Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిక్కని పచ్చదనపు పట్టువస్త్రాన్ని కట్టుకున్నట్టుందిప్పుడు నల్లమల. ఎగిరే పక్షులకు, గంతులేస్తున్న లేడి గుంపులకు, అడవికి పహారా కాసే పులులకు, జానపండ్లు, ఇర్కిపండ్లు, కందమూలాలతో జీవనం గడిపే చెంచులకు, సమస్త అడవి బిడ్డలకు తన చల్లని కొంగును కప్పి ఒడినింపుకున్నది నల్లమల. ప్రకృతి మనకందించిన పచ్చని పందిరి ఇది. పర్యావరణ, జీవావరణ జీవగడ్డ నల్లమల. ఆదివాసీలే కాదు అనేకుల, బహుజనుల జీవనాన్ని ముడివేసుకున్న వనతోరణం నల్లమల.
ఇప్పుడక్కడొక అలజడి చెలరేగుతున్నది. పులి కళ్ళలో కలవరం మొదలయింది. లేడిపిల్ల జంకుతో పరుగెడుతున్నది. పక్షుల గొంతులు రక్షణకై అరుస్తున్నవి. ఆ నేలపై హంతకుడెవరో కాలుమోపాడని వాసన పసికట్టే పనిలో మునిగాయి శునకాలు. పచ్చని వదనంపై ఏదో దిగులు వెలుగుతున్నది. నివురు కప్పేసిన నిప్పుల్లా గుండెలు చప్పుడు చేయటం లేదు. ఏమీ తెలియని పిల్లలు ఆ నేలపైనే సామ్రాజ్యాధిపతుల్లా సంచరిస్తున్నారు. రేణుక ఎల్లమ్మకు మొక్కినట్టే వచ్చే పోయేవాళ్ళకు దండాలు పెట్టి వేడుకుంటున్న ముడతలు తేరిన చేతులు. రేపటి ఆకాశం నల్లని మబ్బులు పులుముకుంటే ఆ నేలన చీకటి వర్షం ముంచెత్తుతుంది. అందుకే అక్కడి ప్రతి ఇంట్లో బెంగ పరచుకుంది. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడమెలాగో అందరికీ తెలుసు. ఇది మనుషులు తెస్తున్న విపత్తు. వీళ్ళు ఒఠ్ఠి మనుషులు కాదు. అధికారపు పెద్దమనుషులు. దీన్ని ఎదుర్కోవడానికి ఆయుధాలు సమకూర్చుకోవాలి. గొంతులు విల్లంబులవ్వాలి.
నల్లమల ప్రాంతంలో యురేనియం తవ్వకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పరీక్షలకు పూనుకొని, ఎవరికీ తెలియకుండానే బోరుబావులేసింది. మన రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుమతి ఇచ్చిందా? దాని విధానమేమిటో ఇంకా స్పష్టం కాలేదు. కానీ మౌనం వహిస్తున్నది. ఈ యురేనియం తవ్వకాల వల్ల అనేక అనర్థాలు కలుగుతాయని, భావితరాలకూ తీవ్ర నష్టం జరుగుతుందని అనేకమంది పర్యావరణవేత్తలు, మానవ హక్కుల సంఘాలు వివరిస్తున్నాయి. ఒకటి... అక్కడి ఆదివాసీల సాంస్కృతిక జీవనం విచ్ఛిన్నమవుతుంది. ఆ చుట్టుపక్కల జీవిస్తున్న వేలాది ప్రజలు గెంటివేయబడతారు. నల్లమల అటవీ జీవావరణమంతా విధ్వంసానికి గురవుతుంది. నీరు, వాయువు కలుషితమవుతాయి. వాతావరణం విషతుల్యమవుతుంది. పచ్చదనమంతా బుగ్గిపాలవుతుంది. ఇంత విధ్వంసం చేసి ఎవరి అభివృద్ధికి ఈ యురేనియం వెలికితీత? మానవ మనుగడకే గొడ్డలి పెట్టులాంటి అభివృద్ధి మనకక్కరలేదు. ఆ అణువిద్యుత్తు వెలుగులు ఎవరి ఇంటి కోసం? అణుశక్తి విస్ఫోటనాలు ఎవరి రక్షణకోసం? ఏ సంస్థ లాభాల కోసమో, ఎవరెవరి జేబులు ఈ పేరున నింపడానికో ఇక్కడి బతుకులను, భవిష్యత్తును తవ్వేస్తారు. వద్దు! వద్దేవద్దు! ఇదొక మోసపు మాయాప్రగతి. సామాన్యుల సహజ సంపదల దోపిడీకి పన్నిన కుట్రకు శృతి.
