Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పశ్చిమ తమిళనాడు నమక్కాల్ జిల్లాలోని తిరుచెంగోడు పట్టణప్రాంతంలో ఒక సామాజిక సాంప్రదాయం వుంది. పిల్లలు లేనివారు తిరుచెంగోడు అర్ధనారీశ్వరుడికి జరిగే రథోత్సవం 14వ రోజున సాంఘిక కట్టుబాట్లను వదిలి ఆ రాత్రి ఎవరు ఎవరితోనైనా సంగమించి పిల్లలను కనవచ్చుననేదే ఆ సాంప్రదాయం. ఆ సాంప్రదాయమే ఈ నవలకు నేపథ్యం. మనలోని ఆచారవంతమైన ఒక శాఖలో ఇలాంటి సాంప్రదాయమే ఉంది. ఆ శాఖవారు ఏడాదికొకసారి రవికల పండుగ చేసుకుంటారు. ఆడవాళ్ళంతా గుడికి వెళ్ళి పూజలు చేస్తారు. పూజల అనంతరం తమ రవికలను విప్పి ఒక చోట పడేస్తారు. తరువాత మగవాళ్ళు ప్రవేశించి తలా ఒక రవిక తీసుకుంటారు. రవిక ఎవరిదో ఆ స్త్రీ రాత్రంతా ఆ మగవాడితో భోగించాలి. తిరుచెంగోడు పట్టణ ప్రాంతంలోని సామాజిక సాంప్రదాయాన్ని ఆధారంగా చేసుకుని 'మధోరు బాగన్' పేరుతో ఆచార్య పెరుమాళ్ మురుగన్ తమిళంలో నవల రాశారు. దాన్ని 'అర్ధనారీశ్వరుడు' పేరుతో ఎల్.ఆర్.స్వామి తెలుగులోకి అనువదించారు. ఇది వ్యవసాయం, పశుపోషణ జీవనంగా గల కాళి, పొన్నల కథ. ఎన్ని గుళ్ళూ గోపురాలు దర్శించినా పొన్నకు పిల్లలు కలగరు. భర్తకు ఇష్టం లేకపోయినా అతనికి తెలియకుండా సంతానం కోసం తిరుచెంగోడు అర్ధనారీశ్వరుడి రథోత్సవం 14వ రోజున పొన్న అపరిచితుడితో సంగమిస్తుంది. ఈ నవలపై దుమారం చెలరేగింది. ఈ నవలలో ప్రస్తావించిన అంశాలు తమ సామాజిక వర్గాన్నీ, స్త్రీలనూ కించపరిచే విధంగా వున్నాయని కొన్ని హిందూమతోన్మాద సంస్థలు ఆందోళన చేశాయి. మురుగన్ని సాంఘిక బహిష్కరణ చేశాయి. ఆయన చేత స్వీయ మరణ శాసనాన్ని రాయించాయి. ఈ గొడవ కోర్టు దాకా వెళ్ళింది. మద్రాసు హైకోర్టు మతోన్మాదుల ఉన్మాదాన్ని కొట్టివేసింది. ఈ నవల అనువాదం సరళంగా, చదివించేదిగా వుంది.
అర్ధనారీశ్వరుడు, రచన : ఆచార్య పెరుమాళ్ మురుగన్, తెలుగు సేత : ఎల్.ఆర్.స్వామి, వెల : 120/-, ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు.
- తెలిదేవర భానుమూర్తి,
9959150491