Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రచయితను ఆవరించుకుని రెండు బలీయమైన శక్తులుంటాయి. అవి: 1. కొత్త విషయాలను తెలిసేటట్టు చెప్పగలగడం; 2. తెలిసిన విషయాలనే కొత్తగా చెప్పగలగడం''.
- జాన్సన్
ప్రపంచ ప్రఖ్యాత విమర్శకుడు జాన్సన్ అన్న ఈ మాటలు, తెలుగులో ప్రముఖ కథకుడు బి.ఎస్. రాములుకి సరిగ్గా సరిపోతాయి. ఈ రెండు బలీయమైన శక్తులు బి.ఎస్. రాములుకి ఉన్నాయి. భ్రమల్లో ఉండే మనుషుల్ని నగవాస్తవంలోకి లాక్కురాగలిగే శక్తి ఏదో బి.ఎస్. రాములు కథలకి ఉంది. బి.ఎస్. రాములు కథల సంపుటాలు 'స్మృతి' (1998), 'అడవిలో వెన్నెల' (2015) 'పాట' - ఈ మూడింటిని గత నెలరోజులుగా ఒకేసారి చదివాను. చదువుతున్న ప్రతి సందర్భంలోనూ నా అంతరంగంలో ఓ కుదుపు, కల్లోలం. బి.ఎస్. రాములు కథల్లోని నగ వాస్తవాలు నన్ను విభిన్న భావోద్వేగాలకు లోను చేసాయి. - ఆయన కథల్లోని మనుషులు జీవితంలోని అనేకానేక ఆటుపోట్లకు లోను కావడాన్ని, చాలా సహజంగా చిత్రించారు. మన బయటి ప్రపంచంలోంచి తన ఆంతరంగిక ప్రపంచంలోకి లాక్కెళ్లే గొప్ప శిల్పమేదో..., బి.ఎస్. రాములు కథల్లో ఉంది. ఆ శిల్పమే ఈ కథలకు బలం. ఈ పుస్తకాలలో ప్రధానంగా మూడు రకాల కథలు ఉన్నాయి.
అవి:
1. విప్లవోద్యమ కథలు.
2. దళిత, బహుజన దృక్పథంలో రాసిన కథలు.
3. మనుషుల జీవితంలోని తీవ్ర ఆటుపోట్లని చిత్రించిన కథలు.
ఈ కథలు బి.ఎస్. రాములు కథకుడిగా ఎంత నేర్పరినో చెప్పకనే చెబుతారు. తెలంగాణలో నక్సల్బరి ఉద్యమంతో ముడిపడ్డ మనుషుల జీవితాన్ని, ఆ చైతన్యాన్ని బలంగా చిత్రించాడు - తన కథల్లో - బి.ఎస్. రాములు. శ్రీకాకుళ గిరిజన సాయుధ పోరాటం సెట్ బ్యాక్ అయిన తరువాత, 1970ల నుంచి తెలుగునాట నగ్జల్బరీ పోరాటాలు మొదలయ్యాయి. ఉద్యమం బలంగా ఉన్నచోట్ల - తెలంగాణ ప్రాంతంలోని ప్రజల జీవితాలలో విప్లవోద్యమం అనేకమైన మార్పుల్ని తీసుకొచ్చింది. ఈ విప్లవోద్యమ వెలుగుల్లోంచి అద్భుతమైన కథా సాహిత్యం వచ్చింది. స్వయంగా ఉద్యమంలో పాల్గొని తాను చూసిన అనుభవాలను, ఎదురైన సంఘటనలను ప్రత్యక్షంగా కథల్లో చిత్రించిన రచయిత బి.ఎస్. రాములు. కథా రచనను ఒక 'సామాజిక బాధ్యత'గా, సీరియస్గా తీసుకొని కథలు రాసిన సృజనశీలి.
1979లో రాసిన 'బతుకు నేర్పిన పాఠం' కథ, నక్సలైట్ ఉద్యమం వైపు ఆకర్షింపబడుతున్న ఒక గొల్లవాని జీవితాన్ని చిత్రించింది. గవర్నమెంట్ ఆధీనంలో వున్న భూమిలో గొర్లను మేపినందుకు అన్యాయంగా శిక్ష పడిన 'గొల్ల మల్లయ్య' కథ ఇది. దొరల అధికారాన్ని, గవర్నమెంట్ అధికారుల పెత్తనాన్ని, దోపిడీని భరించలేని గొల్ల మల్లయ్య విప్లవోద్యమం వైపు ఎలా ఆకర్షింపబడ్డాడో, చాలా సహజంగా ఈ కథలో చిత్రితమైంది.
