Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వీణావేదనం కథల్లో వైవిధ్యముంది. చదివించే గుణముంది. ఎవరి దృష్టి పడని కథా వస్తువుల్ని రచయిత ఎంపిక చేసుకున్నారు. ఇవన్నీ సామాజిక జీవితంలోనివే. వీటిలో ఉత్తరాంధ్ర వాతావరణం కనిపిస్తుంది. వీణలకు బొబ్బిలి ప్రసిద్ధి. అక్కడ వీణలు తయారు చేసేవారి దయనీయ స్థితిని వీణావేదనం కథలో రచయిత కళ్ళకు కట్టినట్లు వివరించారు. అడవిలో వినసొంపుగా పిల్లనగ్రోవి వాయించే గోపన్న పట్టణంలో ఇమడలేక తిరిగి ఎవ్వరికీ చెప్పకుండా అడవికే పారిపోయిన వైనాన్ని పంజరం కథలో చెప్పారు. ఈ కథలోనే కాకుండా అడవి కథలో కూడా అటవీ సౌందర్యాన్ని రచయిత దృశ్యమానం చేశారు. అడవి కథలో ఆదివాసీల తిరుగుబాటు కనిపిస్తుంది. ఉన్నత చదువులు చదివి డాలర్ల వేటలో పడి అమెరికాకు ఎగిరిపోకుండా గిరిజన పల్లెల్లో పనిచేసే యువతీయువకులు వీణా వేదనంలోని కొన్ని కథల్లో కనిపిస్తారు.
ధర్మో రక్షతి రక్షిత:, త్రినేత్రం కథల ద్వారా మానవ సేవే మాధవ సేవ అని సందేశమిచ్చారు. కొద్దిపాటి తేడాతో ఈ కథలు ఒకేలా వున్నాయి. ఈ కథల రూపం వేరైనప్పటికీ ప్రాణం మాత్రం ఒక్కటే.
అనారోగ్యం పాలైన కుమారుడు లేదా కుమార్తెకు ఆరోగ్యం చేకూరితే తిరపతికొచ్చి హుండీలో లక్షరూపాయలు వేస్తామని వెంకటేశ్వరునికి మొక్కుకోవడం ఈ రెండు కథల్లో వుంది. సరిగ్గా అదే సమయంలో ఒక విద్యార్థికి గుండె ఆపరేషన్ కోసం సమాచార సాధనాల ద్వారా ఆర్థిక సహాయన్ని అర్థించడం రెండు కథల్లో వుంది. ముడుపు కట్టిన లక్షరూపాయలను గుండె ఆపరేషన్ కోసం పంపడం రెండు కథల్లో వుంది. గుండె ఆపరేషన్తో ఆరోగ్యవంతుడైన విద్యార్థి పెరిగి పెద్దయ్యాక సైన్యంలో చేరి కొంతమంది ప్రాణాలను రక్షించడం రెండు కథల్లోనూ వుంది. ఇదే ఈ రెండు కథల్లో కీలకమైన అంశం. వీణావేదనం కథలో 'నగుమోము కనలేని నా జాబిలి' అని రాయడం సరికాదు. 'నగుమోము కనలేని నా జాలి తెలిసీ' అని వుండాలి.
వీణావేదనం, రచయిత : గన్నవరపు నరసింహమూర్తి, పేజీలు : , వెల : 100/-, ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు.
- తెలిదేవర భానుమూర్తి,
9959150491