Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'వాక్యం రసాత్మకం కావ్యమ్' అన్నది శ్రీరామ్ కవిత్వానికి అక్షరాలా సరిపోతది. వాక్యం మీదున్న పట్టు అసోంటిది మరి! కవిత్వాన్ని ఇంతలా ప్రేమించే కవి ఉండడం చాలా అరుదు. ఆత్మగతమైన సామాజికాంశాలన్నీ కలగలిసి ఒక్కపెట్టున కవిత్వ లావాను ఎగజిమ్మినట్టుంటది. తొలి కవిత్వసంపుటి 'అద్వంద్వం'తో మనల్ని పలకరిస్తున్న కవి మిత్రునికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ 'రెక్కలు తెగిన దారి' పొంటి నడుసుకుంట అద్వంద్వం కొస్సదన్క చేరుకుందం.
1. అప్పటి దాకా సంగీతం నేర్చుకుంటున్నట్టు ఊగిన లేత కొమ్మలు
ఉరి బిగించుకుని విరిగిపడిన నిశ్శబ్ధం
అక్కడ పొద్దున్నే ప్రార్దనాగీతంలా వినిపిస్తుంది
2. ఇప్పుడా చెట్టుకి తియ్యని పూలూపళ్లూ కాదు
నిగనిగలాడుతూ లోహపంజరాలు వేలాడుతున్నాయి
3. క్రమశిక్షణతో విషం తీసుకుంటున్న బానిసలకి
ఆశల తీరం తెలీని గెలుపొక్కటే కావాలి
4. ఈ దారిలో ఇప్పుడెవరైనా ఆకాశాన్ని పరచండి
ఎటూ ఎగరలేని దారికి రెక్కలుంటేనేం? లేకుంటెనేం?- అని అనుమానం రావచ్చు. తొక్కుడుపడకుండా మూసుకుపోతున్న దారిని సంబోధిస్తూ 'రెక్కలు తెగిన దారి' కోసం ఆరాటపడుడు అవుపడుతది. దారిలో ఆకాశాన్ని పరిస్తే ఏమౌతుంది? ఆకాశం మనకు కొత్త కొత్త ఊహల ప్రపంచానికి తలుపులు తెరుస్తుంది. లోలోపలి సృజనాత్మక శక్తులను వెలికితీస్తుంది. ఎవరి కోసం ఈ తాపత్రయం? గెలుపొక్కటే పరమావధిగా భావిస్తూ సమిధలవుతున్న పసిమొగ్గల కోసమేనని ఎరుకైతది. నెలతప్పిన అమ్మ ఎదురుచూపుల మీద బడిగంట గురిచూసి వలవేయడం కార్పొరేట్ తంత్రం. బిరడా బిగించిన గాజుసీసాల్లోంచి రెక్కలు తెగ్గోసుకున్న సీతాకోకల్ని స్వేచ్ఛగా ఎగరమనడం వర్తమాన సిలబస్లో ప్రధాన అధ్యాయం. అందుకే కదా.. పూలూ పండ్లూ కాయాల్సిన చెట్టుకు నిగనిగలాడే లోహపంజరాలు వేలాడేవి! మరి రెక్కలు తెగిపోయిన దారి ఎట్లుంటది? దాని పరిస్థితి ఏంటి? లేతకొమ్మలన్నీ ఉరిబిగించుకుని విరిగిపడిన నిశ్శబ్దం ప్రార్దనాగీతంలా వినిపించడం నిత్యకృత్యమైన సందర్భంలో బతుకుతున్నాం - ఇక లేలేత పాదముద్రల్ని పచ్చబొట్టులా పొడిపించుకునే దారెలా కనబడుతది? అందుకే దాని రెక్కలెప్పుడో తెగి విలవిలలాడుతూనే వుంది.
ప్రయాణం చేయడమంటే ప్రజల బాధల్ని మోసుకుతిరగడమేమో అనిపిస్తుంది. అనంతపురం నుండి రాజమండ్రికి రావడమంటే కృష్ణ, గోదావరి నదుల్ని దాటడమే కాదు.. అనంత దుక్కాన్ని మోసుకొచ్చి చేపల చెరువులైన పొలాల గుండె మడుల్ని తడపడమేనని అర్థమౌతుంది.
''వూరెళ్ళి రావడమంటే/ వున్నచోట నుండి మరెక్కడో
రెక్కలు కట్టుకుని వాలడమే కాదు/ ఒక్కోసారి
చలి ఆకులు రాల్చిన కాలం చెట్టు
ఒంటరి వేసవిలోకి ధైర్యంగా వెళ్లినట్టు వెళ్ళాలి'' (వెళ్లొచ్చాక,పే.నం :90)
నీళ్లులేక గొంతుల్ని తడపలేమని ఒకచోట, నీళ్లున్నా గొంతు తడపలేక పోవడం మరోచోట గమనిస్తే అనుభవమౌతుంది.
