Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మేలుకొలిపి ఉద్దీపింపజేయడమే సాహిత్యం పని' అని అంటాడు గోర్కీ. సుమారు 25 ఏండ్లుగా ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ తన కవిత్వంలో అదే పని చేస్తున్నాడు. తాను జాగృతమవుతూ సమాజాన్ని జాగృతం చేస్తున్నాడు. ప్రకృతితో, ప్రజలతో, ప్రభుత్వాలతో తన కవిత్వంతో నిరంతరం సంభాషిస్తున్నాడు. జీవితమూ - సాహిత్యమూ బింబ - ప్రతిబింబాలన్న ఎరుక వున్నందునే బాధ్యతాయుతమైన కవిగా కవిత్వాన్ని సృజిస్తున్నాడు. కవిత్వం ఉన్నతమైన కళారూపంగా ఎంచి తన భావోద్వేగాలను బలంగా కవిత్వరూపంలోనే వ్యక్తీకరిస్తున్నాడు. పది కవిత్వ పుస్తకాలను అన్నవరం ఇప్పటి వరకు వెలువరించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత... ఈ నాలుగైదేండ్లలో, 'బువ్వకుండ (దీర్ఘకవిత), ఇంటిదీపం, వరిగొలుసులు' కవితా సంపుటులను ఆయన తీసుకొచ్చారు.
రాష్ట్ర సాధన కోసం ఉధృతంగా సాగిన మలిదశ ఉద్యమంలో కవిత్వాన్ని పండించి ప్రజాక్షేత్రంలో భావాలను మండించిన కవిగా సుప్రసిద్ధుడు అన్నవరం. తెలంగాణ లొల్లిలో కలాలు చేబూని కవిత్వ జెండాలై ఎందరో కవులు నినదించారు. స్వరాష్ట్ర కల సాకారమైంది. తదనంతర కాలంలో తెలంగాణ కవి జెండా, అజెండాలు ఏమిటి? ఈ చౌరస్తా నుంచి అతడి పయనం ఎటువైపు? నిస్తేజం, నిశ్శబ్దం తెలంగాణ కవన క్షేత్రంలో అలముకున్నాయా? రకరకాల ప్రశ్నలు, వ్యాఖ్యలు విమర్శకుల నుంచి విన్నాం. ఇంకా కొండకచో వింటున్నాం. తెలంగాణ కవి మెలకువతో వున్నాడని నిద్రాణమైన వారిని మేల్కొలుపుతూనే ఉన్నాడని అనడానికి నిరంతరం వెలుగు రవ్వలై విరబూస్తున్న అన్నవరం కవిత్వమే తార్కాణం. అనునిత్యం కవితా సేద్యం చేసే శ్రామికుడి కవిత్వం పరిశీలిస్తే బాధ్యత ఎరిగిన కవులు తెలంగాణలో ఏం చేస్తున్నారో బోధపడుతుంది.
ప్రతి అంశాన్ని, సందర్భాన్నీ సునిశిత దృష్టితో పరిశీలిస్తాడు. సున్నితమైన మనసుతో స్పందిస్తాడు. సుదీర్ఘమైన అనుభవంతో సంపాదించిన ప్రతిభతో ప్రతి వస్తువునూ అద్భుతమైన కవితగా తీర్చిదిద్దుతాడు. తనదైన సొంత అభివ్యక్తి వల్ల కవితా నిర్మాణంలో అన్నవరంది ప్రత్యేక ముద్ర కనిపిస్తుంది. ''కవిత్వం కొద్దిగా రాసినా, ఎక్కువగా రాసినా తన సొంతమని చెప్పుకోదగిన శైలిని స్థాపించుకోలేని వాడు సాహిత్య చరిత్రలో నిలదొక్కుకోలేడు'' అని కుందుర్తి ఒక చోట పేర్కొన్నాడు. ఆది నుంచి అన్నవరం తనదైన శైలి పాటిస్తూ వస్తున్నాడు. ఆయన భాష ఇంటి భాష. ఆయన వాక్య నిర్మాణం తెలంగాణ సొబగులను అద్దుకుని సహజ శోభతో ఆకట్టుకుంటుంది. ఈ కవికి తనదైన కవిత్వీకరించే పద్ధతి ఒకటుంది. సహజ సంభాషణలాగా సమూహపు చలన శీలతను పట్టుకున్నవాడిగా కవిత ఎత్తుగడలో, నడతలో తెలంగాణ తనాన్ని అచ్చంగా ప్రదర్శిస్తాడు.
