చేత దారుణంగా అత్యాచారానికి గురయి ఆసుపత్రిలో చేర్చబడిన ఆమె జ్ఞాపకాల నుంచి కథ మొదలవుతుంది. పోలీసుల దాష్టీకాన్ని నిరసిస్తూ మహిళా సంఘాల వారు ఆమెకు అండగా నిలబడటంతో నవల ముగుస్తుంది. అయితే ఆమె నలభై ఏళ్ళ జీవితంలో ముఖ్యంగా పాతికేళ్ళ బతుకులోని పలు పార్శ్వాల్ని ఈ నవలలో చిత్రించారు రచయిత. నూర్జహాన్ జీవితంలో తండ్రి సయ్యద్, మామ అక్బర్, భర్త అన్వర్, కొడుకు సలీం, కోడలు షకీల పోషించే పాత్ర ఎలాంటిదో రూపు కట్టిస్తారు. ఆధిపత్య రాజకీయాలు స్త్రీల శరీరాలతో ఆడుకునే దుర్నీతిని చూపారు.
ఆత్మగౌరవానికీ ప్రతీకగా నూర్జహాన్ పాత్రని చిత్రించారు రచయిత. ఒడిదుడుకుల్ని తట్టుకుంటూ జీవితానికి ఎదురీదిన నూర్జహాన్ మహిళలలో దాగుండే ప్రబలశక్తికి ప్రతీకగా నిలిచిపోతుంది. అయితే పరిస్థితుల ప్రాబల్యం ఆమె మనోదారుఢ్యాన్ని దెబ్బతీస్తుంది. పరిస్థితుల ఒత్తిడికి లొంగిపోవాల్సి వస్తుంది. అయితే ఆ లొంగుబాటు తన కోడలి జీవితాన్ని కూడా నాశనం చేసే రీతిలో ఉన్నపుడు ప్రతిఘటిస్తుంది.
వ్యవసాయంలోని ఒడిదుడుకులు, లిక్కర్ బిజినెస్, 1994 నుంచి మారుతూ వచ్చిన రాజకీయాలు బతుకుల మీద పెంచే ఒత్తిడి మొదలైన అంశాల్ని స్పృశించారు రచయిత. దాదాపు మూడు దశాబ్దాల పరిణామక్రమం నూర్జహాన్ జీవితచిత్రణతో పాటు రూపుగట్టిందీ నవలలో. కాంగ్రెస్, తెలుగుదేశం, బిజెపి, వైసిపి పార్టీల రాజకీయ ధోరణులు... వాటికి బలయ్యే అన్వర్ లాంటి అమాయకులు, వారిని నమ్ముకున్న స్త్రీల జీవితాల్లోని అలజడి, సంక్షోభపు తీవ్రతని రచయిత ఆర్త్రమైన రీతిలో అక్షరీకరించారు. ప్రాంతీయ రాజకీయాలు, ఆర్థికపరమైన ఒత్తిళ్ళు మహిళల బతుకుల్లో సృష్టించే కల్లోలానికీ, సంక్షోభానికీ చిత్రిక ఈ నవల. తన చుట్టూ ఉండే జీవితం పట్ల రచయిత సృజనాత్మక స్పందనకు తార్కాణం 'నూర్జహాన్'.
***
నీళ్ళకోసం అనంతపురం రైతులు చేసిన, చేస్తున్న పోరాటం అలవికానిది, అలుపులేనిది. ఈ నేపథ్యాన్ని తీసుకొని వ్యవసాయాన్ని నమ్ముకున్న సుజాత అనే మహిళ కేంద్రంగా రూపుదిద్దుకొన్న నవలిక 'రక్షక తడులు'. ముద్దలాపురం అనే గ్రామం కథ నడిచే ప్రాంతం. ఈ గ్రామానికి చెందిన రామానాయుడు సుజాత మామయ్య. రామానాయుడు తండ్రి వెంకట్నాయుడు. అతను కమ్యూనిస్టు యోధుడు తరిమెల నాగిరెడ్డి అనుచరునిగా భూస్వాముల దౌష్ట్యాలకు వ్యతిరేకంగా పోరాడినాడు. ఆ వారసత్వపు విలువలే పునాదిగా తన జీవితాన్ని నెట్టుకువస్తున్నాడు రామానాయుడు. ఇతని కొడుకు కార్తీక్ సుజాత భర్త. భార్యాభర్తలు ఇద్దరూ చదువుకున్నవారే. కానీ వ్యవసాయం మీద, గ్రామం మీద ప్రేమతో ముద్దలాపురంలోనే ఉంటున్నారు. తొలినాళ్ళలో వ్యవసాయం లాభదాయకంగా ఉంటుంది. కానీ క్రమంగా చెరువులు ఎండిపోవడం, వానలు కురవకపోవడం, కరువు తాండవించడం, హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా వస్తాయనుకున్న నీళ్ళు రాకపోవడంతో వ్యవసాయ రంగం సంక్షుభితమవుతుంది. ఆ ప్రభావం సుజాత కుటుంబం మీద కూడా పడుతుంది. ఈ సంక్షోభం ఆ కుటుంబాన్ని, సుజాత జీవితాన్ని ఏ మలుపులు తిప్పిందో చెప్పడమే ఈ నవల ఇతివృత్తం.
