Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విత్తనం పంటను వాగ్దానం చేసినట్లు, ఉద్యమం ఉద్యమాల్ని తయారు చేస్తది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అనేక తీరులు పోయింది. కొత్త కొత్త దారులు వేసింది. ప్రతీదారిలో పిల్లాజెల్లా, ఇల్లు వాకిలి వదలి 'జై తెలంగాణ' అంటూ నినదించారు. ఆఫీసుల ముందు ధర్నా, రాస్తారోకో, రైలు రోఖో, బస్సుబందు, దుకాణం బందు, బిల్లు కట్టకపోవుడు, రోడ్లమీద వంట, వాక్ ఫర్ తెలంగాణ, పెన్డౌన్, టూల్ డౌన్, టూల్ డౌన్, శవయాత్ర, ధూంథాం... ఇలాంటి ఎన్నో తీరులు పోయింది ఉద్యమం. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ లాంటి దారులు తెలంగాణను అంతర్జాతీయ వేదికపై తీసుకెళ్ళాయి. 'రాయమల్లు' లాంటి ఉద్యమకారులను తయారుచేశాయి.
'నీళ్ళు, నిధులు, నియామకాలు' అనే ప్రాతిపదికలపై జరిగిన ఉద్యమానికి సబ్బండవర్ణాల మద్దతు దొరికింది. ప్రభుత్వోద్యోగులు, వివిధ కార్పొరేషన్ల ఉద్యోగులు, విద్యార్థులు, స్త్రీలు, పిల్లలు... ఇలా ప్రతి ఒక్కరూ ఇంటి గడప దాటి తెలంగాణ కోసం పోరు చేశారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంటు క్రియాశీలక పాత్ర పోషించాయి. శిఖండి పాత్రను పోషించిన కమిటీలు కూడా వున్నాయి. ఈ మొత్తం అంశం తెలంగాణ జన జీవితాన్ని అతలాకుతలం చేసింది. ఒకవైపు ప్రజల పోరు, మరో వైపు ప్రభుత్వ అణచివేత, ఈ రెంటి మధ్య జనం తుక తుక ఉడికినారు. ఈ క్రమాన్నంతా పెద్దింటి అశోక్ కుమార్ 'లాంగ్మార్చ్' నవలగా చిత్రీకరించారు. మిలియన్ మార్చ్కు ముందు ఉద్యమ దశను తెలుపుతూ, మిలియన్ మార్చ్ విజయవంతం అయిన తీరును చూపుతూ నవల ముగుస్తుంది. 'మిలియన్ మార్చ్'ను దృష్టిలో పెట్టుకుని 'లాంగ్మార్చ్' శీర్షికగా పెట్టి, పల్లెటూరి రైతును నాయకుడిగా చేసి రాసిన నవల ఇది. ఈ నవల నవతెలంగాణ 2017లో నిర్వహించిన 'దాశరథి రంగాచార్య స్మారక రచనల పోటీ'లో నవలా విభాగంలో ప్రథమ బహుమతి గెలుచుకుంది.
ఆద్యంతం పల్లెటూరి వాతావరణ చిత్రణ, వ్యవసాయ పనులు, పశుపోషణ, గ్రామ రాజకీయాలు, నాయకుల వ్యవహారశైలి, పగలు, ద్వేషాలు, పించన్లు, ఇతర సంక్షేమ పథకాల అమలు, వాటిపై ప్రజలకు గల ఆపేక్ష, అవసరం, పని సంబంధాలు, పరస్పర సహాయాలు, రాయమల్లు అమాయకత్వం, గడుసుదనం, ఇకమతులు, సంసార బరువులు, ఉద్యమ నిబద్ధతల మధ్య కొట్టుమిట్టాడే వ్యక్తిత్వం, ప్రభుత్వ అణచివేత, పోలీసుల దమనకాండ, జేఏసీల ఏర్పాటు, వారి నాయకత్వ పటిమ, ఉద్యమ నేతల ప్రస్తావనలు నవలకు నిండుదనాన్నిచ్చాయి. గుమ్ముల కొద్దీ రచయిత వాడిన సామెతలు నవల నడకకు దారుల్ని సుగమం చేశాయి.
ఉపేక్ష అనేది అణచివేత కంటే భయంకరమైనది. ఈ ధోరణి వ్యక్తిని ఆయుధంగా మారుస్తుంది. జాతి యావత్తూ ఉపేక్షకు గురి అయితే..? ఫలితం ఉద్యమంగా తలెత్తుతుంది. తెలంగాణలో జరిగింది అదే. రాష్ట్ర సిద్ది కోసం ఒక్కొక్కరిది ఒక్కోదారి. దారి అనేకంగా చీలడం వల్ల శక్తి సన్నగల్లుతుంది. కనుకనే 'జాయింట్ యాక్షన్ కమిటీ'లు ఏర్పడ్డాయి. ఇవి కూడా ప్రాతినిధ్య స్వభావాల రీత్యా అనేకం. అందులో 'పొలిటికల్ జాక్' ప్రధానంగా కనపడతుంది. ఉద్యమానికి ఇది మార్గనిర్దేశం చేసింది. అందుకే ఉద్యమ నిర్మాణం, నడక సజావుగా సాగినయి. రాయమల్లు లాంటి ఉద్యమ కార్యకర్తలకు, దశరథం లాంటి నాయకులు ఆదర్శపురుషులయ్యారు. వీరే పల్లెల్లోకి మంత్రులు రాకుండా నిలువరించారు. ఈ కార్యకర్తలు మొదట్లో ఇంటా బయటా అవమానాల పాలైనారు. ఫలితంగా మరింత రాటు దేలారు.
