Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభాకర్ జైనీ 1989 నుండి కథానికా పాఠకులకు సుపరిచితులే. అయితే, ఈ దశాబ్దంలో అనన్య సామాన్యమైన పాఠకాదరణనీ, ప్రాచుర్యాన్నీ సాధించుకున్న నవలాకారుడుగా, కథకుడుగా చైతన్యయాత్రను సాగిస్తున్న ఒకరిద్దరు ప్రముఖుల్లో ప్రభాకర్ జైనీ ఒకరు. చదివిన చదువుల ద్వారా, చేసిన ఉద్యోగాల ద్వారా, చేపట్టిన ప్రవృత్తి, సాధన వలన అశేష అనుభవాన్ని ప్రోది చేసుకున్నారాయన. ఆయన జీవనరేఖలు చిత్రవర్ణ పట్టకం వంటివి. విజయపరంపర ఒక ప్రత్యేక గ్రంథం. అంటే, విస్తృతమైన జీవనానుభవం, సమాజానుశీలన ఆయన సాహిత్య కృషికి సారవంతమైన క్షేత్రాలైనాయి. అక్కడ నుండి అంది పుచ్చుకున్న ఫలసాయంతో ఇదిగో ఈ 'మీల్స్ టికెట్' కథలు కొన్ని గట్టి గింజలు!
18 మంచి కథల సమాహారం ఈ సంపుటి. వస్తు విస్తృతిలో, వైవిధ్యంలో కథలన్నీ బహుళార్థస్ఫోరకంగా కనిపిస్తాయి.
'మీల్స్ టికెట్' కథానిక ఒక బతికి చెడినవాని కథ. 'కోట్లు మాయమయిపోయినయిరా.. ఒక అమాయకుణ్ణి మోసం చేసి దక్కించుకున్న కోట్లు కాలగర్భంలో కలిసిపోయినరు' అని వగచి కొడుకులు ఇచ్చే 'మీల్స్ టికెట్స్' రెండు పూటలా కడుపు నిండా తిండిని ఇవ్వకపోయినా, ఆ గురుమూర్తి ఆత్మాభిమానంతో, లేక కొత్త జ్ఞానోదయంతో అంటాడు 'నాకు డబ్బులిస్తావారా... వద్దు..... కర్మఫలం అనుభవించాల్సిందే' అని! ఈ కథ ఔన్నత్యానికి, దానిలో మూడు వాస్తవాలు కుదురుకోవటమే. అమాయకుల్ని అన్యాయం చేసి సంపాదించే 'విత్తం' 'నడమంత్రపు సిరి' నిలవదనేది మొదటి గుణపాఠం. కన్నకొడుకులకైనా సరే వట్టిపోయిన గొడ్డు భారమే అనేది రెండవ వాస్తవం. 'చింత చచ్చినా పులుపు చావదు' అనేది మూడవ పునరుక్తి. 'మీల్స్ టికెట్' చదవగానే, 'జీవితంలో తలెత్తే ప్రశ్నలకు కథలు సమాధానం చెబుతాయి' అని రూఢ కలిగింది. ఈ కథలో ఆ సమాధానాన్ని కళాత్మకంగా చెప్పటం జరిగింది. దానికి తోడు అసలు సిసలైన కథాప్రయోజనంగా భావింపబడే 'అనుభూతి'ని ఈ కథానిక ఆర్తితో సాంద్రంగా, గాఢంగా అందించగలిగింది. అసత్యం అనిపించే ఒక సత్యాన్ని స్పష్టంగా ఆవిష్కరించింది.
'పరిష్వంగం' కథ కౌగిలింతలోని ఆత్మీయతనీ, స్పర్శలోని మాంత్రికతనీ సందేశిస్తుంది. 'కొండంత ధైర్యం, చిటికెడంత ఆప్యాయత కావాలంటే, భేషజాలు వదిలేసి ఆత్మీయుల్ని తనివితీరా కౌగిలించుకోండి'! ఇందులో 'భేషజాలు వదిలేసి' అన్న ఒక్క మాటే రచయితగా ప్రభాకర్ జైనీకి కథారచన పట్ల గల ఆరాధనా భావానికీ, పద ప్రయోగంలో గల చిత్తశుద్ధికీ - తిరుగులేని తార్కాణంగా భావిస్తున్నాను. ఆ మాట ఒక్కటీ కోటి 'పద-అర్థాల' పెట్టు!
'సోల్ మేట్' - శీర్షిక వెల్లడి చేస్తున్న భార్యాభర్తల అనురాగ దీపిక. ఒక ప్రేమశకం ప్రస్థానం, ముగింపు గుండె బరువుతో చదువుతాం.
'నగరపు నాగుబాము' - చింతనపరులందరినీ వేదనకు గురిచేస్తున్న నవపట్టణీకరణం సమస్యని పునర్విచారణ సలిపింది.