తెలంగాణ ఆవిర్భవించిన తరుణంలో పిల్లవాడి తీరుగ కవి ఎంతో సంబరపడ్డాడు. అదే సమయంలో ఆదివాసీల బతుకులను పణంగా పెట్టి ఆశయాన్ని సాధించుకోవడం కవికి అమానవీయంగా తోచింది. అదివాసుల కోసం మానవీయ కవిగా ఎంతో ఆవేదన చెందాడు.
''ఆదివాసుల పునరావాసం అంటే
చెట్ల నుంచి ఆకులు తెంపేసినట్లు
నీళ్ళ నుంచి అలలను వేరు చేసినట్లు
రేపు వాళ్ళు నోరు లేని పక్షులోలె
అవుగోలిస్తరు'' అని 'గరళపోలవరం' (ఇంటిదీపం) కవితలో కవి ఆందోళన పడ్డాడు. రాష్ట్ర ఆవిర్భావానంతరం కొందరు పెద్దల తీరు కవికి రుచించలేదు.
''మన ఇంటి దీపం కదా అని
ముద్దిచ్చుకుంటానంటే
మూతిమీసం కమిరిపోవచ్చునేమో'' అంటూ కవి 'కొత్త ప్రశ్నలు' (ఇంటిదీపం) కవితలో మేధావులను హెచ్చరిస్తాడు. సింహాసనానికీ, సామాన్యులకూ మధ్యనున్న వైరుధ్యాలు ఎరిగిన కవిగా కవితను చక్కగా నడిపించాడు.
ఇంటిదీపం కవితా సంపుటిలో అదే పేరుతో తన తండ్రి యాదిలో రాసుకున్న కవిత పాఠకులను కదిలిపోయేలా చేస్తుంది.
''నాన్నా నీవు
నా బతుకు పందిరి గుంజవు
అఆలు దిద్దిచ్చిన సుద్దముక్కవు
నిటారుగా నిలబెట్టిన ఇంటి నిట్టాడువు
నిత్యం వెలుగుతున్న దీపానివి'' అంటూ రోజుకొక్కసారైనా కలలోనైనా కనిపించవా అంటూ కవి తన నాన్నను అభ్యర్ధిస్తాడు. అమ్మ, జీవన సహచరి, సోపతిగాడు, మనుమరాలుపై కవి కళాఖండాల్లాంటి కవితలను అల్లినాడు.
కవిత్వంలో జీవితంలో ముక్కుసూటిగా వ్యవహరించే కవి, మనసు గాయపడ్డ సందర్భంలో... 'వరి గొలుసులు' కవితా సంపుటిలోని 'శూల', 'చెవుల కిటికి' పద్యాలు రాసుకున్నట్లు అవగతమవుతోంది.
''దేహాత్మకు కుచ్చుకున్న కాట్లు
పెయ్యంత ఇడవారి వడివెడుతున్నయి
అపనిందల అల్లికల సూదుల వల్ల
అనుబంధాల వస్త్రం ఇచ్చుల్లారం''
అన్నవరం దేవేందర్ కవిత్వం నిండా మట్టి సుగంధం పరిమళిస్తూనే వుంటుంది. 'వరి గొలుసులు' కవితా సంపుటిలోని 'వ్యవసాయ శాస్త్రం, భూమి పుత్రుల పాదయాత్ర, తల్లివేరు, పురుగు, అపచారం, దుక్కం ఎక్కిల్లు' తదితర కవితల్లో రైతు జీవితాన్ని కవి బొమ్మ కట్టిస్తాడు.
అన్నవరంది నిరంతర కవితాధార. తనలో అస్తిత్వ స్పృహ ఆరిపోనీకుండా జాగరూకతతో వుంటూనే తన సమూహాన్ని మేల్కొలిపే కవిత్వాన్ని రాస్తున్నాడు. చెరువులు, చెట్లు, గుట్టలు, జలపాతాలు, ఓపెన్కాస్ట్, బొందల గడ్డల గురించి కవి కవిత్వం రాస్తున్నాడు. వనరుల విధ్వంసంపై కవి కన్నెర్ర జేస్తున్నాడు.
''వేల ఏండ్ల నాటి ప్రాకృతిక విధ్వంసక క్రియ
పల్లె గుండె మీద ప్రొక్లెయిన్ గాట్లు
చెల్లా చెదురైన కోతులు కొండెంగలు
కన్నీరొలికి... కూలిపోయిన పండ్ల చెట్లు'' అంటూ పుట్టుమచ్చలు (వరి గొలుసులు) లో గుట్టల విధ్వంసాన్ని దృశ్యమానం చేశాడు కవి. మానవ సంబంధాల ఔన్నత్యం గురించే కవి సతతం ఆలోచన చేస్తూ 'సోపతి' లాంటి మంచి కవితను అందించారు.
