Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తరుణ దశలోనే తెలుగు పరిశోధన రంగంలో తనదైన సంతకాన్ని ముద్రించేసుకున్న తెలుగు సాహిత్య సంశోధకుడు ఆచార్య వెలుదండ నిత్యానందరావు. ఎదిగిన కొద్దీ ఒదిగిన వైదుష్యవటక్ష్మాజం, నిరాడంబరుడు, నిగర్వి, వాత్సల్యభావ సంపన్నుడు, ప్రగల్బాలు పలకని కార్యసాధకుడు, పరిశోధన తప్ప పరమెరుగని సులక్షణ తపస్వి ఆయన.
తెలుగు సారస్వతాంబుధిని మథించిన వెలుదండ పండితోత్తముల ఇంట శ్రీమతి లక్ష్మమ్మ, రామేశ్వరరావు దంపతులకు ఆగష్టు 9న, 1962లో నాగర్ కర్నూల్ జిల్లా మంగునూరులో జన్మించాడు. మంగునూరులో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని, శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ ప్రాచ్య కళాశాల, పాలెంలో డిగ్రీ వరకూ చదివాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ., ఎం.ఫిల్., పిహెచ్.డి. పూర్తి చేసుకొని తను చదివిన విశ్వవిద్యాలయ తెలుగుశాఖలో 1988-92 వరకూ పార్ట్ టైమ్ లెక్చరరుగా చేసి, తదనంతరం లెక్చరరుగా, సహాయాచార్యుడుగా, ఆచార్యుడుగా ఎదిగి పదవీ విరమణకు చేరువలో ఉన్నారు. తెలుగు పరిశోధనకు మారుపేరుగా మారిన వెలుదండ నిత్యానందరావు పేరు తెలియని తెలుగు పరిశోధకుడు ఉండడంటే అతిశయోక్తి కాదేమో.
డిగ్రీ స్థాయిలో శ్రీ రంగాచార్యులు, కపిలవాయి లింగమూర్తి మొదలైనవారు, పి.జి. స్థాయిలో సి.నా.రె, ఎల్లూరి శివారెడ్డి, ఎస్వీ రామారావు మొదలైన సరస్వతీ పుత్రుల సౌహార్దపూర్వక వాత్సల్యానికి, అమేయమైన విద్వద్భావానికి పాత్రుడయ్యాడు. వారి ఆశీస్సులు, సదుపదేశాలు, నిరంతర సాహిత్యాధ్యయనం అన్నీ కలసి భవిష్యత్కాలంలో కవిగా, కథకుడుగా, నాటకకర్తగా, ప్రవక్తగా, సమీక్షకుడుగా, సంపాదకుడుగా, మేటి ఆచార్యుడుగా బహుముఖీనతను సంతరింపజేసాయి. అన్నింటికీ మించి మాహావ్యాసకారుడుగా, అసమాన ప్రతిభానమూర్తిగా నిత్యానందరావును నిలబెట్టాయి.
స్నాతకోత్తర విద్యానంతరం ప్రతి విద్యార్థికి ఎదురయ్యే సమస్య పరిశోధనాంశాన్ని ఎన్నుకోవడం. పరిశోధక ప్రకృత్తి కలవాడు కాబట్టి ఈ సమస్యను ముందుగానే ఊహించి, సమస్యా పరిష్కానికిగాను సుమారు మూడు దశబ్దాలకు క్రితమే, సాంకేతికాభివృద్ధి ఇంతగా చేరువలో లేని రోజులలోనే అవిభాజ్య ఆంధ్రదేశంలో వివిధ విశ్వవిద్యాలయాలలోని తెలుగు విభాగాలలో వచ్చిన ఎం.ఫిల్, పిహెచ్.డి పరిశోధన వివరాలను ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి సేకరించి 1998లో 'విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన'గా వేశాడు. ప్రభుత్వ సంస్థలో, సాహిత్య అకాడెమీలో, విశ్వవిద్యాలయాలో పూనుకొని చేయాల్సిన పనిని ఒంటిచేత్తో చేశాడు. విద్యార్థి దశలోనే ఇంతటి జిజ్ఞాసను కనబరచిన కార్యశీలి వెలుదండ. 2004, 2013లో పరివర్ధిత ముద్రణలను పొందిన ఈ గ్రంథం పరిశోధక విద్యార్థుల చేతులలో ఒదిగే దిక్సూచి.