రచయిత ఆత్మీయతాముద్ర కథానికలో తొంగి చూస్తుందనేది సాధారణ విషయమే. కానీ, ఒక రచయిత రాసిన చాలా కథల్లో ఇది కనిపించటం ఒక అరుదైన అంశం మాత్రమే గాక, ఆ రచయిత స్వీయానుభవాలు ఎంతగా సామాజికపరమైనవో, ఎంతగా పాఠకావశ్యకమైనవో కూడా తెలియచేస్తుంది. 'మీల్స్ టికెట్' సంపుటిలో ఎంతో, ఉచితజ్ఞతతో చోటు చేసుకున్న - 'కొత్తగా రెక్కలొచ్చిన వేళ', 'చెక్ పోస్ట్ బదిలీ', 'ప్రాప్తకాలజ్ఞుడు' వంటి కథలు ఈ వాస్తవాన్ని ధ్రువీకరిస్తాయి.
ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక సదుపాయాన్ని కొందరు అతి తెలివిగా ఎలా దుర్వినియోగం చేస్తారో తెలుపుతుంది 'ఫ్రీడమ్ ఫైటర్' కథ. 'శాంతి పావురం' - హింస ఒక జీవనవిధానంగా ఎలా మారుతున్నదో, పర్యవసానమేమిటో వివరిస్తుంది. తలనొప్పి తనదాకా వస్తే కానీ తెలియదన్నట్లు అస్త్మా రోగి బాధ ఆస్త్మా డాక్టర్ గ్రహించగలుగుతాడు. కథ పేరు 'కాళరాత్రి'
భార్యాభర్తల మధ్య 'ప్రేమ' భావన, 'ఈగో' వాంఛ - రెండూ సమయోచితంగా అవసరమే! విశ్లేషణాత్మక రచన 'డోంట్ వర్రీ.. బీ హ్యాపీ!'
ఇటీవల జైనీ గారికి ఎక్కువ పాఠకాదరణని పంచిన కథ 'సర్దుకున్నారా..?' చక్కటి మనస్తాత్విక కథ. వయసు దృష్ట్యా సంధ్యాసమయంలో జనించే భావపరంపర, ఆర్తి సహజ పరిణామం. ఆ అంశం మీద తెలుగులో శతసహస్ర కథానికలు వచ్చాయి. సాధారణ పాఠకులకు అంతవరకే అమిత తృప్తి. అయితే, ఆ తాత్త్వికత మాత్రమే పెద్ద గొప్ప కథని ఇవ్వదు. ఈ రహస్యం జైనీ గారికి బాగా తెలుసు. ఆ వాస్తవతాత్త్వికతని రచయిత కథాత్మక వాస్తవంగా మలచారు. చివరలో అంత వరకూ - భౌతికాంశాల దృష్ట్యా కూతుర్నీ అల్లుడిని (క్షమించ)(ప్రేమించ) లేని పెద్దాయనకి - బతుకు అర్థము, పరమార్థమూ తెలిసి జ్ఞానోదయమవుతుంది. వెళ్ళి వారిని అక్కున జేర్చుకుంటాడు. తన ఇంటికి ఆహ్వానిస్తాడు. ఆ ఆనందాన్ని భార్యకీ పంచుతాడు. ఇదీ కథలో గుణవిశేషం. ముగింపులో కథలోకి ఒక వ్యక్తి మానసిక పరిణామం, సామాజికంగా వాంఛనీయత కూడా వచ్చి చేరాయి. ఇదీ వాస్తవం ప్లస్ కల్పన తగుపాళ్ళల్లో కలిసి రూపొందే కథాత్మక వాస్తవికత, వ్యష్టి 'చైతన్యం, సమిష్టి' నేపథ్యపు హౌరు ప్రతిఫలించి అద్భుతమైన గొప్ప కథని ఆవిష్కరింపజేశాయి.
ఈ సంపుటి మొత్తంలో మరీమరీ గొప్ప కథ 'ఆ.. అమృతపాదాలు' అనేది ఉన్నది. జైనీగారు 1989లో రాసినది. ఆంధ్రప్రభ వారపత్రికలో వచ్చింది. రైలు ప్రయాణంలో ఎదురు బెర్త్లో పడుకుని ఉన్న యువతి పాదాల్ని చూశాడు ఆకాశ్. భావుకుడు. చాలా ఊహలు, ఆలోచనలు కలుగుతాయి. ఆమె నర్తకి. ఉదయం పరిచయం పెరుగుతుంది. ఆమె పేరు కేరోలిన్. ఇటాలియన్ వనిత. ఆమెతో పాటు సేన్ అనే ఆమె సహచరుడూ ఉన్నాడా ప్రయాణంలో. ఆకాశ్ మనసులో ఆమె పట్ల అవ్యక్త మాధుర్య భావనలు, అనిర్వచనీయమైన ఆరాధన వంటి ఉద్విగత. సేన్ తనకు కాబోయే భర్త అని ఆమె చెప్పినప్పుడు అతనిలో ఏదో నిరాశ. ఏదో పెన్నిధిని కోల్పోతున్న బాధ! అది చెప్పుకుని కళ్ళు చెమర్చుకుంటాడు. 