రాయమల్లు - లలిత ఇద్దరు భార్యాభర్తలు. తెల్లారి లేసి పని చేసుకుంటేనే బతుకు గడుస్తది వారికి. వీరి బిడ్డ నిండు గర్భిణి. అదొక బాధ్యత కూడా వుంది. ఈ స్థితిలో రాయమల్లు తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. మిలియన్ మార్చ్లో భాగంగా ట్యాంక్బండ్పై వరకు వెళ్ళాడు. ఈ పరిస్థితిలో అంతడెంత యాతన పడ్డాడో నవల విశదీకరించింది. సమ్మె విజయవంతం కావడానికి రాయమల్లు అనుసరించిన పద్ధతులు ఆశ్చర్యాన్ని కలిగిస్తయి. ఊర్లోకి పోలీసులు రాకుండా దారికి అడ్డంగా చెట్లు కొట్టివేయడం, తీట కొలిక్కాయ ఆకులు వేయడం, వాటిని తీయబోయిన పోలీసులకు అది అంటుకుని, గోకుడు పెట్టి ఎర్రగా దద్దులు తేలడం వల్ల ఊర్లోకి రాకుండా పోతారు. సమ్మెకు ప్రజల్ని పురికొల్పడంలో భాగంగా దున్నపోతు వీపు నిండా 'సమ్మె జేస్తున్నం' అని రాసిన కాగితాలు అంటించడం, పిచ్చివాని వేషం వేయడం, దున్నపోతుల బండిని రోడ్డుపై నిలపడం, మూడు తొవ్వల దగ్గర దిష్టి బొమ్మలు పెట్టడం, పాలక్యాన్ పట్టుకుని ప్రయాణం చేయడం లాంటి అనేక ఇకమతులు సమ్మె సాగడానికి ఉపయోగపడ్డాయి.
జె.పి పై దాడి సందర్భంగా ఆంధ్రా పార్టీలన్ని ఏకం కావడం, తెలంగాణ సమస్యపై ఇక్కడి పార్టీల్లో ఏకాభిప్రాయం లేకపోవడం, ఈ సమయంలో టీవీ చానల్స్ ఏకపక్ష ధోరణులను ఉన్నదున్నట్లుగా నవల చిత్రించింది. తెలంగాణ పోరులో క్రియాశీలకంగా ఉన్న తండ్రిని పోలీసులు చితకబాదినట్లు కూతురు కలగనడం, భవిష్యత్లో అది నిజమవడం ఒక మానవీయ కాల్పనికతగా కనిపిస్తుంది. పాలకుల సాచివేత ధోరణికి ఉదాహరణగా శ్రీకృష్ణ కమిటీని చెప్పవచ్చు. ట్యాంక్బండ్పై తలపెట్టిన మిలియన్ మార్చ్ను కట్టడి చేయడానికి పోలీసులు - పాలకులు, విజయవంతం చేయడానికి ప్రజలు చేసిన ప్రయత్నాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణించారు. పల్లెనుంచి ట్యాంక్బండ్పైకి రాయమల్లు చేసిన ప్రయాణం అనేక మలుపులతో, నాటకీయతతో సాగుతుంది. అదొక రోడ్మ్యాప్. తెలంగాణ కల సాకారానికి రహదారి. ట్యాంక్బండ్పై మామా అల్లుళ్ళ కలయిక కొసమెరుపుగా కనిపించినా, అదొక భవిష్యత్ సూచికగా అర్థం చేసుకోవచ్చు. అశోక్ కుమార్ ఫింగర్టిప్స్పై ఉన్న తెలంగాణ భాష కలం ద్వారా ఒలికింది. దవాఖాన పరిసరాల్ని, పోలీస్స్టేషన్ స్థితిగతుల్ని, పేదరికపు ఆనవాళ్ళను అర్థించిన సందర్భాలు తెలంగాణ పల్లెల యథాస్థితిని ముందుంచాయి. నవల చదువుతుంటే గతం జ్ఞాపకం రావడంలోనే రచయిత నైపుణ్యం దాగుంది. రచయిత చెప్పుకున్నట్టే మిలియన్ మార్చ్ నేపథ్యంగా వచ్చిన తొలి నవల ఇది. ఒక్క సంఘటనను నవలగా మార్చిన రచయిత పట్టుదల హర్షణీయం.
- డా||బి.వి.ఎన్.స్వామి,
9247817732