డిగ్రీ రోజుల్లోనే వందలకొద్దీ పరిశోధన వ్యాసాలను ప్రకటించిన గరిమతో, ప్రాచీనాధునిక సాహిత్యకారులందరూ రంకుమాటల ప్రబంధమని ఈసడించిన 'చంద్రరేఖా విలాపం' ఎం.ఫిల్ పరిశీలనాంశంగా తీసుకొని అందరిని విస్మయపరిచాడు. ఈ విషయం విని ఎంతోమంది వికటభ్రుకుటులైనా, మరెంతో మంది ఉలిక్కిపడ్డా ఆయన వెనుదిరిగి చూడలేదు. పరిశోధన దాహార్తియై సాగిపోయాడు. ఈ పరిశోధనలో ఆయన ఎన్నో కొత్త సంగతులను తెలిపి, తొలి వికట ప్రబంధం పైన సమగ్ర పరిశీలన చేసి ఆ విలాసకృతి యొక్క కవితలోని ప్రౌఢ సమంచిత పదగుంభితనాన్ని, సరసహాస్యాలను బయల్పరిచి పరిశోధకుడికి పరిధులుండరాదని చాటాడు.
ఆది నుంచి ఎవ్వరినీ నొప్పించని మనస్తత్త్వం, అందరితో హాయిగా, ఆహ్లాదంగా మెలిగే వ్యక్తిత్వం, ఆయనలో ఎంత పాండితీ ప్రకర్ష ఉన్నా సరదాగా సాగిపోయే తత్త్వం కావడం వల్ల ఆ అభిరుచితో 'తెలుగు సాహిత్యంలో పేరడీ' అనే అంశంపై శోధించి డాక్టరేటు పొందాడు. పేరడీపై అంతకు మునుపే ఒకటీ, రెండు పుస్తకాలు వచ్చినా అవి సమగ్ర లక్షణాలను నిరూపించలేదు. ఈ పిహెచ్.డి గ్రంథాన్ని నిత్యానందరావు నూత్నగవేషణతో, వివేచనాత్మక విశ్లేషణతో పరిశీలించి, సుస్పష్టంగా, సుబోధకంగా పేరడీ తత్త్వాన్ని విశదీకరించాడు. ఇందులోని నిర్దిష్టత, నిర్దుష్టత ఈ గ్రంథ ప్రామాణికతకు, నిత్యానందరావులోని చిత్తశుద్ధికి, పరిశోధన శీలానికి నిదర్శనంగా నిలుస్తాయి. ఈ గ్రంథం వెలుదండ విమర్శన పాటవానికి ప్రస్ఫుట దర్పణం.
భారతదేశాన్ని నిత్యప్రభావితం చేసే వందేమాతరగీత సృష్టికర్త బంకించంద్రుడి గురించి ఎరుగని భారతీయుడుండడు. రవీంద్రుని కంటే మునుపే తెలుగు నేలకు సుపరిచితుడాయన. భారతజాతి పునరుజ్జీవన చేతనను మరొక్కసారి తెలుగు పాఠకులకు తెలియజెప్పేందుకు చేసిన అపురూప ప్రయత్నమే 'భారతీయ జ్వలిత చేతన-బంకించంద్ర' చారిత్రక, కల్పానిక రచనా శైలిలో సాగిన ఈ రచన నిత్యానందరావులోని గొప్ప రచయితను పరిచయం చేస్తుంది. ఆద్యంతం గంగాప్రవాహంలా సాగిపోయే ఈ రచనను ఎన్నో ఏళ్ళ క్రితం మొదలుపెట్టి కొద్దిగా రాసిన తర్వాత అటకెక్కిన ఈ రచన 2006లో పుస్తకంగా వచ్చింది. ఎన్నో ఏళ్ళ విరామం తర్వాత పూర్తి చేసిందైనా పుస్తకమంతా ఒకే శైలిలో కొనసాగడం విశేషం.