''బాధల గాధలు బొక్కెనతో చేది
తల్లడిల్లిన మనసును సేద తీర్చేందుకు
సావాసగాళ్ళు ఒక్కరిద్దరైనా ఉండాలి'' అంటూ సోపతి విలువను కవి వివరిస్తాడు. తన కళ్ళు క్లిక్ మనిపించిన ప్రతి దృశ్యాన్ని కవిత్వం చేస్తున్నట్లుగానే, తాను చేసిన ప్రయాణాలు, అనుభవంలోకి వచ్చిన కొత్త స్థలాల విషయాల గురించి కవి ట్రావెలాగ్ మాదిరి కవిత్వం వినూత్నంగా రాస్తున్నాడు. త్రివేండ్రం వెళ్ళి కోవలం బీచ్ను చూసి 'కోవెలం' కవితను సృష్టించాడు కవి.
సామాజిక బాధ్యతెరిగి, స్పష్టమైన చూపున్న ఈ కవి నుంచి వినూత్నమైన వస్తువులపై కవిత్వాన్ని దర్శిస్తాం. పల్లెం, తువ్వాల, ప్రజ్ఞాపూర్, అచ్చు అచ్చు (జిరాక్స్), దంతదావనం, అరచేతిలో అంటువ్యాధి, ఇనుము లోహం ఆత్మకథ (లోకం కోసం) లాంటి విభిన్నమైన వస్తువులు ఈ కవి చేతిలో పడి కళాత్మక రూపాలు రూపాంతరం చెందుతాయి. కవి ఏది చెప్పినా నిర్భయంగా, నిశ్చలమైన అభిప్రాయంతో ఘంటాపథంగా చెబుతాడు. ఆహారంపై ఆంక్షలు కూడదంటూ శాకం (ఇంటిదీపం) కవిత రాశాడు. చుక్కల్ని తాకి అంతరిక్ష రహస్యాలను ఛేదించాల్సిన వాడిగా అర్ధాంతరంగా బతుకు చాలిస్తావా అంటూ రోహిత్ బలవన్మరణంపై గెలాక్సి (ఇంటిదీపం) కవితలో కవి కలత చెందాడు. తాను ఏమిటో, తన మార్గం ఏమిటో 'మార్గం, పాసంగం, తత్వం' కవితల్లో కవి చెప్పుకుంటాడు. 'బతుకు, తెలంగాణుడు' కవితల్లో తెలంగాణ వాడంటే ఏమిటో విస్పష్టమైన ప్రకటన చేస్తాడు ఈ కవి. 'శుభం, ఇంటిపని' కవితలను బట్టి కవికి జెండర్ స్పృహ వుందని పాఠకునికి అర్థం అవుతుంది. 'బాస్' అనే కవితలో భాషపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించాడు.
''ఎవల మాట వాల్ల భాష
ఎవల భాష వాల్లకు భూషణం
పరాయి గొంతుకలకది మాండలీకం'' అంటూ తెలంగాణ భాషపై తన మమకారాన్ని పునరుద్ఘాటిస్తాడు. జీవితంలోని ప్రతి ప్రార్శ్వాన్ని తన కవిత్వం ద్వారా స్పృశిస్తూ, అభివ్యక్తిని వెల్లడిస్తున్నాడు. జీవితం జీవించడానికేనంటూ ఎన్నో ఇకమతులు తన కవిత్వంలో చెబుతూ వ్యక్తిత్వ వికాసాన్ని అందిస్తాడు కవి. బతకడానికి అనేక పద్ధతులున్నాయి. బతుకు చాలించవద్దని రైతుకు 'భరోసా' ఇస్తాడు కవి. జీవనోత్సాహం మానవ సంబంధాల్లో పరిఢవిల్లాలని కోరుకుంటాడు. సొంత అభివ్యక్తితో ఏ వస్తువునైనా కళాత్మకం గావించే కవి అన్నవరం దేవేందర్, వర్థమాన కవులకు ఆదర్శనీయం.
(అన్నవరం దేవేందర్ ఈ నెల 15న ఉదారి నాగదాసు రాష్ట్రస్థాయి సాహిత్య పురస్కారం అందుకుంటున్న సందర్భంగా)
- సి.వి.కుమార్, 9849902910