Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ పల్లెల, పట్టణాల జీవన విధానాలను ఔపోసన పట్టి రాసిన కథల సంపుటి 'ఒక వర్షం కురిసిన రోజు'. రచయిత డా|| కాంచనపల్లి గోవర్దనరాజు. ఇందులో 12 కథలున్నాయి. వీటిలో వస్తు వైవిధ్యం, వస్తు విస్తృతి నిబిడీకృతమై వున్నాయి. సమాజాన్ని, మనిషి జీవితంలోని వివిధ పార్శ్వాల్ని అధ్యయనం చేసి రాస్తున్నట్లున్నాయి.
మొదటి కథ 'సంధ్య'. రచయిత తన బాల్యదశలో సహ విద్యార్థిగా పరిచయమైన సంధ్య తనకు ఒక జ్ఞాపకంగా, కవిత్వంగా, కథగా ప్రవహించినట్లుగా చెబుతాడు రచయిత. ఆగయ్య మాస్టారు వంటివారు కర్కశంగా ప్రవర్తించడంపై విద్యార్థుల మనోభావాలెలా దెబ్బతింటాయో పట్టి చూపుతాడు కాంచనపల్లి.
నాన్న హృదయాన్ని ఆవిష్కరించిన కథ 'ఒక వర్షం కురిసిన రోజు'. తెలంగాణ పల్లెల్లో బతుకమ్మ పండుగను వల్లించి చెప్పేది 'బలి బతుకు' కథ. వడ్డీ వ్యాపారి వల్ల బుచ్చయ్య ఇంటికి అగ్గి తగిలితే, ఆ నేపథ్యంగా అమీన్ సాబ్ దొర ఆ సంఘటనను ఎలా తమకనుకూలంగా మలుచుకున్నారో ఈ కథలో తెలుస్తుంది. 'టిట్ ఫర్ టాట్' కథలో మగవారితో సమానంగా ఆడవారికి కూడా అన్ని అవకాశాలు వర్తించాలని తెలియజేస్తుంది. 'చేజారిన స్వప్నం' కథ పాఠకుడిని ఉవ్విళూరిస్తుంది. 'కర్తవ్యం' కథ రచయిత అధ్యాపక వృత్తి అనుభవాలను వింగడించినట్లయ్యింది. ఈ కథల్లో కొన్నాళ్ళ కింది తెలంగాణ పల్లెలు, హైదరాబాద్ జనజీవన పరిస్థితులు దర్శనమిస్తాయి. పాఠకుడిని సుతారంగా చదివించగల నేర్పు కాంచనపల్లి రచనా శిల్పంగా గోచరిస్తుంది.
ఒక వర్షం కురిసిన రోజు (కథల సంపుటి), రచన : డా||కాంచనపల్లి (9676096614), పేజీలు : 112, వెల : 80/-, ప్రతులకు : ఎ.అంజనీదేవి, ప్లాట్ నెం: 2, స్నేహదీప్ అపార్ట్మెంట్, వీధి నెం : 1, ఐకాత్నగర్, తార్నాక, సికింద్రాబాద్ - 17.
- కె.హరనాథ్, 9703542598