Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీపై సంధించిన అస్త్రం 'ధిక్కారం' నవల. పురాణ కాలంలో గురుకులాలుండేవి. మునులు తమ ఆశ్రమాల్లో విద్య బోధించేవారు. రాజూ, పేదా తేడా లేకుండా అందరి పిల్లలూ గురుకులాల్లో వుండి చదువుకునేవారు. విద్యాభ్యాసం అయిపోయాక తమ తాహతును బట్టి గురుదక్షిణ ఇచ్చేవారు. గురువూ, గురుపత్నీ విద్యార్థులను తమ సొంత పిల్లల్లా చూసేవారు. అనంతర కాలంలో బీదవాళ్ళు వారాలు చేస్తూ చదువుకునేవారు. ప్రఖ్యాత గాయకుడు ఘంటసాల విజయనరగంలో వారాలు చేసుకుంటూ సంగీతం నేర్చుకున్నారు. కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలూ రంగప్రవేశం చేయడంతో చదువుకోవడం పోయి చదువు కొనే పరిస్థితి దాపురించింది.
ధిక్కారం నవలలో ఎక్కడా కల్పనలు లేవు. కల్పిత పాత్రలు లేవు. నడుస్తున్న చరిత్రనే రచయిత నవలగా రూపొందించారు. ముసుగు లాగేసి కార్పొరేట్ విద్యారంగ అసలు స్వరూపాన్ని చూపారు. ఇంటర్ విద్యను కబ్జా చేసిన రెండు కార్పొరేట్ కాలేజీ గ్రూపులేవో మనకు తెలుస్తూనే వుంటుంది. ధిక్కారం నవల్లో కథంతా మాథ్స్ లెక్చరర్ వెంకటరమణ చుట్టూ తిరుగుతుంది. అతని మనోభావాలతో పాటు అతని ముందుతరం, భావితరం మనోభావాలను రచయిత చిత్రీకరించారు. కార్పొరేట్ విద్యాసంస్థలపై మూడు తరాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఈ నవల్లో వున్నాయి. రమణ తండ్రి గతకాలానికి ప్రతినిధి అయితే రమణ వర్తమాన కాలానికి ప్రతినిధి. రమణ కుమార్తె భావి కాలానికి ప్రతినిధి. ''భూముల్ని, ఆస్తుల్ని విలువ గట్టినట్టు విద్యను కూడా విలువ కడుతున్నారు. పిల్లలు బాగా సంపాదించడానికి ఏ చదువు పనికొస్తుందో అదే చదివించాలనుకుంటున్నారు తల్లిదండ్రులు. వారి ఆశల్ని మరింత పెంచుతూ, భ్రమల్లో వుంచుతూ డబ్బు చేసుకుంటున్నాయి విద్యాసంస్థలు. ఆ ధోరణి సరికాదు. చదువంటే విద్యాసంస్థల విజ్ఞానాన్ని, శీలాన్ని, సత్ప్రవర్తనని, సామాజిక బాధ్యతను పెంపొందించేది. విద్య ప్రథమ లక్ష్యం అక్షర జ్ఞానం....'' ఇది రమణ తండ్రి బ్రహ్మం మాస్టారి అభిప్రాయం.
రమణ తన తండ్రికి పూర్తి విరుద్ధం. అతనికి ఎలాంటి ఆదర్శాలూ లేవు. విద్యార్థుల్లో సత్ప్రవర్తనని, సామాజిక బాధ్యతను పెంపొందించాలనే తపనా లేదు. అతని ధ్యేయం మనీ మనీ ఓన్లీ మనీ. ''నువ్వు సాలెగూడులో చిక్కుకు పోయావని బాధపడేవారు, రంగుల మాయజలతారు నీ చుట్టూ ఉచ్చు బిగిస్తోందని వాపోయేవారు, శ్లేష్మంలో పడ్డ ఈగలా కొట్టుకుంటున్నావనేవారు, నీలో గురువు చనిపోయాడనీ, వట్టి అవకాశవాదిగా వ్యాపారిగా మిగిలిపోయావనీ ఆవేదన చెందేవారు, డబ్బు నిన్ను కొనేసిందనీ చెప్పేవారు'' రమణ గురించి అతని తండ్రి అభిప్రాయం ఇది.
రమణ కుమార్తె అక్షర ఇప్పటి ప్రగతిశీల యువతరానికి ప్రతినిధి. ఆమె తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇచ్చి బైపీసీలో చేరకుండా సీఈసీలో చేరుతుంది. ''విద్య ప్రైవేటీకరణ మీద ధిక్కారం. కార్పొరేటీకరణ మీద ధిక్కారం. ప్రపంచీకరణ మీద ధిక్కారం. ధిక్కరించడమంటే ఎదిరించడం, ఎదురు తిరగడం, మన శక్తిని ప్రదర్శించడం మన ఐక్యతని చాటడం. ముందు తరాలకు చక్కని భవిష్యత్తునివ్వడం.'' ఇవి విద్యపై అక్షర అభిప్రాయాలు. అనుభవంతో తత్వం బోధపడగా చివరకు రమణ కూడా అక్షర మార్గాన్నే అనుసరిస్తాడు.
ఈ నవల్లో కార్పొరేట్ కాలేజీల మధ్య పోటీలు, ర్యాంకర్లను కొనేసి తమ కాలేజీలో చదివినట్లు ఇచ్చే తప్పుడు ప్రకటనలు, ఎంసెట్ ప్రశ్నాపత్రాల లీకేజీ, కాలేజీ లెక్చరర్ల ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్న బ్రిలియంట్ విద్యార్థిని, తల్లిదండ్రుల బలవంతం మీద తమకిష్టం లేని గ్రూపుల్లో చేరే విద్యార్థులు, భరించలేక కాలేజీ నుంచి పారిపోయేవారు, అమెరికా వెళ్ళాక తల్లిదండ్రులను విస్మరించే సుపుత్రులు, కేవలం ర్యాంకర్లను తయారు చేయడానికే తమ శక్తియుక్తులను ఉపయోగిస్తున్న లెక్చరర్ల గురించి ఈ నవల్లో రచయిత సింహప్రసాద్ ప్రస్తావించారు. కార్పొరేట్ కాలేజీల నగ స్వరూపాన్ని ధిక్కారం నవల్లో చూడవచ్చు.
ధిక్కారం (నవల), రచయిత : సింహప్రసాద్, పేజీలు : 216, వెల : 120/-, ప్రతులకు : నవోదయ, నవతెలంగాణ పుస్తక కేంద్రాలు.
- తెలిదేవర భానుమూర్తి,
9959150491