ఈ నవలలో నీటి ప్రాజెక్టుల పేరుతో రచయితల్ని దగాచేస్తున్న రాజకీయాల పట్ల సునిశితమైన విమర్శ ఉంది. రచయిత శాంతి నారాయణకు కృష్ణా జలాల పట్లా, నీటి వనరులపైనా, హంద్రీనీవా రూపురేఖల పట్లా దాని ద్వారా పారే నీళ్ళ పట్ల సమగ్రమయిన అవగాహన ఉందని ఈ నవల తెలియజేస్తుంది. హంద్రీనీవా ప్రాజెక్టు పేరుతో పాలకవర్గాలు ఆడుతున్న నాటకాల్ని చెబుతారు. ఈ ప్రాజెక్టును సరిగా అమలుచేసి గ్రామాలకు నీళ్ళు అందించే విషయంలో చేస్తున్న తాత్సారాన్ని ప్రశ్నిస్తారు.
నీటి సమస్య ప్రస్తావనతో కూడిన ఈ నవలలో రాయలసీమ ప్రాంతీయ అస్తిత్వ సంవేదన ప్రతిఫలిస్తుంది. నూర్జహాన్ నవలలో మాదిరిగానే ఇక్కడా సుజాత బాధితురాలు. ఇద్దరూ జీవితానికి ఎదురొడ్డి పోరాడినవారే. కాని వారి ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసే రాజకీయ, ఆర్థికమూలాలు ఎంత బలీయమైనవో ఈ నవలికలు చెబుతాయి. రెండింటిలోనూ స్త్రీల శరీరాల్ని బలితీసుకునే పురుషాధిపత్యపు క్రూరత్వాన్ని చూస్తాం.
రచయితగా శాంతినారాయణ అంతర్లోకాల అలజడిని పట్టిచూపే నవలికలు ఇవి. వీటిని రాయడానికి ఆయన ఎంతగా కల్లోలానికి లోనయ్యారో ఊహించడం కష్టం. ఎందుకంటే తను సృజించే పాత్రకు కలిగే కష్టం సైతం రచయితని దు:ఖపెడుతుంది. భరింపలేని దిగులుకు లోను చేస్తుంది. తన జీవనానుభవపరిధిలో అన్యాయానికి బలయ్యే మనుషులెందరినో ఆయన చూసి ఉంటారు. కానీ ఆ మనుషుల్ని తన రచనల్లో పాత్రలుగా సృష్టించి లోకానికి పరిచయం చేయాల్సి వచ్చినపుడు పడే వేదన వర్ణనాతీతం. అయితే చుట్టూ ఉండే వాస్తవాల్ని శిల్ప ఔచిత్యానికి భంగం కలిగించకుండా రాయడంలో రచయిత కౌశలం దాగుంది. వాస్తవాన్ని పఠిత హృదయం ద్రవించేలా రాయడం రచయిత అనుసరించే శైలీశిల్పాల మీద ఆధారపడి వుంది. కథనంలో ఎక్కడా రచయిత తొట్రుపాటుకు లోను కాడు. ప్రతి సంఘటన, ప్రతి పాత్ర ఎక్కడ ఎలా ఒదిగి ఉండాలో అలాగే ఉంటుంది. అంతేగాక తను చెప్పదలుచుకున్న విషయాలని సూచ్యప్రాయంగా ప్రస్తావిస్తూనే పాఠకుల్ని కథ వెంట నడిపించుకుపోతాడు.
ఈ నాలుగు నవలికలు ఆయా ప్రాంతాల్లోని నుడికారం, పలుకుబడి, మాండలికపు భాషా సొగసులతో పాఠకులకు చిత్రమైన పఠనానుభవాన్ని అందిస్తాయి. ఆయా పాత్రలు తమదైన సహజమైన భాషనే మాట్లాడతాయి. ఇలా మాట్లాడటమే భాషకీ, మనుషులకీ అందం. 'రక్షకతడులు' నవలికలో ఈ అంశం ప్రస్తావన కూడా ఉంటుంది. తమ నేటివిటీకి తగ్గ భాషనే ఎవరయినా మాట్లాడటం ఎంత మంచిదో చెప్పకనే చెప్పడం విశేషం.
ఈ నాలుగు నవలికల్లో అస్తిత్వ సంవేదన మాత్రమే కాదు, గత నాలుగు దశాబ్దాల కాలాన అనంతపురం జిల్లాలో నెలకొన్న పరిణామాల చరిత్రకు ఆనవాళ్ళున్నాయి. భూస్వామ్యం, రాజకీయం, పెట్టుబడి, పాలకవర్గాల దాష్టీకం జనం బతుకులతో చెరలాటలాడిన తీరును చెబుతాయి ఈ నవలికలు. దేశం ఎంతో అభివృద్ధి సాధిస్తుందని, సాంకేతికంగా పురోగమిస్తుందని చెబుతున్నప్పటికీ రాయలసీమ పల్లెల్లో బతుకు మారలేదు. ముఖ్యంగా మహిళల బతుకు మరింత భయానకం. ఈ వాస్తవాల్ని తెలియజేస్తూ ఆలోచింపజేయడం రచయిత శాంతినారాయణ సాహిత్య సాఫల్యం. ప్రజల మీద, చుట్టూ వున్న జీవితం మీద రచయిత శాంతినారాయణకు వున్న ప్రేమ, నిబద్ధతలకు నిదర్శనం ఈ నాలుగు నవలికలు.
- గుడిపాటి