Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమాజం పరిణామం చెందుతుంది. ప్రతి అంశమూ, ప్రతి వస్తువూ, ప్రతి మనిషీ, ప్రతి సంఘటనా మార్పులకతీతమేమీ కావు. అంటే సాహిత్యం కూడా ప్రతి దశలోనూ అది కొత్త చిగుళ్ళను తొడుక్కుంటుంది. మానవాభ్యుదయాన్ని ఏటికేడు నవ్యరీతిలో కోరుకుంటుంది. అట్లా అలవాట్లను, అభిప్రాయాలను, ఆలోచనలను, వైఖరులను, ప్రవర్తనలను కాలానుగుణంగా సాహిత్యం తనలో ఇముడ్చుకుంటుంది. ఇది ప్రతి సంవత్సరం వచ్చిన కవితలను సేకరించి భావనాశక్తిని, అభివ్యక్తి ధారను పసిగట్టి 2018 సంవత్సరంలో ప్రచురించబడిన కవితలలో అత్యుత్తమమైనవిగా తాను భావించిన అరవై కవితలను 'కవిత్వం - 2018'గా ప్రకటించారు. దీనికి సంపాదకత్వం వహించిన ప్రముఖ కవి దర్భశయనం శ్రీనివాసాచార్య అభిప్రాయపడినట్లు ఇది సర్వ సమగ్ర సంకలనం కాకపోవచ్చు కానీ ఒక కళా క్రమశిక్షణను అలవాటు చేసుకోవడం మాత్రం జరిగింది.
ఈ సంకలనంలో వరవరరావు, శివారెడ్డి, ఎన్.గోపి వంటి చేయి తిరిగిన కవులతో పాటు బండారి రాజ్కుమార్, రేఖాజ్యోతి వంటి వర్దమాన కవులు చోటు చేసుకున్నారు. ఈ అన్ని కవితల్ని (2018) పరిశీలించినట్లయితే కవులు తమ అనుభూతులను, ఆవేశాలను, ఆలోచనలను, ఉద్వేగాలను వారి వారి సహజశైలుల్లో వ్యక్తపరిచారు. స్వేచ్ఛగా రాశారు. సంప్రదాయంగా, నియమబద్దంగా కాక సమాజంలోని ఆవేదనను, ఆర్తిని, నిరాశానిస్పృహలను ప్రకటించారు. కొత్త ప్రతీకలు, కొంగొత్త సమాసాల కూర్పులు, కొత్త భావాలతో అలంకారాలు స్వీయ అనుభవాలు జాతీయాలు, లోకోక్తులు కవిత్వంలో చొప్పించారు. దీర్ఘ సమాసాలు కాక భాష, శైలి, అలంకారాదులను హృద్యంగా చిత్రించారు. వస్తుపరంగా, ప్రక్రియపరంగా, భావపరంగా నూతన పోకడలను నెలకొల్పారు. సమాజంలో మార్పుకై మరింత పరితపించారు. ఇదొక రకంగా 2018 సంవత్సరానికి వచ్చిన కవిత్వాన్ని నెమరువేసుకోవడం, కొత్త కవితా రచనలకై దారులు పరచడం వంటిది.
కవిత్వం 2018, సంపాదకత్వం : దర్భశయనం శ్రీనివాసాచార్య (9440419039), పేజీలు : 136, వెల : 100/-, ప్రతులకు : ప్రధాన పుస్తక కేంద్రాలు.
- కె.హరనాథ్,
9703542598