Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతీయ సమాజంలో భార్యాభర్తలది పవిత్ర ప్రేమ, స్నేహబంధం. రెండు తనువులూ, మనసులూ ఒక్కటయ్యే దివ్యబంధం. జీవితమంతా ఒకర్ని విడిచి ఒకరు ఉండలేని మధురానుభూతుల అనుబంధం. చరిత్రలో నూర్జహాను వల్ల తాజ్మహల్ నిర్మాణం, భాగమతి వలన భాగ్యనగర నిర్మాణం భార్యల పట్ల భర్తలకున్న ప్రేమను ప్రకటిస్తాయి. బెజవాడ గోపాలరెడ్డి 'ఆమె'పై కవిత్వం రాసినా, ముగ్దూం మొహియుద్దీన్ ప్రణయ కవిత్వం వల్లించినా భార్యల యెడబాట్లను తట్టుకోలేకనే కదా. ప్రస్తుత కాలంలో స్త్రీలు సైతం ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ, ధర్మంగా కుటుంబానికీ, భర్తలకూ యెడబాట్లు కల్గిస్తుండడం మామూలైపోయింది. ఈ పరిస్థితులను మనసులో దాచుకుని మథనపడుతున్న వారు కొందరైతే కవిత్వమే శ్వాసగా బతికే కోట్ల వెంకటేశ్వరరెడ్డి తన పాణి గృహతి వనజాత ఉద్యోగిస్తూ ఎడబాటు చెందటం తట్టుకోలేక పోతున్నాడు. ప్రతిఫలంగా ఆయన కలం నుండి జాలువారిందే 'అంతర్వాహిని' కవితా సంపుటి. 'విరహం, ప్రణయం, ఎడబాట్లు' కలగలిపిన సంపుటి.
'వనజాత' ''ఆమె అంతే ఏం మాయ చేస్తుందో/ ఎదలో తిష్టవేసి/ అధిష్టాన దేవతౌతుంది'' వెంకటేశ్వరరెడ్డికి. అతని ''లోన వలపు గంటమోగిందా/ ఎదలో ఇక ప్రియరాగాలే'' పలికాయి. అతనికి ''ఆ మనిషీ మాటా కరువైన చోట/ యమకింకరుల స్థిరనివాస'' మని అర్థమైంది. ''ఎడబాటు మాధుర్యాన్ని/ ఒకింత శృతి చేసుకుని'' పాడుకుంటున్నాడు. ''మనకన్నా ఆ పక్షులు మేలు కదా / కూటికోసం పగలంతా రెక్కలల్లార్చినా/ సాయంకాలానికి గూడును చేరుకుంటాయి'' అంటూ నిర్వేదం చెందుతాడు. ''దూరాలను/ చెరిపేసిన ఈ వియోగం/ నా చేత ఎన్ని ప్రేమ గీతాలు రాయించిందో'' అంటూ తపించిపోతాడు.
అందంగా అర్థవంతంగా తీర్చిదిద్దిన ముఖచిత్రంతో వెలువడిన అంతర్వాహినిని పరితాపం పేరిట ముందుమాట రాసిన డా||ఏనుగు నరసింహారెడ్డి అభిప్రాయపడినట్లు పెళ్ళైన ప్రతి కొత్త జంటలకు బహుమతిగా ఇవ్వదగిందే.
అంతర్వాహిని (కవిత్వం), రచన : కోట్ల వెంకటేశ్వరరెడ్డి (944023326), పేజీలు : 64, వెల : 50/-, ప్రతులకు : రచయిత, 431/1/2, భగీరథ కాలనీ, మహబూబ్నగర్ - 509001
- కె.హరనాథ్,
9703542598