1980లో రాసిన 'పాలు' కథలో సామాజిక దౌష్ట్యనీతి అద్భుతంగా వర్ణించబడింది. ఎల్లవ్వకు, ఎల్లవ్వ కొడుకుకు పాలు ఎందుకు దక్కడం లేదో, విషయాన్ని అత్యద్భుతంగా చిత్రీకరించాడు. ''దేవుని బిడ్డలు'' కథలో దోపిడీకి గురయ్యి, అన్యాయమైపోయే పిల్లల బాల్యాన్ని చిత్రించాడు. బాల్యంలోనే అనాథలయిన పిల్లలు ఉద్యమం వైపు ఎంత ఆకర్షింపబడ్డారో ఈ కథలో చూడొచ్చు. 1981లో రాసిన 'భార్యాభర్తలు' కథ తెలంగాణ విప్లవోద్యమం సామాన్య యువకుల జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో వర్ణిస్తుంది. గ్రామంలో ఉద్యమం ప్రభావంతో ప్రజా పోరాటాలు నిర్వహిస్తున్న ఒక పేదరైతు సగటు మనస్తత్వాన్ని ఈ కథల్లో గొప్పగా చిత్రీకరించారు. బీడీ ఆకు కార్మికుల హక్కుల కోసం పోరాడడాన్ని ''పోరు'' కథలో వాస్తవికంగా చిత్రీకరించారు 'లచ్చిందేవి' అనే స్త్రీ పాత్ర ఎంత శక్తివంతంగా, అవగాహనతో సమస్యలను ఎదుర్కొందో బాగా చెప్పారు. కరీంనగర్ జిల్లా ప్రాంతంలోని బీడీ కార్మికుల కష్టాలను, హక్కులను చిత్రించడంతోపాటు, విప్లవోద్యమం బలంగా వుండడం మూలాన సామాన్య ప్రజల్లో ఉండే తెగింపును, ధైర్యాన్ని ఈ కథ చిత్రించింది.
పేద ప్రజలు కోల్పోయిన భూముల్ని, విప్లవ ఉద్యమం తిరిగి ప్రజలకు ఎలా ఇప్పించిందో, 'తల్లీ కొడుకులు' కథలో చెప్పారు. చింతకింది మైసమ్మ తాను కోల్పోయిన భూమిని 'సంఘం' ద్వారా ఎలా తిరిగి పొందగలిగిందో ఈ కథలో చూస్తాం. కరీంనగర్లో 1988లో జరిగిన రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభల సందర్భాన్ని అత్యద్భుతంగా చిత్రించిన కథ ''కాగితం పులి''. ఒక రకంగా బి.ఎస్. రాములు తెలంగాణ విప్లవ పోరాటాలను, ఇక్కడి ప్రజల్లో వచ్చిన చైతన్యాన్ని చాలా సునిశితంగా పరిశీలించి రాసారనడానికి ఈ కథ ఒక ప్రబలమైన దాఖలా. కులం, వర్గం, ప్రాంతంతో పాటు, చదువులు, ప్రేమలు, స్త్రీ పురుష శారీరక సంబంధాలకు సంబంధించిన విషయాలను ఏ గుంజాటనకు లోను కాకుండా ఉన్నది ఉన్నట్టుగా, సహజంగా చిత్రించే గొప్ప రచనా నైపుణ్యం ఈ కథకుడికి అబ్బింది. నడుస్తున్న సమాజంలో త్వరితగతిన వస్తున్న మార్పుల్ని గమనించడంలో నేర్పరి. జీవన విధానాల్లో, జీవన ప్రమాణాల్లో, దార్శనికతలో వస్తున్న మార్పుల్ని గమనించి, వాటిని అద్భుత కథలుగా మలిచిన కథాశిల్పి బి.ఎస్. రాములు. ఈయన కథలలో 'స్మృతి' కథ నాకు బాగా నచ్చిన కథ. ఈ కథ తెలంగాణ జీవన విధానానికి, మనుషుల మనస్తత్వానికి అద్దం పట్టింది. ఈ కథలోని మల్లేశం తల్లి కొడ్కుల దుబ్బక్క ద్వారా తెలంగాణ భూస్వాముల దోపిడి కాలం నాటి, దుర్భర జీవితాల్ని చూపారు. తెలంగాణలోని సామాన్యుల జీవితాల్ని రికార్డ్ చేయాలంటే, చరిత్రకారుల బి.ఎస్. రాములు కథల్ని తప్పక చదవాల్సిందే.