రోడ్డు విస్తరణలో పాకలబజారు ప్రాణం తీసినా, నోరూరించే ఆవకాయజాడిలా మనసుల్ని కలుపుతున్న మానవతా దృశ్యాన్ని కండ్లముందుంచుతూ ..
''మా బజారు రసం కాయ తినడం రాక ఒళ్లంతా పూసుకున్న జిగురు వాసన'' లాంటి పసితనాన్ని నెమరేయడం చూడవచ్చు.
''కాలం నాటి పాకలు పోయి/ రేకులొచ్చిన షాపుల వేడిరెక్కల కింద
గుడ్డు ప్రాణం పోసుకుంటున్నట్టు
మగ్గేసిన కాయలన్నీ కొత్త పెళ్లికూతురు
పసుపు రాసుకున్న కాళ్లలాగ కళ్లు తెరుస్తాయి''
(మామిడికాయ పాకలు,పే .నెం: 87)
మాగబెట్టిన పండ్లు వేడిరెక్కల కింద ప్రాణం పోసుకోవడం, పసుపు రాసుకున్న కొత్త పెళ్లికూతురు కాళ్లలాగ కళ్లు తెరవడం ఎంత కవితాత్మకంగా చెప్పాడో అనిపిస్తుంది. ఆకాశమంత ఊహ, బలమైన అభివ్యక్తితో కవి దృష్టికోణం జతకూడితే ఇలాంటి పండుమామిడిరసంలా నోరూరిస్తుంది కవిత్వం. సామాజిక అంశాల్ని ఎత్తుకోవడం, దానితో పాటు దాని వెనకున్న శ్రమైక జీవన సౌందర్యాన్ని ఒడిసిపట్టడం, ధారలా కవిత్వమై కురవడం శ్రీరామ్ కవిత్వంలో బింబ ప్రతిబింబాలై పోటీపడి తారసపడుతుంటాయి.
''అద్వంద్వం, నేనెక్సూ.. నువ్వయ్యీ, ఇదం శరీరం'' వంటి కవితలు స్త్రీ ఇతివృత్తంతో ముడిపడినవి. ఆకాశంలో సగమని చెప్పుకునే వారి ఆకాశమంత దుక్కాన్ని, వేదనను అక్షరీకరిస్తాయి.
''వీరోచిత జాతి ఆయుధాగారం లాంటి శరీరం
నిర్బంధ కూలీతనంలోనో, గతిలేని ఆలితనంతోనో
బానిసరాగం తీస్తుంది
అవయవాల్నొక్కొక్కటీ తెంపుకుంటున్నప్పుడు
కన్న తల్లిదండ్రులు గుర్తొచ్చి రోదిస్తుంది'' (ఇదం శరీరం, పే.నం :74)
''వెతకద్దుజ తల్లి పోలికా.. తండ్రిదా అన్న సందేహాన్ని
అనాదిగా బహిర్గతమౌతూనే ఉన్నదాన్ని
దారితప్పిన జన్యువుని
దుర్భిణీ వేసి మరీ చూడ్డానికేముంది?'' (పే.నెం:38)
''ఎక్కడో మారుమూల/ పగలూ రాత్రిళ్లకు అతీతంగా
ఆమెలోని ఎక్స్ క్రోమోజోముతో/ గతిలేక వాడి ఎక్సే జతగడుతుంది
(పే.నెం :39)
ప్రధానంగా ఈ మూడు కవితలు స్త్రీ శరీరంపై జరుగుతున్న దాడిని ప్రశ్నిస్తున్నాయి. వ్యాపారానికి స్త్రీ శరీరమే కావాలె. పిల్లల్ని కనివ్వడానికి స్త్రీ శరీరమే కావాలె. తనలాంటి మరోజీవికి జన్మనివ్వడం మాత్రం ఇక్కడ పాపం. అదో నేరం. శారీరక వాంఛలను తీర్చుకోవడానికి తనొక వాడి పారేసే వినియోగ వస్తువు. తనవాళ్లనుకునే వాళ్లకు జీవితకాలపు బానిస. సంకెళ్లు ఎవరేస్తేనేం? గిరిగీసుకున్న ఛట్రం నుండి బయటపడలేక గిజగిజ తన్నుకులాడే ప్రాణం తనది.
