Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫకీర్ మోహన్ సేనాపతి రాసిన ఛొమాణొ అఠో గుంఠొ (ఆరెకరాల ఎనిమిది గుంటలు) ఒడియా సాహిత్యంలో మొట్టమొదటి సాంఘిక నవల. ఇందులో 1831 - 32 సంవత్సరాల కాలం నాటి జమిందారీ వ్యవస్థనూ; ఒడియా గ్రామీణ జీవనాన్నీ; దోపిడీ విధానాలనూ కళ్ళకు కట్టేటట్లు రచయిత చిత్రీకరించారు. ఈ నవలలో సంప్రదాయాలు; మూఢనమ్మకాలపై రచయిత చేసిన వ్యంగ్యాత్మక వ్యాఖ్యలున్నాయి. జమిందారు రామచంద్ర మంగరాజు వడ్డీ వ్యాపారి. సారవంతమైన ఆరెకరాల ఎనిమిది గుంటల భూమిని తనఖా పెట్టుకుని భగియాకు అప్పిస్తాడు. అప్పు తీర్చకపోవడంతో భగియాకు చెందిన ఛొమాణొ అఠొ గుంఠొ (ఆరెకరాల ఎనిమిది గుంటలు) భూమిని స్వాధీనం చేసుకుంటాడు. ఆ భూమే అతని పతనానికీ, చివరకు మరణానికీ కారణమవుతుంది. కర్మఫలం అనుభవించక తప్పదని ఈ నవల ద్వారా రచయిత తెలిపారు. ఎలాంటి సన్నివేశంలోనైనా హాస్యాన్ని సృష్టించడంలో మోహన్ సేనాపతి నిష్ణాతుడు. మంగరాజు చావుబతుకుల్లో ఉన్నప్పుడు గోపియా తంతీ ఉరఫ్ గోపియా కవిరాజు అనే ఆయుర్వేద వైద్యుడొస్తాడు. రోగిని పరీక్షిస్తాడు. కవిరాజు బాబూ ఏమిటి సంగతి అని అడిగితే ''కంఠా శ్లేష ప్రణయిని జనేకిం పునర్దూర సంస్థే'' అంటే 'కంఠంలో శ్లేష్మం వుంటే ప్రాణం పోతుంది. మరి దూరంగా వెడితే ఏమౌతుంది' అని మేఘ సందేశంలోని ఈ శ్లోక పాదానికి అర్థం చెబుతాడు. ''మెడను కౌగలించిన ప్రియురాళ్ళకే అలా వుంటే ఇంక దూరంగా ఉన్నవాళ్ళ సంగతి చెప్పాలా'' ఆ శ్లోక పాదానికి అసలర్థం ఇది. 'కస్తూరీ తిలకం' అని కడుపులోకి కస్తూరి ఇచ్చి నుదుటన తిలకం పెడితే రోగం తగ్గుతుందని కవి రాజు చెప్తాడు. ఇలాగే గణపతి నవలలో చిలకమర్తి 'శ్రీరఘురామ చారు తులసీదళరామ' అనే పద్యానికి 'శ్రీరాములవారు పైత్యముగా నుండి ఒకనాడు చారు కాపించుకున్నారు. ఆ దేశంలో కరివేపాకు లేదు కనుక తులసీదళములే ఇందులో వేచి పొగిచినారు' అని గణపతితో అర్థం చెప్పించి హాస్యాన్ని సృష్టించారు. 'ఛొమాణొ అఠో గుంఠొ' నవలను 1897లో ఫకీర్ మోహన్ సేనాపతి రాయగా 1920లో చిలకమర్తి 'గణపతి' నవల రాశారు. ఇద్దరు గొప్ప రచయితల ఆలోచనలు ఒకలాగే వుంటాయనటానికి ఇంతకంటే మంచి నిదర్శనం ఏముంటుంది. కస్తూరి అనువాదం సరళంగా వుంది. ఆయన ఇచ్చిన ఫుట్ నోట్స్ నవలలోని వ్యంగ్యం; హాస్యం అర్థం చేసుకోవడానికి దోహద పడ్డాయి. మంగరాజును పరీక్షించడానికి గోపియా తంతీ వస్తాడు. గోపియా తంతీ చేయి చేసుకొన్నాడు అని అనువాదకుడు రాశారు. చేయి చేసుకోవడం అంటే తన్నడమని అర్థం. ఇలాంటి గొప్ప నవలను తెనిగించిన కస్తూరి అభినందనీయుడు.
ఛొమాణొ అఠో గుంఠొ, రచయిత : ఫకీర్ మోహన్ చేనాపతి, తెలుగు సేత : కస్తూరి, వెల : 70/-,
ప్రతులకు : నవోదయ బుకహేౌస్, కాచీగూడ, హైదరాబాద్.
- తెలిదేవర భానుమూర్తి,
9959150491