Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగులో ప్రేమలేఖలు చాలా ఉన్నాయి. ప్రేమ, వాటి వల్ల కలిగే అంతరాలు, అటువైపు నుంచి కొనసాగే సామాజిక, సాంఘిక కట్టుబాట్లు ఇవన్నీ అరుణాంక్ లత 'ఖ్వాబ్' చర్చకు పెడుతుంది. ప్రేమికురాలికి రాసిన లేఖల్లా, ఒకింత సంభాషణల్లా కనిపించే ఈ వాక్యాలన్నీ సామాజిక చరిత్రను, అందులోనూ దళిత స్త్రీ పార్శ్వాల నుండి అణచివేతకు గురౌతున్న చరిత్రను చర్చకు పెడుతున్నాయి. ''కులాంతర వివాహాలు ఇలా వలపోతకు తయారయ్యాయి'' (పే.21) కంచికర్ల కోటేషు సర్వ నామం. ఎంత మంది కోటేషుల జీవితాలు రాత్రికీ, పగలుకూ తేడా చెప్పాయి. రాత్రి మనసునూ, దేహాన్నీ ఇచ్చిన అమ్మాయిని పొద్దున్నే ''అమ్మగారూ'' అని పిలవడం ఎంత విషాదం (పే.37) ఈ దేశంలో దోపిడీ కులాల కామవాంఛలు తీర్చుకునేందుకు ఎక్కువగా వాడిన ఆయుధం ప్రేమ. చాలా అరుదుగా ఊరూ వాడా మధ్య విరబూసిన తెగ నరికేందుకు ఎన్ని ప్రయత్నాలు జరుగలేదు (పే.45). ఇలాంటి చాలా వాక్యాలు వర్తమాన చరిత్రను చర్చకు తెస్తున్నాయి. ఈ పార్శ్వాల నుండి వాదనలు కవిత్వం, కథ కొత్తేం కాదుగానీ, నిజంగానే నడుస్తున్న చరిత్రమీద ఒక స్పష్టమైన చూపు కనిపిస్తుంది.
అరుణాంక్ వచనంలో హిందీ, తెలుగూ కొంత ఉర్దూ, మరికొంత ఇంగ్లీష్ కలిసిన వాక్యాలున్నాయి. బహుశ: ఇప్పుడు మనిషి భాషే బహుళ మూలాల (మల్టీ ఆరిజన్)కు సంబంధించింది. భాషలు అలా తేలిగ్గా కలిసిపోయాయి. ఏ భాష ఏ మూలాన్ని మనలో నాటుతుందో ఆ భాషా మూలాలను అలాగే ఉపయోగించారు అరుణాంక్. వీటిని కవితలనడానికి లేదు. అలాగని వచనమూ కాదు. కవితాత్మక వచనం. ఒకింత సున్నితత్త్వాన్ని, దు:ఖాన్ని స్పష్టంగా చెబితే దిగ్భ్రాంతినీ మూటకట్టుకున్న వచనమిది. చెప్పడానికి ఏదో ఒక రూపాన్ని ఆశ్రయించడమెందుకనే ఒక ప్రజాస్వామిక ఊహ ఉండడం వల్ల లేదా చెప్పేదానికి ఏ జానర్ సరిపోక పోవటం వల్ల ఈ రూపంలోకి ఒదిగి పోయారనిపిస్తుంది. ''వాడికోసం ఒక కవిత రాద్దాం అనుకున్నాడు. పదాలు దొరక్క ఆగిపోయాడు (పే.23) బహుశ: కవిత్వం కావడానికో, కథ కావడానికో ఈ వాక్యాలు అక్కడే ఆగిపోయి ఉంటాయి. ఒకటి రెండు చోట్ల బాగా ఉపయోగంలో ఉన్న అనిర్దిష్ట వాక్యాలను ఉపయోగించడం వల్ల ఇబ్బందులున్నాయి. మనుస్మృతిలోని ఒక శ్లోకంలోని పాదభాగాన్ని ''యత్ర నార్యంతు'' అని శీర్షికగా రాశారు.
''యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా, యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలాక్రియా: (ఎక్కడిస్తీలు గౌరవింప బడుతున్నారో అక్కడ దేవతలు సంతృప్తి చెందుతున్నారు. ఎక్కడ గౌరవింపబడరో అక్కడి పనులన్నీ ఫలరహితమౌతాయి) ఇందులో భాగాన్నే తీసుకున్నది. ఇలాంటివి ఒకటి రెండు కనిపిస్తాయి. లోక వ్యవహారంలోనే ఈ పొరపాట్లు ఎక్కువ. కాళిదాసు అన్నట్టు ''ఏకోహి దోషో గుణ సన్నిపాతే నిమజ్జతీందో: కిరణేష్వివాంక: -(చంద్రుని ఒకే ఒక మచ్చ అతని గుణాల్లో కలిసిపోయునట్టు, ఒక దోషం అనేక మంచిగుణాల్లో కలిసిపోతుంది) ఇలా ఇవి కలిసిపోతాయి.
ఖ్వాబ్-అరుణాంక్ లత, పేజీలు : 102, వెల : 120/-, ప్రతులకు : అనల్ప బుక్ కంపనీ, సికింద్రాబాద్- 500094. ఫో.7093800678
- ఎం.నారాయణ శర్మ,
9848348502