Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానవ జీవితానికి వ్యాఖ్యాన ప్రాయంగా వెలువడిన మహాభారతంలో మనకు తెలియని విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో వున్నాయి. మనలో తలెత్తే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించేటప్పుడు ఆయా విషయాల గురించి మహాభారతం ఏం చెప్పింది? వ్యాఖ్యాన కర్తలేమి చెప్పారు? ప్రముఖుల అభిప్రాయాలెలా వున్నాయి? మొదలైన విషయాలు ముందుగా పరిశీలించి వాటి ప్రభావం సమాజంలో ఏమైనా ఉన్నదా? ఉంటే అవి ఏ రూపంలో ఉన్నాయి అనే విషయాలను కూడా తెలుసుకొని, వాటిని సమన్వయపరుస్తూ నిర్ధారించిన విషయాలతో ఈ పుస్తకం వెలువడింది. ఇందులో 'మాండవ్య మర్యాద' బాల నేరస్తుల పాలిటి వరమా?; 'శ్వేతకేతు మర్యాద' ప్రాచీన సమాజంలోని స్త్రీ, పురుష సంబంధాల నియంత్రణమా?; 'దీర్ఘ తముడి శాపం' భారత స్త్రీల పాలిట పాపంగా పరిణమించిందా?; మద్యపానం మహాభారతకాలంలో నిషేధింపబడిందా? లాంటి ప్రశ్నలపై జరిగిన చర్చ ఎన్నో సామాజిక విశేషాలను, మార్పులను తెలియజేస్తాయి. కురు సామ్రాజ్యానికి వారసులు పాండవులా? కౌరవులా? తనది కాని రాజ్యానికి ధృతరాష్ట్రుడెలా రాజయ్యాడు? దుర్యోధనుడెలా రాజయ్యాడు? ధర్మరాజు జూద వ్యసనపరుడా? ద్రౌపది ధర్మవిజితయా? అధర్మవిజితయా? అర్జునుడు ఎంతో కష్టపడి సాధించుకున్న పాశుపతాస్త్రాన్ని యుద్ధంలో ఎందుకు ఉపయోగించలేదు? అభిమన్యు వధకు ఎంతోమంది కారకులైనా, అర్జునుడు ప్రతిజ్ఞ చేసి మరీ సైంధవుడినే ఎందుకు చంపాడు? లాంటి ధర్మ సూక్ష్మాలపై జరిపిన చర్చ సమాచారాత్మకంగానూ, విజ్ఞానాత్మకంగాను వుంది.
మహాభారతంలో ఇవి మీకు తెలుసా?, డా||గుంజి వెంకటరత్నం, పేజీలు : 178, వెల :100/- ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు.
- కె.పి.అశోక్కుమార్,
9700000948