ఒక విచిత్రాన్ని చూడండి... ఒక వైపు యాదాద్రిలో దైవం నరసింహుడి భార్య చెంచులక్ష్మి. ఈ గుడిలో చెంచులక్ష్మి కొలువై వుండేందుకు కోట్ల రూపాయల ఖర్చుతో ఆలయ నిర్మాణం, విగ్రహాల ఏర్పాట్లు. కానీ నిజ జీవితాలను ఈడుస్తున్న నల్లమల అడవులలోని ఆదివాసీ చెంచులను మాత్రం వారికి నెలవు లేకుండా తరిమే కుట్రలు తలపెట్టడం ఎంత దుర్మార్గం. 'మనిషి చేసిన రాయిరప్పకు మహిమ కలదని సాగిమొక్కుతూ, మనుషులను హీనంగా చూస్తావేమిటని' ఆనాడే కవులు ప్రశ్నించారు. దాని అక్షరాలా ఆచరించి చూపిస్తున్నారు. అడవులను కాపాడాలని, మొక్కలు నాటాలని మహౌద్యమాలు చేపడుతున్న ప్రభుత్వాలు పచ్చగా నిండైన వనాలున్న నేలను తవ్వకాలతో ధ్వంసం చేయపూనుకోవడం ఏ ప్రయోజనం కోసం? బతుకుదెరువు కోసం పోడు చేసుకుంటున్న పేద ఆదివాసీలను నిరోధిస్తూ, నిర్బంధిస్తూ, అడవిని ఆగం చేయొద్దని సుద్దులు చెప్పే పెద్దలు నల్లమల అడవిని అణుధార్మికతతో, వ్యర్థాలతో ముంచేయటానికి సన్నద్ధమంటం ఏ రకమైన నీతి? నువ్వు చేస్తున్న పనిలో నిజాయితీ వుంటే, నిజంగా ప్రజల కోసమే అయితే, ముందుగా ప్రజలతో చర్చించాలి. వాళ్ళ అభిప్రాయాలనూ వినాలి. స్థానిక ప్రజా ప్రతినిధుల సమ్మతి తీసుకోవాలి. ఇది ప్రజాస్వామ్య పద్ధతి. ఇవేమీ లేకుండా దొంగల్లా దాడి చేయటంలోనే దోపిడీ జరుగుతోందని అర్థమవుతున్నది.
ఒకవైపు సామాన్య ప్రజల జీవన విచ్ఛిన్నం. సాంస్కృతిక విధ్వంసం, ప్రజల బతుకుదెరువును బలిపెట్టడం. రెండోది, వేల ఎకరాల్లో పర్యావరణాన్ని, జీవావరణాన్ని నాశనం చేయటం. వేలాది కిలోమీటర్ల పొడవునా జలాలను, వాతావరణాన్ని కాలుష్యమయం చేయటం. దీన్ని నిలువరించాలి. అడ్డుకోవాలి. సాటి ప్రజల పట్ల మన కనీస బాధ్యత పర్యావరణ రక్షణ పట్ల నిబద్ధత. అందుకు కలాలు, గళాలు గల గొంతులు తమ బాధ్యతగా నల్లమలను కాపాడుకుందామనే నినాదంతో తెలంగాణ సాహితి, ప్రజా నాట్యమండలి కలిసి ఆ ప్రాంతంలో పర్యటించి ప్రజలతో చర్చించింది. అవును, కవులు కేవలం సాక్షులుగానే వుండేందుకు వీలులేదు. కన్నీళ్ళను తుడిచే కర్తవ్యాన్ని చేపట్టాలి. అందుకనుగుణంగానే ముప్పయి ఐదు మంది కవులు కళాకారులు నల్లమల పరిసర గ్రామాలను ఇటీవల సందర్శించింది. అమ్రాబాద్, పదర మండలాలోని గ్రామాలలోని ప్రజలు, చెంచులతో మాట్లాడింది. ''మా ప్రాణాలు పోయినా మా నేలను మేం వదిలేదు లేదు, తరతరాలుగా ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినం. మా బతుకుల్ని ఛిద్రం చేస్తానంటే ఊరుకోం. ప్రాణం వున్నంతవరకూ పోరాడుతాం'' అంటూ అక్కడి ప్రజలు తీవ్ర స్వరంతో నినదించారు. ముఖ్యంగా మహిళలు ఎంతో ఆవేదనతో ఆక్రోశించారు. ''మీ పోరాటానికి, ఉద్యమానికి మా కాలాలను, గళాలను తోడుగా వుంచుతాం. మీ గొంతును మా గొంతుగా చేసుకుని ప్రపంచానికి వినిపిస్తాం'' అంటూ వారికి మద్దతును ప్రకటించాం. పరస్పరం చైతన్యాన్ని నింపుకున్నాం. నవలాకారులు, కథారచయితలు, కవులు, కళాకారులు, గేయ రచయితలు, మేధావులు, విమర్శకులు, పండితులు పాల్గొన్న ఈ పర్యటన ఎంతో చైతన్యయుతంగా సాగింది.
జనులకు, జీవరాసులకు నీడను పంచుతున్న నల్లమలను, కలాలను ఎక్కుపెట్టి కాపాడుకుంటామని, కర్తవ్యానికి పూనుకుంటామని తెలియజేయటమే ఈ పర్యటన ఉద్దేశం.
- కె.ఆనందాచారి,
9948787660