Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవి, కథకుడు, నవలాకారుడు, వ్యాసకర్త, అనువాదకుడు... ఈ అన్ని ప్రక్రియల్లో చేయి తిరిగిన వాడు అమ్జద్. తన మాతృభాష వేరేదైనా తెలుగులో మంచి సామర్థ్యం గల రచనలే చేశాడు. దశాబ్దాల నుండి సౌదీ అరేబియాలో ఉద్యోగిస్తున్నా తన హృదయం మాత్రం తెలుగు నేల భాషకై పరితపిస్తూనే వుంటుంది.
ప్రధానంగా తెలంగాణ ప్రాంతానికి ఉర్దూభాషతో విడదీయరాని సంబంధం వుంది. తెలుగు ఉర్దూ భాషల సాహిత్యాలు ఒకదానితో ఒకటి ఆదాన ప్రధానాలుగా కొనసాగుతున్నాయి. ఆ పరంపరలో అమ్జద్, ఉర్దూ ప్రముఖ కథారచయితలైన సాదత్ హుసేన్మంటో, ఇస్మత్ చుగ్తాయి, వాజిద తబస్సుం ఉర్దూ కథానికల్ని తెలుగుకు అనువాదం చేశాడు. అట్లా 12 కథలు అమ్జద్ కలం నుండి తెలుగుకు ప్రవహించాయి.
మంటో రాసిన కథలు ఏడింటిని సేకరించాడు. అనువాదకుడు వీటిలో మనుషుల నైజాన్ని, పోకడల్ని విభిన్న కోణాల్లో చిత్రించిన వైనం కనబడుతుంది. అట్లానే స్త్రీ పురుషుల సంబంధాల్లోని వైవిధ్యాల్ని, వైరుధ్యాల్ని, పరిస్థితుల ప్రభావాల్ని చిత్రిక పట్టాడు. చుగ్తాయి పేరెన్నికగల రచయిత్రి. ఆమె రెండు కథల్లోనూ మహిళల పోరాట దీప్తిని, వారి త్యాగ నిరతులను చాటి చెప్పింది. వాజిద తబస్సుం రాసిన మూడు కథల్ని సేకరించాడు. వాటిలోని చాంద్, చమ్కి హీన పాత్రలు. వారి నిబ్బరతలు పాఠకులను తప్పక ఆలోచింపజేస్తాయి. అమ్జద్ అనువాదం సరళంగా, సాఫీగా సాగింది.
గోరింటాకు (అనువాద కథలు), అనువాదం : అమ్జద్, పేజీలు : 112, వెల : 30/-, ప్రతులకు : రచయిత, 11-3-209, రోడ్ నెం.7, శ్రీ వెంకటేశ్వరా కాలనీ, సరూర్నగర్, హైదరాబాద్ - 35.
- కె.హరనాథ్,
9703542598