స్త్రీలపై అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? శరీరంపై ఆధిపత్యం కోసమేనా? అవయవాలన్నీ పూర్తిగా పరిపక్వం చెందని పసిపిల్లలపై ఎందుకు జరుగుతున్నట్టు? ఆమె దేహమంటే మహౌత్సాహ రంధ్రాన్వేషణేనా? అసిఫా లాంటివి బయటకు పొక్కని సంఘటనలు చుట్టూ ఎన్ని జరుగుతున్నాయో చెప్పలేం కదా! గుడిలో రక్తం ఏరులై పారుతుంటే ఉత్సవ విగ్రహం ఉలకదూ పలకదు. నిజంగా అప్పుడు మైల పడలేదంటారా! ఆక్రందనలన్నీ జేగంటలని నిద్రమత్తులో జోగుతుంది కాబోలు!
స్త్రీల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిదీ. ఆర్టీసీ బస్సుల్లో స్త్రీలను గౌరవిద్దాం అని రాసి వుంటుంది. అవి నినాదాలుగా మిగిలిపోయి ఆచరణ లేకపోవడం నిత్యం చూస్తూనే వుంటాం. మన ఇంట్లోని ఆడవాళ్లు పడే ఇబ్బందుల్ని సుత మనం అంతలా పట్టించుకోం. 'బహిరంగ మలమూత్ర విసర్జన నేరం. అందుకు జరిమానా విధించబడును' అనే బోర్డు కనిపిస్తుందే తప్ప టాయిలెట్స్ చుట్టుపక్కలెక్కడా కనిపించవు. మగవారు ఎక్కడపడితే అక్కడ కానిచ్చేయడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. అదే ఆడవారైతే వారి ఆత్మాభిమానాన్ని చంపుకోలేరు. ఆరోగ్యసమస్యల్నీ తప్పించుకోలేరు. ఉద్యోగ నిమిత్తమో, కుటుంబపోషణకో సమాజంలోకి వచ్చే మన ఇంటి ఆడవాళ్లు కనీస అవసరాలు తీర్చుకోలేకపోతున్న దుస్థితిని ఈ 70 ఏండ్ల స్వాతంత్య్ర భారతదేశంలో ఇంకా చూస్తూ నిలబడిపోతూనే వున్నాం. ఇప్పుడిప్పుడే సోయి వచ్చినట్టు అనిపించినా ఇంకా మారుమూల గ్రామాల్లో శెంబట్క బోయే పరిస్థితిని దాటలేకపోతున్నాం. ఉణఖీ మీద శ్రీరామ్ రాసిన కవిత ''ఏబీసీడీ ఎఫ్ఫూ! మా ఊరిప్పుడు ఓడీఎఫ్పూ'' ఇదే స్థితిని తేటతెల్లంజేసింది. ఒక పురుషుడు స్త్రీ పడుతున్న వేదనను అక్షరీకరిస్తే ఎలా వుంటుందో చూడొచ్చు.
''కాలాన్నెదిరించలేని సాధికార పాదాల్తో/ ఆమె నడిచే
ముళ్ళజెముళ్ళ బయల్దొడ్డి దారంతా
అరికాళ్ల గుర్తులు కన్నీళ్లు స్రవిస్తాయి
అరచేత్తో పట్టుకున్న రబ్బరు చెంబు నిండా
సిగ్గుతో తలలోతు మునిగిన/ సప్తసముద్రాలు ఉప్పెనలా
పొంగిపొర్లుతాయి/ బొంతమీంచి బయల్దాకా
ఆమెదొక సజీవ శవయాత్ర'' (పే.నెం:64,65)
ODF (OPEN DEFECATION FREE) అంటే బహిరంగ మల విసర్జన రహితమైన అని అర్థం. చివర్లో కవి పాడిగేదెకున్న స్వేచ్ఛ ఆమెకి లేదని కుండబద్దలు కొడుతాడు. గడ్డివేసిన చోటే పేడకుప్పలు పెట్టి బద్ధకంగా ఊరి గొప్పతనాన్ని నెమరేస్తుందని దెప్పిపొడుస్తాడు. అందుకే ఆమెదొక సజీవ శవయాత్ర అనగలిగాడు. శ్రీరామ్ కవిత సదువుతానప్పుడు గతంలో సొన్నాయిల క్రిష్ణవేణి (అనామిక) గారు రాసిన 'కానుకిస్తావా' కవిత యాదికొచ్చింది. సందర్భం వచ్చింది గనుక ఇక్కడ పరిచయం చేస్తాను. శ్రీరామ్ పురుష కోణం నుంచి జనరల్గా ప్రామాణికమనుకున్న భాషలో వ్యక్తం చేసిన దాన్ని ప్రజల భాషలో స్త్రీకోణం నుండి స్త్రీగా అనుభవించిన విషయాల్ని సంభాషణాత్మకంగా తన తోటోల్లను, ఇంట్లోని మగవాళ్లను 'నాకో కానుకిస్తావా' అంటూ అడగడం చూస్తాం. మనం ఏ పరిస్థితుల్లో వున్నామో అంచనా వేసుకోవచ్చు. కాళ్లగజ్జెలేమొద్దనీ నాయినను, బంగారు గాజులేమొద్దని అన్నదమ్ముల్నీ, పట్టు చీరెలేమొద్దనీ పెనిమిటినీ ఓ కోరిక కోరడం గమనిస్తాం. నా ఆత్మాభిమానాన్ని నాకు కానుకివ్వమంటుంది.