తెలుగు సాహిత్యంలో వచ్చిన హాస్య సన్నివేశాలను చక్కని విశ్లేషణగా మలచి రూపొందించిన మరో పరిశోధనాత్మక వ్యాసావళి 'హాసవిలాసం' ఇది 2005లో వచ్చింది. ఇందులో వివిధ కవి, రచయితలు సందర్భానుసారంగా తమ రచనలలో పొదిగిన సునిశితమైన హాస్యస్ఫోరక సన్నివేశ మౌక్తికాలను ఏరికూర్చి అందించాడు. 2007లో 'నిత్యవైవిధ్యం' పేరుతో విభిన్నమైన పరిశోధనాత్మక వ్యాసాలను అందించాడు. 2010లో అచ్చైన 'నిత్యానుశీలనం' ఆయనలోని నిరంతరాధ్యయన శీలతను తెలుపుతుంది. 2018లో వచ్చిన సాహిత్య దీర్ఘవ్యాస సమాహారం 'నిత్యాన్వేషణం' ఆయన పరిశీలన దృష్టికీ, ఎడతెగని శ్రమకు, నిత్య జ్ఞాన సముపార్జన పిపాసకు నిరూపణం. ఈ మధ్య కాలంలో వస్తున్న ఏ వ్యాస సంకలనాలలోని వ్యాసాల నిడివి చూసినా ఐదు నుండి పది పుటలకే పరిమితమవడం మామూలైంది. కానీ దీనిలో 25 పుటల నుండి 50 పుటల దాకా విస్తరించిన వ్యాసాలున్నాయి. ఒక రకంగా చిన్నపాటి మోనోగ్రాఫ్స్ లాంటివి. వ్యాసకర్తలోని విలక్షణతను ఈ వైవిధ్యభరితమైన వ్యాససంపుటిలో దర్శించవచ్చు. ఒక్కొక్క వ్యాసం, నేరుగా ఎం.ఫిల్ పట్టం పుచ్చుకునేంత సంసిద్ధతను కలిగి ఉన్నాయి. నిత్యానందరావు ఇందులోని ఏ విషయాన్ని స్పృశించినా ఆవలి దరిని తాకనిదే వదిలిపెట్టలేదు. పరిశోధక పాఠీనులకు, పరిశీలన తర్షితులకు ఈ గ్రంథం పాలకడలి పాయసమే.
2011 లో రాసిన హైదరాబాదు రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి 'బూర్గుల రామకృష్ణ రావు జీవిత చరిత్ర'. 2012లో ప్రపంచ తెలుగు మాహాసభల సందర్భంగా తెలుగు అకాడమీ ప్రచురించిన 'తెలుగు పరిశోధన' మొదలైన రచనలు ఆయనకు సాహితీ సామ్రాజ్యంపై గల సాధికారతకు తార్కాణంగా నిలుస్తాయి.
నవయుగ రత్నాలు ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం సాహిత్య వ్యాస సంపుటి, పరిశోధన వ్యాసమంజరి (105 సిద్ధాంత గ్రంథాల సారసంగ్రహ సంకలనం), ఆధునిక భాషాశాస్త్రం- ప్రకార్యభాష, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎం.ఏ. దూరవిద్య తెలుగు పాఠ్య గ్రంథం. ఆధునికాంధ్ర భావకవిత్వం - డా||పాటిబండ మాధవశర్మ గ్రంథాలకు సంపాదకత్వం, వాఙ్మయ దివాకరుడు (దివాకర్ల వేంకటావధాని శతజయంతి సంచిక, 2014), పాలవెల్లి (పల్లా దుర్గయ్య శత జయంతి సంచిక, 2016)లకు సహసంపాదకత్వం వహించడం వెలుదండ నిత్యసంశోధన ధీషణకు సాదృశ్యాలు.
ఇప్పటి వరకూ రెండు వేలకు పైచిలుకు పరిశోధక వ్యాసాలు, ఎన్నో గ్రంథ సమీక్షలు, మరెన్నో జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పత్ర సమర్పణలు, ముప్పాతిక దాకా పీఠికలు రాసిన ఆచార్య వెలుదండ నిత్యానందరావు వ్యాస ధిషణికి కోటీరమక్కర లేని 'పట్టభద్రుడ'నడంలో ఎటువంటి సందేహం లేదు.
- డా||బి.బాలకృష్ణ,
9948997983