Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రతి ఉదయం రక్త వర్ణమై/ ఆకలి విజృంభిస్తుంది/ కనికరం లేకుండా/ రగిలే మంటల్ని చల్లార్చటానికి/ ఆత్మీయురాలు, రొడ్డెక్కు తారు/ నిస్గిగ్గుగా వాళ్ళే/ పీల్చిపిప్పిచేయబడ్డ/ పేదరికానికి నకళ్ళు'' అని విశ్లేషించగలిగిన కవి పుష్యమీసాగర్. 'పునరావృత దృశ్యం' అనే కవితా సంపుటి ద్వారా 52 కవితలతో పాఠకుల ముందుకు వస్తున్నాడు. ప్రతి కవితలోనూ కవి తన సామాజిక బాధ్యతను పట్టి ఏలార్చాడు. ఈ విషయం తన మొదటి కవితా సంపుటి 'కొన్ని రాత్రులు' ద్వారా తెలిపే ప్రయత్నం చేశాడు.
పుష్యమీ సాగర్ ఆశావాది. కవిత్వం ద్వారా సమాజానికి జీవశక్తి అనే టానిక్ను అందిస్తాననే నమ్మకం కలిగినవాడు. సామాజిక రుగ్మతలను చీల్చిచెండాడడానికి అలతి అలతి పదాలను ఎన్నుకుని కవితాస్త్రాలను ఝళిపిస్తున్నాడు. తన మొదటి కవితలోనే 'కోడలు నెలతప్పింది/ పిండానికి దినదిన గండమే, లింగ వివక్ష'తో అంటూ మొదటి చరుపుతోనే మహిళా పక్షపాతిగా కనిపిస్తాడు. 'నాలోని నిజమైన మనిషి కోసం యుద్ధం/ మొదలు పెట్టాను/ విసిరి వేయబడ్డ జీవితానికి నేనో/ నమూనాని కాదల్చుకోలేదు'' అంటూ తన నిబద్ధతను ప్రకటించుకున్న కవి. ''రాత్రులను కుప్పగా పోసి/ ఆలోచనలను ఏరుకుని/ అక్షర విత్తులను నాటుతున్నాను/ కాగితపు నేలపైన'' అని తన నిత్యకృత్యాలను తెలియపరుచుకున్నాడు. జీవితంలో నువ్వు అనే కవిత ద్వారా తన తాత్విక చింతనను కూడా ఈ విధంగా ప్రకటిస్తున్నాడు కవి. ''నువ్వు, జీవితం/ రెండు వేరు కాదు/ చావు పుట్టుకల సమ్మిళితం/ అనంత సత్యానికి/ అంతిమ సంకేతమే నువ్వు'' అంటూ వింగడిస్తాడు.
స్పష్టత, గాఢత, క్లుప్తత, పరివేదన నిండిన కవిత్వం పుష్యమీ సాగర్ కవితల్లో పుష్కలంగా వున్నాయి. మనిషిని, సమాజాన్ని పట్టించుకుని రాసిన ఈ కవి మరింత శిల్ప సౌందర్యాన్ని మెరుగ్గా పరుచుకుంటే బాగుంటుందని సూచన.
పునరావృత దృశ్యం (కవిత్వం), రచన : పుష్యమీ సాగర్ (9010350317), పేజీలు : 110, వెల : 100/-, ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు.
- కె.హరనాథ్, 9703542598