'పూర్ బారు! నువ్వు కష్టాల్లో వున్నావు. ఎవరు ఆత్మీయత, ఆదరణ చూపించినా వారి పట్ల నీకు అభిమానం కలుగుతుంది. అయితే వాళ్లంతా నీ స్వంతం కావాలని కోరుకోవడం తప్పు కదూ' అని మందలిస్తున్నట్టుగా అంటుంది! వారణాసి వెళ్తారు ముగ్గురూ. అక్కడ ఆమె అతనికి మరింత జ్ఞాన చైతన్యాన్నీ, జీవన తాత్త్వికతనీ అందిస్తుంది. అతన్ని వాస్తవాధీనరేఖ మీద నిలుపుతుంది! ఈ కథ ఆనాటి బుచ్చిబాబు 'నన్ను గురించి కథ వ్రాయవూ', ఆ తర్వాతి భమిడిపాటి జగన్నాథరావు 'సముద్రం', ఆర్. ఎస్. సుదర్శనం 'మధుర మీనాక్షి' వంటి ఉత్తమోత్తమ కథానికల సరసన తలయెత్తుకొని నిలిచే రచన. వందల కథలకి వేల చప్పట్లు రావచ్చు; లక్ష కరచాలనాలూ లభించవచ్చు. కానీ, అసలుసిసలైన ఇలాంటి కథలకు లభించే సహృదయచలనాలు అజరామరమైనవి. ఇలాంటి కథలే ప్రపంచ కథాసాహిత్యంలో తెలుగు కథకి మన్నన సమకూరుస్తున్నవి. జైనీగారు ఈ కథని (కనీసం) ఇంగ్లీష్, భారతీయ భాషల్లోకి అనువదింపజేసి ఆయా ప్రాంతాల పాఠకులకు పరివ్యాప్తం చేయాలని కోరుతున్నాను.
కాగా, ఈ సంపుటిలో ఇంతకింత భావుకత, మనస్తత్వ విశ్లేషణ, ఆర్తి కలిగిన కథ 'అలసితి...' అనేది ఉన్నది. రోగగ్రస్తమైన భార్య, భర్తకు ఒక ఉత్తరం ఇచ్చి 'వీలైనప్పుడు చదవండి' అంటుంది. ఆ భర్తలో అనేక భావోద్వేగాలు, భయాలు, సందేహాలు. చివరికి చదువుతాడు - చేతులు వొణుకుతుంటే కవరును చించి! 'ఏమండీ! ఎంత అందమైన జీవితమండీ మనది. నాకేం కాదు. ఒకవేళ అయినా బాధపడకండి. నాకే కోరికా లేదు. మీరెట్లుంటారన్న బెంగ తప్ప. మీరు నాకే లోటు చేయలేదు. కానీ, స్వామీ అలసిపోయిన... ఇట్లు.. మీ పాదదాసి' అని రాసి ఉంది! ఏముందీ కథలో అంటే - ఏదో అందలేనిది, అందరానిది, అర్థం అయిపోయిన రహస్యం ఉన్నది. ప్రేమ, ఆనందం, దాంపత్యం, సంసారం, జీవితం, అర్థం - అన్నీ ఒకటే అనుకోమనే ఒక ప్రజ్ఞానం ఉన్నది! మంచి కథ!
ప్రభాకర్ జైనీకి తక్కువ నిడివిలో, చదువరిని ఆకట్టుకునే వస్తువుని కథగా మలిచే నైపుణ్యం ఉన్నది. కథని అనుభూతిమయం చేయటమే గాక, ఆలోచనాత్మకం చేసే శిల్ప రహస్యం కూడా తెలుసు.
కథనంలో, శైలిలో, ఎప్పుడు ఏ అభివ్యక్తి విన్యాసాన్ని చూపాలో కూడా బాగా నేర్చిన కథకుడు ప్రభాకర్ జైనీ. ఒక్కటే ఉదాహరణ - 'ఒక్కొక్క రోజు, నొప్పులు లేకుంటే హుషారుగుంటది. అప్పుడు మా ఇంటి నిండా సీతాకోకచిలుకలు ఎగురుతున్నట్టు, హరివిల్లులు మా కోసమే విరిసినట్టు అనిపిస్తది. తను పకపక నవ్వితె మా ఇంట్ల స్వరరాగ గంగా ప్రవాహమె'!
జైనీ కథల్లో - మనిషీ-మనస్తత్వ వైరుధ్యం, సమాజం సంక్లిష్టత, వీటిలో అంతర్లీనంగా కాలం వహించే పాత్రా - చదువరుల మనసును పట్టేస్తాయి. జీవితానుభవాల్ని రచనా సన్నివేశాల్ని చేయగల ఆయన నేర్పు, కథనానికి చదివించే గుణాన్ని పుష్కలంగా అందిస్తాయి. జీవిత సత్యాల్ని నమోదు చేసి ఊరుకోవటం కాక, జీవన సత్యాల వ్యాఖ్యానాన్ని కూడా కథాత్మకంగా ఆవిష్కరించటమే ఈ సంపుటిలోని కథల గుణౌన్నత్యం. కొని, చదివి, ఆనందించవలసిన సంపుటి 'మీల్స్ టికెట్'! ప్రభాకర్ జైనీకి అభినందనలు!!
- విహారి,
9343025600