Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వచన కవిత్వం పూర్తిగా వచనంగా వస్తున్న కాలంలో కొంత మార్మికతతోను, భావుకతతోను పదబంధాల పోహళింపులను సమకూర్చుకు వచ్చిన కవితా సంపుటే బుర్రా లక్ష్మీనారాయణ గారి 'ఇదీ వరస...!'. కవిత్వమే శ్వాసగా, ఔచిత్యాలకు పోకుండా, వాస్తవిక అంశాలను తన కవిత్వంతో రంగరించి మనకు అందించారు ఈ సంపుటిని. వచన కవిత్వం అనేక రకాలుగా అలంకించుకుని తనకు తానుగా భావకుడి చేతిలో పడి అలరిస్తున్నది. కవికి ఇది నిరంతర చర్య. నిత్య వికాసి. తన కవితలో అనేకమైన అంశాలను తీసుకున్నప్పటికిని, వాటిని వాస్తవిక దృక్పథంతోనే విడమర్చినారు. ''ఆలోచన ఆకలికి మూలమైనప్పుడు/ ఆత్మకు పర్యాయం వెదకడమెందుకు? ఎక్కుపెట్టబడ్డ బాణమైనప్పుడు/ వింటినారి గట్టితనం కాదు చూడవలసింది/ అసహాయతను తుదముట్టించే అస్త్రశాస్త్రాలనే'' (నువ్వే. పే. 48).
ఏ సాహిత్య సృజనకైనా మూలం వ్యక్తావ్యక్త జగత్తులతోడి అనుసంధానం. వ్యక్తి చైతన్యం, అవ్యక్త చైతన్యం రెండూ సాహిత్య నిర్మాణంలో అవినాభావంగా ప్రవర్తిస్తూ వుంటవి. సృజనవేళ రచయిత వ్యక్తావ్యక్త చైతన్యాల నడిమి బిందువు నిలిచి వుంటాడు. అందుకు నిదర్శనంగా బుర్రా లక్ష్మీనారాయణ గారు అందిచిన 'ఇదీ వరస...!' కవితా సంపుటి నిలుస్తుంది. ప్రస్తుత సమాజంలో మానవుని ఉనికి నేడు ప్రశ్నార్థకం అయిందని ''....మాటలు కరువైనప్పుడు ఏర్పడేది/ నిశ్శబ్దమందామా? ఉచ్ఛ్వాసనిశ్వాసల మధ్య/ శబ్దంలేకుండా/ నిశ్శబ్దాన్ని పలికేప్పుడు/ కాలనాగు ఉనికి స్ఫురిస్తే...'' (పే.11)లో చెపుతారు.
'స్వాస్థ్యాక్షరి' కవితలో మన ఆలోచనలు, అక్షరాలు చేతనా చేతనల నుండి వ్యక్తావ్యక్తరూపంగా ఎలా వెలువడుతుందో ఇలా చెప్పారు. ''మాసికలేసిన ఊహా పోహలనిర్భర నిశ్వాసనలే/ నిశ్చలన చిత్రంలో ప్రస్ఫుటించే/ నిన్నటి చెకుముకి రవ్వలు/ మాట పొదగని మౌనమంటే/ శ్వాసపొసగని ఆశ్వాసంలో నివురుగప్పిన మొన్నటి జ్ఞాపకం...'', ''నుదుట పులుముకున్న సుశ్మితరేకలు/ నిష్క్రియాంబధి యీవలి ఒడ్డున/ అనుశృతంగా ప్రవహించే గాలి బుడగల మెరుపు/ హస్తాక్షరికైనా... వ్యస్త స్వాస్ట్యాక్షరికైనా...!!''
బుర్రా లక్ష్మీనారాయణ తన ముప్పది సంవత్సరాలలో రాసిన కవితలలో నుండి కొన్నింటిని చేర్చి 'ఇదీ వరస...!' సంపుటిని అందించారు. ఈ కవిత్వం కాస్త నెమ్మదిగా ఆస్వాదిస్తూ, ఆశ్వాశిస్తూ చదవాలి. చిక్కటి పాటు తాగిన అనుభూతి మిగులుతుంది. ఈ కవితా సంపుటి పూర్తి చేశాక కవిత్వ పిపాసులకు ఇది చలివేంద్రమవుతుంది.
- టి.శ్రీరంగస్వామి,
9949857955