''శీకట్ల బోకట్ల శెంబువట్కోని/ శేన్లల్లకు వోతుంటే
ఏనంగ ఏ పామొస్తదోనని/ నేనెంత అగులు బుగులైతనో
నీకెన్నడన్న ఎరికేనా?
యాల్లదప్పి ఎలుగైనంక పోవాల్సస్తే
అన్నో, తమ్ముడో, బావో, మరిదో కనవడితే
తలొంచుకుని నిలవడ్డప్పుడు
అమాంతం భూమాత పటుక్కున వలిగి
నన్ను దాసుకుంటేమవునని/ నీకెన్నడన్న సమజైందా?'' (కానుకిస్తవా)
సూత్తానికి చిన్న విషయమే అనిపించినా సుదీర్ఘ చర్చ అవసరం. ఇంకా ఇలాంటి సమస్యనెదుర్కుంటున్న తల్లుల్ని, చెల్లెల్ని చాలా పల్లెల్లో చూస్తూనే వున్నాం కదా! పోలియో రహిత భారతదేశంలా ODF INDIA కావాలనీ కోరుకుందాం.
'నాసిక్ -ముంబై' కవితనొకసారి పరిశీలిస్తే రైతులు పాదయాత్ర చేస్తే.. పొలం మట్టి నగరానికేం నేర్పిస్తుందో దృశ్యీకరిస్తాడు.
రంగు వెలిసిన కన్నీటివానలా కురుస్తూ గొంతెండిపోయిన లేగదూడ దాహపు పాటను వినిపించే మట్టిమనిషి వెతను అనుభవిస్తం. నగరానికొచ్చిన పొలం కాళ్లను కళ్లకద్దుకుంటం. సరిగ్గా అప్పుడే ఆకలిదీర్చేవాడే దేవుడని గుర్తుకొస్తుంది. కుతకుతలాడే గుండె తునకల్లాంటి అతనెప్పుడూ ఈ పవిత్ర దేశంలో అక్కరకురాని అత్యవసర వస్తువు.
తరగతిగదిలో చిన్నపిల్లలకు పాఠం అనుభవంలోకి తేవడానికి వాడే అన్ని బోధనాపద్ధతుల్ని కవిత్వంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించి కవి సఫలమౌతున్నాడు. అన్వయం అతని కవిత్వ రహస్యం. అంతర్గత సహసంబంధాల నాడీ తెలిసిన వైద్యుడు. బోధనాభ్యసన ప్రక్రియలో పూర్వజ్ఞాన పరిశీలన లాగే అతని కవిత్వ ఎత్తుగడ ప్రారంభమవుతుంది. ఆసక్తి రేకెత్తించేలా కొనసాగింపు, ఉత్కంఠ రేపేలా ముగింపు ఉంటాయి. మధ్యలో ఒక ట్విస్ట్ -ఒక విషయం నుండి మరో విషయంలోకి సునాయాసంగా వెళ్లడానికి అదొక టెక్నిక్. కవిత్వాన్ని ప్రయోగాత్మక సాధనంగా వాడడం అతనికి కమిట్మెంట్తో కూడిన సరదా. 'గినియా పంది' లాంటి కవిత శ్రీరామ్ ఒక్కడే రాయగలడేమో అనిపించింది. అలాగే 'మాకు మేమే మీకు మీరే' కవితలో రివర్స్ స్క్రీన్ ప్లే చాలా బాగా వర్కవుట్ అయి అవుట్పుట్ అందరినీ అలరిస్తుంది. మనసు పెట్టి చదివితే మీరూ ఒప్పుకుంటారు. పచ్చినిజాల మూటల్ని అమాంతం మింగలేక ఇబ్బందిపడితే నేనేం చేయలేను. ఆస్వాదించండి. మాగిన మాంఛి కవిత్వ విందు ఆరగించండి.
- బండారి రాజ్కుమార్,
8919556560