బి.ఎస్. రాములు కథల్లో కెల్లా, 8 డిసెంబర్, 1996న రాయబడ్డ 'దక్షయజ్ఞం' కథ మకుటాయమానమైన కథ. 1980 నుండి 1990ల మధ్య విప్లవోద్యమాన్ని కీర్తిస్తూ కథలు రాసిన బి.ఎస్. రాములు, 1990ల తరువాత అస్తిత్వ ఉద్యమాలైన దళిత, బహుజన వాద ఉద్యమాలతో మమేకమైనారు. తెలంగాణలో ఉద్యమాలు ప్రజల జీవితాలలో ఎలాంటి మహౌన్నతమైన మార్పులు తీసుకొచ్చాయో చాలా నిజాయితీగా తన కథల్లో చిత్రించిన బి.ఎస్. రాములు, విప్లవోద్యమాలలోని లోపాలను కూడా అంతే బలంగా 'దక్షయజ్ఞం' కథలో చిత్రించాడు. ''నగ్జల్బరీ చీకటి కోణాలు'' అనే పేర కె. బాలగోపాల్ రాసిన వ్యాసం, నక్సలైట్ ఉద్యమంలోని ఒడిదొడుకుల్ని చీకటి కోణాల్ని బలంగా విమర్శకు పెట్టింది. దానికంటే బలంగా బి.ఎస్. రాములు రాసిన 'దక్షయజ్ఞం' కథ విప్లవోద్యమాల బలహీనతలను, లోపాలను బయట పెట్టింది. ఉద్యమంలో కొంతకాలం జీవితాలను అర్పించి పనిచేసిన వారు అందులోని లోపాలను ఎత్తి చూపడం వలన సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. ఏ ఏ కాలంలో ఏ ఏ ఉద్యమాలు ఎందుకు సక్సెస్ కాలేదో ప్రజలకు, మేధావులకు, చరిత్రకారులకు తెలియజెప్పినట్లవుతుంది. విప్లవోద్యమం ఎడల సమగ్ర దృక్పథం ఏర్పడడానికి, ఉద్యమాన్ని మరింత పటిష్టంగా నిర్మించడానికి ఇది ఉపకరిస్తుంది. విప్లవకారులు వెలిబుచ్చే అన్ని ప్రశ్నలకు ఈ 'దక్షయజ్ఞం' కథ చక్కని సమాధానం. 1996లో ఈ కథ రాసిన తరువాత రచయిత బి.ఎస్. రాములు తన దృక్పథాన్నే మార్చుకున్నాడు. క్రమంగా విప్లవ దృక్పథంలోంచి, బహుజనవాద దృక్పథంలోకి పయనించాడు. దరకమే (దళిత రచయితల కళాకారుల మేధావుల) ఐక్య వేదిక స్థాపించి, అందులో బలంగా పని చేసాడు. దళిత, బహుజన దృక్పథంతో చాలా మంచి కథలు, గొప్ప కథలు రాసారు.
తన ఆలోచనల పరిణామ క్రమం పెరిగినా కొద్దీ మంచి రచనలు చేసారు బి.ఎస్. రాములు. ఇందులో రచయిత మనస్తత్వం మీద రాసిన ''గాడిద'' గొప్ప కథ. రచయితకుండాల్సిన లక్షణాల గూర్చి ఈ కథలో గొప్పగా చెప్పారు.''రచయిత ప్రజల్ని మేల్కొల్పాలి'' అంటారు. కాని, ఇప్పుడు చాలామంది రచయితల్ని ప్రజలే మేల్కొల్పుతున్నారు. ప్రజలను, రచయితలను మేలుకొలిపే దివ్య శక్తి ఏదో బి.ఎస్. రాములు వచనా శైలిలో వుంది. ''మాయ, ప్రేమ, తెల్లబట్ట, చెలిమ'' చాలా మంచి కథలు.
బి.ఎస్. రాములు రచనల్లోని లోతు, మేధావితనం, నిజాయితీ మనల్ని నిలువెల్లా కదిలిస్తాయి. జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొనే అనేక సందర్భాల్లో ఆయన కథలు తలపుకొస్తాయి. విప్లవ దృక్పథంలోంచి, బహుజనవాద దృక్పథంలోకి పయనిస్తున్న కాలంలో రాయబడ్డ ఆయన రచనలు పాఠకులకు ఒక మేల్కొల్పు. నిజంగానే 'సదానంద శారద' అన్నట్లు ''కాలక్షేపాన్ని ఆశించే పాఠకుల కోసం ఈ కథలు రాయబడలేదు. మేధావుల్ని, రచయితలని నిద్ర పోనివ్వని కథలివి. ప్రజల్ని ఉద్యమింపజేసే కథలివి''. పాఠకుల మనో ప్రపంచాన్ని విస్తృత పరిచే బి.ఎస్. రాములు లాంటి రచయితల సృజనాత్మక క్రియాశీలత ఇవాళ్టి అవసరం.
- డా|| పగడాల నాగేందర్,
9849872230