Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనసులోని భావాలను అక్షరీకరించి చెప్పాలనుకున్న మాటలను ఎదుటి వారికి సున్నితంగా చెప్పేదే కవిత్వం. ఇప్పుడు కవిత్వం ఎన్నో ప్రక్రియలుగా రూపాంతరం చెంది విరాజిల్లుతోంది. వాటిలో గానమాధుర్యాన్ని కూడా అద్దుకుని అందరినీ ఆకర్షించే ప్రక్రియ 'గజల్'. ఈ ప్రక్రియ ఉర్దూ సాహిత్యం నుండి తీసుకోబడింది. దాశరథి, డా||సి.నారాయణ రెడ్డి తెలుగు గజళ్లను రాసి, వాటి మాధుర్యాన్ని పరిచయం చేసి ప్రాచుర్యం కల్పించారు. వారి ద్వారా ఎంతోమంది ఆకర్షితులై గజల్ ప్రక్రియ లక్షణాలను అనుసరించి రాస్తున్నారు.
అలాంటివారిలో శ్రీమతి గద్వాల కిరణ్ కుమారి తెలంగాణలో తొలిగజల్ కవయిత్రిగా చెప్పుకోవచ్చు. సినారె ప్రేరణతో ఆకర్షితురాలై భావచిత్రాలే కాకుండా సామాజిక పరమైన అంశాలను వస్తువులుగా తీసుకుని విభిన్నమైన శైలిలో రాసిన ఆమె తొలి సంపుటి 'గజల్ కిరణాలు'.
''సమస్యల దారిలో నిరాశను గెలిచినప్పుడు
గర్వంగా నా వెన్నును తడుతుంటాను నేను'' అనే గజల్ లోని షేర్ ఇది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మొక్కను ఆదర్శంగా తీసుకుని తనకుతానే సముదాయించుకుని ధైర్యంగా ముందుకెళ్తాను అంటుంది కిరణ్. ఇక్కడ తన ఆత్మస్థైర్యం కనిపిస్తుంది.
''ప్రేమంటే నిందలేసి నీతినేర్పులోకాన
సేదతీర్చి చేరదీసె జోలపాటే గజల్''.
ప్రస్తుత సమాజంలో ప్రేమ అంటే అదో తప్పుడు భావనతో ఉంటూ ప్రేమించుకునే వారికి వ్యతిరేకంగా మాట్లాడి, మానసికంగా హింసించే ఈ సమాజం నుండి దూరంగా తీసుకెళ్ళి, విశ్రాంతి నిచ్చే జోలపాటనే గజల్ అంటూ పై షేర్లో గజల్ మధురిమను చక్కగా చెప్పారు.
''పసిపాప నవ్వితే నచ్చని వారుంటారా
కలవని నవ్వులకు అంటుకడుతుంటాను నేను''.
ఇక్కడ కిరణ్ కుమారి తన వ్యక్తిత్వాన్ని చెప్పుకున్నట్లు అనిపించింది. అందరితో నవ్వుతూ కలిసి పోయి అందరూ తనవాళ్ళే అనుకోవడం ఆమె ప్రత్యేకత.
''అందరినీ ఒక్కలాగే చూస్తుంది కాలం
ఊహించని మార్పులెన్నో చేస్తుంది కాలం''.
కాలం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది వారివారి వ్యక్తిత్వాలను బట్టి అనుభవాలను బట్టి మార్పు కనిపిస్తుంది అంటారు కవయిత్రి.
''చెట్టుపైన పండనిదే పండైనా రాలుతుందా
మకరందం లేకుంటే తుమ్మెదైనా వాలుతుందా''.
మన దగ్గర ఏదైనా విలువైనది ఉంటేనే కదా లోకం గుర్తించి మన దగ్గర కొస్తారు. పై షేర్లో నేటి సమాజదోరణిని చక్కగా చెప్పారు.
''అనుభవమెపుడూ మన్ను ఆదుకునే నేస్తమే
మందులే లేకుంటే గాయమైనా మారుతుందా''.
గాయం మానాలంటే ముందు వేయాలి. ఎలా జీవించాలో తెలియాలంటే అనుభవాలే నేర్పిస్తాయి.
''బాధలే ఓర్చుకునే నేర్పు ఉందనుకున్నా
సునామీలో పయనం సుఖంగా చేస్తామా'' (7) చూస్తామా
పైషేర్లు నిత్యం మనం చూస్తున్న మన కళ్ళ ముందు జరిగేవే. ఒక్కోటి ఒక్కో నీతిని బోధిస్తాయి. వాస్తవాలను కళ్ళకు కడుతున్నాయి.అర్థం చేసుకుంటే నిరాశను తరిమే ఆయుధాలవుతాయి.
గజల్ ప్రక్రియ కొన్ని నియమ నిబంధనలు ఉండి కఠినంగా అనిపిస్తాయి. గజళ్ళను ఆస్వాదించాలన్నా ప్రక్రియ గురించి తెలియడం అవసరం.
గజల్ అనగా స్త్రీల సంభాషణ. పూర్వకాలంలో స్త్రీల సౌందర్యాన్ని వర్ణించడానికి గజల్ను వాడేవారు. గజల్ అనే పదానికి మూలం టర్కీ భాషలోని పదమైన 'గజాల్'. గజాల నుండి ఆవిర్భవించింది. ఆ పదానికి అర్థం జింక, జింక కన్నులు కల మృగనయన.
పర్షియన్లు ఖసీదా ద్వారా దీన్ని వాడుకలోకి తెచ్చారు.10వ శతాబ్దంలో ముస్లిం రాజుల ప్రాబల్యంలో మొగలులు ఇరానీయుల ఆచార వ్యవహారాలతో పాటు గజల్ను ఇరాన్ నుండి భారతదేశానికి దిగుమతి చేసుకున్నారు.
మిర్జాగాలీబ్ (1797-1869), మహ్మద్ ఇక్బాల్ (1877-1938) ఇరువురూ పారశీ, ఉర్దూ భాషలలో గజల్ రచించారు.
గజల్లో 5షేర్లు/ అషార్లు ఉంటాయి 7,9,11... అషార్లు ఉండవచ్చు. ప్రతీ షేర్లో రెండు మిస్రాలు ఉంటాయి. ప్రతి మిస్రా (పాదం) ఛందస్సు కల్గి ఉంటుంది. గజల్లో మొదటి షేర్ను మత్లా అని, ఆఖరి షేర్ను మఖ్తా అంటారు. మఖ్ తాలో కవి తన తఖల్లుస్ (కలంపేరు) ను ఉపయోగిస్తాడు.
'గజల్ కిరణాలు' సంపుటిలో దాదాపుగా పై నియమాలను అన్నీ పాటిస్తూ రాసిన 41 గజళ్ళు, 21 రుబాయీలు ఉన్నాయి.
వస్తువైవిధ్యంతో చక్కని అభివ్యక్తి కలగలిసిన గజల్ లను ఆస్వాదించాల్సిందే....
''పథకాలు వేసుకుంటే ఫలితం వస్తుందా
పనినే సాధించే ప్రతిభకు వడి ఉండాలి''.
''రహస్యాలన్నీ రచ్చకెక్కినాయంటే
కలిసుండే బంధమెక్కడో చెడి ఉండాలి''.
పై షేర్లు ఎవరికి వారు అన్వయించుకోవచ్చు. ఇలా చేయాలి అలా చేయాలి అని ప్లాన్ చేసుకుంటే సరిపోదు కదా! ఆచరణలో ఉంచితేనే కదా మన ప్రతిభ తెలుస్తుంది. మరో షేర్ స్నేహితులకు ఎక్కువగా వర్తిస్తుంది. కలిసున్నప్పుడు మాట్లాడిన విషయాలు తరువాత బయటపడ్డాయంటే అక్కడ స్నేహం చెడి ఉండాలి.
''నడమంతరపుసిరి నడతను మార్చేస్తుంది
గతాన్ని మరవడం మనిషికి మామూలే'' (5) మామూలే
అనే షేర్లో కష్టపడి సాధించిన ప్రగతి అణకువ నేర్పి ఉన్నత శిఖరాలను చేరుస్తుంది. అనుకోకుండా కలిసొచ్చిన వారి ప్రగతి అంతకుముందు వారికి చేయూత నిచ్చిన వారిని మరవడం మామూలే అంటారు కవయిత్రి.
మానవజన్మ అంటే వరమంటారు కానీ జన్మంతా నటనలో బతకటం మామూలేనంటారు. ఈ ప్రకృతిలోని ప్రతీ అంశం అపురూపమే అయినా లేని అంశాన్ని వెతకటం మామూలే అంటారు.
''స్నేహమె శాశ్వతమని తిరిగితే సరిపోదు
చెడు సంబంధాలు తెంపితేనె జీవితం'' (5) జీవితం
మనకు ఎన్నెన్నో ఇచ్చిన అమ్మానాన్నలను కష్టపెట్టకుండా ఏ కష్టం రాకుండా చూసుకోవడమే వాళ్ళిచ్చిన జీవితానికి అర్థం. బతికినన్నాళ్ళు గొప్పగా బతకాలి. చెడు స్నేహాలకు దూరంగా ఉండాలనే సందేశం పై గజల్లో ఉంది.
''వేడుకలకు సొమ్ములెన్ని వేసుకున్నగాని
నవ్వులనే నగలు కూడా ధరిస్తేనె అందం'' (2) 'అందం' అనే గజల్లో చిరునవ్వు అనే నగతో ఎన్ని బంగారు నగలు వేసుకున్నా సాటిరావు అంటారు. ఈ షేర్లో తను చేస్తున్న అభివ్యక్తి సున్నితత్వం కనిపిస్తుంది.
గజల్ ప్రక్రియ గానయోగ్యమైనది. గద్వాల కిరణ్ కుమారి గజల్లోని సొగసులను మనసులో నిలుపుకుంది. తను రాసిన గజళ్ళలో పల్లెపదచిత్రాలే ఎక్కువగా కనిపిస్తాయి. సమాజంలోని రుగ్మతలు, అన్యాయాలను ఎండగడుతూ రాసిన గజల్ లు మనసును మెలిపెడతాయి.
కిరణ్ కుమారి పరిచయం అయ్యి కొంత కాలమే అయినా 'గజల్ కిరణాలు' చదివిన తర్వాత ఆమె వ్యక్తిత్వం గొప్పతనం అర్థమైంది. స్నేహానికి విలువనిస్తుంది. గాయపడిన హృదయాలకు స్నేహపరిమళాలు అద్ది వారి మనసును గెలుస్తుంది. పచ్చని పైరును చూసి ఆనందించని వారుండరు కానీ ఆ పైరు హొయలలోని సొగసులను, రాగాలను పసిగట్ట గలదు కిరణ్. సమాజాన్ని అంత దగ్గరగా చూస్తుంది. గజల్ రాయగలదు, పాడగలదు. సినారె నే తనకు ఆదర్శం. ఈ సంపుటిలో తను రాసిన రుబాయీలు కూడా ఉన్నాయి. గజళ్ళను ఇష్టపడేవారు చదవాల్సిన పుస్తకమిది.
- వాసరచెట్ల జయంతి,
9985525355